1. కావలసింది బాబాపై పూర్తి నమ్మకం
2. అమ్మనాన్న అయి చూసుకుంటున్న బాబా
3. బాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత
కావలసింది బాబాపై పూర్తి నమ్మకం
నేను గత 20 సంవత్సరాలుగా సాయిని నమ్ముకున్న సాయి భక్తురాలిని. నేను ముందుగా సాయినాథునికి నమస్కరించి ఆయన మాకు ప్రసాదించిన రెండు అనుభవాలను ఈ బ్లాగులోని 'సాయిభక్త అనుభవమాలిక' ద్వారా మీ అందరితో పంచుకుంటున్నాను. బాబాని నమ్ముకున్న తొలిరోజుల్లో ఊదీతో బాబా నాకు నయం చేసిన ఒక జబ్బు గురించి ముందుగా చెప్తాను. నేను ఒకప్పుడు తెలియక నా తలకి హెన్నా పెట్టుకుని రాత్రంతా అలాగే ఉంచుకుని పడుకునేదాన్ని. దాని మూలంగా కొన్నిరోజులకు నాకు ఆస్తమా సమస్య బాగా వచ్చింది. దానితో నేను చాలా బాధపడ్డాను. మందులు వాడినప్పుడు ఉపశమించి మళ్ళీ మళ్ళీ వస్తుండేది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఆస్తమా వచ్చి ఆయాసం వల్ల నాకు ఊపిరి తీసుకోవటం కష్టమైంది. చాలా బాధను అనుభవించాను. అప్పుడు బాబాపై నమ్మకముంచి, "బాబా! మీ ఊదీని మందుగా తీసుకుంటున్నాను. ఈ బాధను తగ్గించండి బాబా" అని బాబాను వేడుకుని ఊదీ నీళ్లలో కలిపి త్రాగాను. ఒక్క అయిదు నిమిషాలు అయ్యేటప్పటికి అంతటి బాధ తగ్గిపోయి గాఢంగా నిద్రపట్టేసింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆస్తమా అనేదే మళ్లీ రాలేదు. ఈ అద్భుతాన్ని తలుచుకుంటే ఇప్పటికీ బాబా చూపిన దయకు నా కళ్ళవెంట నీరు కారుతోంది. "బాబా! మీకు కృతజ్ఞతలు చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు సాయి".
ఇక రెండవ అనుభవం విషయానికి వస్తే, ఇది ఇటీవల 2022, జూన్ మూడో వారంలో జరిగింది. నేను ఎప్పటినుంచో మా పాప విషయంలో ఒక సమస్యతో బాధపడుతున్నాను. ఆ విషయమై మా పాప ఎప్పుడూ, "అమ్మా! నువ్వు పిలిస్తే బాబా పలుకుతాడు. మరి నేను పిలిస్తే ఎందుకు రావడం లేదు. నువ్వు చెప్పినట్లే బాబా సేవ చేస్తున్నాను కదా! నా మొర ఎందుకు అలకించడం లేదు" అని అంటూ ఉండేది. నేను తనతో, "లేదమ్మా, ఎవరు పిలిచినా బాబా పలుకుతారు. కావలసింది ఆయనపై పూర్తి నమ్మకం" అని చెప్పేదాన్ని. తను అలాగే బాబాపై పూర్తి నమ్మకముంచడం వల్ల తన కోరిక నెరవేరింది. అసలు విషయమేమిటంటే, తను తన భర్త వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. అందువల్ల తను ఎమ్మెస్ చేయడానికి యు.ఎస్ వెళ్ళడానికి అప్లై చేసుకుంది. తనకి వీసా వచ్చింది. కానీ కొన్ని సమస్యల వల్ల యు.ఎస్ వెళ్లడం పోస్టుపోన్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్లడానికి i20 వీసాకోసం ఎదురు చూస్తున్న సమయంలో నేను ఈ బ్లాగులోని సాయిభక్త అనుభవమాలికలో భక్తులు పంచుకున్న అనుభవాలు చదివాను. వెంటనే నేను, "బాబా! మీ దయతో అమ్మాయికి i20 వీసా రావాలి" అని బాబాని వేడుకున్నాను. బాబా వెంటనే అనుగ్రహించారు. మర్నాడే i20 వీసా వచ్చింది. నా ఆనందాన్ని మాటల్లో రాయలేను. "బాబా! మీ పాదాలను నా ఆనందభాష్పాలతో కడగటం తప్ప నేనేమి చేయగలను. ఎన్నో సమస్యలను తప్పిస్తూ నా బిడ్డని ఇంతవరకు తీసుకొచ్చావు బాబా. ఇకపై కూడా ఏ సమస్యలు అడ్డుపడకుండా నా బిడ్డని తన పిల్లలతో అమెరికా వెళ్ళేటట్లు అనుగ్రహించు సాయిదేవా. రెప్పపాటు కాలం కూడా మీ పాదసేవ నుంచి, మీ అనుగ్రహం నుంచి మమ్మల్ని దూరం చేయకు తండ్రి సాయిదేవా".
అమ్మనాన్న అయి చూసుకుంటున్న బాబా
సాయి బంధువులకు బాబా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు సాయిశ్వేత. మా కుటుంబం మొత్తం సాయి భక్తులం. మేము ప్రతిదినం, ప్రతిక్షణం బాబా దయతో బతుకుతున్నాము. ఆర్ధికంగా, మానసికంగా ఎన్ని బాధలున్నా బాబానే నా పుట్టింటి మరియు మెట్టినింటి కుటుంబాలను ముందుకి నడిపిస్తున్నారు. బాబా లేనిదే నా జీవితంలో ఏదీ లేదు. నా బాబా నా ప్రాణం. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిని పంచుకోవాలంటే రోజులు సరిపోవు. అబ్బాయిని ఎన్నుకోవడం దగ్గర నుండి నా పెళ్లి అయ్యేంతవరకు అంతా బాబా ఆశీస్సులతోనే జరిగింది. పెళ్లి జరుగుతున్నంతసేపూ నేను నా బాబా ప్రతిమను చేతిలో పట్టుకుని కూర్చున్నాను. పెళ్లయ్యాక అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు ఒక వృద్ధుడైన ఒక ముస్లిం వ్యక్తి వచ్చి, "అల్లా అచ్చా కరేగా, బాబా అచ్చా కరేగా" అని మమ్మల్ని దీవించి వెళ్లారు. ఆ వృద్ధుని రూపంలో వచ్చింది నా బాబానే అని నాకు తెలుసు. ఆయన ఆశీస్సులతో నేను గర్భవతిని అయ్యాను. మొదటి మూడు నెలలు వాంతులు ఎక్కువగా అవుతుండడంతో నాకు నీరసంగా ఉండేది. ఒకరోజు రాత్రి ఒంటిగంట సమయంలో నాకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. మొదటి గర్భం కావడంతో నాకు ఏమీ అర్థంకాక చాలా భయపడ్డాను. రాత్రంతా బాబాని తలచుకుంటూ, ఆయన నామజపం చేసుకుంటూ, "ఉదయానికల్లా వాంతులు తగ్గిపోవాలి" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల ఉదయానికి వాంతులు, విరోచనాలు తగ్గాయి. ఇలాగే నా ఆరోగ్య విషయంలో బాబా చాలాసార్లు నన్ను కాపాడారు. ఉద్యోగరీత్యా భర్తతో ఒంటరిగా అమ్మనాన్నలకు, అత్తమామలకు దూరంగా ఉంటున్న నాకు నా బాబానే అమ్మనాన్న అయ్యి నా భర్త రూపంలో నన్ను చూసుకుంటున్నారు. ఎన్నని చెప్పను, ఎంతని చెప్పను నా తండ్రి బాబా గురించి. ఎంత చెప్పినా తక్కువే.
ఓం శ్రీసాయి రక్షక శరణం దేవా|
సర్వం శ్రీసాయి పరబ్రహ్మర్పణ మస్తు!!!
బాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత
ముందుగా ఈ ఆధునిక సచ్చరిత్ర చదువుతున్న భక్తులకి ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితమంతా ఒక బాబా మిరాకిల్. నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం మా అక్క కూతురుకి సంబంధించినది. తను ఒక ఏవరేజ్ స్టూడెంట్. కరోనా కారణంగా తను టెన్త్, ఇంటర్ మొదటి సంవత్సరం పాస్ అయింది. కానీ తన ఇంటర్ రెండో సంవత్సరం విషయంలో మేము భయపడ్డాము. ఎందుకంటే, తను లెక్కల్లో బాగా వీక్. తను ఫెయిల్ అయితే సప్లిమెంట్లో కూడా పాస్ అవుతుందో, లేదో చెప్పలేం. అదే జరిగితే ఒక సంవత్సరం గ్యాప్ వస్తుంది. కాబట్టి మేము 'ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయగలిగేది బాబా ఒక్కరే' అని ఆయన మీద పూర్తి నమ్మకముంచాము. ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు వచ్చేరోజు ఇన్స్టాగ్రామ్లో "సానుకూల ఫలితం రానుంది" అన్న బాబా సందేశం నా కంటపడింది. దాంతో నేను 'మనకింక భయమెందుకు?' అని అనుకున్నాను. తరువాత వచ్చిన రిజల్ట్స్లో అక్క కూతురు పాస్ అయింది. "థాంక్యూ బాబా. జీవితాంతం తనకి ఇలాగే అండగా ఉండండి. థాంక్యూ సో మచ్ బాబా. మీకు ఎన్ని సార్లు థాంక్యూ చెప్పినా తక్కువే బాబా".
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
