సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 386వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఇరవయ్యవ భాగం 

నిన్నటి తరువాయిభాగం..... 

బాబా కఫ్నీ తప్ప వేరే ఏ వస్త్రాన్నీ ధరించేవారు కాదు. అప్పుడప్పుడు ధుని వద్ద కూర్చునేవారు. అందువల్ల ఆయన శరీరంలో కఫం ఎక్కువగా ఉండేది. అది ఉదయం పూట చాలా ఎక్కువగా ఉండేది. అది బహుశా డిసెంబరు నెల అనుకుంటాను. అప్పుడొకసారి నేను బాబా వద్ద కూర్చొని ఉన్నాను. అక్కడ ఇంకెవరూ లేరు. బాబాకు దగ్గొచ్చింది. ఆయన కట్టడా పక్కన గట్టు మీద కఫాన్ని ఉమ్మేశారు. అప్పుడు, “చూస్తున్నావేమిటి? బాగు చెయ్యి” అన్న శబ్దం వినిపించింది. అందువల్ల నీటితో ఆ ప్రదేశాన్ని కడిగాను. తరువాత నేను చాలారోజులదాకా అక్కడున్నాను. ఆ రోజుల్లో ఇతరులు కఫాన్ని ఎలా కడిగేవారో నేను చూశాను. కఫం పడిన చోట బూడిద వేసి కొంచెం దూరంలో ఉన్న గుంటలో పడేసేవారు. ఆ గుంటని నీటితో కడిగే అలవాటుని నేను గమనించాను. ఆ తరువాత నేను కూడా ఆ విధంగానే శుభ్రపరచటం ప్రారంభించాను. అప్పుడప్పుడు కుక్కలు సభామండపాన్ని అశుభ్రం చేసేవి. దాన్ని కూడా నేను శుభ్రంచేసేవాడిని. ఈ రకమైన సేవ 1916 వరకూ నడిచింది. తరువాత ఒకసారి బాబా, “ఇప్పుడు చేయి పాడుచేసుకోవద్దు" అన్నారు. అయినప్పటికీ వారి దృష్టిని తప్పించుకుని ఈ సేవను చేసినందువల్ల నా శరీరంపై బొబ్బలు రావటంతో దాన్ని ఆ తరువాత ఆపేశాను.

ఒకరోజు ఉదయం సభ జరుగుతున్నప్పుడు నేను కట్టడాకి వెలుపల కూర్చున్నాను. అక్కడ నేను తప్ప మరెవరూ లేరు. అప్పుడు బాబా నా చేయి పట్టుకుని రాధాకృష్ణమాయి గదివైపు వేలుపెట్టి చూపిస్తూ కూర్చుండిపోయారు. నోటితో నాకు ఏమీ చెప్పలేదు. దానితో సేవ చేయాలనే నా కోరికను నెరవేర్చటానికి బాబా నన్ను రాధాకృష్ణమాయి దగ్గరికి వెళ్ళమని సూచిస్తున్నారని అనిపించింది. అయితే నా స్వభావాన్ననుసరించి ఏ కారణమూ లేదు కాబట్టి నేను అక్కడకు వెళ్ళలేదు. అందువల్ల ఈ పని చేయమని బాబా శ్రీవామనరావు నార్వేకర్‌కు ప్రేరణ ఇచ్చారు. బాబా నన్ను అమిత గారాబం చేస్తూ ఏదో ఒక పనిని నా చేత చేయిస్తూ ఉండేవారు. ఈ కారణంవల్ల బాబా భక్తుల్లో అనేకమంది తాము కూడా నన్ను ప్రేమతో పిలుస్తుండేవారు. ఆ విధంగానే వామనరావు నార్వేకర్ కూడా నాతో పరిచయం చేసుకున్నాడు. నార్వేకర్‌ది బాగా డబ్బున్న కుటుంబం. వారికి ముంబాయిలో పోర్ట్ ఏరియాలో చాలా పెద్ద చెప్పుల దుకాణం ఉండేది. దాన్ని మద్రాసుకు చెందిన శ్రీసుందర్రావుతో భాగస్వాములై నడిపించేవారు. నార్వేకర్ ఒకసారి బాబాతో, "మా నాన్నగారికి జ్వరమొచ్చింది” అన్నారు. అప్పుడు బాబా అతన్ని ఐదువందల రూపాయలడిగారు.

అతను ఇచ్చాడు. అక్కడ అతని తండ్రి జ్వరం వెంటనే తగ్గిపోయింది. ఇక్కడ బాబాకు జ్వరమొచ్చి కొద్దిసేపు తరువాత తగ్గిపోయింది. అయితే అందువల్ల, "ఎవరి దగ్గర దక్షిణ తీసుకుంటారో వారి పని చేయటం ఆవశ్యకం” అన్న మాటకు ప్రత్యక్ష ప్రమాణం ఆయనే ఇచ్చారు. నార్వేకర్ ఉదయమూ, సాయంత్రమూ బాబాకు నైవేద్యం సమర్పించేవారు. ఇంకా బాబా కోసం ఇతర ఖర్చులు కూడా చేసేవారు. అందువల్ల ఆయన బాబాను ప్రేమించే సంపన్నులైన భక్తుల్లో ఒకరుగా పరిగణింపబడేవారు. నార్వేకర్ ఎప్పుడూ రాధాకృష్ణమాయి ఇంట్లోనే ఉండేవారు. అందువల్ల నాక్కూడా మాయి ఇంటికి వెళ్ళి రావటం అలవాటైంది.

ఒకసారి శ్రీవాసుకాకా దగ్గరకు వెళ్ళి లడ్డు తినాలనే కోరికతో చావడి నుండి భోజనాలయం వైపు వెళుతున్నాను. అప్పుడు బాబా మసీదు ప్రాంగణంలో గోడకానుకొని నిలబడి ఉన్నారు. ఆయన తీవ్రమైన స్వరంతో, “తినటానికి వెళుతున్నావు, కానీ ఛస్తావ్!” అని అన్నారు. అయితే ఆకలిని ఆపుకోలేని పరిస్థితిలో ఉన్న నేను వాసుకాకా దగ్గరకి వెళ్ళి శనగపిండితో చేసిన మూడు లడ్డూలు తిన్నాను. దాని పరిణామం బాబా చెప్పినట్లే జరిగింది. మర్నాడు కడుపులో నొప్పి ప్రారంభమైంది. ఒకటి రెండు విరోచనాలైనాయి. తరువాత ఈ విరోచనాలు ఎప్పటికీ వదలవేమోనన్న భయం పట్టుకొంది. కానీ మధ్యాహ్నం బాపూసాహెబ్ జోగ్ ద్వారా బర్ఫీ ముక్కను ప్రసాదంగా పంపించారు బాబా. అది తిన్న తరువాత నొప్పి సర్దుకొని, విరోచనాలు కూడా ఆగిపోయాయి. ఈ సంఘటన జరిగిన తరువాత కూడా నేను ఆకలిని సహించలేక మళ్ళీ వాసుకాకా దగ్గరకి వెళ్ళటం మొదలుపెట్టాను. అయితే బాబా వెళ్ళొద్దని చెప్పటం వల్లా, వెనుకటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాసుకాకా దగ్గరకి వెళ్ళొద్దని నిర్ణయించుకున్నాను. ఆ రకంగా నాకు రాబోయే అనారోగ్యం నుంచి నన్ను నేను రక్షించుకున్నాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo