సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 406వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభయ్యవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

రాత్రి బసకు తిరిగి వచ్చి శ్రీమాన్ బూటీ, నార్వేకర్, రాధాకృష్ణమాయి ఇత్యాదులతో పాటు భోజనం చేయటానికి కూర్చున్నాను. ఇదివరకే రాసినట్లు పరీక్ష గురించిన ఆలోచన వల్ల నాకు అన్నం రుచించేది కాదు. ఏదీ తినాలనిపించేది కాదు. శిరిడీలో కూడా అదే జరిగింది. కానీ రాధాకృష్ణమాయి ఒక్కొక్క ముద్దను నాకు పెడుతూ, వాటి తత్వసంఖ్యను నాకు చెబుతూ ఉండేది. మొత్తం ఆమె నాకు 42 ముద్దలు పెట్టినట్లు గుర్తు. ఈ ప్రకారంగా అన్నం వల్ల నాకు ఏర్పడిన అరుచిని ఆమె దూరం చేసింది. అంతేకాదు, దాంతోపాటు “తత్వాల శుష్కజ్ఞానంతో ఏం పని? ఏ వస్తువులో ఏ తత్వం ఉందో అది తెలుసుకొనే శక్తి మనకు ప్రాప్తించాలి. ఉదాహరణకి - ఉప్పు, అన్నం మొదలైనవాటిలో ఏ తత్వం ఉందో తెలుసుకోవటం అవసరం” అనేది.

ఇది జరిగిన కొన్ని రోజులకు మేమంతా భోజనం చేయటానికి కూర్చున్నప్పుడు నా విస్తరి వద్ద ఒక అరటిపండు పెట్టి వుండటం కనిపించింది. దానిపై రెండు మూడుచోట్ల మచ్చలు పడినట్లు కనిపించాయి. ఒక కూర ముద్దలో ఎలుక పెంటిక కనిపించింది. అయితే కూరలో మిగతాభాగం బాగున్నట్లే కనిపించింది. ఏది తినటానికి యోగ్యమైనదో, ఏది తినటానికి యోగ్యం కానిదో తెలుసుకొనే జ్ఞానాన్ని యోగులు తమ భక్తులకు ఈ ప్రకారంగా ఇస్తారని దీంతో బోధపడింది.

ఆమధ్య ఒకసారి బాబా శనగపప్పు, మసాలా, కొబ్బరి మొదలైనవాటితో పచ్చడి చేశారు. దాన్ని రాధాకృష్ణమాయి నాకు తినటానికి ఇస్తూ, “తీసుకో, తీసుకో, తినేసెయ్! బాబా తన చేత్తో స్వయంగా తయారుచేసిన పచ్చడి తినాలంటే మళ్ళీ దొరకదు” అన్నది. రాధాకృష్ణమాయి బ్రతిమిలాడినందువల్ల దాన్ని నేను తిన్నాను, కానీ పచ్చడి బాగా కారంగా ఉంది. అందువల్ల శరీరంలో వికారం పుట్టి వమనం ద్వారా అది బయటకు వెళ్ళిపోయింది. మర్నాడు బాబా, "ఏ వస్తువు మన వాటాలో లేదో దాన్ని తింటే ఇలాగే తెరలు తెరలుగా బయటకు వస్తుంది” అన్నారు.

నేను శిరిడీలో ఉన్న 21 రోజులలో రాధాకృష్ణమాయి ఇంట్లో ఎన్ని రోజులు పడుకున్న సంగతి ఇప్పుడు, అంటే 43 సంవత్సరాల తరువాత (19-5-1951) సరిగ్గా నాకు గుర్తులేదు. బహుశా మొదటి ఐదారు రోజులు పడుకున్నట్లున్నాను. నేను శిరిడీ వెళ్ళినప్పుడు మొదట్లో అన్నం సయించకపోవటంవల్ల రాత్రిళ్ళు సరిగ్గా నాకు నిద్రపట్టేది కాదు. రాధాకృష్ణమాయి తత్వసంఖ్యను లెక్కించి ముద్దలు పెట్టిన తరువాత ఆ అరుచి దూరమైపోయింది. అలాగే మొదటిరోజు అర్థరాత్రి వరకూ నిద్ర రాకపోయేసరికి ఆమె తెల్లటి వస్త్రాన్ని ముట్టుకుంటే చల్లగా అనిపించి వెంటనే నిద్ర వచ్చింది. ఈ అనుభవంతో చల్లదనం అనేది వస్త్రంలోనో లేదా వస్త్రాన్ని ధరించేవారి ఏదో ఓ అలౌకిక గుణంలోనో కాక, మన మనసులో ఉండే మృదువైన భావం యొక్క పరిణామమే అని 43 సంవత్సరాల తరువాత ఋజువైంది. (ఈ సందర్భంలో పంచదశి చదివాను.) ఈశ్వరసృష్టి బాధాకరం కాదు. అయితే ఈ సృష్టి మీద మనం ఏం ఆరోపిస్తామో అదే బాధాకరం. స్త్రీ అనేది ఒకటే అయినా తల్లిదండ్రులకు వేరుగా, తన భర్తకు వేరుగా కనిపించి తన పుత్రుడికి మూడవ రూపంలో అనుభవమిస్తుంది. భావమానమవుతున్న సంసారమంతా దోషరహితంగా ఉన్నప్పటికీ మన మనోవికారాన్ననుసరించి సుఖదుఃఖాలుగా అనుభవిస్తాం. (పంచదశి 4వ ప్రకరణం 18వ శ్లోకం నుంచి 23 దాకా)

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo