సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 426వ భాగం



సాయిశరణానంద అనుభవాలు - 59వ భాగం

నిన్నటి తరువాయిభాగం.....

నేను అహ్మదాబాదులో నివసించిన నాలుగు సంవత్సరాల కాలంలో బాబాకి గొప్ప భక్తుడైన మాధవరావు (షామా) ఒకసారి అక్కడికొచ్చాడు. తన నిత్యకర్మ చేసిన తరువాత, ఆయన బాబా ఆజ్ఞానుసారం విష్ణుసహస్రనామాన్ని పఠిస్తుండేవాడు. పఠించే సమయంలో ఆయన కంఠం గద్గదమయ్యేది. ఆయన కళ్ళనుంచి అశ్రుధారలు కారేవి. ఆ సమయంలో ఆయనకి బాబా బాగా గుర్తొచ్చేవారని నాకనిపించేది. ఆయన స్వయంగా వంట చేసుకునేవాడు. ఆయన వచ్చిన రోజు నా నిత్యనియమిత ధ్యానం చాలా బాగా జరిగింది. నా ఈ ధ్యానాన్ని మాధవరావు చాలా ప్రశంసించాడు. మర్నాడు ధ్యానంలో అవరోధం కలిగినట్లనిపించింది నాకు. తరువాత ధ్యానం చేసుకునే గదిలోంచి బయటకు రావటంతోనే మాధవరావు, “ధ్యానం అలాగే ఉంటుంది. భక్తే సులభం” అన్నాడు.

1923 నవంబరు నెలలో నేను సాలిసిటర్ పరీక్షకి సిద్ధమయ్యాను. నాకు అవసరమైనప్పుడల్లా సాయిమహారాజు మౌలిక సూచనలిచ్చి సహాయం చేసేవారు. పరీక్షా సమయంలో ఆయన నాతో, 'నీవు ప్రశ్నలకు సుదీర్ఘమైన జవాబులు రాస్తున్నావు. చిన్న వాక్యాలలో బాగా ముఖ్యమైన పాయింట్లు తీసుకుని రాయి' అన్నారు. ఆయన కృపతో నేను ఆ పరీక్షలో పాసయి సొలిసిటర్ అయ్యాను. 

సాయిమహారాజు సర్వత్రా ఉన్నారు. భక్తుల సూక్ష్మంలోకెల్లా సూక్ష్మవిచారాన్ని, గుప్తమైన లేదా గుప్తంకాని వ్యవహారాలన్నిటి గురించి వారికి ఎరుకేనన్న ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించారు. అన్వయం చేసిన పద్ధతిలో ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని చూపించారు. సాధన చేస్తూ చేస్తూ స్వయంసాక్షి రూపంతో సర్వత్రా ఉండే ఆత్మను నేనే అన్న అనుభవాన్ని శ్రీసాయిమహారాజు కృపతో నాకిచ్చారు. ఈ దృశ్యజగత్తు మూర్తిమంతమైన మన పుణ్యపాప ఫలం. మనకి వస్తువులు, జనులు, పరిస్థితులు, అనుకూలంగా చేసేవారు లేదా అనుకూల్యత - ఇలా కనిపించేవన్నీ మన పుణ్యమే సాకారరూపంలో మనకు వ్యవహారిక సుఖాన్నివ్వటం కోసం ఉత్పన్నమైనదని తెలుసుకోవాలి. ఆ విధంగానే ఏ ఏ వస్తువులు, జనులు, పరిస్థితులు మనకు ప్రతికూలం అవుతాయో, అలాంటి ఆలోచనతో కనిపిస్తాయో అవన్నీ మన పాపం యొక్క సాకారఫలం. దుఃఖాన్ని ఇవ్వటానికే అవి ఉత్పన్నమయ్యాయని తెలుసుకుని సుఖం పట్ల మోహమూ, దుఃఖం పట్ల అధైర్యము లేకుండా ఉండాలి. రెండు పరిస్థితుల్లోనూ వృత్తిని సంతోషంగా ఉంచుకోవాలి, ఉంచుకునే అలవాటు చేసుకోవాలి. అదే యోగ్యమైనది.

భట్ వాడాలో జోషీ ఇంట్లో నాకు ఏకాంతం బాగా లభించేది. అక్కడ నిత్యకర్మ, వైశ్వదేవం, ధ్యానాదులు బాగా జరిగేవి. ఈ సమయంలో ‘ఏ జపం జపించాలి?’ అన్న విషయం గురించి నేను చాలా మధనపడ్డాను. 'కల్యాణ్' మాసపత్రికలో నేను, “రాధను ప్రసన్నం చేసుకోకుండా కృష్ణుడు ప్రాప్తించటం అసంభవం, గోపీభావం లేకుండా ఆమె ప్రాప్తించదు” అని చదివాను. బాబా కూడా మొదట మురళీగానలోలుడి పేరుతో, “నీవే నేను, నేనే నీవు” అని చెప్పి అపరోక్ష జ్ఞానాన్ని నాకు బోధించారు. “నేను గోపికలను ఈ పద్ధతిలోనే ఉద్ధరించాను” అని కూడా చెప్పారు. అందువల్ల 'గోపీజనవల్లభ' అన్న గోపికా మంత్రాన్ని జపించటం ప్రారంభించాను. ఈ మంత్రం జపించటం ప్రారంభించిన రోజునో లేక మరుసటి రోజునో రాత్రి స్వప్నంలో బాబా కనిపించారు. అక్కడ నరేంద్రుడు కూడా కూర్చున్నాడు. బాబా, “నీ మేనల్లుడిని ‘రాధాకృష్ణ జయ కుంజ విహారీ మురళీధర గోవర్ధనధారీ’ అనే మంత్రాన్ని జపించమని చెప్పు” అన్నారు. నరేంద్ర నాతోపాటు ఉమరేఠ్‌లో లేడు. అందువల్ల మేనల్లుడికి మృత్యువు సమీపించిందని తెలిసి నేను ఈ మంత్రాన్ని జపించసాగాను. కాసేపట్లోనే నెమ్మది నెమ్మదిగా మరణిస్తూ ఉన్న ఎవరిదో చేతి బొటనవ్రేలు హృదయంలోంచి ప్రకటమైనట్లు కనిపించింది. తుకారామ్ అభంగంలో అంతర్భూతమైన, "ఆయన చూపిన రూపం బొటనవ్రేలి ప్రమాణంలో ఉన్నద"న్న పంక్తి గుర్తొచ్చి, ఈ మంత్రం సిద్ధమంత్రమని తెలిసింది. అందువల్ల ఈ జపం తప్పకుండా చేస్తుండేవాణ్ణి. 

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo