సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 323వ భాగం.


ఖపర్డే డైరీ - తొమ్మిదవ భాగం

13-12-1911.

నేను మామూలుగానే లేచి ప్రార్థన చేసుకొని స్నానం చేద్దామనుకున్నాను. కానీ వేన్నీళ్ళు సిద్ధంగా లేకపోవటంవల్ల బయటకు వచ్చి మాట్లాడుతూ కూర్చున్నాను. సాయి మహారాజు బయటకు వెళ్ళేటప్పుడు వారికి నమస్కరించుకొని అప్పుడు స్నానం చేశాను. పంచదశి పఠించిన తరువాత సాయి మహారాజును మశీదులో దర్శించుకొని ఆరతి తరువాత తిరిగి వచ్చాను. సాయంత్రం నాలుగ్గంటలకి నేను, బల్వంత్, భీష్మ, బందులతో కలసి వెళ్ళాను. బందు పట్టుకొచ్చిన నా హుక్కాని సాయి మహారాజు ఒకసారి పీల్చారు. నేను తిరిగి అమరావతి వెళ్ళేందుకు మాధవరావు సాయి మహారాజుని అడిగితే, ఆ విషయం రేప్పొద్దున నిర్ణయిస్తామన్నారు వారు. అక్కడున్న వారందరినీ మశీదు బయటకు వెళ్ళమని చెప్పి, నాకు మాత్రం అపారమైన కరుణతో కన్నతండ్రిలా సలహా ఇచ్చారు. సాయంత్రం వారిని దర్శించేందుకు చావడి ఎదురుగా వెళ్ళి, తరువాత శేజారతికి హాజరయ్యాం. భీష్మ పంచదశి పఠనం రోజూ కంటే ముందుగానే జరిగింది. భాయీ కూడా ఒక భజన పాడాడు.

14-12-1911.

వెళ్ళిపోవాలనే కోరికతో నేను త్వరగా లేచాను. కాకడ ఆరతికి హాజరయి, హడావుడిగా ప్రార్థన చేసుకొని, మాధవరావు దేశ్‌పాండేతో కలసి సాయి మహారాజును మశీదులో కలుసుకునేందుకు వెళ్ళాను. సాయి మహారాజు రేపు వెళ్ళొచ్చునని నాకు చెప్పి, నేను భగవంతుని సేవ తప్ప మరెవరి సేవా చేయకూడదని చెప్పారు. "దేవుడిచ్చింది పోదనీ, మానవుడిచ్చింది నిలువదనీ" అన్నారు వారు. నేను తిరిగి వచ్చి కల్యాణ్ నుంచి దర్వేష్ సాహెబ్ రావటం చూశాను. అతను పాతకాలపు పెద్దమనిషి. షింగణే, అతని భార్యా కూడ అతనితో ఉన్నారు. షింగణే బొంబాయిలో పేరుమోసిన పెద్దలాయరు. అతను 'లా' తరగతులు కూడా నిర్వహించేవాడు. నేను మధ్యాహ్నపూజకు హాజరయి, బాపూసాహెబ్ జోగ్‌తో కలసి నా ఉదయ ఫలహారం చేశాను. దాని తరువాత పడుకొని నిద్రపోయాను. మశీదుకి కొంచెం ఆలస్యంగా వెళ్ళి చావడి వద్ద నమస్కరించుకున్నాను. అప్పుడు దర్వేష్ సాహెబ్, షింగణేలతో మాట్లాడుతూ కూర్చున్నాను. తరువాత భీష్మ తన నిత్య భజన కార్యక్రమం నిర్వహించాడు.

15-12-1911.


ప్రొద్దున నా ప్రార్థనానంతరం షింగణే, దర్వేష్ ఫాల్కేలతో మాట్లాడుతూ కూర్చున్నాను. అతన్ని హాజీసాహెబ్ అని కూడా అంటారు. అతను బాగ్దాద్, కాన్‌స్టాంటినోపుల్, మక్కా, ఇంకా అక్కడి చుట్టుప్రక్కల ప్రదేశాలు ప్రయాణం చేశాడు. అతని సంభాషణ హాయిగానూ, సాధకుడికి సూచనలు చేసేదిగానూ ఉంది. సాయి మహారాజు అతన్నెంతో ఇష్టపడి అతనికి ఆహారం పంపి ప్రేమతో ఆదరించారు. సాయి మహారాజును వారు బయటకు వెళ్ళేటప్పుడు, వారు తిరిగి వచ్చాక మశీదులోనూ చూశాన్నేను. వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారి సంభాషణలో మేమంతా ఆనందాన్ని అనుభవించాం. భోజనానంతరం నేను కాసేపు విశ్రమించి, తరువాత మా అబ్బాయి బల్వంత్ చదివిన ఢిల్లీ సంగతులు వింటూ కూర్చున్నాను. మశీదుకి వెళ్ళి సాయి మహారాజు ఆశీస్సులు తీసుకొని ఆ తరువాత శేజారతికి వెళ్ళాం.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai,🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo