సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 380 వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పద్నాల్గవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

మరుసటి సంవత్సరం, అంటే 1913 ఫాల్గుణ శుద్ధ షష్ఠి ఉదయం బ్రహ్మీముహూర్తంలో మా నాన్నగారు పరమపదించారు. చివరి సమయం వరకూ వారి వద్దనే వారిని కనిపెట్టుకుని ఉన్న మా పినతండ్రిగారైన రామగోవింద్ మా నాన్నగారు తమ అంతిమ క్షణం వరకూ నన్నే తలుచుకున్నారని చెప్పారు. వారికి దుఃఖాతిరేకం ఎక్కువైనప్పుడు ఆవేదనతో, ''నేను నా జీవితపర్యంతమూ ఎవరితోనూ పేచీ పెట్టుకోలేదు. ఎవరికీ నేను కష్టం కలిగించలేదు. మరి నాకీ పరిస్థితి ఎందుకొచ్చిందో?" అనేవారట. నిష్కపటీ, ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలిగించనివాడూ, నిరాడంబరుడూ, ధర్మపరుడూ అయి ధార్మిక జీవనాన్ని గడిపే మా నాన్నగారు తన అంతిమ సమయంలో కలిగిన దుఃఖాన్ని గురించి అన్న మాటలు వారి జీవన విధానంతో పరిచయమున్న వ్యక్తులకి సరైనవే అనిపించాయి. అంతిమ సమయంలో ఊదీ ఇవ్వటంతో ఆయనకి సాయి దర్శనం గురించి గుర్తుకు వచ్చింది. వెంటనే ఊదీ ప్రభావంతో ఆయనకు దుఃఖం నుండి ముక్తి లభించింది. ఈ సంఘటనతో, "సాధారణ జీవితాన్ని జీవిస్తూ, ఎవరికీ ఎటువంటి కష్టమూ కలిగించని మంచిమనిషి జీవితానికి ఈశ్వరుడి దగ్గర మూల్యం ఇంతేనా?” అని నా మనసులో మాటిమాటికీ అనిపించేది. తరువాత బాగా ఆలోచించాక ఒక సంగతి స్ఫురణకు వచ్చింది. 

నాన్నగారి జీవితం నిరాడంబరమూ, పాపరహితమూ, ఎవరికీ ఏ హానీ తలపెట్టనిదన్నది నిజమే. అయితే ఇదొక్కటే చాలదు. సత్కర్మాచరణ ద్వారా పుణ్యాన్ని సంపాదించటం కూడా అవసరం. ఇది నాన్నగారి జీవితంలో లోపించింది. మా బాబాయిలాగా ఆయన ఎటువంటి వ్రతాలూ, త్యాగాలూ చేయలేదు. కేవలం అధర్మాచరణకు దూరంగా ఉండటం మాత్రమేకాక ధర్మాచరణ, పుణ్యకర్మలు చేస్తేనే ఈ జీవుడు మానవదేహంలోకి వచ్చినందుకు తగిన సార్ధకతా, ఈశ్వరుడి కృపా లభిస్తాయి. ఎవరికీ కష్టం కలిగించని నాన్నగారి సాత్విక జీవనం వారికేమీ ఉపకరించలేదుగానీ, తమ అంతిమ సమయంలో వారికి లభించిన శ్రీసాయిబాబా దర్శనం వారికి పనికొచ్చిందని నేను తెలుసుకున్నాను.

వేసవిరోజుల్లో నేను శిరిడీ వెళ్ళినప్పుడు సగుణరావు ద్వారా లభించిన అక్కల్‌కోట స్వామి చరిత్ర పారాయణ నాన్నగారి సూతకం రోజుల్లో చేశాను. ఆ పారాయణ గ్రంథం మోతా గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ దాన్ని పూర్తిచేశాను. శ్రాద్ధకర్మలు పూర్తి చేసుకొని నేను పార్లే తిరిగి వచ్చాను. అమ్మ మోతా గ్రామంలోనే ఆగిపోయారు. మోమీ అక్కయ్య, రామకృష్ణ బావగారూ మా ఇంట్లో ఉండేందుకు వచ్చారు. 

రామకృష్ణ బావగారి వల్ల కాకాసాహెబ్ ఇంటికి రాకపోకలు మొదలయ్యాయి. కాకాసాహెబ్ నాకు నాభాజీ విరచిత "భక్త మాల"ను చదివేందుకిచ్చారు. అందులో మహనీయుల జీవితాలను చదివి చాలా సంతోషించాను. శ్రీ“ఎమ్” రాసిన "గోస్పెల్ ఆఫ్ రామకృష్ణ” ప్రథమ భాగం తెప్పించుకున్నాను. అదికూడా భక్తమాల చదివే సమయంలోనే లభించింది. అది చదివి ఎంతో నచ్చటం మూలాన మళ్ళీ మళ్ళీ దాన్ని పారాయణ చేయటం మొదలుపెట్టాను. తరువాతి కాలంలో గాంధీ మహాత్ముడికి కార్యదర్శిగా పనిచేసిన మహదేవ్ దేశాయ్ గారు సిస్టర్ నివేదిత రాసిన "మై మాస్టర్ యాజ్ ఐ సా” అనే పుస్తకమిచ్చి, దాన్ని గుజరాతీలోకి అనువదించమని చెప్పారు. 

శ్రీమనూభాయి సుబేదారు (స్వామి సాయిశరణానందుల వారికి ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో సహాధ్యాయులు) నాతోనే ఉన్నారు. తరువాత ఆయన అర్థశాస్త్రంలో నిపుణులుగా పురస్కారం పొంది, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కాంగ్రెసు టిక్కెట్టు మీద గెలిచి అసెంబ్లీ సభ్యులయ్యారు. ఆయన మాటపై నేను "ఇన్ ట్యూన్ విత్ ది ఇన్‌ఫినిట్”, మిస్ ఎలెన్ వ్రాసిన “ఔట్ ఫ్రం ది హార్ట్” అనే రెండు పుస్తకాలూ చదివాను. తరువాత "ఔట్ ఫ్రం ది హార్ట్" తర్జుమా చేశాను కానీ, అది ప్రచురించబడలేదు. 'ఇన్ ట్యూన్ విత్ ది ఇన్‌ఫినిట్' అనువాదం పూర్తి చేయలేకపోయాను. మహదేవ్ గారిచ్చిన పుస్తకం చదివి, దాని అనువాదం ప్రారంభించాను. అలాగే మే నెలలో కోర్టు సెలవుల సమయంలో శ్రీగులాబ్‌భాయి వద్ద సెలవు తీసుకుని శిరిడీ వెళ్ళాను. ఈ యాత్రలో మనూభాయి సుబేదార్ ఇచ్చిన రెండు పుస్తకాలూ, వశిష్ఠ గీత, జ్ఞానేశ్వరి, దాసబోధ మొదలైన గ్రంథాలను చదివేందుకు శిరిడీ పట్టుకువెళ్ళాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

  1. Om Sri sairam tatayya 🙏🌹🙏🌹

    ReplyDelete
  2. I love shirdi sai baba, and i know a site which tells sai baba answers , https://saibabaspeaks.com ,sabka malik ek sai baba, we love you 3000 sai baba, Ask Sai baba Answer, sai baba 108 names , Shirdi Sai baba Prashnavali

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo