సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 395వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఇరవై తొమ్మిదవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నేనొకసారి నా గది ముంగిట శుభ్రం చేసే పని మొదలుపెట్టాను. అక్కడ పొయ్యి వెలిగించేటప్పుడు శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయంలోని 4వ శ్లోకం గుర్తొచ్చింది.

"మన్యనే యదితచ్చక్యం
మయా ద్రష్టుమితి ప్రభో
యోగేశ్వర తతోమేత్వం
దర్శయాత్మా న మవ్యయమ్”

(అర్థం:- ఓ ప్రభూ! మీ రూపాన్ని చూడటం నాకు శక్యమేనా? అలా అని మీరొకవేళ అనుకుంటే, ఓ యోగేశ్వరా! మీరు మీ అవినాశి స్వరూపాన్ని నాకు చూపండి.)

శ్లోకం గుర్తొచ్చిన మీదట మళ్ళీ మళ్ళీ ఉచ్ఛస్వరంతో దాన్ని చదువుతూనే ఉన్నాను. ఈ పంక్తులను మళ్ళీ మళ్ళీ పలకటంలోని ఉద్దేశ్యం నాకు విశ్వరూప సందర్శనం మీద గల కోరికే.

భగవంతుని దర్శనం మీదున్న కోరికే నన్ను శిరిడీ వరకు తీసుకొచ్చింది. ఇదయితే స్పష్టమే. ఆ కోరికనే అర్జునుడు వ్యక్తం చేసి ఉన్నాడు. ప్రక్కనున్న రాధాకృష్ణమాయికి వినిపించేట్లుగా ఈ ప్రార్థన చేసి ఆమె ద్వారా బాబా విశ్వరూపదర్శనం చేసుకోవాలన్న కోరికే ఉంది నాకు. అదేరాత్రి స్వప్నంలో ఆనంద లెహర్ శ్లోకంలో వర్ణించబడ్డట్లుగా అదే ఆకారంలో ఆదిశక్తి దర్శనం నాకు లభించింది. భగవానుడు అర్జునుడికి ప్రసాదించిన విశ్వరూపదర్శనం కాదిది. అది బాబా రూపం లాగానే ఉంది. వారి సమ్మతితో మంత్రోచ్ఛారణ ప్రారంభించటంతోనే అదే రూపంలో దర్శనం అవుతూ ఉండేది. ఈ ఆకారం ఆ సమయంలో పెద్దవాటిల్లోకెల్లా పెద్దదిగానూ, అణువులో అణురూపంలోనూ కనిపిస్తూ ఉండేది.

అయితే తరువాత శిరిడీలో ఉన్న సమయంలో విద్యుత్తు లాంటి బాబా తేజోమయ రూపదర్శనం అయ్యేది. నా మనసు విచారంగా ఉన్నప్పుడు బాబా ఈ రూపంలో దర్శనమిచ్చేవారు. దాంతో నా విచారం తొలగిపోయేది. నిగూఢ విషయాలు తెలుసుకోలేకపోయినప్పుడు ఇలా బాబా దర్శనమైన తరువాత ఆ విషయాలు వెంటనే అర్థమయ్యేవి. ఈ మానవుడే విద్యుత్ పురుషుడు. అందువల్ల ఆయన సాధకులకి బ్రహ్మప్రాప్తిని కలిగింపజేస్తాడని 4 నుంచి 6 వరకూ ఉన్న బ్రహ్మసూత్రాల్లో స్పష్టంగా రాసి పెట్టబడి ఉంది. "గమయతి” - తీసుకెళ్ళిపోతుంది. ఈ శబ్దానికి అర్థం - “నేతృత్వ క్షమత ఉన్న శ్రీసాయిబాబా, భక్తుల కోసం అవతరించిన భగవంతుడే”.

నేను శిరిడీలో ప్రాణాయామాన్ని అభ్యసించేటప్పుడు దాన్ని బాబా ఎలా ఆపించారో ఆ కథ ముందే చెప్పేశాను. అయినప్పటికీ ప్రాణాయామం చేయాలనే నా అభిలాష పోలేదు. 1917 మార్చి - 15 జనవరి 1921 మధ్యకాలంలో నేను అహ్మదాబాదులో నివసించే సమయంలో 'యోగానుశాననం' అనే పేరు గల ప్రాచీన గ్రంథాన్ని చదవటం తటస్థించింది. రామశంకర త్రిపాఠిగారు తన గురువు నుంచి ఆసనం, బ్రహ్మదాతౌన్, నేతి, నౌళి, ధౌతి, బస్తి, ప్రాణాయామం వగైరాలన్నీ నేర్చుకొన్నారు. “వాటిని ఆయన దగ్గర నేను నేర్చుకోనా?” అని అడిగినప్పుడు, బాబా 'సరే'నన్నారు. ఆ క్రియలను బ్రహ్మదాతౌన్ నేర్చుకోవటంతో నేను ప్రారంభించాను. 

ఉప్పు వేసి కరిగించిన వేడి నీటిని ఒకటి రెండు చెంబులు త్రాగి ఉత్తానాసనం (పశ్చిమోత్తానాసనం) చేసి కడుపును శుభ్రపరచిన తరువాత బ్రహ్మదాతౌన్, అంటే సన్నని మర్రిపుల్లను గొంతులో వరకూ దించి దాన్ని బాగా కదిలించే క్రియను కొద్దిరోజుల పాటు చేశాను. శ్రీరామశంకర్ వద్ద వారి గురువు ద్వారా ఇవ్వబడిన సిద్ధ ధౌతి ఉంది. బట్టను ఒక చివర పట్టుకుని, దాన్ని గొంతులోకి దించి రెండవ కొనను పట్టుకుని ఉండేవాణ్ణి. మళ్ళీ వేడి నీరు త్రాగి నెమ్మది నెమ్మదిగా బయటకు తీసే ప్రయోగం చేసేవాడిని. చాలారోజుల వరకూ ఈ ప్రయోగం కొనసాగించాను. ధౌతి బయటకు వచ్చేటప్పుడు దానితోపాటు శ్లేష్మం ఎక్కువగా బయటకు వచ్చేది. చివరికొన కొంచెం పచ్చగా అవుతుండేది. అది పిత్తాశయం వరకూ చేరుకునేదని శ్రీరామశంకర్ చెప్పారు.

ఈ క్రియతో నాకు చాలా నీరసంగా అనిపించేది. ఎందుకంటే నేను తినే పదార్థాల్లో పాలు, పూరీ తప్ప వేరే ఏదీ ఉండేది కాదు. అదీకాక, చాలినంత మాత్రంగా కూడా నేను తినగలిగేవాణ్ణి కాదు. ఈ క్రియను ప్రారంభించటానికి ముందు మోతాలోని వైద్యుడి ద్వారా పంపించబడిన మారేడు పళ్ళూ, పటికబెల్లం పాకమూ; రామశంకర్ తయారుచేసిన మారేడుపండు, పటికబెల్లం పాకమూ త్రాగటంతో శరీరానికి మంచి పుష్టి కలిగింది. గడ్డంలో తెల్లబడిన ఒకటి రెండు వెంట్రుకలు కూడా నల్లబడ్డాయి. కానీ ఈ క్రియ ప్రారంభించిన తరువాత నాకు నీరసంగా అనిపించి నల్లబడిన వెంట్రుకలు మళ్ళీ తెల్లబడ్డాయి. అందువల్ల శ్రీరామశంకర్ సలహాతో ఈ క్రియను ఆపేశాను. ఈ క్రియలు చేస్తున్నప్పుడు శ్రీరామశంకర్ ని ‘నేతి క్రియ’ నేర్పించమని ఒకటి రెండుసార్లు అర్థించాను. కానీ నా అభ్యర్థనను వారు పట్టించుకోలేదు. అందువల్ల అది జరగలేదు. 

దాని తరువాత అహ్మదాబాదులో ప్లేగు వ్యాపించి, పాఠశాలలు నిరవధికంగా మూసివేశారు. నేను సర్కేజ్‌లో ఉన్న శ్రీరామశంకర్ ఇంటిలో ఉండవలసి వచ్చింది. అక్కడ వేరే పనేమీ లేకపోవటం వల్ల ప్రాణాయామం నేర్పించమని శ్రీరామశంకర్ ని అడిగాను. ఆయన నిర్దేశానుసారం ప్రతిరోజూ ఆరు ప్రాణాయామాలు చేయటం ప్రారంభించాను. ఇవి అభ్యసించే సమయంలో శ్రీరామశంకర్ మాటపై కొద్దిమాత్రంగా నెయ్యి తినటం ప్రారంభించాను. నెయ్యి నాకు అరగకపోవటం వల్ల ప్రాణాయామం యొక్క విపరీత పరిణామాలు కలిగాయి. అప్పటినుంచి పూర్తిగా ప్రాణాయామ క్రియను వదిలేశాను. నేను శిరిడీలో ఉండే సమయంలో బాబా నన్ను ప్రాణాయామ అభ్యాసం చేయకుండా ఆపేశారు. దానికిదే కారణమై ఉండొచ్చని పై అనుభవం వల్ల నాకు తెలిసింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

5 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. very well neratted very nice experience.these devotees are very lucky to see baba when he is alive.om sai ram om sai ram om sai maa

    ReplyDelete
  3. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhavya sree

    ReplyDelete
  4. 🙏🌹ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🌹

    ReplyDelete
  5. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo