సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 345వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయ్యవ భాగం  

11-2-1912.

ఈ ఉదయం నా ప్రార్థన ముగిసే సమయానికి గద్రే పైకి రావటాన్ని చూసి అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను. తిరిగి వెళ్ళిపోవటానికి బాబా వద్ద అనుమతిని పొంది అతను నాసిక్ వెళ్ళిపోయాడు. సాయిసాహెబ్ బయటకు వెళ్ళటం చూసి ఉపాసనీ, కౌజల్గి, బాపూసాహెబ్ జోగ్‌లతో కలసి పంచదశి తరగతి నిర్వహించాము. నాసిక్ జిల్లా రెవిన్యూ అధికారి లేలే కూడా పంచదశి తరగతికి హాజరయ్యాడు. అతను చాలా మంచివాడిలా అనిపించాడు. సాయిమహారాజు అతన్ని చాలా ఇష్టపడ్డారు. సాయిబాబా తిరిగి వచ్చాక యథాప్రకారం మశీదుకు వెళ్ళాను, కానీ అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. వారిలో చాలామంది క్రొత్తవారు. వారిలో ఒకాయన అకోలా పోలీసు. అతను తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నాగపూర్ బారిష్టర్ గోవిందరావు దేశ్‌ముఖ్ దగ్గర పనిలో చేరానని నన్ను చూడగానే నాతో చెప్పాడు. మధ్యాహ్న ఆరతి, భోజనమూ అయ్యాక కొద్దిసేపు నడుంవాల్చి దీక్షిత్ రామాయణ పురాణానికి హాజరయ్యాను. తరువాత సాయంత్రవు వ్యాహ్యాళి నమయంలో ఒకచోట నిలుచుని లేలేతో మాట్లాడుతున్న సాయిబాబాను చూడ్డానికి వెళ్ళాము. సాయంత్రం వాడా ఆరతి, ఆ తరువాత శేజారతి, భీష్మ భాగవతం, దీక్షిత్ రామాయణం అన్నీ జరిగాయి. ఈరోజు తిరిగి వెళ్ళటానికి శివానందశాస్త్రికి అనుమతి దొరకలేదు.

13-2-1912.

దీక్షిత్ రామాయణం చదివాక మేం మశీదుకి వెళ్ళాము. నేను లోపలికి అడుగుపెట్టిన వెంటనే సాయిమహారాజు నాకు ఊదీ ఇచ్చారు. 'నన్ను వెళ్ళిపొమ్మనటానికి సంకేతంగా ఇచ్చారా!' అని నేను ఆశ్చర్యపోతుంటే, “వెళ్ళమని ఎవరన్నారు? కూర్చో!" అన్నారు. కూర్చున్న తరువాత హాయిగా మాట్లాడారు. "ఇప్పుడు దీక్షిత్‌కి చెందిన ఆవు మొదట మహల్సాపతిది. అప్పుడది ఔరంగాబాదు వెళ్ళింది. ఆ తరువాత జాల్నా వెళ్ళినప్పుడు దీక్షిత్ ఆస్తిగా తిరిగి వచ్చింది. అసలది ఎవరి సొత్తో భగవంతుడికే ఎరుక" అన్నారు. నావంక చూస్తూ ఆయన, "భగవంతుడి మీద దృఢమైన విశ్వాసమున్న వాళ్ళెవరూ ఏదీ కోరరు" అన్నారు. నా భార్య, ఇంకా మిగతా వారంతా అక్కడే ఉన్నారు. మేమంతా సాయంత్రపు వ్యాహ్యాళిలో బాబాను చూశాము. అప్పుడు వాడా ఆరతి, తరువాత శేజారతి జరిగింది. రాత్రి భీష్మ భజన చేస్తే దీక్షిత్ రామాయణం చదివాడు. ఈరోజు మధ్యాహ్న ఆరతి, శేజారతి రెండు ఆరతులు అయ్యాక రెండుసార్లు సాయిబాబా ప్రత్యేకంగా నా పేరుతో పిలిచి వాడాకు వెళ్ళమన్నారు.

14-2-1912.


పెందరాళే లేచి కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిబాబా చావడి వదిలే సమయంలో తన చిన్న బెత్తాన్ని తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కుగా ఊపటం చూసి ఆశ్చర్యపోయాను. పంచదశి తరగతి నిర్వహించి సాయిబాబా బయటకు వెళ్ళటం, తరువాత మశీదుకు వెళ్ళటం చూశాము. 

సాయిబాబా రెండు కథలు చెప్పారు. అందులో ఒకటి:- ఒక ప్రయాణీకుడ్ని ఒక ఉదయం, ఒక రాక్షనుడు వెంబడించాడట. దానిని ఒక దుష్టశకునంగా పరిగణించి, ముందుకు సాగిపోతూ అతను రెండు బావుల్ని చూశాడట. అందులో ఒక బావిలో నీరు తియ్యగా ఉండి అతని దాహాన్ని తీర్చిందిట. అతనికి ఆకలి వేసినప్పుడు అతను ఒక వ్యక్తిని కలిశాడట. ఆ వ్యక్తి తన భార్య సలహాపై అతనికి ఆహారం ఇచ్చాడట. పంటకి వచ్చిన ఒక జొన్నచేనుని ఇతను చూసి ఒక కంకిని తిందామనుకున్నప్పుడు పొలం యజమాని దాన్ని అతనికిచ్చాడట. ఆ ప్రయాణీకుడు ఆనందించి హాయిగా పొగత్రాగుతూ ముందుకు సాగాడట. అడవిలో నుంచి అతను ప్రయాణిస్తున్నప్పుడు ఒక పులిని చూసి ధైర్యాన్ని కోల్పోయి ఒక గుహలో దాక్కున్నాడట. ఎంతో పెద్దగా ఉన్న ఆ పులి అతని కోసం వెతుకుతోందట. సాయిబాబా అదే మార్గంలో పోవటం తటస్థించి, ఆయన ఆ ప్రయాణీకుడిలో ధైర్యాన్ని నింపి, అతన్ని బయటకు తెచ్చి అతని మార్గంలో పెట్టి “దాన్ని నువ్వు బాధిస్తే తప్ప ఆ పులి నిన్నేమీ చేయదు” అని చెప్పారట. 

రెండో కథ:- సాయిబాబాకి నలుగురు సోదరులున్నారట. అందులో ఒకడు బయటకు వెళ్ళి భిక్షచేసి, అన్నం, రొట్టె, వండిన జొన్నలు తెచ్చాడట. అతని భార్య అతని తల్లితండ్రులకి సరిపోయినంత మాత్రమే ఇచ్చి మిగతా సోదరుల్ని పస్తుంచేదట. సాయిబాబా అప్పుడొక కాంట్రాక్టు కుదుర్చుకొని ఆ డబ్బు ఇంటికి తెచ్చినప్పుడు అది ఆయన డబ్బున్న సోదరుడితో సహా అందరూ పంచుకొనేవారట. తరువాత ఆ సోదరుడికి కుష్టు వస్తే అందరూ అతణ్ణి దూరం చేశారట. తండ్రి బయటకు వెళ్ళగొట్టాడట. అప్పుడు సాయిబాబా అతనికి ఆహారం ఇచ్చి అతని సౌకర్యాలు చూసేవారట. చివరికి ఆ సోదరుడు చనిపోయాడట. 

మధ్యాహ్న ఆరతి యథాప్రకారం జరిగింది. మేము భోజనం చేసి, విశ్రాంతి తీసుకున్నాము. శివానందశాస్త్రి, విజయదుర్గ ఠాకూరు ఈరోజు వెళ్ళిపోయారు. ప్రాంతీయాచార్యుడు వ్యాహి అందర్నీ భోజనానికి పిలిచాడు. నేను వెళ్ళలేదుగానీ అందరూ వెళ్ళారు. సాయంత్రం వ్యాహ్యాళిలో సాయిబాబా "భోజనానికి ఎందుకు వెళ్ళలేదని" నన్నడిగారు. ఒకే మధ్యాహ్నం రెండు భోజనాలు నేను చేయలేనన్న నిజాన్ని వారికి చెప్పాను. సాయిబాబా దేనిగురించో ఆలోచనలో మునిగిపోయినట్లు, తూర్పు, పడమరలవైపు దీర్ఘంగా చూస్తూ 'వాడాకి వెళ్ళండి' అని మమ్మల్నందర్నీ పంపేశారు. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo