సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 407వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైఒకటవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకరోజు రాత్రి నిద్రించే సమయంలో శ్రీబూటీ వచ్చి రాధాకృష్ణమాయితో, "అబ్దుల్లా పఠాను గుడిసెకు నిప్పంటుకుంది” అన్నారు. ఇది విని, “నేను వెళ్ళి మంటలను ఆర్పటానికి ఏర్పాటు చేస్తాను” అన్నాను. ఇలా అని నేను చెంబు తీసుకుని బయటకు వచ్చాను. తరువాత రాత్రంతా బయటే గడిపాను. అందువల్ల రాధాకృష్ణమాయి నా గురించి తన ఇంటి తలుపులు తీసిపెట్టవలసి వచ్చింది. ఆ రాత్రి నేను ఎక్కడ ఎలా గడిపిందీ చెప్పేముందు, శ్రీనానావలీతో నా పరిచయం గురించి తెలుపవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.

నానావలీని శిరిడీలో నేను 1916లో మొట్టమొదటిసారిగా చూశాను. జ్ఞానులు బాలోన్మత్త పిశాచవత్ వృత్తిలో ఉంటారని నేను చదివాను. నానావలీ ఎక్కువగా పిశాచవత్‌గా ఉండేవాడు. నేను ఒకసారి బాబా దగ్గర ధునికి ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఆనుకుని కూర్చున్నాను. సమయం మూడు, నాలుగు గంటలవుతోందేమో. ఇంతలో నానావలీ బాబా దగ్గరకొచ్చాడు. అతన్ని చూసి చాలామంది అక్కడ మూగారు. వాళ్ళందరూ ద్వారకామాయి ప్రాంగణంలో నానావలీ లీలలు చూడటానికి గుమిగూడారు. ఆరోజు అతను చెప్పినవన్నీ నా మనసులో మాటలేనని అనిపించింది. అతని ఆమోదం కోసం చేతివ్రేళ్ళను పైకి క్రిందకీ ఆడించి నేను సంతోషపడ్డాను. ఇలా ప్రదర్శిస్తున్నప్పుడు బాబా నాతో, "చిటికెలు వేయకు” అంటూ నా చేతుల క్రియకు విరామం కలిగించారు. తరువాత కొద్దిసేపటికి నానావలీ వెళ్ళిపోయాడు.

అబ్దుల్లా పఠాను గుడిసెకి అంటుకున్న మంటలు చల్లార్చటానికి కావలసిన ఏర్పాట్లు చేయటానికి చెంబు తీసుకుని రాధాకృష్ణమాయి ఇంటినుండి బయటకొచ్చాను. తరువాత తొట్టెలో నుంచి చెంబుతో నీరు నింపుకుని స్కూలు వెనకభాగంలో శౌచవిధి కోసం కూర్చున్నాను. ఆరతి సమయంలో బాబాకి చేసే విధంగా నా మనసులో కూడా జయకారాలు చేసినట్లు అనిపించింది. తరువాత అంతఃకరణలో "ఈ రాత్రంతా ఈ మంత్రాన్ని జపించ"మని ఆదేశం వచ్చింది. శౌచవిధి తరువాత అబ్దుల్లా పఠాను గుడిసె వైపు వెళ్ళాను. అది వెన్నెల రాత్రి. కాళ్ళల్లో కంకర, ముళ్ళు గుచ్చుకొంటున్నాయి. గుడిసె వైపు వెళుతూ వెళుతూ 'వామనరావు చచ్చిపోయాడు' అని మనసుకు నచ్చజెప్పాను. ఎలాగైనా సరే బాబా నన్ను వైతరణి నుంచి దాటిస్తారన్న భావన ఉత్పన్నమైంది. గుడిసెలో చీకటిగా ఉంది. నాకు రాత్రంతా మంత్రజపం చేయమన్న ఆదేశం వచ్చినందువల్ల నేను గుడిసెలోకి వెళ్ళి ఆ చీకట్లో ఒకచోట కూర్చుని జపం ప్రారంభించాను. కొద్దిసేపయిన తరువాత నేను క్రింద కూర్చున్న చోట వేడిగా ఉన్న అనుభూతి కలిగింది. దాంతో నేను కూర్చున్నది అబ్దుల్లా పఠాను ధుని వెలిగించి ఉంచే చోటని నాకు అర్థమైంది ఆ తరువాత పాపాల ప్రాయశ్చిత్తం గురించి బాబా నన్ను రాత్రంతా జపం చేయమని ఆజ్ఞాపించినట్లు నాకు అర్థమైంది. నాకు తెలీకుండానే నేను మంటమీద కూర్చున్నాను. అప్పుడు, 'జరిగేదేదో జరుగుతుంది. ఏది ఏమైనా నేను ఆసనం నుంచి లేవను' అని అనుకున్నాను. ఈ భావంతో నేను అక్కడే కూర్చుండిపోయాను. కొద్దిసేపటి తరువాత మంట చల్లారిపోయింది. మరి కాసేపటికి తెల్లవారింది. 

గుడిసెలో చీకటిగా ఉండటం వల్ల బయట ఏం జరుగుతోందో నాకు తెలియలేదు. ఇంతలో నానావలీ వచ్చిన చప్పుడైంది. “అరే! ఇప్పుడిక్కడ ఎందుక్కూర్చున్నావు?” అన్నాడతను. ప్రకృతి, పురుషుల గురించి అతను కొంచెం చెప్పాడు కానీ అది నాకు గుర్తు లేదు. అతను చెప్పినదాని ప్రకారం నేను ఆ రాత్రంతా చల్లారుతున్న ధుని మీదనే కూర్చుని గడిపాను, ఇది నిజం.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo