సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 417వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - 50వ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకసారి ఉదయం తొమ్మిది, పది గంటలకు నేను పచార్లు చేస్తున్నాను. అప్పుడు, "ఇది మన పొలం. ఇక్కడ కూర్చుని పనిచేయి” అని ఆకాశవాణి వినిపించింది. నేనక్కడ కూర్చున్నాను. ఎవరో దున్నటాన్నీ, మరెవరో విత్తనాలు చల్లటాన్నీ నేను చూశాను. కానీ, నాగలి పట్టుకోవటం తెలీకపోవటం వల్ల ఏం చేయాలో నాకు స్ఫురించలేదు. ఇలా కూర్చున్నప్పుడు ఉదయ ఫలహారం కోసం జొన్న రొట్టెలున్న బుట్టను తలమీద పెట్టుకున్న ఒక నౌకరును వెంటబెట్టుకుని ఫకీరుబాబా వచ్చాడు. ఫకీరుబాబా ఆ పొలంలో కూర్చుని, తన నౌకరును కూడా కూర్చోబెట్టి అతనికి జొన్న రొట్టె ఇచ్చి తినమన్నాడు. తను కూడా తింటూ రొట్టెను చేత్తో తీసుకొని నాతో, “తీసుకో!” అన్నాడు. కానీ నేను శుద్ధ బ్రాహ్మణుడను. నేనెలా తీసుకొంటాను? నేనేమీ చెప్పనూలేదు, రొట్టెను తీసుకోనూలేదు. అప్పుడు ఫకీరుబాబా, “ఏమీ ఫరవాలేదు. నీకోసం సగుణరావు ఇంట్లో ఏర్పాటు చేస్తాను” అన్నాడు. ఈ మాటకు నేనేమీ సమాధానమివ్వలేదు. అప్పట్లో నాకు ఈ ప్రకారంగా ఏదో ఒక ఏర్పాటు అవసరం ఉంది. దీని తరువాత ముఖ్యంగా ఈ విషయం గురించి మళ్ళీ ఫకీరుబాబాను కలవటం జరుగలేదు. అతను కూడా ఎప్పుడూ నాతో 'ఇక్కడ నీ భోజనం ఏర్పాటు ఏమైంద'ని అడగలేదు. బహుశా రాధాకృష్ణమాయి, కాకాసాహెబ్ దీక్షిత్‌లు నా భోజనానికి ఏర్పాటు చేస్తున్నారని వేరేవారి ద్వారా తెలుసుకుని ఉండొచ్చు.

నేను శిరిడీలో పదకొండు నెలలు (1913లో) ఉంటున్నప్పటి మాట. ఒకరాత్రి మొదటిఝాములో నా గది బయట అరుగు మీద కూర్చుని ఉన్నాను. అప్పుడు బాబా సన్నిధిలో ఉండే నగ్నశరీరంతో ఉన్న ఒక వైరాగ్య పురుషుడు (ఆయన సాకోరీలో ఉన్న ఉపాసనీ మహారాజు అనే విషయం ముందుకి వెళ్ళి ఆయన్ను కలిసిన తరువాత నాకు తెలిసింది) నాతో, "ముస్లింగా నువ్వు 'రోజా' చేయాలని బాబా నాతో చెప్పారు” అని అన్నారు. అది విని నాకు, “నేనేమైనా ముస్లింనా 'రోజా' పాటించటానికి?” అనిపించింది. ఆ సమయంలో నాకు ఆయనతో (ఉపాసనీతో) పరిచయం లేదు. అందువల్ల నేను ఆయన మాటలను కేవలం విన్నానే కానీ ఔననీ, కాదనీ బదులు చెప్పలేదు. కానీ ఆ సమయంలో, ఈ వ్యక్తి బాబా మీద నాకున్న శ్రద్ధని క్షీణింపచేయటానికి ప్రయాసపడుతున్నాడని అనిపించింది. అందువల్ల నేనాయన మాటను అసలు పట్టించుకోలేదు. తరువాత నేను 'రోజా'కి అర్థం 'నక్తా భోజనం', అంటే రాత్రి భోజనమనీ, మన హిందూశాస్త్రానుసారం ఈ ప్రకారంగా భోజనం చేయటం పాపక్షయకారి అనీ, అలాగే అది పవిత్రమైనదిగా విశ్వసించబడుతుందనీ తెలుసుకున్నాను. తరువాత శ్రీఉపాసనీతో పరిచయమయినప్పుడు, మొదటి సంవత్సరాల్లో ఆయన ఉదయంపూట కొంచెం కాఫీ గానీ లేదా ఇంకేదైనా గానీ త్రాగేవారనీ, రాత్రిపూట నైవేద్యం తిరిగి వచ్చిన తరువాత దాన్ని గానీ లేక తను తయారుచేయించిన జొన్న రొట్టెలో కేవలం సగం రొట్టెను మాత్రం తినేవారనీ నాకు తెలిసింది.

అకారణంగా ఏ కారణమూ లేకుండా ఒకసారి నేను ముంబాయి నుంచి ఒక్కరోజు కోసం శిరిడీ వెళ్ళాను. ఆరతి సమయంలో బాబాకు చామరం వీస్తూ నిలుచున్నాను. నా కళ్ళల్లోంచి అరగంట, ముప్పావుగంట వరకూ అశ్రుధారలు కారసాగాయి. ఒక గురుపూర్ణిమ రోజున నేను బాబా చరణాలకు చందనం పెట్టాను. అయితే బాబా నుదుటిపై చందనం పెట్టటం మిగిలిపోయింది. పూజచేసేవాళ్ళ మధ్యలో కూర్చుని నేను నా వంతు వచ్చేవరకూ ఎదురుచూస్తున్నాను. అప్పుడు కూడా నా కళ్ళల్లోంచి అశ్రువులు కారసాగాయి. అది చూసి తాత్యాపాటిల్, “ఏడవకు. ఇదిగో, పూజ నువ్వే చేయి” అన్నాడు. పూజ చేయటానికి నా వంతు ఇంకా రాలేదన్న దానికోసం నేను ఏడవటంలేదని అతనికేం తెలుసు! ఈ అశ్రుప్రవాహం ఏ కారణంతో వస్తున్నదో నాక్కూడా తెలియలేదు. అయితే తరువాత ఒక పుస్తకాన్ని చదువుతుంటే, పాపక్షాళనం కోసం మహాత్ములు తమ భక్తులపై ఇలాంటి ప్రయోగాన్ని చేస్తారని తెలిసింది. ఈ ప్రకారంగా అశ్రువులు కారటంతో ఆత్మశుద్ధి అవుతుంది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo