ఈ భాగంలో అనుభవాలు:
1. శ్రీసాయి అనుగ్రహం
2. శరణన్న వెంటనే బాబా తమ భక్తుల కష్టాలు తీరుస్తారు
3. స్థలం విషయంలో లభించిన బాబా సహాయం
శ్రీసాయి అనుగ్రహం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
సాయి బంధువులకు, బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 17 సంవత్సరాలుగా సాయిబాబా భక్తురాలిని. నాకు కొన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చి ఒకానొక సందర్భంలో నేను బాబాపట్ల అసహనానికి గురయ్యాను. కానీ తమ మీద నాకున్న నమ్మకం చెదిరిపోకుండా బాబానే నా మనసును మార్చారు. ఆయన నా అనారోగ్య సమస్యలు తగ్గించారు. ఇకపోతే, ఈమధ్య నాకు ఎంతో ఇష్టమైన చెవిపోగులు కనిపించకుండా పోయాయి. వారం రోజులపాటు ఇల్లంతా ఎంత వెతికినా కనబడలేదు. వారం తరువాత 2022, జూన్ 14న బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా! ఈరోజు నా చెవిపోగులు కనపడితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత వెతుకుతుండగా నా చెవిపోగులు కనిపించాయి. నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. బాబా మీద నమ్మకం ఎంతగానో స్థిరపడింది. "బాబా! ఇలాగే నాపై, మా కుటుంబంపై మీ కృపాకటాక్షాలు చూపు తండ్రి. అలాగే నా మనసులోని ఇంకొక కోరిక కూడా నెరవేరితే, అది కూడా సాయిభక్తుల అనుభవమాలికలో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా నా కోరిక నెరవేర్చారు.
2022, జూన్ 15న మా అమ్మవాళ్ళింట్లో శ్రీసత్యనారాయణస్వామి వ్రతం జరిగింది. "వ్రతానికి, నాకు, మా అమ్మవాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్రతం నిర్విఘ్నంగా జరగాల"ని నేను బాబాను వేడుకున్నాను. బాబా మాయందు దయ చూపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాలేదు, నోము నిర్విఘ్నంగా జరిగింది. నేను మ్రొక్కుకున్న విధంగా ఆ సాయినాథుని అనుగ్రహాన్నిలా ఈ బ్లాగులో పంచుకున్నాను. మా అన్నయ్య, వదినలకు పెళ్ళై ఆరు సంవత్సరాలు పూర్తయింది కానీ, ఇంకా వాళ్ళకి సంతానం లేదు. వదినకు కొన్ని అనారోగ్య సమస్యలున్నాయి. "బాబా! మీ దయతో వదిన అనారోగ్య సమస్యలను తొలగించి వాళ్ళకి ఒక మంచి తెలివైన సంతానాన్ని ప్రసాదించండి. ఈ కోరిక నెరవేరితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుని, అన్నయ్య, వదిన శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటారు. అలాగే వాళ్ళ మ్రొక్కులు తీర్చుకుంటారు. ఇకపోతే అమ్మానాన్న తీవ్రమైన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. వాళ్లద్దరి నొప్పులు తగ్గి, ఆరోగ్యం కుదుటపడాలి బాబా. మా యందు, మా కుటుంబమందు మీ కృపాకటాక్షాలు చూపుతూ కుటుంబంలోని అందరినీ చల్లగా చూడండి. మనస్సునందు ఎలాంటి చెడు ఆలోచనలు, ఈర్ష్య, అసూయ భావాలు లేకుండా మా మనసులు నిష్కల్మషంగా ఉండే విధంగా అనుగ్రహించు తండ్రి".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
శరణన్న వెంటనే బాబా తమ భక్తుల కష్టాలు తీరుస్తారు
ముందుగా నా తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సద్గురు శ్రీసాయినాథునికి నా సాష్టాంగ ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి స్వరూపమైన సాయికి నా కృతజ్ఞతలు అలాగే సద్గురుని ఆశీస్సులు. నా పేరు నాగార్జున. నేను ఇదివరకు ఈ బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరలా నా అనుభవాలను పంచుకోవడం ద్వారా ఆ సాయినాథునికి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. 2022, ఏప్రిల్ 2న మేము మా పంటను(వరి ధాన్యం) దళారికి ఇచ్చాము. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొత్త నియమాల వల్ల 2022, జూన్ 5 వచ్చినా ఏ రైతు అకౌంటులో కూడా డబ్బులు జమ కాలేదు. మాకు డబ్బులు అప్పుగా ఇచ్చినవాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతుంటే, డబ్బులు ఇంకా చేతికి అందలేదని చెప్పేవాళ్ళము. వాళ్ళు మేము చెప్పేది వినేవారు కానీ మాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. అసలు అప్పులు తెచ్చి, వ్యవసాయానికి పెట్టుబడి పెట్టడం రైతులకు ఎంత పెద్ద కష్టమో ఆ సాయినాథునికే ఎరుక. నేను మా దగ్గరలో ఉన్న సాయినాథుని సన్నిధికి వెళ్లి, "మా కష్టాన్ని తీర్చు తండ్రి. మీ దయతో డబ్బులు మా అకౌంటులో పడినట్లైతే, ఒక బస్తా ధాన్యానికి వచ్చే డబ్బులు మీ సన్నిధిలో అన్నదానానికి ఉపయోగిస్తాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అలా బాబాని శరణు వేడుకున్న రెండు రోజులకి అంటే 2022, జూన్ 9, గురువారం నాడు మా పంట డబ్బులు నాన్న అకౌంటులో పడ్డాయి. ఎంత ఆశ్చర్యమంటే, మా గ్రామంలో ఇంకే రైతుకి కూడ పూర్తి డబ్బులు పడలేదు. బాబా కృపకు ఇంతకన్నా ఋజువు ఏం కావాలి. శరణన్న వెంటనే బాబా తమ భక్తుల కష్టాలు తీరుస్తారు. "ధన్యుడను తండ్రి. ఇలాగే మా కుటుంబం యొక్క ఆపదలను తొలగించండి బాబా. అలాగే మిగిలిన రైతులను కూడా కష్టాల నుండి కాపాడండి. నాకు ఒక ఉద్యోగం ప్రసాదించి నేను నా తల్లితండ్రులకు భారం కాకుండా కాపాడు తండ్రి. నీకు తెలియంది ఏమి కాదు తండ్రి. ఏది ఏ సమయానికి ఇవ్వాలో మీకు తెలుసు. మరలా మంచి అనుభవం ఈ నేటి సచ్చరిత్ర(బ్లాగు)లో పంచుకోవాలని కోరుకుంటున్నాను తండ్రి".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
స్థలం విషయంలో లభించిన బాబా సహాయం
నాపేరు వసంతకుమార్ రెడ్డి. సుమారు 1990 ముందునుంచి నేను శ్రీసాయినాథున్ని కొలుస్తున్నాను. ఆయన దయవలన నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి. నేనిప్పుడు నాకు ఈ మధ్యనే జరిగిన ఒక అనుభవం పంచుకుంటాను. ఒకతను దౌర్జన్యంగా మా స్థలం ఒకటి ఆక్రమించడానికి ప్రయత్నించాడు. మాకు ఎవరిని సహయం అడగాలో అర్థంకాక సాయినామ జపం చేసాం. ఇంకా యూట్యూబ్ చూస్తుంటే, ఈ బ్లాగు పోస్టు ఒకటి నా కంటపడింది. అందులో ఒక సోదరి వారింటి పక్కనున్న స్థలం గురించి బాబాకి చెప్పుకుని 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని స్మరించడం వల్ల తమ సమస్య తీరినట్లు వ్రాసారు. వెంటనే నేను కూడా 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని జపించడం మొదలుపెట్టాను. తక్షణమే మాకు అన్నివైపుల నుండి సహాయం లభించడంతో సర్వే చేయించి స్థలం చుట్టూ కంచె వేయించాము. ఇదంతా సకల దేవతా స్వరూపుడైన శ్రీసాయినాథుని దయ మాత్రమే. "ధన్యవాదాలు సాయి". ఇకపోతే మేము వేరే ఊళ్ళో ఉంటున్నందున ఆ స్థలం అమ్మేద్దామని అనుకుంటున్నాము. అందుకు కూడ నేను, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అన్న నామమే పఠిస్తున్నాను. ఆ స్థలం ఏ ఇబ్బందులూ లేకుండా అమ్ముడైతే, మళ్లీ నా అనుభవం ఈ బ్లాగులో పంచుకుంటాను..
