సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 317వ భాగం


ఖపర్డే డైరీ - మూడవ భాగం.

9-12-1910

నేను, మా అబ్బాయి ఈరోజు వెళ్ళిపోదామనుకున్నాం. ఉదయ ప్రార్థనానంతరం సాయి మహారాజుని యథాప్రకారం దర్శనం చేసుకునేందుకు వెళ్ళినప్పుడు, వారు మా అబ్బాయితో "మీరు వెళ్ళాలనుకుంటున్నారా?" అని, "ఒకవేళ వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చ"ని చెప్పారు. అవసరమైన అనుమతి అనుగ్రహించారనుకుని మేం వెళ్ళేందుకు సిద్ధపడ్డాం. మా అబ్బాయి మా సామాన్లన్నీ సర్దేసి మాకోసం ఒక బండినీ, మా సామాను కోసం మరో బండినీ కుదుర్చుకుని వచ్చాక మధ్యాహ్నం మేం బయలుదేరే ముందు సాయి మహారాజుని దర్శించుకునేందుకు వెళ్ళాం. 

నన్ను చూడ్డంతోటే బాబా, "నువ్వు నిజంగా వెళదామనుకుంటున్నావా?" అన్నారు. 'నేను వెళదామనుకుంటున్నమాట నిజమే గానీ, మీరు అనుమతించకపోతే మాత్రం కాదు' అన్నాను. "అయితే మీరు రేపు గానీ, ఎల్లుండి గానీ వెళ్ళొచ్చు. ఇది మనిల్లు, ఈ వాడా మనిల్లు, నేనిక్కడ ఉండగా ఎవరు మాత్రం భయపడవలసిన అవసరమేముంది? ఇది మన సొంతిల్లు. నువ్వు దీన్ని నీ స్వంత ఇల్లుగానే చూడాలి" అన్నారు బాబా. నేను ఆగిపోవటానికి అంగీకరించి వెళ్ళిపోయేందుకు చేసుకున్న ఏర్పాట్లన్నిటినీ రద్దు చేసుకున్నాను. మేం మాట్లాడుతూ కూచున్నాం. సాయి మహారాజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో సంతోషకరమైన విషయాలు చెప్పారు కానీ వారిని నేను అర్థం చేసుకోలేదనే నాకు భయమేస్తోంది.

10-12-1910

ఉదయం ప్రార్ధన కాగానే మా అబ్బాయితో, "మనల్ని ఎప్పుడు పంపించాలో అదంతా ఆయనకు తెలుసు, మనం వెళ్ళిపోయే సంగతిని సాయి మహారాజుతో ప్రస్తావించొద్దు" అన్నాను. సాయీసాహెబ్ బయటకు వెళ్ళేటప్పుడు యథాప్రకారం వారిని చూశాం. మళ్ళీ వారు మశీదుకు వెళ్ళే సమయంలోనూ చూశాం. సాయీసాపాబ్ చాలా ఆనందంగా ఉన్నారు. తనతో అడుకునే ఓ చిన్నపిల్ల పూర్వజీవితం గురించిన కథను చెప్పారు. ఆమె ఒక కళాకారిణి అనీ, ఆమె చనిపోతే మామూలుగానే పూడ్చివేశారనీ చెప్పారు. ఆ మార్గంలోనే వెళుతున్న సాయిసాహెబ్ ఆమె సమాధి వద్ద ఒక రాత్రి గడిపారట. కనుక ఆమె వారిని అనుసరించింది. ఆయన ఆమెని ఒక తుమ్మచెట్టులో పెట్టి ఆ తరువాత ఇక్కడకు తెచ్చారట. వెనుకటి జన్మలో తాను కబీరుననీ, నూలు వడికేవాడిననీ చెప్పారు. సంభాషణ అంతా అతిశయించిన ఆనందంతో సాగిపోయింది.

మధ్యాహ్నం వార్దాకి చెందిన శ్రీధర్ పంత్ పరాంజపే అనే ఆయన ఒక పండిట్, ఒక డాక్టరు, మరో పెద్దమనిషితోనూ కలిసి వచ్చారు. అహ్మద్ నగర్ జూనియర్ పట్వర్ధన్ కూడా వారితో ఉన్నాడు. అతను, మా అబ్బాయి కాలేజీ పాత ఫ్రెండ్స్. వాళ్ళు సాయిసాహెబ్‌ను చూడటానికి పోతుంటే మేము వారిననుసరించాం. మిగతా అందరితో ఎలా వ్యవహరిస్తారో వారితోనూ సాయి అలాగే వ్యవహరిస్తూ మొదట నూనె వ్యాపారి, మార్వాడీ మొదలైనవారి గురించే మాట్లాడారు. తరువాత ఆయన కొత్తగా వస్తున్న భవనాల గురించి మాట్లాడుతూ, "ప్రపంచానికి పిచ్చెక్కింది. ప్రతివాడూ చెడుభావాల్ని అలవరచుకుంటున్నాడు. వాళ్ళతో సమానంగా ఉండాలని నేనెప్పుడూ ప్రయత్నించను. కాబట్టి వాళ్ళేం చెప్పినా నే వినను. అసలు సమాధానమే ఇవ్వను. ఏం సమాధానం చెప్పాలి?" అని, అందరికీ 'ఊదీ' పంచి మమ్మల్ని వాడాకు వెళ్ళిపొమ్మన్నారు. జూనియర్ పట్వర్ధన్‌ని విడిగా చూపిస్తూ తమ సహజధోరణిలో, "నువ్వు ఆగి రేపు వెళ్ళు" అని చెప్పారు. 

నేను, బాబాసాహెబ్ సహస్రబుద్ధే వాడాకి వచ్చేశాం. పరాంజపే, అతని సహచరులూ రాధాకృష్ణ ఆయీ దగ్గరకు వెళ్ళినట్లున్నారు. బాపూసాహెబ్ జోగ్ భార్య అనారోగ్యంగా ఉంది. సాయిసాహెబ్ ఆమెకేమీ మందు ఇవ్వకపోయినా, ఆయన చెప్పిన దాంతో ఆమె బాగా ప్రయోజనాన్ని పొందింది. అయితే ఈరోజు ఆమె తన ఓర్పుని కోల్పోయి వెళ్ళిపోవాలనుకొంది. బాపూసాహెబ్ జోగ్ కూడా (కేవలం) నిస్సహాయతతో ఆమె వెళ్ళిపోవటానికి అంగీకరించాడు. ఆమె పోతున్నప్పుడు సాయిసాహెబ్ ఆమె గురించి పదే పదే అడిగారు. బావూసాహెబ్ జోగ్ ఆ సాయంత్రం సాయిసాహెబ్ దగ్గరకు అనుమతి కోసం వెళ్దామనుకునేంతలో, ఆమె 'తనకు నయంగా ఉందనీ, ఎక్కడికీ వెళ్ళాలనుకోవటం లేద'నీ అంటే మేమంతా ఆశ్చర్యపోయాం.

తరువాయి భాగం రేపు ......

  source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo