సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 375వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - తొమ్మిదవ  భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

"నేను బ్రాహ్మణ్ణి కానా, ఏం?”

మా నాన్నగారు ఉద్యోగ విరమణానంతరం విల్లేపార్లేలోని శ్రీవైద్యగారి బంగ్లాలో ఉండేందుకు నిశ్చయించుకున్నారు. అందుకని మేం శాంతాక్రజ్ నుంచి విల్లేపార్లేలో ఉండేందుకు వెళ్ళాం. సొలిసిటరయ్యేందుకు నేను జహంగీర్ గులాబ్‌ భాయి, బిల్లిమోరియా గార్ల ఆర్గనైజేషన్లో బిల్లిమోరియాతో మాట్లాడి ఒక అంగీకారానికి (Articles of agreement for solicitorship) వచ్చాను. దానికి మా నాన్నగారు నా ఇష్టానుసారం డబ్బు చెల్లించేందుకు సుముఖంగా కనిపించారు. ఆయన నాతో, “నీది స్వతంత్ర ప్రవృత్తి అవటం వల్ల నీకు బహుశా అసంతృప్తిగా ఉండొచ్చు. కానీ, నీవు కష్టపడి నీ అభీష్టాన్ని నెరవేర్చుకుంటావన్న నమ్మకం నాకుంది" అన్నారు. అలా అని ఆయన నాకు 2,000 రూపాయలు ఇచ్చారు. అవి నేను శ్రీబిల్లిమోరియాకు ఇచ్చి, శ్రీసాయి నామస్మరణ చేసుకుని దస్తావేజు కాగితాల మీద సంతకం పెట్టి అక్కడ ఉన్న నియమావళిని అనుసరించి జూనియర్‌గా పనిచేయటం ప్రారంభించాను. 

తరువాత మా నాన్నగారు తన కనిష్ఠ సోదరుడి దగ్గరకు ధంధుక వెళ్ళిపోయారు. అక్కడ ఆయనకు అతిసారవ్యాధి సోకింది. అది కొంచెం నెమ్మదించాక ఆయన మోతా గ్రామానికి వెళ్ళి అక్కడి వైద్యుడి సలహాతో మందులు తీసుకోవటం మొదలుపెట్టారు. కొద్దిరోజుల తరువాత వైద్యుడు, “మీకు జలోదరం ఉంది. అది తీవ్రమవుతోంది" అని చెప్పాడు. అప్పుడు నాన్నగారు నాకు, "వైద్యుడు నాకు జలోదరం(డ్రాప్సీ) ఉన్నదని నిర్ధారించారు. అది ప్రాణాలు తీసే వ్యాధి" అని ఉత్తరం రాశారు. ఇది చదివాక నాన్నగార్ని కలిసేందుకు ఒకటి రెండుసార్లు నేను ఊరు వెళ్ళొచ్చాను. 

ఈ మధ్యలో ఒకసారి నేను శిరిడీ వెళ్ళినప్పుడు బాబా స్వయంగా నాతో, "ఆ కడుపుబ్బిన వాణ్ణి ఇక్కడకు తీసుకురా" అన్నారు. బాబా చెప్పేది నాన్నగారి గురించే అని నేను వెంటనే గ్రహించాను. అయితే, "మా నాన్నగారికి ఇక్కడకి రావటం ఎలా నచ్చుతుంది? ఇంట్లో వాళ్ళంతా బాబాని ముస్లిం అనుకుంటారు కదా?" అన్న అనుమానం నా మనస్సులో మెదిలింది. వెంటనే బాబా, “నేను బ్రాహ్మణ్ణి కాదా, ఏం?" అని ప్రశ్నించారు. అయితే నా ఖర్మకొద్దీ నా చుట్టుపక్కలున్న మనుషుల్ని, వాతావరణాన్ని చూశాక నాన్నగారిని శిరిడీ తీసుకెళ్ళటం అసంభవమనిపించింది. మోతా గ్రామంలో 1913, ఫాల్గుణ శుద్ధ షష్ఠి రోజున మా నాన్నగారు పరమపదించారు.

1912వ సంవత్సరంలో గురుపూర్ణిమ కొద్దిరోజులు ఉందనగా నేను కోర్టుకు వెళుతున్నప్పుడు, 'వెస్టెండ్ వాచ్ కంపెనీ' దుకాణం ఎదురుగా శ్రీహరిసీతారాం దీక్షిత్ కనిపించి, “ఏమిటీ, గురుపూర్ణిమకి శిరిడీ వెళ్తున్నారా, లేదా?" అని నన్నడిగారు. నేను, “చూస్తాను” అని సందిగ్ధంగా అన్నాను. అందుకాయన, "గురుపూర్ణిమ లాంటి రోజున తప్పకుండా శిరిడీ వెళ్ళి తీరాలి” అన్నారు. ఆయన మాటలు సబబుగా అనిపించటం వల్ల గురుపూర్ణిమకు నేను శిరిడీ వెళ్ళాను. అక్కడ మిగతా భక్తులందరితో కలిసి విధిపూర్వకంగా బాబాని పూజించాను. ఆ రాత్రో, మర్నాటి రాత్రో బాబా స్వప్న దర్శనమిచ్చి, “నువ్వు నాకు చాలా నచ్చావు" అన్నారు. అప్పుడు, "నేను మీకు అందరికంటే ఎక్కువ ఇష్టమైనవాడినా?" అని అడిగాను. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే బాబా అదృశ్యమయ్యారు. తెల్లవారుఝామున మంగళ ఆరతి సమయంలో బాబా లేచి కూర్చున్నారు. ఆరతి జరుగుతుండగా ఆయన నా మొహంలోకి ప్రసన్నంగా చూస్తూ నవ్వారు. ఈ రకంగా నా స్వప్నం కేవలం స్వప్నం కాదనీ, అనుభూతినివ్వగల ప్రత్యక్ష అనుభవమనే విశ్వాసాన్ని వారు నాకు కలిగించారు. అప్పుడు నేను బాబాని పూజించటం మొదలుపెట్టి, శిరిడీలో ఆయనకి దీపంతో ఆరతి ఇచ్చే పద్ధతిని మొదలుపెట్టాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo