సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 403వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ముప్పైఏడవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఈ మధ్యలో రాధాకృష్ణమాయి శిరిడీలో ఉన్న నా గదిని తనకిమ్మని అడిగింది. ఆమె నాతో, “నీవు శిరిడీ వచ్చినప్పుడు ఉండటానికి నా ఇల్లు ఎలాగూ ఉంది కదా, వ్యర్థంగా నీవు అద్దె ఎందుకు కడుతున్నావు? బాబా కోసం తీసుకొచ్చే సామాను పెట్టటానికి ప్రస్తుతం స్థలం తక్కువైంది. నీ స్థలం మాకిస్తే మా స్థలం పెరుగుతుంది” అని అన్నది. నేను సరేనన్నాను. ఈ విషయం శ్రీతాత్యాపాటిల్‌తో చెబితే అతను కూడా సరేనన్నాడు. తరువాత ఆ ప్రదేశం రాధాకృష్ణమాయి వాడుకలోకి వచ్చేసింది. దానివల్ల ఆమెకు ఏకాంతంలో గుప్తమంత్రాన్ని సాధన చేసుకోవటానికి సరైన అవకాశం కలిగింది. 

డిసెంబరులో నేను శిరిడీలో రాధాకృష్ణమాయి ఇంట్లో దిగాను. నా చెల్లెలు నన్ను తెల్లవారుఝామునే కేకలు వేసి ఎలా లేపేదో రాధాకృష్ణమాయి కూడా నన్ను అలాగే లేపేది. "వామన్యా! లే, టీ తయారైంది, ఆరుగంటలైంది” అంటూ ఆమె నన్ను లేపేది. నేను చెప్పకుండానే ఆమె మా ఇంటి పద్ధతులనూ, నా అలవాట్లనూ తెలుసుకొన్నది. నేను రెండు మూడు రోజులు శిరిడీలోనే ఉండిపోయాను. ఆమె ప్రతిరోజూ సరిగ్గా ఆరుగంటలకు నా చెల్లెలి లాగానే పిలిచి నన్ను లేపుతూ ఉండేది. ముంబాయికి, శిరిడీకి ఎంత దూరం! కానీ మా ఇంటి వ్యవహారాలను ఏ మాత్రం తేడా లేకుండా తెలుసుకుని ఆ ప్రకారంగా నాకు ఆతిథ్యమివ్వటమనేది సామాన్యులు చేసే పని కాదు. మాయితో ఇలాంటి అనుభవాలు నాకెన్నో జరిగాయి. సహజంగానే ఆమె చరణాలకు నేను శిరసు వంచి నమస్కరించేవాణ్ణి. 

ఆ సమయంలోనే లోకమాన్య తిలక్ గారి 'గీతా రహస్యం' అనే గ్రంథం ప్రచురింపబడింది. దాన్ని తెప్పించి నేను చదవటం ప్రారంభించాను. దాన్ని పఠించే సమయంలో ఎన్నో నిగూఢమైన ప్రశ్నలు మనసులోకి రావటం మొదలైంది. అలాంటి ప్రశ్నలు ఏవైనా మనసులోకి వచ్చాక రాధాకృష్ణమాయి దగ్గరకు వెళ్ళి సామాన్యమైన మాటలు మాట్లాడుతుండగానే, పరిష్కారం కాని ఆ నా ప్రశ్నలకు సమాధానం దొరికేది. చాలాసార్లు ఆమె వద్దకు వెళ్ళి నిలబడగానే ఆమె వద్ద సమాధానాలు దొరికేవి. ఆ ప్రశ్నలకు జవాబులు రాధాకృష్ణమాయి మాటల్లో తమంతట తామే వచ్చేవి. దానికి ముందు విద్యుత్తులా మెరిసే తేజస్సు గదిలోకి వచ్చేది. ఈ రకంగా దివ్యరూపంలో ప్రకటమై బాబా నా ప్రశ్నలకు సమాధానమిస్తుండేవారని ఇప్పుడు నాకు తెలుస్తోంది.

ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలను నేను ఎన్నో చదివాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్, ఇంకా ఇతర పండితుల సమాగమంతో తత్వజ్ఞానంలో శంకరాచార్యులవారి అద్వైత దర్శనమే గ్రహించవలసిందనీ, నిర్దోషమైందనీ, మిగిలిన అన్ని దర్శనాలలో కొంచెం అల్పత్వం ఉండటం వల్ల అవి గ్రహించరానివనీ నేను నిశ్చయం చేసుకొన్నాను. మణిభాయి, నమూభాయిల సిద్ధాంతసారాన్ని ఈ సమయంలో నేను చక్కగా అధ్యయనం చేశాను. వారి భగవద్గీతను కూడా పఠించాను. దాన్నుంచి నేను అద్వైత మతమే శ్రేష్ఠమైందని అంగీకరించాను. పూజ-అర్చన-తిలకం ఇత్యాది శ్రీరామానుజుల చిహ్నాలను చూసి, 'భక్తి కేవలం ద్వైతంలోనే ఉందా?' అన్న సంశయం మనసులో రాసాగింది. 'ఒకవేళ నన్ను ఎవరైనా ద్వైత సాంప్రదాయంలో బంధించి ఉంచారేమో?' అన్న భయం అప్పుడు నన్ను పట్టుకుంది. రాధాకృష్ణమాయి భక్తినీ, చావడికెళ్ళే సమయంలో అందరికీ బొట్టు పెట్టే ఆమె అలవాటునూ చూసి ఆమెది అద్వైత మార్గం కాక, విశిష్టాద్వైతంగానీ లేక వల్లభ సాంప్రదాయంగానీ అవొచ్చునని నాకు అనిపించింది. సంతులందరూ వ్రాసిన భక్తిరసంతో పరిపూర్ణంగా ఉండే గ్రంథాలను చదువుతున్నప్పుడు కూడా ఈ శంకే వస్తుండేది. సంత్ జ్ఞానేశ్వర మహారాజు విషయం గురించి కూడా నా మనసులో సంశయం ఉండేది. తరువాత అమృతానుభవంపై శివ వ్రాసిన టీకను చదివాను. శ్రీజ్ఞానేశ్వర్ మహారాజు గురువు సంత్ నివృత్తినాథుడి గురుపరంపరని చూసి ఈ సంశయం కొన్ని అంశాల్లో తగ్గింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo