సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 61వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • క్లిష్ట పరిస్థితుల ద్వారా భక్తునిలో పరిపక్వత తీసుకొస్తారు బాబా

సాయిభక్తురాలు లక్ష్మి తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

నా పేరు లక్ష్మి. నేను పుట్టి పెరిగింది కేరళ. ప్రస్తుతం నేను నా భర్త, 9 ఏళ్ళ బాబుతో యూ.ఏ.ఈ లో ఉంటున్నాను. బాబా కొన్ని సందర్భాల్లో భక్తులను పరీక్షించి, వారి భక్తిలో పరిపక్వతను తీసుకొస్తారు. అటువంటిదే నేనిప్పుడు చెప్పబోయే అనుభవం. ఎక్కడినుండి మొదలుపెట్టాలో నాకు అర్థం కావట్లేదు. నేను బాబా భక్తురాలిని. నేను నా జీవితంలో చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. బాబా కృపవలనే వాటినుండి మా కుటుంబం బయటపడింది.

2014 నాటికి మా అబ్బాయి వయసు మూడేళ్లు. మేమిద్దరం యూ.ఏ.ఈ. లో ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళం. మాది ఎంతో సంతోషకరమైన కుటుంబం. అంతా సజావుగా సాగుతుండగా ఒక్కరోజులో అంతా మారిపోయింది. 33 ఏళ్లు వచ్చేవరకు ఎటువంటి అనారోగ్య చిహ్నాలే లేని మావారికి హఠాత్తుగా 2014 మే నెలలో తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉందని బయటపడింది. డాక్టర్లు డయాలసిస్ మొదలుపెట్టాలని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేయాలని చెప్పారు. హఠాత్తుగా మా జీవితాలలో వచ్చిన మార్పుకి మేము షాక్ అయ్యాము. అయితే భగవంతుని కృపవలన మావారి సిస్టర్ కిడ్నీ దానం చేయడానికి అంగీకరించడంతో స్వల్పకాలవ్యవధిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తయింది. అయితే మా సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. సంవత్సరం తిరిగేసరికి ఆ కిడ్నీ వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. దాంతో మళ్లీ మావారికి డయాలసిస్ చేయడం మొదలుపెట్టారు. మూడు సంవత్సరాలు గడిచినా పరిస్థితిలో మార్పులేదు. చివరికి 2018 ఆగస్టులో నా భర్తకి రెండోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడానికి డాక్టర్స్ నిర్ణయించారు. అయితే రెండోసారి కావడంతో సర్జరీకి ముందు చాలాసార్లు ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూజన్ చేయాల్సి ఉండటంతో ఆ ప్రక్రియ మొదలుపెట్టారు. సర్జరీ తర్వాత నేను ఎలాగూ ఎక్కువ రోజులు సెలవు తీసుకోవాలని, కేవలం ఒక్క వారం ముందే నేను హాస్పిటల్ కి వెళ్ళాను. అప్పటికి మావారికి రెండుసార్లు ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూజన్ జరిగింది. ఆరోజు మూడోసారి జరగనుంది. సాధారణంగా అయితే ఆ చికిత్సను ఎక్కువ శాతం రోగులు తట్టుకోగలరు. కానీ మావారి బ్లడ్ ప్రెషర్ స్థిరంగా లేకపోవడంతో పరిస్థితి చాలా విషమం అయ్యింది. ఆయన బాగా అలసటగా ఉండి, కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అందువలన ఆ చికిత్స చేయించుకోవడానికి చాలా భయపడుతున్నారు. నేను బాబా ఫోటో ముందు నిలబడి 'అంతా సాఫీగా సాగాల'ని బాబాని ప్రార్థించి, మావారి నుదుటిపై ఊదీ పెట్టాను.  అప్పటినుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా 8 సార్లు ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూజన్స్ జరిగిపోయాయి. ప్రతిసారీ నేను బాబాని ప్రార్థించి, ఆయనకు ఊదీ పెడుతూ ఉండేదాన్ని. బాబా కృపవలన అంతా సజావుగా సాగింది.

అప్పటికే ఆరునెలల ముందు శిరిడీ వెళ్లినప్పటినుంచి మావారు బాబాను నమ్ముతున్నప్పటికీ ఈ పరిస్థితి ఆయనను అసలైన భక్తుడిగా మార్చింది. తర్వాత కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ కూడా విజయవంతంగా పూర్తయ్యింది. రెండువారాలు అంతా సక్రమంగా సాగుతూ కిడ్నీ పనితనంలో మెరుగుదల కనిపించింది. ఎనిమిదవరోజు మావారిని ఐ.సి.యు. కి మార్చినప్పటినుండి నేను ప్రతిరోజూ సచ్చరిత్రలోని ఒక అధ్యాయాన్ని చదువుతూ ఉండేదాన్ని. ఇకపై ఏ సమస్యా ఉండదని అనుకుంటుండగా రెండువారాల తర్వాత కిడ్నీ పనితనంలో ఒడిదుడుకులు కనిపించాయి. క్రియాటినిన్ లెవెల్స్ లో పెరుగుదల కనిపించింది. అవి మరికొంచం పెరిగాయంటే పరిస్థితి దారుణంగా మారిపోతుంది. నేనింక నియంత్రణ కోల్పోయాను. బాబా పటం ముందు బాగా ఏడ్చాను. ఆయనకు ఫిర్యాదు చేస్తూ ఆయనతో పోట్లాడాను. ఇన్ని ఇబ్బందులను, ఇంత కష్టకాలాన్ని ఎదుర్కొన్న తర్వాత కూడా ఇలా జరగకుండా బాబా ఆపలేదని చాలా కోపంతో, "బాబా! రేపటికింకా క్రియాటినిన్ లెవెల్స్ పెరిగినట్లయితే, నేను మళ్ళీ మీ ముందుకు రాను. మిమ్మల్ని ఇంకేమీ అడగను" అని ఎంతో ఏడ్చాను. నేనెప్పుడు అయోమయస్థితిలో ఉన్నా సమాధానం కోసం starsai.com లేదా సచ్చరిత్రలో ఏదో ఒక పేజీ తెరచి చూస్తుంటాను. కానీ ఆరోజు నా మనసుకు సంతృప్తినిచ్చే సమాధానమేదీ రాలేదు. దాంతో ఇంకా ఆందోళనపడుతూ భారమైన మనసుతో సచ్చరిత్రలో ఆరోజు చదవాల్సిన అధ్యాయాన్ని తెరచి చదవడం మొదలుపెట్టాను. భక్తులకు గల వ్యాధులనుండి బాబా స్వస్థత చేకూర్చే అధ్యాయమది. నేను మొదలుపెట్టడమే 'బాబా వ్యాధులను నిర్మూలిస్తారు' అన్న పదాలు చదివాను. బాబా చూపిన కరుణకు మా ఇద్దరి మనస్సులు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. నిజానికి అదంతా బాబా ప్రణాళికే. ఎందుకలా అంటున్నానంటే, నేను రోజూ ఒక అధ్యాయాన్ని మాత్రమే చదివేదాన్ని. కానీ ఆ ముందురోజు మావారెందుకో రెండు అధ్యాయాలు చదవమనడంతో ఈరోజు ఈ అధ్యాయం వచ్చింది. అలా బాబా సరైన సమయంలో మా మనస్సుకు ఊరటనిచ్చారు. దాంతో మాకు మళ్ళీ ఆశ కనిపించింది. అదే నిజమైంది. మరుసటిరోజుకి క్రియాటినిన్ లెవెల్స్ తగ్గుముఖం పట్టాయి.

ఆరోజే అనుకోకుండా నేను హేతల్ గారి ఇంగ్లీష్ బ్లాగ్ చూసాను. అప్పటినుండి ప్రతిరోజూ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ ఉండేదాన్ని. తర్వాత డాక్టర్స్ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి కిడ్నీ బయాప్సీ చేద్దామని, ఐదుసార్లు ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూజన్స్ చేద్దామని చెప్పారు. వాటిద్వారా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించి బాబా మేలు చేస్తారని మేము బాబానే నమ్ముకున్నాం. ఈ క్రమంలో నాకన్నా మావారికే బాబాపట్ల భక్తి ఎక్కువగా ఉందని నాకనిపించి, నేనెంతో సంతోషించాను. ఆయన ఏది తిన్నా ముందుగా బాబాకి పెట్టి, తరువాత తింటుండేవారు. ఆయనెంతో భక్తిగా అలా చేస్తుండేవారు.

మేము రోజూ శిరిడీ నుండి బాబా లైవ్ దర్శన్ కూడా చూడటం మొదలుపెట్టాము. అక్టోబరు 17న నా భర్తతో, "ఈరోజు బాబా గ్రీన్ కలర్ డ్రెస్సులో ఉంటార"ని నేను అన్నాను. అందుకాయన 'అది చెప్పడం కష్టం' అన్నారు. చూస్తే బాబా పింక్ కలర్ డ్రెస్సులో ఉన్నారు. తరువాత నేను ఆరోజు భక్తుల అనుభవాలు చదువుతూ ఉంటే ఒక అనుభవంలో భక్తురాలు బాబాని గ్రీన్ డ్రెస్సులో దర్శనమిమ్మని ప్రార్థిస్తే, బాబా ఆమె కోరిక నెరవేర్చారు. అది చదివాక నాకెంతో సంతోషంగా అనిపించింది. దాంతో నేను అక్టోబర్ 19న జరగబోయే ఐదవ ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూజన్, ఆ మరుసటిరోజు ఉన్న బయాప్సీ పరీక్షలను తలుచుకుని, "బాబా! ఈ ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూజన్స్ తో నా భర్త పూర్తిగా ఈ వ్యాధి నుండి బయటపడేట్లయితే, 19వ తేదీన గ్రీన్ కలర్ డ్రెస్సులో మీరు దర్శనం ఇవ్వండి" అని ప్రార్థించాను. తరువాత 19 ఉదయాన చూస్తే బాబా పింక్ కలర్ డ్రెస్సులో ఉన్నారు. మధ్యాహ్న ఆరతి టైంలో చూస్తే వైట్ కలర్ డ్రెస్సులో ఉన్నారు. సంధ్య ఆరతిలో మళ్ళీ డార్క్ పింక్ డ్రెస్సులో ఉన్నారు. దానితో నేను కాస్త అసహనానికి గురై, మరొకరోజెప్పుడైనా బాబా గ్రీన్ కలర్ డ్రెస్సులో దర్శనమిస్తారేమో, బహుశా ఈ సమస్యలనుండి బయటపడటానికి మరికొంత సమయం పడుతుందేమో అనుకున్నాను. తరువాత రాత్రి 10.40 సమయంలో, 10-10.30 మధ్యలో బాబా డ్రెస్సు మారుస్తారని గుర్తొచ్చి లైవ్ చూసి నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ఆశ్చర్యంతో నాకు మాటలు రాలేదు. బాబా డార్క్ గ్రీన్ కలర్ డ్రెస్సులో ఉన్నారు. ఆనందంతో మావారికి చూపించాను. మావారు ఆ వ్యాధినుండి పూర్తిగా బయటపడతారని నాకు నమ్మకం వచ్చింది. మరుసటిరోజు బయాప్సీ చేసారు. అక్టోబరు 22న వచ్చిన రిపోర్ట్సులో ఏ సమస్యా లేదని వచ్చింది. అవి చూసాక ఇకపై మాకు ఏ కష్టం లేదని సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాము. బాబానే నమ్ముకున్నందుకు ఎన్నో ప్రార్థనల తర్వాత, ఇన్ని సంవత్సరాల తరువాత అంతా అనుకూలంగా కనిపించింది. "థాంక్యూ బాబా! ఎప్పుడూ ఇలాగే మీ కరుణను మాపై కురిపించండి".

ఇన్ని సంవత్సరాలుగా నేను సాయిభక్తురాలిని అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నిజమైన భక్తులంటే ఎలా వుండాలో తెలుసుకున్నాను. రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రతిక్షణం ఆయన ధ్యాసలో ఉండేవాళ్ళే నిజమైన భక్తులు. ఇప్పుడు నేను, నా భర్త సాయిభక్తులమని దృఢంగా చెప్పగలను. ఈ కష్ట పరిస్థితుల ద్వారా ఆయనపై మా నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంపొందింపజేసి, ఎటువంటి అనుమానాలు లేకుండా ఆయనను విశ్వసించేలా మమ్ము అనుగ్రహించారు. బాబా మీ అందరినీ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను.

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2349.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo