సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 333వ భాగం.


ఖపర్డే డైరీ - పద్దెనిమిదవ భాగం  

10-1-1912.

నేను చాలా ఉదయాన్నే లేచి, తెల్లవారకముందే నా ప్రార్థన పూర్తిచేసుకొని, సాయిమహారాజు బయటకు వెళ్ళే సమయంలోనూ, మళ్ళీ వారు మశీదుకు తిరిగి వచ్చాకా దర్శించాను. ఒక మార్వాడీ వచ్చి తన స్వప్నం గురించి చెప్పాడు. ఆ స్వప్నంలో అతను అంతులేనంత వెండినీ, బంగారు కడ్డీలనూ సంపాదించాడట. వాటిని లెక్కపెడుతున్న సమయంలో మెలకువ వచ్చిందట. సాయిసాహెబ్  ఆ స్వప్నం ఎవరో గొప్ప వ్యక్తుల మరణాన్ని సూచిస్తుందని చెప్పారు.

12-1-1912.

నేను తెల్లవారుఝామునే లేచి, ప్రార్థన చేసుకొని నిత్య కార్యక్రమం మొదలుపెడుతుండగా నారాయణరావు కుమారుడు గోవింద్, సోదరుడు బాపూసాహెబ్ వచ్చారు. కొద్దిరోజుల క్రితం హుషంగాబాద్ నుండి అమరావతి వచ్చి, అక్కడ నేను, నా భార్య లేకపోయేసరికి మమ్మల్ని చూసేందుకు వారిక్కడకు వచ్చారు. సహజంగానే ఒకరినొకరం చూసుకొని సంతోషించి కూర్చుని మాట్లాడుకోసాగాము. బాపూసాహెబ్ జోగ్ హడావుడిగా ఉండటం వల్ల యోగవాశిష్ఠం చదవటం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాము. 

సాయిమహారాజు బయటకు వెళ్ళటం, మళ్ళీ తిరిగి మశీదుకు రావటం మేము చూశాము. వారు ఎంతో దయతో తన చిలుం గొట్టంతో పొగపీల్చమని మళ్ళీ మళ్ళీ నాకిచ్చారు. అది నా సందేహాలు ఎన్నింటినో పరిష్కరించటంతో నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. మధ్యాహ్న ఆరతి అయ్యాక భోజనానంతరం కొద్ది నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాను. మశీదు వద్ద దీక్షిత్ మామూలు కంటే ఎక్కువగా ఆలస్యం చేశాడు. కనుక రామాయణం మామూలు కంటే ఆలస్యంగా మొదలుపెట్టాము. అధ్యాయం చాలా పెద్దదిగానూ, కష్టంగానూ ఉండటం వల్ల మేము ఒక్క అధ్యాయమైనా పూర్తిచేయలేకపోయాము. తరువాత మశీదు దగ్గర సాయిమహారాజును దర్శించాము. ఆయన సంగీతం విన్నారు. ఇద్దరు కళాకారిణులు పాడుతూ నృత్యం చేశారు. తరువాత శేజారతి అయింది. సాయిమహారాజు బల్వంత్ పట్ల చాలా కరుణతో వున్నారు. అతనికోసం కబురు పెట్టి మధ్యాహ్నమంతా అతన్ని పూర్తిగా తనతో గడపనిచ్చారు.

13-1-1912.


ఉదయాన్నే నిద్రలేచి కాకడ ఆరతికి హాజరయ్యాను. ఈరోజు సాయిమహారాజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఆయన మామూలుగా ప్రసరింపచేసే దృష్టిని కూడ ప్రసరింపచేయలేదు. ఖాండ్వా తాహసీల్దారు ఇక్కడకు వచ్చాడు. రంగనాథ్ గారి యోగవాశిష్ఠం  చదువుతున్నప్పుడు మేము ఆయన్ని చూశాము. సాయిమహారాజు బయటకు వెళ్ళినప్పుడు, మళ్ళీ ఆయన తిరిగి వచ్చినప్పుడు వారిని మేము దర్శించాము. నిన్న పాడిన కళాకారిణులు ఉన్నారక్కడ. వాళ్ళు కొంచెంగా పాడి అందుకు బహుమానంగా తీపి మిఠాయిలను పొంది వెళ్ళిపోయారు. మధ్యాహ్న ఆరతి చాలా ఆహ్లాదంగా గడిచిపోయింది. మేఘుడు ఇంకా బాగా కోలుకోలేదు. మాధవరావు దేశ్‌పాండే సోదరుడు బాపాజీని, అతని భార్యతో ఉదయ ఫలహారానికి ఆహ్వానించాను. ఖాండ్వా తహసీల్దారు చాలా సంస్కారవంతుడుగా అనిపించాడు. అతడు యోగవాశిష్ఠం చదివాడు. తన ఆధ్యాత్మిక అభిరుచులకు అనుగుణంగా వ్యక్తుల్ని తీర్చిదిద్దటంలో తాను చాలా విషాదానికి లోనుకావలసి వచ్చిందని చెప్పాడు. 

కొద్దిసేపు మధ్యాహ్న విరామం తరువాత దీక్షిత్ భావార్థరామాయణాన్ని చదివాడు. బాలకాండ (11వ అధ్యాయం) యోగవాశిష్ఠం యొక్క సారమే అవటం వల్ల చాలా ఆసక్తికరంగా ఉంది. సాయిమహారాజు వ్యాహ్యాళి కోసం బయటకు వెళ్ళినప్పుడు వారిని దర్శించాము. వారి ధోరణి మారిపోవటం వల్ల వారిని చూసిన ఎవరైనా వారు చాలా కోపంగా ఉన్నారని భావిస్తారు, కానీ నిజానికి వారలా లేరు. రాత్రి భజన, రామాయణం యథాప్రకారం జరిగాయి.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo