సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 373వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఏడవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నలుదిశలా చూసుకుంటూ శిరిడీ వైపు వెళ్తూ సావుల్ విహిర్ (గ్రామం పేరు) చేరుకున్నాం. అక్కడ రోడ్డుమీద ఆ ఊరి కాపలాదారు నిలబడి ఉన్నాడు. అతను మాతో, "ఈరోజు సాయంత్రం ఒక ఎడ్లబండి - బండి తోలేవాడుగానీ, ప్రయాణీకులుగానీ లేకుండానే కొంత సామాన్లతో ఇక్కడికి వచ్చింది. ఈ సామాన్ల యజమానినీ, బండివాణ్ణీ ఎవరో చంపి ఉంటారని మాకనిపించింది. వీటికి సంబంధించిన వాళ్ళెవరైనా వస్తారేమోనని త్రోవ వెంబడి చూసి చూసి అలసిపోయి మెదలకుండా కూర్చుండిపోయాను" అన్నాడు. పోలీసులు ఆ రాత్రివేళ ఏ నిర్ణయం తీసుకోకుండా, ''మేము ఈ కేసుని పంచనామా చేయవలసి ఉంటుంది. అందువల్ల రేప్రొద్దున రండి" అని చెప్పారు. దాంతో నేనూ, బండివాడూ శిరిడీ వచ్చేశాం. నేను ఒక కంబళి కప్పుకొని రాత్రంతా బాలాభావు భోజనశాల వద్ద ఉన్న బెంచి మీద పడుకుండిపోయాను.

తెల్లవారగానే బండివాడితో కలిసి సావుల్ విహిర్ గ్రామానికి చేరుకున్నాను. పంచనామా అయిన తరువాత నా మనీ పర్సు, సామాను తిరిగి ఇవ్వమని పోలీసులకు విన్నవించుకున్నాను. అయితే వాళ్ళు కోపర్గాం పోలీసు స్టేషనుకి నేను స్వయంగా వెళ్ళి నా సామాను నాకు దొరికిందని చెప్పేంతవరకూ నా సామాను నాకు ఇవ్వటం జరగదని చెప్పారు. వారు చెప్పిన విధంగా చేసి నేను నా సామాను స్వాధీనం చేసుకున్నాను. 

ఖాళీ బండి శిరిడీకి వెళ్ళవలసి ఉండగా నేను అందులో కూర్చొని తిరిగి శిరిడీ వచ్చేశాను. జరిగిన సంఘటన గురించి విన్న ఖపర్డే, షింగణేలు ఆశ్చర్యపోతూ, "బాబా అనుమతి తీసుకున్న తరువాత అలా ఎలా జరిగింది?" అన్నారు. తరువాత ఖపర్డే ఎగతాళిగా, “నీవు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా! అందుకే అలా జరిగింది" అన్నాడు. షింగణే, "అసలు పోలీసులు నిన్ను ఏ ఆధారంతో పట్టుకున్నారు?" అన్నాడు. తరువాత ఆలోచిస్తే, “నన్ను తిరిగి శిరిడీకి రప్పించి, మరో రెండు రోజులు శిరిడీలో ఉంచిన తరువాత ప్రయాణం చేయించాలని బాబా తలచి ఇలా చేసి ఉంటార"ని నాకనిపించింది.

ఒకరోజు ఉదయం ఇంచుమించు 10.30 గంటలకి కొందరు భక్తులు బాబా చేతికి ఆయన చిత్రపటాన్ని ఇవ్వగా, ఆయన దాన్ని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్ళటానికి తిరిగి వారికిచ్చారు. అప్పుడు నేను కూడా బాబా చేతికి ఫోటోలిచ్చి ప్రసాదంగా తిరిగి తీసుకున్నాను. దాని తరువాత శిరిడీ నుండి బయలుదేరటానికి ముందురోజు సాయంత్రం మాకు తెలిసిన దయాళ్ సేట్ అనే ఉప్పు వ్యాపారి కొడుకు గిరిధర్‌లాల్ తన్నా అనే అతను దహను నుంచి వచ్చాడు. అతను - మాధవరావు, కాకాసాహెబ్‌లతో - నా గురించి మా నాన్నగారు చింతపడుతున్న సంగతి తెలియజేసి, “ఇక్కడ ప్లేగు వ్యాపించి ఉందని ఆయన బాగా దిగులుగా ఉన్నారు. ఇతని కుశలాన్ని గురించి ఉత్తరం కూడా రాలేదు. ఇతన్ని ఒప్పించి ఇంటికి పంపించండి” అని చెప్పాడు. 

మరుసటిరోజు ప్రొద్దున మాధవరావు నా గురించి అడిగాడు. అప్పటికే నేను ప్రయాణానికి సిద్ధంగా ఉండటాన్ని చూసి, నన్ను పైఅంతస్తులో ఉన్న కాకాసాహెబ్ వద్దకు తీసుకెళ్ళి పరిచయం చేశాడు మాధవరావు. కాకాసాహెబ్ దగ్గర టీ తీసుకొని, తాంబూలం వేసుకున్న తరువాత నేను ఎడ్లబండిలో కూర్చున్నాను. నాకు వీడ్కోలు చెప్పటానికి మాధవరావు రోడ్డుమీద కొంతదూరం వరకూ వచ్చాడు. ఈ మొదటి కలయికలోనే బాబా నాకు తమ సామర్థ్యాన్ని ఎరుకపరచారు. విశేషించి, ఆయన భగవంతుడన్న దానిపై నాకు పూర్ణ విశ్వాసాన్ని కలుగచేశారు. ఆయన నామస్మరణతో నాపై వచ్చిన ఆపద తొలగిపోయింది. మొదట ఫోటోను ప్రసాదంగా తీసుకోవాలన్న నా తలంపు నెరవేరలేదు. అందువల్లనే బాబా నన్ను వెనక్కి లాగి, అసంపూర్ణంగా మిగిలిపోయిన నా ఆలోచనను సంపూర్ణం చేసి పంపించారు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo