సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 361వ భాగం.


ఖపర్డే డైరీ - నలభైఆరవ భాగం.

1918 మార్చిలో అయిదవ దర్శనం:

ఈ శిరిడీ యాత్ర తేదీలు దాదాసాహెబు మరాఠీ జీవిత చరిత్ర గ్రంథంలో లేవు. అయితే ఎన్ని రోజులు ఉన్నాడనేది వివరంగా లేని ఈ దర్శనానికి ఒక ఉద్దేశం ఉంది. హోమ్ రూల్ గురించి ఒత్తిడి తీసుకురావటానికి కాంగ్రెసు దౌత్యవర్గంగా దాదాసాహెబ్ ఇంగ్లాండుకు వెళ్ళవలసి రావటం వల్ల ఆ సందర్భంలో అతను ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. ఢిల్లీ నుంచి బయలుదేరేముందు, 1897లో ఆమ్రావతిలో దాదాసాహెబ్ ఖపర్డే తను రిసెప్షన్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నప్పుడు జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు అధ్యక్షత వహించిన సర్ శంకరన్ నాయర్‌ని కలిశాడు. 1918లో సర్ శంకరన్ నాయర్ భారతదేశపు వైస్రాయ్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్లో చేరాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాను తీసుకొన్న నిర్ణయాలపై కొన్ని అనుమానాలు వచ్చాయతనికి. అందుకని తాను తీసుకున్న నిర్ణయాల గురించి సాయిమహారాజు అభిప్రాయాన్నీ, ఆయన మార్గదర్శకత్వాన్నీ తెలుసుకోమని ఖపర్డేని అర్థించాడు. తేదీలు లేని జీవిత చరిత్ర పుస్తకంలోంచి గ్రహించబడిన భాగాల వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

"శంకరన్ నాయర్ని చూశాను. నన్ను చూసి ఎంతో ఆనందించాడు. నాతో చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నాడు. తన తరపు నుంచి శిరిడీలో సాయిమహారాజుని ఈ క్రింది ప్రశ్నలు అడగమని చెప్పాడు. అతను తన సర్వీసులో కొనసాగటం మంచిదేనా? ఆధ్యాత్మికంగా తాను తప్పు మార్గంలో పోతున్నాడా? అలా అయితే సాయిమహారాజు సరైన మార్గంలో నడిపిస్తారా? ఈ ప్రశ్నలు సాయిమహారాజును అడిగి ఆయనేం చెప్తారో అది అతనికి ఉత్తరం ద్వారా తెలియజేస్తానని వాగ్దానం చేశాను".

దాదాసాహెబ్ ఖపర్డే చరిత్రకారుడు, ఖపర్డే శిరిడీ వెళ్ళి సాయిబాబా దర్శన ఆశీస్సులు తీసుకొని ఆమ్రావతి తిరిగి వచ్చాడని రాశాడు. సర్ శంకరన్ నాయర్ ప్రశ్నలకు సాయిబాబా ఏమని సమాధానాలిచ్చారన్నది డైరీలో ప్రస్తావించబడలేదని వ్రాశాడు రచయిత. బహుశా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచమన్న నాయర్‌ కోరికను దాదాసాహెబ్ మన్నించి ఉండవచ్చు. డైరీ నుంచి రహస్యాలను ఉద్దేశ్యపూర్వకంగా వదిలేయటానికి ఇదో నిదర్శనం. ప్రస్తుతం దాదాసాహెబ్ ఖపర్డే డైరీలు నేషనల్ ఆర్కైవ్స్‌లో భద్రపరచబడి ఉన్నాయి.

((సర్ శంకరన్ నాయర్‌గారి అల్లుడు శ్రీ కె.పి.ఎస్ మీనన్ తన మామగారి జీవిత చరిత్రని వ్రాయగా దాన్ని 1967లో భారత ప్రభుత్వపు పబ్లికేషన్స్ డివిజన్ వాళ్ళు ప్రచురించారు. అందులో సర్ శంకరన్ నాయర్‌ వైస్రాయి ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ మెంబరుగా 1915 మధ్యలో (55వ పేజీ) ఎన్నుకోబడి జలియన్ వాలాబాగ్(1919) క్రూర హత్యలకు నిరసనగా రాజీనామా చేశారని రాశారు. (పే 104-105). సర్ శంకరన్ యోగాని విపరీతంగా నమ్ముతాడు (133 పేజీ). మతం పట్ల అతని మనసు ఎంతగానో మొగ్గుచూపేది. అతను 22-4-1934న కారు యాక్సిడెంటులో తలకి బలమైన గాయం తగిలి చనిపోయాడు. (138 పేజి) )).

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo