సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 388వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఇరవైరెండవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

1916వ సంవత్సరంలో ఒకరోజు చావడిలో ఆరతి మొదలైంది. ఆ సమయంలో నేను రాధాకృష్ణమాయికి కొద్దిదూరంలో సామానుగదిలో నిలబడి ఉన్నాను. అప్పుడామె తన చేతిలోకి రాధాకృష్ణ విగ్రహం తీసుకుని దానితో అగ్నిని ఎలా సృష్టించారంటే, దాంతో విగ్రహం ఎర్రబారింది. అప్పుడామెకు నేను ఆరు బారల దూరంలో నిలబడి ఉన్నప్పటికీ, నా శరీరానికి ఆ అగ్నిజ్వాల యొక్క వేడి సోకటం అనుభూతమైంది.

బాబా ఆజ్ఞతో నేను రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళటం మొదలుపెట్టాను. సేవ చేసేందుకు నాకలా అవకాశం దొరికింది. మొదట్లో రాధాకృష్ణమాయి చెప్పినట్లు పొద్దునపూట బాబా ఫలహారం చేసే వెండిపాత్రలను మట్టితో తోమకుండా, బయటనుంచి పేడ తెచ్చి, నేనే శుభ్రం చేసేవాణ్ణి. బాబా లెండీతోటకు వెళ్ళొచ్చాక అక్కడికి వెళ్ళమని ఆమె నన్ను ఆదేశించేవారు. ఆమె ఆజ్ఞానుసారం బాబా లెండీతోటకు వెళ్ళటానికి రోడ్డుమీదకు వెళ్ళినప్పుడే నేనక్కడికి వెళ్ళేవాణ్ణి. చాలాసార్లు ఆమె గది తలుపులు తెరిచేందుకు చాలా ఆలస్యమయ్యేది. అప్పుడు నేను లెండీకి ఆలస్యంగా వెళ్ళేవాడిని. అనేకసార్లు సకారణంగానో, అకారణంగానో ఆవిడ నాపై తిట్లవర్షం కురిపించేది. అయితే నా మనసులో మాత్రం ఆవిడ సేవ చేసేందుకే నన్ను బాబా ఆమె వద్దకు పంపారన్న దృఢవిశ్వాసం ఉండేది. అందుకని దాన్ని సహించి ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ మానరాదని ఏది ఏమైనా దాన్ని సహించి ఎంతో ఓర్పు వహించేవాణ్ణి. బాబా ఆ నిర్ణయం మీదే నన్ను దృఢంగా ఉంచారు.

తరువాత చాలాసార్లు బాబా లెండీ నుండి వచ్చాక నేను వారు కూర్చొనే గట్టూ, పరుపూ, దిండూ చక్కగా అమర్చటంలో సాయపడుతుండేవాడిని. ఒకసారి అలా సాయపడుతున్నప్పుడు రాధాకృష్ణమాయి నాతో తగవుపడింది. ఆ తరువాత రెండు మూడ్రోజులు నేను ఈ సేవ చేయలేదు. ఇంతలో ఎవరో బాబాకు ఆకుపచ్చ రంగు సిల్కు జెండాలు కర్రలతో సహా బహుకరించారు. సాఠేవాడా నుండి బాబా లెండీతోటకు వెళ్ళే మార్గంలో వీధికి రెండు వైపులా దగ్గర దగ్గరగా గుంటలు తవ్వి, అందులో జెండాలు పాతిపెట్టే పని రాధాకృష్ణమాయి ప్రారంభించింది. రెండుమూడ్రోజుల తరువాత ఆ పని నాకు ఒప్పగించబడింది. అలా చాలారోజుల వరకూ నేనా పనిని చేసి దాన్ని పూర్తిచేశాను. ఈ బాధ్యత నా తలపై ఉండటంతో ఉదయం ఫలహారానంతరం బాబా దర్బారులో కూర్చునేందుకు అవరోధం ఏర్పడ్డంతో నా మనసుకి బాధ కలిగేది. అందువల్ల ఒకరోజు ఈ పనిని అలాగే వదిలేసి బాబా దర్బారులో కూర్చున్నాను. అప్పుడు బాబా నన్నేమీ అనలేదుగానీ, నన్ను దర్బారులోంచి లేపేశారు. దానితో జెండాలు పాతే కార్యక్రమం రాధాకృష్ణమాయి బాబా అనుమతితోనే మొదలుపెట్టిందనీ, ఆ సేవను మాని బాబా దర్బారులో కూర్చోవటం గొప్ప విశేషమని భావించటం నా పొరపాటనీ నేను తెలుసుకున్నాను. వెంటనే వెళ్లి జెండాలు పాతిపెట్టే పని మొదలుపెట్టాను. పొద్దుటి పూట వెళ్ళి బాబా దర్బారులో కూర్చోవాలనే ఆలోచనను తిరిగి నేను ఎన్నడూ చేయలేదు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo