సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 402వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ముప్పైఆరవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నవసారి ఆధ్యాత్మిక జీవనంలో ఒకసారి ఇలా జరిగింది. ఓరోజు నేను స్కూలుకి వెళుతూ దారిలో, ఒక మురికిపట్టిన పసుపురంగు వస్త్రాన్ని ధరించి, ముఖంపై కుంకుమను అడ్డంగా పట్టీలా పెట్టుకొని, ఎత్తుపళ్ళతో, జుట్టు విరబోసుకున్న ఒక భయంకరమైన స్త్రీని చూశాను. నేనామెని పట్టించుకోలేదు. కానీ కొద్దిరోజుల్లోనే నేను నివసిస్తున్నచోటా, ఇంకా పరిసరాల్లో కూడా కలరా ఎక్కువగా వ్యాపించింది. నా స్వభావం వల్ల దాని ప్రభావం నా మీద కొంచెం కూడా పడలేదు. ఈ సమయంలో ఒకటి రెండుసార్లు తేజోమయ వస్త్రాలను ధరించిన శ్రీకృష్ణ భగవానుడి సుందర స్వరూపం నా హృదయంలో శయనించి ఉన్నట్లు భాసించింది. నుదుటిమీద సుందరమైన తిలకాన్ని నిలువుగా పెట్టుకుని ఉన్న శ్రీకృష్ణ దర్శనం అనేకసార్లు అయింది. ఇవన్నీ రాధాకృష్ణమాయి నా పాదాలు పట్టుకుని ధ్యానస్థురాలై కూర్చున్న పరిణామమేనని నేను విశ్వసిస్తున్నాను.

“నీవేదో అదే నేను, నేనేదో అదే నీవు” అని నాకివ్వబడిన ఈ బోధను గురించి ఆలోచిస్తే, బాబా యొక్క ఈ కృప నేను శిరిడీలో చేసిన వారంరోజుల ఉపవాసం (ఏకాంతంలో) వల్లనే అనిపిస్తోంది. చివరి రాత్రి గదిలో గోడకానుకొని కూర్చున్నప్పుడు ఆ నిద్రలో బాబా సాక్షాత్కరించి నాకో పొట్లం ఇస్తున్నట్లనిపించింది. ఉదయం లేచి చూస్తే, తెరచి ఉన్న పొట్లమూ, అందులో గోధుమపిండీ కనిపించాయి. కానీ స్వప్నాన్ని స్వప్నంలాగానే ఒక మిథ్యగా భావించి, "బహుశా ఆ పొట్లాన్ని నేనే అక్కడ పెట్టానేమో” అన్న ఆలోచనతో దాన్ని పట్టించుకోలేదు. ఆ పొట్లంలో రెండు మూడు చిటికెళ్ళ పిండి ఉంది. తరువాత ఏదో ప్రేరణ కలిగి అందులోంచి ఒక చిటికెడు పిండిని బాబా ప్రసాదంగా భావించి తిన్నాను. ఇది జరిగిన కొద్దికాలం తరువాత, అంటే 1916లో జ్ఞానేశ్వరి పారాయణ పూర్తయిన తరువాత నేను బాబాని "మళ్ళీ జ్ఞానేశ్వరి పారాయణ చేయాలా?" అని అడిగినప్పుడు బాబా, "ఇప్పుడు పారాయణ గ్రంథంతో ఏం పని? పారాయణ గ్రంథం అవసరం లేదు. పారాయణ గ్రంథమైతే పిండి అయింది" అన్నారు. బాబా అన్న ఈ మాటలకు అర్థం ఏమిటంటే, "నీ ఉపవాసంతో ప్రసన్నుడినై నీకు ప్రసాదరూపంలో పిండిని ఇచ్చాను. పిండితో పారాయణ గ్రంథరూపమైన రొట్టె సృష్టించబడింది. అంటే, పారాయణ గ్రంథం యొక్క మూలంలోని లోతైన రహస్యాన్ని, అంటే దేనితో పారాయణ గ్రంథం తయారవుతుందో దాన్నే నీకిచ్చాను. ఇప్పుడు నీకు పారాయణ గ్రంథం గానీ లేదా పిండి(ఆచార్య పదవి) గానీ అవసరం లేదు" అని. తరువాత అనేకసార్లు జ్ఞానేశ్వరి చదవాలని ప్రయత్నించాను. కానీ 18 అధ్యాయాలూ ఎప్పుడూ పూర్తిచేయలేదు. చివరికి సన్యాసం స్వీకరించిన తరువాత ఆనంద్‌లో 1955లో దాన్ని పూర్తిచేయగలిగాను.

స్కూలు సెలవుల్లో శ్రీజహంగీరు గులాబ్‌భాయికి భాగస్థుడైన సొలిసిటర్ బిల్లిమోరియాతో నాకు పరిచయమైంది. ఆయన సొలిసిటర్ జహంగీర్ ఇచ్చిన హెచ్చరికను పట్టించుకోకుండా నన్ను హైకోర్టులో అప్పీలు పెట్టుకోమని సలహా ఇచ్చారు. అందువల్ల నవసారికి వెళ్ళి ప్రధానోపాధ్యాయుడితో, "సెలవులయిన తరువాత పాఠశాల ప్రారంభం కాగానే నేను ఉద్యోగం మానేస్తాన"న్న నా నిర్ణయం గురించి సూచించాను. కొద్ది అసౌకర్యం కలిగిన తరువాత నా స్థానంలో పనిచేయటానికి కొత్త ఉపాధ్యాయుడు దొరకగానే అతడు నన్ను విడుదల చేశాడు. తరువాత ముంబాయి వెళ్ళి గులాబ్‌భాయి సలహాను అనుసరించి నివేదన పత్రాన్ని తయారుచేసి దాన్ని నేను సొలిసిటర్ శ్రీజహంగీరుకు చూపించాను. ఆయన, "వినతి పత్రం తప్పక ఇవ్వు. కానీ రావలసిన గడువులో రాకుండా రెండేళ్ళ వ్యవధి తరువాత దాఖలు చేసిన పిటీషనును అంగీకరించిన సంఘటన ఒక్కటి కూడా హైకోర్టు చరిత్రలో జరగలేదు” అన్నారు. జహంగీరు ఆ వినతి పత్రాన్ని అంగీకరించటానికి ఇష్టపడనందువల్ల దాన్ని టైపు చేయించి హైకోర్టుకు పంపించాను. కొద్దిరోజుల తరువాత ప్రోధ్ నోటరీ వాళ్ళు నన్ను వివరణ కోసం పిలిపించారు. నన్ను చూశాక నా గైరుహాజరుకి కారణం నా అస్వస్థతే అయివుంటుందన్న విశ్వాసం వారికి కలిగింది. వారు హైకోర్టు న్యాయమూర్తికి నా వినుతి గురించి సిఫారసు చేశారు. నా పదమూడు నెలల హాజరును అంగీకరించి కేవలం మిగిలిన పదకొండు నెలల గడువును పూర్తిచేయమన్న ఆదేశాన్ని ప్రధాన న్యాయమూర్తి ఇచ్చాడు. అందువల్ల మిగిలిన కొద్ది డబ్బునూ సొలిసిటర్‌కి ఇచ్చేశాను. ఆ తరువాత మిగిలిన సమయంలో ఆయన్ని కలిసి నేను కూడా సొలిసిటర్ పరీక్షకు చదవటం మొదలుపెట్టాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo