సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 91వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • బాబా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాల కొరత ఉండదు

బాబా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాల కొరత ఉండదు

నాగపూర్ నివాసి డి.బొంబొరికర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. అతని ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండేది. పైగా అతనిది పదిమంది సభ్యులు గల పెద్ద కుటుంబం. వాళ్లందరికీ ఆహారాన్ని అందించడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం అతనికి కష్టతరంగా ఉండేది. అలాంటి నిస్సహాయస్థితిలో ఆకలితో అలమటించే రోజులు ఎదుర్కోవలసి వస్తుందేమోనని అతను దిగులుపడుతుండేవాడు.

1957వ సంవత్సరం నుంచి బొంబొరికర్ చాలా శ్రద్ధగా బాబాను పూజించడం మొదలుపెట్టాడు. రోజువారీ పూజతోపాటు ప్రతి గురువారం కొండాభువన్ బాబా మందిరంలో భక్తిపాటలు పాడటంతోపాటు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుండేవాడు. అతనికెంత శ్రద్ధంటే, ఒక్క గురువారం కూడా బాబా మందిరానికి వెళ్ళడం అతను తప్పలేదు. అతడు ధబోల్కర్ రచించిన శ్రీసాయిసచ్చరిత్రను శ్రద్ధగా తన స్వహస్తాలతో వ్రాయడం మొదలుపెట్టాడు. దానిని 1964, డిసెంబర్ నెలలో ఒక గురువారంనాడు పూర్తి చేశాడు. ఇక అతను కోరుకునేదల్లా ఒక్కటే, ఆ సచ్చరిత్రను రానున్న గురువారంనాడు బాబా పాదాలకు సమర్పించడం. ఆరోజు రాత్రి శేజారతి, భజన ముగించుకుని సుమారు అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి తిరిగి వచ్చి నిద్రపోవడానికి మంచంమీద మేను వాల్చాడు. ఆ సమయంలో ఎంతో నిరాశగా, "బాబా! దృఢమైన భక్తి, శ్రద్ధలతో నా సేవలను ఇన్ని సంవత్సరాలుగా మీకు సమర్పించుకుంటూ వస్తున్నాను. నా జీవితాన్నంతా మీ పాదాలకు సమర్పించుకున్నాను. ఇదంతా మీకు తెలియనిదా? ఇప్పుడు మీరు మమ్మల్ని ఆకలితో అలమటింపజేయదలుచుకున్నారా? "నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాలకు కొరత ఉండదు" అని మీరు వాగ్దానం చేయలేదా? నా భారమంతా మీ మీద వేసాను. కాబట్టి మీరు నాకు ఏమన్నా ఉపశమనం ఇవ్వబోతున్నారా? "ఎవరైతే భక్తి, ప్రేమలతో నా చరిత్రను పఠిస్తూ, గానం చేస్తుంటారో వారి ప్రక్కనే నేను నిలిచి ఉంటాను" అని మీరు వాగ్దానం చేశారు కదా! నేను నా స్వహస్తాలతో మీ చరిత్రంతా వ్రాసాను. అందుకు నాకు రమారమి మూడునెలల సమయం పట్టింది. దాన్ని మీరు పరిగణించలేదు. 'ఏ భక్తుడైనా మీకు శరణు పొందితే, వాళ్ళ అవసరాలు తీర్చడంలో మీరెన్నడూ విఫలం కాలేద'ని నేను విన్నాను. మరి నా విషయంలో మీరెందుకు వెన్ను చూపుతున్నారు? మీ వాగ్దానాలన్నీ ఉట్టిమాటలా? అవన్నీ అబద్ధాలా? మీరు అసత్యవాదా? మీరు అసత్యవాది కాదని నాకు ఏదైనా ఒక సాక్ష్యం లేదా అనుభవం కావాలి. వచ్చే గురువారం మీ మందిరానికి వెళ్తాను, నేను వ్రాసిన చరిత్రను మీ పాదాలకు సమర్పిస్తాను. ఆ తరువాత మీ మహిమలు కీర్తిస్తాను. ఆ సమయంలో నాకు మీనుండి ఋజువు కావాలి, అది నాకు స్పష్టంగా తెలియాలి. అలా జరగని పక్షంలో నేను 'నువ్వు అసత్యవాదివని, గారడీలవాడివని, అమాయక భక్తులను మోసం చేస్తున్నావ'ని నిశ్చయించుకుంటాను. అప్పుడు నేను మీ చిత్రపటాన్ని వార్ధా నదిలో పడేసి, మిమ్మల్ని పూజించడం మానేస్తాను" అని తన మనస్సులోని భారాన్నంతా  దించుకుని నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటి గురువారంనాడు బొంబొరికర్ బాబా మందిరానికి వెళ్లేముందు ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. అక్కడినుండి తన స్నేహితుని కుటుంబంతో కలిసి అతడు కూడా మందిరానికి చేరుకున్నాడు. ముందుగా అతడు బాబాను పూజించి, తాను వ్రాసిన చరిత్రను బాబా పాదాల దగ్గర ఉంచి ఆయనకు నైవేద్యం సమర్పించాడు. సుమారు 60 నుంచి 70 మంది భక్తులు అక్కడ చేరారు. అయితే ఆరోజు అంతమంది ఉన్నా భక్తిగీతాలు పాడటానికి అతడొక్కడే సిద్ధంగా ఉన్నాడు. అప్పుడతడు తన మనస్సులో, "నేను వృత్తిపరంగా గాయకుడిని కాను, నాది గొప్ప గొంతు కూడా కాదు. అయితే నాకున్నది బాబా పట్ల భక్తి, ప్రేమలు మాత్రమే" అని అనుకున్నాడు. ఆరోజు పాటకు తాళం వేసే వ్యక్తి కూడా రాలేదు. అతడు వాద్యబృందంతో, "నేను శాయశక్తులా బాగా పాడటానికి ప్రయత్నిస్తాను. మీకు నచ్చిన విధంగా వీలైనంతవరకు నన్ను అనుసరించండి" అని చెప్పాడు. సరిగ్గా రాత్రి 8 గంటల సమయంలో భక్తిగీతాలాపన మొదలై, చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బొంబొరికర్ కాళ్ళు వణుకుతున్నాయి. అతని మనస్సు ఏం జరుగుతుందోనని వ్యాకులపడుతూ ఉంది. 'బాబా తనకేదైనా ఋజువు ఇస్తారా, లేదా?' అని ఒకటే చింత. అతడు ఒకటి తరువాత ఒకటి హృదయపూర్వకంగా పాటలు పాడాడు. సమయం పరుగులు పెడుతూ రాత్రి 10 గంటలైంది. అయినా తనడిగిన ఋజువుకు సంబంధించిన ఎటువంటి సూచనా లేదు! ఇక అతనిలో నిరాశ అలుముకోగా హృదయవేదనతో, "నా దగ్గర ధనవంతుడైన కుబేరుడున్నప్పుడు, నా ఇంటిని నేను నాశనం చేసుకున్నాను. నేను పేదరికాన్ని కౌగిలించుకున్నప్పుడు నీ ద్వారం వద్దకు భిక్షకు వచ్చాను. నీ ధనాగారం దైవత్వంతో నిండి ఉంది, నాకు కొన్ని ముక్కలు ఇవ్వు, ఒట్టి చేతులతో నీ దర్బారును వదిలివెళ్ళడం నాకు వేదన కలిగిస్తుంది" అనే భావం వచ్చేలా ఒక పాట పాడాడు.

పాట ముగిసే సమయంలో అక్కడి పూజారి ఆరతి కోసం అందరినీ ఒక్కచోట చేరమన్నాడు.  బొంబొరికర్ బాబా విగ్రహం వైపు చూస్తూ, "రేపు నేను ఖచ్చితంగా నా మాటను నిలబెట్టుకుంటాను. నిన్ను వార్ధా నీటిలో ముంచేస్తాను" అని అనుకున్నాడు. తరువాత భక్తులందరితో కలిసి ఆరతిలో పాల్గొన్నాడు. ఆరతి కొనసాగుతుండగా బాబా తమ అనుగ్రహాన్ని అతనిపై కురిపించారు. ఆ అనుభవాన్ని బొంబొరికర్ ఇలా చెప్తున్నాడు: "తరువాత జరిగిన దానికి నేను దాసోహమైపోయాను. నేను చూస్తుండగానే బాబా విగ్రహం అతి పెద్దగా మారిపోయింది. పరమానందభరితంగా నవ్వడం మొదలుపెట్టింది. తరువాత వేదిక మీద నుంచి క్రిందకు దిగి మందిరమంతా తిరగసాగింది. నా కళ్ళు పెద్దగా చేసుకుని ఆనందపారవశ్యంతో విగ్రహాన్ని చూస్తూ ఉండిపోయాను. నా కళ్ళనిండా ఆనందభాష్పాలు నిండిపోయాయి. నేను పూర్తి జాగరూకతలోనే ఉన్నానని నాకు తెలుస్తోంది. కానీ 'ఏం జరుగుతుంది ఇక్కడ?' అని అనిపించింది. మరుక్షణంలో దృశ్యమంతా మారిపోయింది. నేను పరిమళాలు వెదజల్లే పూలు, చెట్లు ఉన్న అందమైన తోటలో ఉన్నట్లు గమనించాను. ఒక పెద్ద చెట్టుకి ఊయల కట్టబడి ఉంది. ఆ ఊయలపై మానవరూపంలో బాబా కూర్చుని ఉన్నారు. ఆయన ముఖం ఆనందపారవశ్యంతో వెలిగిపోతోంది. ఆయన వేగంగా ముందుకి వెనక్కి ఉయ్యాల ఊగుతున్నారు. అలా ఆయన ఊగుతూ తనవద్ద ఉన్న పూలు నా మీద విసరి, "ఇదిగో, ఇవి తీసుకో! నిజానికి నీవు నిజాయితీపరుడివి. మిగతా జీవితమంతా ఇలానే ఉండు" అని అన్నారు. ఆ దృశ్యమంతా మూడు నిమిషాలపాటు కొనసాగింది. కానీ బాబా ఇచ్చిన అనుభవం మర్చిపోలేనిది". ఈ అనుభవం తరువాత అతని ఆర్థిక పరిస్థితి నిదానంగా మెరుగుపడడం మొదలయ్యింది.

బొంబొరికర్ ఇలా చెప్పారు: "నేను ఇంతవరకు శిరిడీ దర్శించలేదు. అయినా దయగల శిరిడీ దైవం నేను ఆయన పాటలు పాడినప్పుడు ఇక్కడే ఉంటారు. ఒకానొక సమయంలో నాతోపాటు నా కుటుంబమంతా ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి. కానీ నిదానంగా నా పరిస్థితి మెరుగుపడసాగింది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను, "అన్నవస్త్రాలకు బాబా భక్తుని ఇంటిలో కొరత ఉండదు. బాబా తన వాగ్దానాలని నిలబెట్టుకుంటారు".

Ref : ప్రసాద్, వాల్యూం ౩౩, నెంబర్.9, ఆగష్టు 1979.
source: Baba’s Divine Manifestations, Compiled by Vinny Chitluri.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo