సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1226వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దయగల తండ్రి నా సాయి
2. బాబా దయవుంటే అన్నీ ఉన్నట్లే
3. సాయి లీల

దయగల తండ్రి నా సాయి

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు కీర్తన. మాది కర్నూలు. నా జీవితంలో సాయి ఎన్నో మహిమలు చూపించారు. వాటిలో కొన్నింటిని మీతో పంచుకోబోతున్నాను. కరోనా మొదటి వేవ్‍లో నాకు, నా భర్తకి కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు జలుబు మాత్రమే ఉన్నప్పటికీ నా భర్తపై కరోనా ప్రభావం కాస్త ఎక్కువగానే చూపింది. ఆయనకి కిడ్నీ సమస్య ఉండడం వల్ల క్రియాటిన్ పెరగడంతో డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే డయాలసిస్ సదుపాయం మేమున్న చోట లేనందున మావారిని హైదరాబాద్‌కి తీసుకుని వెళ్లమన్నారు. నాకు ఏం చేయలో తెలియలేదు. బాబాపైనే భారం వేసి నా ఇద్దరు పిల్లల్ని, మంచానికి అతుక్కుపోయిన మామయ్యగార్ని, అత్తగారిని వదిలి ఒక్కదాన్నే నా భర్తని హైదరాబాద్‍కి తీసుకుని వెళ్ళాను. అక్కడ హాస్పిటల్‍కి వెళ్లగానే బాబా దర్శనమిచ్చారు. "మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చే భారం నీదే బాబా. దయతో నా భర్తకి డయాలసిస్ అవసరం లేకుండా కాపాడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. ఆ తండ్రి దయవల్ల మందులు వాడకుండానే క్రియాటిన్ తగ్గుతూ వచ్చింది. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయి, "మీరు అదృష్టవంతులు" అని అన్నారు. కేవలం ఐదు రోజుల్లో మేము క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము. అంతా నా తండ్రి సాయి దయ.

మేము కరోనా నుండి బయటపడిన తరువాత రెండు నెలలకి నా భర్తకి ప్యాంక్రియాటైటిస్‍తో చాలా కడుపునొప్పి వచ్చింది. ఇంకా తనకున్న కిడ్నీ సమస్య వల్ల క్రియాటిన్ పెరిగి ఐ.సి.యులో ఉంచి, రెండు, మూడుసార్లు డయాలసిస్ చేయాలన్నారు డాక్టర్లు. నాకు ఏం చేయాలో తెలీక బాగా ఏడ్చాను. చిన్నపిల్లలు, అత్తమామలు గుర్తుకువచ్చి అంతా శున్యంలా అనిపించేది. నేను హాస్పిటల్లో రోజూ బాబాకి నా బాధను చెప్పుకుంటూ బాగా ఏడ్చేదాన్ని. బాబా దయవల్ల నా భర్త ఐ.సి.యులో ఒక్కరోజే ఉన్నారు. డయాలసిస్ కూడా ఒక్కసారే చేశారు. తర్వాత క్రియాటిన్ తగ్గుతూ వచ్చింది. కాకపోతే, ఆయనకి జ్వరం బాగా ఎక్కువగా ఉంటుండేది. నేను, "బాబా! ఆయనకి జ్వరం తగ్గి, డిశ్చార్జ్ అవ్వాల"ని బాబాను వేడుకుంటూ ఊదీని రోజూ నా భర్తకి పెడుతుండేదాన్ని. బాబా దయవల్ల గురువారం జ్వరం తగ్గింది. వైద్యులు, "మూడు రోజులు జ్వరం రాకుండా ఉంటే, డిశ్చార్జ్ చేస్తాం" అన్నారు. బాబా కృపవల్ల నా భర్తకి మళ్ళీ జ్వరం రాకపోవడంతో మేము క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాం. బాబాకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియడం లేదు. నిజంగా బాబాను నమ్ముకుంటే, ఎంత పెద్ద కష్టమైనా తీరుస్తారు. అంత దయ గల తండ్రి నా సాయి. "బాబా! నా అనుభవాలను ఎలా పంచుకోవాలో తెలియక ఆలస్యం చేశాను. నన్ను క్షమించు సాయీ. నా భర్తకి ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. మీ దయవలన అన్నీ మామూలు అవుతాయని నమ్ముతూ మీ మీదే భారం వేస్తున్నాను, నా భర్తని కాపాడు సాయీ".

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

బాబా దయవుంటే అన్నీ ఉన్నట్లే

నా పేరు సునీత. మేము హైదరాబాదులో ఉంటాము. మాకు వివాహమై ఆరు సంవత్సరాలు అవుతోంది. కానీ మాకు సంతానం లేదు. ప్రస్తుతం మేము IVF ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము. అందులో భాగంగా 2022, జూన్ 6వ తేదీన డాక్టరు నా నుండి ఎగ్స్ (అండాలు) తీసుకున్నారు. సాధారణంగా ఋతుచక్రంలో (ఫోలిక్యూలర్ ఫేజ్) 13 అండాల వరకు ఉండాల్సి ఉండగా నా విషయంలో 4 అండాలు మాత్రమే లభించాయి. వాటిలో ఎన్ని అండాలు ఆరోగ్యవంతమైన పిండంగా అభివృద్ధి చెందుతాయో తెలియదు. అందువలన నాకు చాలా భయమేసింది. "ఒకవేళ అండం సరైన పిండంగా రూపాంతరం చెందకపోతే ఇంకోసారి IVF ప్రక్రియ మొదలుపెట్టి ఎగ్స్ తీసుకుందామ"ని డాక్టర్ చెప్పారు. డాక్టర్ అలా అనేసరికి అసలు మాకు ఏమీ తోచలేదు. ఎందుకంటే, నేను అప్పటికే హాస్పిటల్స్ మరియు మందులతో చాలా అలసిపోయాను. అందువలన నేను, "బాబా! మీరే నాకు దిక్కు. మీ దివ్యపూజ చేస్తాను. మాపై మీ అనుగ్రహం ఉంచి పిండాలు సరిగ్గా తయారయ్యేలా చూడండి" అని దృఢంగా బాబాను వేడుకున్నాను. 2022, జూన్ 9వ తేదీ గురువారంనాడు మేము బాబా గుడికి వెళ్లి, బాబా దర్శనం చేసుకున్న తరువాత హాస్పిటల్‍కి వెళ్ళాము. డాక్టరు, "4 అండాలలో 3 పిండాలు మంచి నాణ్యత కలిగి ఉన్నాయి. వచ్చే ఋతుక్రమంలో ఎగ్ ట్రాన్స్‌ఫర్ చేద్దాం" అన్నారు. మా ఆనందానికి అవధులు లేవు. బాబా ఆశీర్వాదం వల్లే ఇదంతా జరిగింది. బాబా దయవుంటే అన్నీ ఉన్నట్లే.

తరువాత మేము శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాము. అక్కడినుండి బస్సులో హైదరాబాదు తిరిగి వస్తున్నప్పుడు మావారికి ఒకవైపు తలనొప్పి చాలా తీవ్రంగా వచ్చింది. ఆయన రెండు, మూడు టాబ్లెట్లు వేసుకున్నప్పటికీ నొప్పి తగ్గలేదు. నేను మావారికి బాబా ఊదీ ఇచ్చి, నోట్లో వేసుకోమని చెప్పి, "బాబా! మావారి తలనొప్పి తగ్గించండి" అని వేడుకున్నాను. ఒక్క అరగంటలో మావారి తలనొప్పి చాలావరకు తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా".

సాయి లీల

సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు చాలా చాలా కృతజ్ఞతలు. సాయిభక్త ప్రపంచంలో నేను ఒకడిని కావడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. నా పేరు నరసింహం. నా వయస్సు 55 సంవత్సరాలు. నేను బెంగుళూరు నివాసిని. నేను ఇంతకుముందు బాబా దయతో నా కంటిసమస్య పరిష్కారమైందని మీ అందరితో పంచుకున్నాను (సాయిభక్తుల అనుభవమాలిక 1047వ భాగం). ఇప్పుడు సాయితండ్రి అద్భుత లీలల్లో నుండి మరో చిన్న కుసుమాన్ని మీతో పంచుకుంటున్నాను. 2022, ఫిబ్రవరి 5వ తేదీన నా శాామ్‍సంగ్ మొబైల్ స్క్రీన్ టచ్ పనిచేయలేదు. కంపెనీ సర్వీస్ సెంటరులో చూపిస్తే, "3,500 రూపాయలు అవుతుంది" అన్నారు. నేను చాలా బాధపడి మనసులోనే సాయీశునితో, "ఏమయ్యా ఆపద్భాంధవా! నేనిప్పుడు అంత డబ్బు ఖర్చుపెట్టాలా?" అని అనుకున్నాను. ఆయన దయవలన ఫిబ్రవరి 7న నేను ఒక చిన్న రిపేర్ షాపుకెళ్ళి నా మొబైల్ చూపిస్తే, వాళ్ళు ఏమి చేశారో తెలీదుగానీ 10 నిమిషాల్లో నా ఫోన్ రెడీ చేసి నా చేతికిచ్చారు. ఆ బిల్ ఎంతో తెలుసా? కేవలం 100 రూపాయలే. ఇదే కదా మన శిరిడీవాసుని లీల! ఇంతకన్నా మరేం కావాలి? ఆయన లీలలు ఎన్నో ఎన్నెన్నో. వానిని కొనియాడ మన తరమా!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo