సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 59వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • మా దైవం సాయిబాబా

విజయవాడ వాస్తవ్యులైన ఇందిరగారు తమ అనుభవాలనిలా మనతో పంచుకుంటున్నారు:

1. మావారికి 2002లో చాలా జబ్బు చేసింది. చాలామంది డాక్టర్లని సంప్రదించాము. కానీ సమస్య ఏమిటన్నది తెలియలేదు. చివరికి మంగళగిరిలో ఉన్న నెమ్ము స్పెషలిస్టుకి చూపించాము. ఆయనకి కూడా అర్థంకాక ఇంకో డాక్టర్ దగ్గరకి పంపించారు. ఆయన స్కాన్ తీయించి, లంగ్ క్యాన్సర్ అని చెప్పారు. కీమోథెరపీ 6 సిట్టింగులు పెట్టాలని చెప్పారు. మా పెద్దమ్మాయి రేవతికి బాబా కనబడుతుంటారు. ఏదైనా అడిగితే సమాధానం చెపుతుంటారు. అక్టోబర్ నెలలో మొదటి కీమోథెరపీ ఉండగా ఆ ముందురోజు మా అమ్మాయితో మావారు, 'బాబాని రమ్మ'ని చెప్పమన్నాను. మా అమ్మాయి అడిగితే, "వాళ్ళని వెళ్ళమను, నేను వాళ్ళకంటే ముందుగానే అక్కడ ఉంటాను" అని చెప్పారు. మర్నాడు మేము డాక్టర్ దగ్గరకి వెళ్ళేసరికి అప్పుడే ఎవరో బాబా క్యాలెండర్ ఇచ్చివెళ్లారట, దానిని మా ముందే గోడకు తగిలించారు. తరువాత డాక్టర్, "కీమోథెరపీ చేసేటప్పుడు లోపల ఉన్న గడ్డ పగిలి ఆయాసం రావచ్చు, పేషంట్ తట్టుకుంటే ఫరవాలేదు. లేదంటే ప్రాణం పోయే ప్రమాదం ఉంది" అని చెప్పారు. బాబా దయవలన ఆయాసం వచ్చినప్పటికీ మావారు తట్టుకోగలిగారు. అలా 2004 మార్చి వరకు బాబా వారిని కాపాడారు. తరువాత బాబా మా అమ్మాయితో, "వాడు అప్పుడే పోవలసినవాడు, 18 నెలలు లాక్కొచ్చాను, ఇక నావల్ల కాలేదు" అని చెప్పారు.

2. మా పెద్దమ్మాయి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఒకసారి తన స్నేహితురాలు తన కుటుంబంతో శిరిడీ వెళ్ళింది. ఆ అమ్మాయి బాబా దర్శనం చేసుకుని సమాధిమందిరం లోపలినుండి బయటకు వస్తుంటే ఒక పూజారి తనని పిలిచి ఒక ఆరెంజ్ కలర్ త్రాడు, ప్రసాదము ఇచ్చి, "నీ స్నేహితురాలు రేవతికి ఇచ్చి, తనని అడిగినట్లు చెప్పు" అన్నారట. ఆ అమ్మాయి శిరిడీనుండి వచ్చాక మా అమ్మాయికి ప్రసాదం, త్రాడు ఇచ్చి, "మీకు శిరిడీలో చుట్టాలు ఉన్నారా?" అని అడిగింది. అందుకు మా అమ్మాయి, "మాకు శిరిడీలో తెలిసిన వాళ్లెవరూ లేరు" అని చెపితే, తను, "ఏమో నాకు తెలియదుగాని, అక్కడ పూజారి మాత్రం ఈ త్రాడు, ప్రసాదం నీకిచ్చి, అడిగానని కూడా చెప్పమన్నారు" అని చెప్పింది. ఆ విషయం మా అమ్మాయి నాతో చెప్పింది. నేను తనతో, "ఆ రూపంలో బాబాయే నీకు త్రాడు, ప్రసాదం పంపించారు" అని చెప్పి ఆ త్రాడు మా అమ్మాయి చేతికి కట్టి, ప్రసాదాన్ని అందరమూ తీసుకున్నాము. ఈ సంఘటన సుమారుగా 2003లో జరిగింది. 

3. తరువాత అదే సంవత్సరంలో ఒకసారి నేను చపాతీలు, బంగాళదుంప కూర చేసి స్టవ్ ప్రక్కన పెట్టాను. ఆరోజు మా రెండవ అమ్మాయి స్కూల్ నుండి చాలా ఆలస్యంగా వచ్చింది. తను వచ్చాక అందరమూ తినడానికి కూర్చున్నాము. అప్పుడు చూస్తే చపాతీ కొంచెం త్రుంచి ఉంది, ప్రక్కన ఉన్న కూర మధ్యలో కొంచెం తీసినట్టుగా గుర్తులు ఉన్నాయి. నాకేమీ అర్థంకాక, "మీలో ఎవరన్నా తిన్నారా?" అని పిల్లల్ని అడిగాను. వాళ్ళు 'మేము తినలేదు' అని అన్నారు. తరువాత మా అమ్మాయికి బాబా కనిపించి, "నేనే తిన్నాను" అని చెప్పారు.

4. 2003 కార్తీకమాసంలో మా అమ్మాయి తన స్నేహితులతో కలిసి వనభోజనానికి వెళ్ళింది. నేను తనకి చపాతీలు చేసి ఇచ్చాను. వాళ్లంతా మధ్యాహ్నం తింటున్న సమయంలో ఒక కుక్క వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుందట. తన స్నేహితుల్లో ఒకరు, "రేవతీ! ఒక చపాతీ దానికి పెట్టు" అన్నారు. మా అమ్మాయి వెళ్ళి చపాతీ పెడితే, "నేనే" అని బాబా నిజరూప దర్శనం ఇచ్చారు. మా అమ్మాయికి మాత్రమే బాబా కనబడ్డారు.

5. మా అమ్మ మా అమ్మాయితో, "బాబాని ఒక్కసారి దర్శనం ఇమ్మని చెప్పమ"ని అడుగుతూ ఉండేది. ఒకరోజు అమ్మ మెట్లు ఎక్కుతుండగా మెట్లమీద చిన్న పాము కనిపించింది. దాని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. అమ్మ వెంటనే క్రిందకి దిగిపోయి, "మెట్లమీద పాము ఉంద"ని అందరినీ పిలిచారు. వాళ్లు వచ్చి చూస్తే అక్కడ ఏ పామూ లేదు. అంతా వెతికారు గానీ ఎక్కడా పాము కనపడలేదు. తరువాత అమ్మ, "బాబానే ఆ రూపంలో వచ్చారా?" అనే అనుమానంతో మా అమ్మాయితో బాబాని అడగమని చెప్పింది. మా అమ్మాయి బాబాని అడిగితే, "వచ్చింది నేనే! లేకపోతే నాకు కనపడు, కనపడు అంటుందా? అందుకే అలా దర్శనమిచ్చాను" అన్నారు.

6. మా అమ్మకి 2005లో కంటిలో శుక్లాలు వచ్చాయి. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ ముందురోజు మా అమ్మ మా అమ్మాయితో, "బాబాని రమ్మని చెప్పమ్మా" అని అడిగారు. అందుకు బాబా, "సరే, వస్తాలే!" అని చెప్పారు. మర్నాడు ఉదయం 8 గంటలకి ఆపరేషన్ థియేటర్ లోపలికి అమ్మని తీసుకుని వెళ్లారు. కంట్లో మందువేసి దూదితో కంటిమీద తిప్పేసరికి శుక్లమ్ ముక్కలు ముక్కలుగా అయిపోయిందట. అలా జరగడం నిజంగా ప్రమాదమట. తరువాత 8 గంటల 10 నిమిషాలకి బాబా లోపలికి వెళ్లారు. బాబాని చూసిన మా అమ్మాయి, "అమ్మా! బాబా ఇప్పుడే లోపలికి వెళ్లారు" అని చెప్పింది. బాబా లోపలికి వెళ్లకపోయుంటే అమ్మ కన్ను పోయేదే! కానీ బాబా దయవలన అమ్మ కన్ను బాగయింది.

7. మా అమ్మానాన్న కాశీ వెళ్లినప్పుడు ఏదో ఒకటి అక్కడ వదిలిపెట్టాలని మా నాన్న జామకాయ వదిలి వచ్చేసారు. ఆ తరువాత కొన్నాళ్లకి వాళ్ళిద్దరికీ షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ వ్యాధిగ్రస్తులు తినాల్సిన పండ్ల రకాలు చాలా తక్కువ కావడంతో మా నాన్న మా అమ్మాయితో, "జామకాయ తినొచ్చా?" అని బాబాని అడగమన్నారు. అందుకు బాబా, "కాశీలో వదిలిపెట్టారు, అదెలా కుదురుతుంది?" అని చెప్పారు. రెండురోజుల తరువాత నాకొకరు పెద్ద జామకాయ ఇచ్చారు. నేను దానిని కడిగి బాబాకి నైవేద్యంగా పెట్టాను. నేను అప్పట్లో టీచర్‌గా పనిచేస్తుండేదాన్ని. నేను స్కూలుకి వెళ్లి సాయంత్రం వచ్చి చూస్తే బాబాకు పెట్టిన జామకాయ లేదు. పిల్లలు తిన్నారేమో అని నేను ఊరుకున్నాను. మా ఇంటి వెనుక లైనులో మా అమ్మా వాళ్ళు ఉంటారు. సాయంత్రం 6 గంటలకి నన్ను మా అమ్మ పిలిచి, ఇంటిలో దేవుడి దగ్గర ఒక కవరులో పెట్టి ఉన్న జామకాయను చూపించారు. అది నేను ఉదయం బాబాకి పెట్టిన జామకాయే! పైగా ఆ కవరు నేను ప్రక్కన పడేసిన నల్లని కవరే! అప్పుడు అర్థమైంది, మా నాన్న 'జామకాయ తినవచ్చా' అని బాబాని అడిగారు కదా! అందుకు సమాధానంగా మా ఇంట్లో జామకాయను మాయం చేసి, వాళ్ళ ఇంట్లో పెట్టి 'తినవచ్చ'ని బాబా తెలియజేసారు.

8. మా పెద్దమ్మాయి పెళ్లి సందర్భంగా మొదటి శుభలేఖను బాబా వద్ద పెట్టి పెళ్లికి రమ్మని ఆహ్వానించాను. తరువాత ఆ విషయమే మర్చిపోయాను. పెళ్లిలో మేమంతా బిజీగా ఉన్న సమయంలో ఒకావిడ వచ్చి మా అమ్మతో, "నాకు భోజనం పెడతారా?" అని అడిగారు. మా అమ్మ ఆవిడకు భోజనం పెట్టించారు. ఆవిడ భోజనం చేస్తూ నావైపే చూస్తూ ఉన్నారట. తరువాత మా అమ్మ ఆ రూపంలో బాబానే వచ్చారని, ఆవిడ కళ్ళు నీలిరంగులో ఉన్నాయని చెప్పారు. ఆ విషయం తెలిసి బాబాని పిలిచి, అయన వస్తే గుర్తుపట్టలేకపోయానని చాలా బాధపడ్డాను. 

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo