సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

పని విలువ


1946వ సంవత్సరం మే నెలలో ఒకరోజు వసంత్ ప్రధాన్, అతని స్నేహితుడు శిరిడీ సందర్శించారు. ఆ సాయంత్రం వేడి తగ్గుతూ ఆహ్లాదకరమైన గాలి వీస్తోంది. 'వయస్సు పైబడివుండి, బాబాను కలిసిన వ్యక్తి ఎవరైనా కనపడతారా?' అనే ఆశతో స్నేహితులిద్దరూ గ్రామంలో నడుస్తున్నారు. బాబాకి సంబంధించిన లీలలు, ఆసక్తికరమైన విషయాలు ఆ వ్యక్తి చెప్తారేమోనని వారి ఉద్దేశ్యం.

చిన్నచిన్న వీధులలో వారిరువురు నడుస్తుండగా ఒక ముస్లిం పెద్దమనిషి కనపడ్డారు(దురదృష్టవశాత్తు ఆ పెద్దమనిషి పేరు తెలియపరచలేదు). అతను ఒక రాయిమీద కూర్చుని బీడీ తాగుతున్నాడు. వసంత్ అతనిని, "బాబా, మీరు శిరిడీ గ్రామస్థులా?" అని అడిగాడు. అతను ఆతురతగా తల ఆడించాడు. అప్పుడు వసంత్ అతనితో, "బాబా గురించి, మీకు జరిగిన ఏదైనా అనుభవం గురించి మాకు చెప్పండి" అని అభ్యర్థించాడు. అందుకతను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: 

"నేను బాబా దగ్గర కూర్చునేవాడిని. ఆయన ఇచ్చిన చిలుం పీల్చేవాడిని. ప్రతిరోజూ నేను ఆయన దర్బారుకు వెళ్ళి, ఆయన చెప్పేవి జాగ్రత్తగా వినేవాడిని. బాబా వింతగా మాట్లాడేవారు. ఎప్పుడైనా ఏ భక్తునికైనా ఏదన్నా చెప్పాలని అనుకుంటే, ఆయన వేరెవరివైపో చూస్తూ సందేశం లేదా సలహా చెప్పేవారు. ఆయన చూపు ఎవరిపై ఉందో ఆ వ్యక్తి గాభరాపడేవాడు. కానీ ఏ వ్యక్తిని ఉద్దేశించి ఆయన చెప్తున్నారో ఆ వ్యక్తి మాత్రం చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఆ సందేశాన్ని వినేవాడు. తరువాత ఆ వ్యక్తి ఆయన పాదాలమీద పడి ఆ సలహాను పాటించేవాడు. ప్రతిరోజూ బాబా విస్తారంగా డబ్బులు పంచేవారు. ఆయన 5, 10, 50 మరియు 100 రూపాయలు అక్కడ కూర్చుని ఉన్న భక్తులకు ఇచ్చేవారు. అయితే నాకు మాత్రం ఆయనెప్పుడూ డబ్బులు ఇవ్వలేదు. నాకు ఒక చిన్న పొలం ఉండేది. దానిద్వారా వచ్చిన దాంతోనే నేను నా జీవితాన్ని సర్దుబాటు చేసుకునేవాడిని. ఒకరోజు నేను, "బాబా! మీరు మీ భక్తులందరికీ విరివిగా డబ్బులు పంచిపెడతారు. నేను చాలా పేదవాడిని, అయినప్పటికీ మీరు నాకెప్పుడూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు" అని అన్నాను. అప్పుడు బాబా, "అరె! నీకెందుకు డబ్బులు కావాలి? నీ పొలంలో బంగారుకుండ ఉంది" అని అన్నారు. మరుసటిరోజు నేను జాగ్రత్తగా పొలం దున్ని, సరిపడేంత ఎరువు వేసి, గింజలు నాటాను. బాబా మాటలు నా చెవిలో మారుమ్రోగుతుండగా ప్రతిరోజూ జాగ్రత్తగా పనిచేసేవాడిని. సమయం దొర్లిపోయింది కానీ బంగారుకుండ కనపడలేదు. అయినా నా శ్రమవలన ప్రతిసారీ విస్తారమైన పంట వచ్చేది. తొందరలో నేను ప్రక్కనున్న మూడు పొలాలు కొనగలిగాను. నా దగ్గర సరిపడా ధనం చేరింది. కొన్ని సంవత్సరాల తరువాత నేను బాబాతో, "నేనింకా బంగారుకుండను కనుగొనలేకపోయాను" అని అన్నాను. ఆయన నవ్వుతూ, "ప్రయత్నం చేస్తూ ఉండు" అని అన్నారు. తరువాత బాబా మాటలు నిజమయ్యాయి. నేనిప్పుడు ఐశ్వర్యవంతుడిని. చాలా సంతోషంగా ఉన్నాను. నా శ్రమ, ఆయన అనుగ్రహం రెండూ కలిస్తే బ్రహ్మండమైన పంట పండుతుందని ఆయన నాకు తెలియజేశారు". ఆ క్రమంలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, బాబాను ఎల్లవేళలా జ్ఞప్తియందు ఉంచుకుని శ్రద్ధగా పని చేసినట్లయితే తప్పక విజయం సాధిస్తాము అని.

వసంత్ కూడా ఈ కథ వల్ల పాఠం నేర్చుకున్నాడు. శ్రీసాయిసచ్చరిత్ర 19వ అధ్యాయంలో హేమాడ్‌పంత్ ఇలా వ్రాసారు: "మీరు మీ సామర్థ్యాన్నంతా పెట్టి కష్టపడి పనిచేయండి. నేను గిన్నెడు పాలతో మీ ప్రక్కనే నిలబడి ఉంటాను. మీరు కష్టపడక పోయినట్లైతే నేను గిన్నెడు పాలతో మీ ప్రక్కన నిలుచుంటానని ఆశించవద్దు".

బాబా చదువుకున్న, చదువుకోని భక్తులకు సుళువైన పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పుతారు. ఆయన అంతటా, అన్నిచోట్లా ఉన్నారు. ఆయన సర్వాంతర్యామి.

Ref : సాయి ప్రసాద్ మ్యాగజైన్, దీపావళి సంచిక, 1992.
Source: Baba’s Divine Manifestations  compiled by Vinny Chitluri.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo