సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 94వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. ఆఫీసు వర్కులో బాబా సహాయం
  2. మైల సోకినా పారాయణ ఆపనక్కరలేదు
  3. అమ్మ ఆరోగ్యం గురించి బాబా ఇచ్చిన సంకేతం

ఓం సాయిరామ్! నా పేరు అర్చన. నేను హైదరాబాద్ నివాసిని. నేను సాయిబాబా భక్తురాలిని. ఆయన లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఎల్లవేళలా బాబా నాకు అండగా ఉంటూ ఎన్నో అనుభవాలు ప్రసాదిస్తున్నారు. ఇదివరకు ఈ బ్లాగు ద్వారా చాలా అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇటీవల జరిగిన మరికొన్ని అనుభవాలు నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

ఆఫీసు వర్కులో బాబా సహాయం:

నేను చేస్తున్న ప్రాజెక్టులో ఒక అప్లికేషన్ సెట్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అది సెట్ కాలేదు. నెట్‌వర్క్ నిపుణులను సంప్రదించినా పరిష్కారం తెలియలేదు. మా మేనేజర్ ఒక వారంలో డెవలప్‌మెంట్ చేయాలని చెప్పారు. దానితో నాకు ఆందోళనగా అనిపించింది. ఆ సమస్య ఒక్కటి పరిష్కారమైతే మిగతా అంతా చాలా సుళువుగా అయిపోతుంది. కానీ అదే సాల్వ్ కావడం లేదు. ఇక నేను, "బాబా! అప్లికేషన్ సెట్ అయితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని అనుకున్నాను. వెంటనే ప్రక్కన ఉన్న ఒకతను ఒక చిన్న ప్రాపర్టీ మార్చారు. దాంతో అప్లికేషన్ సెట్ అయ్యింది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. కానీ నా సమర్థ సద్గురు సాయిబాబా ఉండగా నాకు భయమెందుకు?

మైల సోకినా పారాయణ ఆపనక్కరలేదు:

నేను చాలా రోజుల నుండి మహాపారాయణ గురించి వింటున్నాను. కానీ అందులో ఎలా చేరాలో తెలిసేది కాదు. ఒకసారి బాబా గుడిలో 'మహాపారాయణ గ్రూపులో చేరాలంటే ఈ నెంబరుకి మెసేజ్ పెట్టండ'ని ఫ్లెక్సీ పెట్టారు. నేను పట్టలేని ఆనందంతో వెంటనే నా వివరాలు పంపించాను. తరువాత 2 వారాలకు ఆ గ్రూపులో నన్ను చేర్చారు. ప్రతి గురువారం కేటాయించిన రెండు అధ్యాయాలు చదవాలి. 10 వారాలు ఎటువంటి ఆటంకం లేకుండా నడిచింది. జూన్ 17న మా ఇంటిపేరు గల వాళ్ళు చనిపోవటం వలన మాకు సూతకం వచ్చింది. బాబాకి అటువంటి పట్టింపులు ఉండవు కాబట్టి మామూలుగా అయితే అలాంటి సమయంలో కూడా నేను బాబాకి సంబంధించిన పుస్తకాలు చదువుతాను. కానీ కోట్లాదిమంది భక్తులు ఎంతో భక్తిశ్రద్దలతో చేసే మహాపారాయణలో భాగంగా నేను చదవాల్సిన రెండు అధ్యాయాలు చదవచ్చో, లేదో అని సందిగ్ధంలో పడిపోయాను. ఆ విషయమే ఒకరిద్దరిని అడిగితే, ఒకరు ఖరాఖండిగా, "మీరు చదవవద్దు. మీకు తెలిసిన వాళ్లతో చదివించి, మాకు చదివినట్లు తెలియజేయండి" అన్నారు. వేరేవాళ్లు 'చేయొచ్చు' అని చెప్పి, మళ్ళీ, 'అయినా కూడా కనుక్కుని చెప్తాను' అని అన్నారు. నాకు చాలా బాధగా అనిపించింది. నేనెప్పుడూ సాయికి సంబంధించి ఏ సందేహాలు వచ్చినా నాకు తెలిసిన ఒక సాయిబంధువుని అడిగి నివృత్తి చేసుకుంటాను. వెంటనే ఆ సాయిబంధువుకి ఫోన్ చేసి అడిగితే, "ఏ తప్పూ లేదు, మీరు నిరభ్యంతరంగా పారాయణ చేసుకోండి" అని చెప్పారు. నేను, "చాలామంది భక్తుల మనోభావాలకు సంబంధించినది కదా! అందువలన వద్దంటున్నారు" అని అన్నాను. అందుకతను, "వాళ్ళు అలా చెపుతున్నారంటే వాళ్ళకి బాబా పట్ల సరైన అవగాహన లేక అలా చెప్తున్నారు" అని చెప్పి, సాయి సమక్షంలో జరిగిన కొన్ని ఉదాహరణలు కూడా తెలియజేసి, "సాయి వంటి మహాత్ములు అటువంటి ఆచారాలకు ప్రాముఖ్యతనివ్వరు. మీరు ఏ సందేహం పెట్టుకోకుండా పారాయణ చేసుకోండి" అని చెప్పారు. ఇక నేను ఆ పారాయణ గ్రూపు వాళ్ళకి ఫోన్ చేసి, "నాకు కేటాయించిన అధ్యాయాలు నేనే చదువుతాను. మీకు ఇష్టమైతే కౌంట్ చేసుకోండి. లేకపోతే వేరే వాళ్లతో మీరే చదివించుకోండి. నేనైతే చదువుతాను. ఆపై మీ ఇష్టం" అని చెప్పేసాను. అందుకు వాళ్ళు, "సరే, మీరే చదవండి. కానీ పుస్తకంలో కాకుండా మొబైల్‌లో చదవండి" అని చెప్పారు. కానీ నేను కూడా మామూలు మనిషినే కదా! ఎంత సమాధానపడదామన్నా మనస్సు అనుమానపడుతూనే ఉంది. అందువలన, "ఇదంతా సరేగాని, నేను చేసేది తప్పు కాదని బాబా ఒప్పుకున్నారని ఎలా అనుకోవటం?" అని నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. అందుకు బాబా అద్భుతరీతిన నన్ను సమాధానపరచారు. బుధవారంనాడు పారాయణ గ్రూపు వాళ్ళు నాకు ఫోన్ చేసి, "ఒక గ్రూపుకి కెప్టెన్‌గా మిమ్మల్ని నియమించాము" అని చెప్పారు. తరువాతరోజు గురువారంనాడు నేను ఆ గ్రూపు కెప్టెన్‌గా గ్రూపులోని వారందరికీ మెసేజులు పెట్టి వాళ్లంతా పారాయణ చేసేలా చూశాను. వాళ్లలో ఒకరికి కుదరకపోతే వాళ్ళు చదవాల్సిన 2 అధ్యాయాలు కూడా నేనే చదివి, నాకు కేటాయింపబడిన రెండు అధ్యాయాలు కూడా చదివి ఆరోజు మహాపారాయణ పూర్తి చేశాను. అదంతా జరిగాక గానీ నాకు అర్థం కాలేదు, సూతకంలో ఉన్న నేను నా అధ్యాయాలే చదవచ్చా లేదా అని అనుకుంటే, బాబా వాటిని నా చేత చదివించడమే కాకుండా ఒక గ్రూపుకి కెప్టెన్‌గా నాకు బాధ్యతలు అప్పగించి, అందులో ఒకరు చదవకపోతే ఆ అధ్యాయాలు కూడా నాతోనే చదివించి తమకి అటువంటి పట్టింపులు లేవని, నేను చేసింది తప్పు కాదని అనుభవపూర్వకంగా తెలియజేశారు. "హృదయంలో శోకం లేకపోతే మైల సోకినా బాబా పూజ అపనక్కరలేదు" అన్న సాయిలీలామృతంలోని వాక్యానికి ఈ అనుభవం ద్వారా సజీవ నిదర్శనమిచ్చారు బాబా.

అమ్మ ఆరోగ్యం గురించి బాబా ఇచ్చిన సంకేతం:

మా అమ్మగారు ఈ మధ్య తరచూ 'గుండెల్లో ఏదో తేడాగా ఉంది' అంటున్నారు. నేను డాక్టరుకి చూపించుకోమంటున్నా తను చూపించుకోవటం లేదు. ఆ విషయం గురించి జూన్ 25న ఫోనులో మాట్లాడుతున్నప్పుడు, "అమ్మో! ఒకవేళ డాక్టరు చేసే టెస్టులలో ఏదైనా సమస్య ఉందని వస్తుందా?" అని నా మనసుకనిపించి భయం వేసింది. ఫోన్ మాట్లాడటం అయ్యాక నా మొబైల్‌లో శిరిడీ ప్రత్యక్ష దర్శనం చూస్తూ ఆదుర్దాగా అమ్మ విషయం బాబాకు చెప్పుకుని, "బాబా! నాకిప్పుడు చిన్నపిల్లలు గాని, పెద్ద పూలమాల గాని కనపడినట్లైతే, 'అమ్మకు తోడుగా ఉండి, తనని మీరు కాపాడుతార'ని ధైర్యంగా ఉండగలుగుతాను" అని అనుకున్నాను. అలా అనుకున్న రెండు సెకన్లలో ఒక చిన్నపిల్లాడిని ఎవరో అక్కడ పూజారికి అందిస్తున్నారు. పూజారి పిల్లాడిని అందుకుని బాబా పాదాల వద్ద పెట్టారు. పట్టలేని ఆనందంతో నేను అమ్మకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పాను. ఫోన్ పెట్టేసి మళ్ళీ ప్రత్యక్ష ప్రసారం చూస్తే, ఒక పెద్ద పూలమాలను సమాధి మీద వేస్తున్నారు. అమ్మను బాబా కాపాడుతారన్న ధైర్యం వచ్చి మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మరుసటిరోజు ఒక మెసేజ్ - "అంతా భగవంతుని ఆట. అతడే నయం చేస్తాడు. ఎందుకు ఆందోళన?" అని. ఆ మెసేజ్ ద్వారా కూడా బాబా నాకు భరోసా ఇచ్చారు. ఇక బాబా మీద భారం వేసి, ధైర్యంగా ఉంటున్నాను. 

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo