సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 324వ భాగం.


ఖపర్డే డైరీ - పదవ భాగం

16-12-1911

నాకు తీవ్రంగా జలుబు చేసింది. అందువల్ల కాకడ ఆరతి సమయానికి లేవలేకపోయాను. తెల్లవారుఝామున మూడు గంటలకు లేచి మళ్ళీ బాగా నిద్రపోయాను. ప్రార్థనానంతరం 'హజ్రత్ సాహెబ్' లేదా 'హజ్రత్'గా పిలువబడే దర్వేష్ సాహెబ్ ఫాల్కేతో మాట్లాడుతూ కూర్చున్నాను. మన హిందూమతంలో చెప్పబడే కర్మమార్గంలో పోయే మనిషతను. గ్రంథస్థం కాబడని మహనీయుల జీవితాల్లోని సంఘటనలనెన్నో చెప్పేవాడతను. సాయిమహారాజు బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి ఆయన మసీదుకి వచ్చాకా దర్శించాను. ఆయన చాలా సరదాగా ఆహ్లాదంగా హాస్యపూరిత సంభాషణ చేస్తూ కూర్చున్నారు. ఆరతి అయాక బసకి వచ్చి భోజనం చేసి పడుకున్నాను కానీ నిద్రపోలేదు. అమరావతి నుంచి 'అమృతబజారు' అనే పత్రికతో బాటు బాంబే ఎడ్వకేట్ రెండు ప్రతులు రావటం వల్ల నాకు చదువుకొనేందుకు కావలసినంత విషయం దొరికింది. సెషన్స్ కేసు ఒకటి చేయమంటూ ఒక టెలిగ్రాం కూడా వచ్చింది. మూడు రోజుల క్రితం వార్దా దగ్గర ఒక కేసు చేయమంటూ ఒక టెలిగ్రాం వచ్చింది. సాయి మహారాజు నాకు అనుమతి ఇవ్వకపోవటం వల్ల దాన్ని తిరస్కరించాను. ఈరోజు టెలిగ్రాం పరిస్థితికి కూడా ఫలితం అదే. నా గురించి మాధవరావు దేశ్‌పాండే అనుమతి అడిగితే సాయి మహారాజు ఎల్లుండో లేకపోతే ఒక నెల తరువాతో వెళ్ళొచ్చన్నారు. కనుక విషయం నిర్ధారణయ్యింది. చావడి ఎదురుగా వారికి మామూలు ప్రకారం నమస్కరించుకొని ఆరతయ్యాక వాడాలో భీష్మ భజన వింటూ కూర్చున్నాను. ఈరోజు వచ్చిన కొత్తవాళ్ళల్లో హాటే ఎల్.ఎమ్. అండ్ ఎస్ పరీక్షలకు కూర్చున్నాడు. అతను చాలా మంచి యువకుడు. అతని తండ్రి ఆమ్రేలిలో జడ్జిగా ఉండి తరువాత పాలిటానాకి దివానుగా ఉంటున్నాడు. అతని మామ నాకు తెలుసనుకుంటా.

17-12-1911

ప్రార్థనానంతరం సాయి మహారాజు బయటకు వెళ్లేటప్పుడు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు దర్శించుకున్నాను. ఆయన ఎంతో ప్రసన్నంగా ఉన్నారు. వారి హాస్యరస సంభాషణను మేమంతా ఆనందించాం. మేఘరాజు బిళ్వపత్రాలు తెచ్చేందుకు వెళ్ళటం వల్ల ఉదయ ఫలహారం చాలా ఆలస్యమైంది. అతను కొంచెం ఆలస్యంగా తిరిగి వచ్చాడు. మధ్యాహ్నం హాజీసాహెబ్ ఫాల్కే, హాటే, షింగణే తదితరులతో మాట్లాడుతూ కూర్చున్నాను. ఈరోజు గోఖలే వెళ్ళిపోయాడు. సాయంత్రం నేను మశీదుకి వెళ్ళాను కానీ సాయి మహారాజు నన్నూ, మావాళ్ళనీ దూరంనుంచి నమస్కరించుకోమని చెప్పారు. అయితే మా అబ్బాయి బల్వంత్‌ను మాత్రం ఆయన దగ్గరకి పిలిచి దక్షిణ తెమ్మన్నారు. చావడి ఎదుట వారికి నమస్కరించుకొని, మళ్ళీ మేం వారిని రాత్రి శేజారతి సమయంలో చూశాం. ఈ రాత్రి సాయి మహారాజు చావడిలో నిద్రించారు.

18-12-1911


నిన్నటి కంటే నా గొంతు ఈరోజు బాగానే వుంది. ప్రార్థనానంతరం నేను షింగణే, వామనరావు పటేల్, దర్వేష్ సాహెబ్‌ లతో మాట్లాడుతూ కూచున్నాను. కల్యాణ్‌కి చెందిన ఈ దర్వేష్ పేరు దర్వేష్ హాజీ మొహమ్మద్ సిద్దిక్. నేను సాయి మహారాజుని వారు బయటకు వెళ్ళేటప్పుడు చూసి వారు తిరిగి వచ్చిన తరువాత మశీదుకు వెళ్ళాను. నిద్రైనా లేకుండా అన్నిరకాల బాధలనూ తాను ఓర్చుకుంటుంటే నేను నా బక్కెట్ నింపుకుని వేపచెట్టు చల్లనిగాలులను ఆనందంగా అనుభవిస్తున్నానని చెప్పారాయన. ఆయన చాలా సరదాగా ఉన్నారు. ఎంతోమంది వారిని సేవించటానికొచ్చారు. అలాగే నా భార్య కూడా వచ్చింది. మధ్యాహ్న ఆరతి అయిపోయాక వెనక్కి తిరిగి వచ్చి హాజీసాహెబ్, బాపూసాహెబ్ జోగ్, ఇంకా వేరేవాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను. సాయంసమయానికి మేం మశీదుకి వెళ్ళి సాయిసాహెబ్ వద్ద కూర్చున్నాం. కానీ చీకటిపడుతున్నందు వల్ల ఎక్కువ సమయం లేదు కనుక వారు మాకు సెలవిచ్చారు. మేం మామూలుగా చావడి ముందు నుంచుని వారికి నమస్కరించుకున్నాం. మా బసకు వచ్చేశాక భీష్మ భజన వింటూ కూర్చున్నాను.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo