ఖపర్డే డైరీ - మొదటి భాగం.
శిరిడీలో ఓ వారం
5-12-1910
సాయంత్రం 4 గంటలకి శిరిడీ చేరాం. రావుబహదూర్ హెచ్.వి.సాఠే చేత భక్తులకు అనుకూలంగా నిర్మించబడ్డ వాడాలో దిగాము. మాధవరావు దేశ్పాండే చాలా మర్యాదపూర్వకంగా మాకు సాయం చేసి మమ్మల్ని అతిథుల్లా గౌరవించాడు. వాడాలో తాత్యాసాహెబ్ నూల్కర్, అతని కుటుంబము, బాపూసాహెబ్ జోగ్, బాబాసాహెబ్ సహస్రబుద్ధే కూడా ఉన్నారు. మేం చేరుకున్న వెంటనే సాయి మహరాజును దర్శించేందుకు వెళ్ళాం. వారు మశీదులో ఉన్నారు. వారికి నమస్కరించిన తరువాత నేను, మా అబ్బాయి బాబాకి మేం తీసుకొచ్చిన పండ్లు సమర్పించి, వారి కోరికపై దక్షిణ సమర్పించాం. రెండు సంవత్సరాలకు పైగా తన ఒంట్లో బాగుండకపోవటం వల్ల తాను బార్లీ రొట్టె, కొంచెం నీరు మాత్రమే తీసుకుంటున్నానని సాయి చెప్పారు. తమ కాలుని చూపి, దానిమీద ఉన్న చిన్న కురుపుని చూపిస్తూ, అది నారికురుపనీ (స్ట్రింగ్ వామ్), దాన్ని తీసేసినా కూడా అది తెగిపోయి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూందని అన్నారు. తన స్వగ్రామం వెళ్ళేంతవరకు అది బాగవదని తాను తెలుసుకున్నానని చెప్పారు సాయి. తాను దాన్ని దృష్టిలో పెట్టుకొన్నానని, అయితే తన స్వంత జీవితం కన్నా తనవారి గురించే తాను ఎక్కువ జాగ్రత్తపడతానని చెప్పారు సాయి. మానవులు తనను ఇబ్బందిపెట్టటం వల్ల తనకు కొంచెం కూడా విశ్రాంతి దొరకటం లేదనీ, అయినా తాను ఏం చేయలేననీ చెప్పారు. తరువాత మేం చేసినదాన్ని వదిలేయమని సాయి మాతో చెప్పారు. సాయంత్రం వాడా ప్రక్కగా ఆయన వెళ్తున్నప్పుడు మేం వెళ్ళి నమస్కారం చేసుకొన్నాం. నేను, మాధవరావు దేశ్పాండే కలిసే ఉన్నాం. మేం నమస్కరించిన తరువాత ఆయన, "వాడాకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి" అన్నారు. కనుక నేనూ, మాధవరావు దేశ్పాండే వెనుదిరిగాం. మేం మాట్లాడుకుంటూ కూచున్నాం. ఆయన నాకు ఎన్నో అద్భుతాలను వివరించాడు.
6-12-1910
ఉదయం నేను మార్నింగ్ వాక్కి వెళ్ళి స్నానం చేసిన తరువాత, ఎంబ్రాయిడరీ చేసిన పెద్ద గొడుగును తమ తలపై భక్తులు పట్టుకొనగా బయటకు వెళుతున్న సాయి మహరాజుని చూశాము. తరువాత మేము మశీదుకు వెళ్ళాం. సాయిబాబా కొంచెం ఉద్రేకపూరితంగా ఉన్నట్లనిపించింది. తరువాత వారు లేచి అక్కడ ఉన్న ప్రసాదం అందరికీ పంచాక, ఊదీని అందరికీ ప్రసాదించి మమ్మల్ని వెళ్ళమని అన్నారు. బాబా ఆదేశాన్ని మేం పాటించాము. మధ్యాహ్న భోజనం మధ్యాహ్నం 2-30 గంటల వరకు పెట్టలేదు. ఆ తరువాత మేం మాట్లాడుకుంటూ కూచున్నాం. సాయంత్రం వ్యాహ్యాళికి బయటకి వచ్చిన సాయిని చూసి తరువాత రాత్రిపూట బాబా నిద్రించే చావడికి వెళ్ళాం. అందంగా అలంకరించబడిన గొడుగు, వెండి దండం, వింజామరలు విసనకర్రలు మొదలైనవి వారిని అనుసరించాయి. ఆ ప్రదేశమంతా అద్భుతంగా లైట్లతో వెలిగిపోయింది. రాధాకృష్ణమాయి లైట్లతో బయటకు వచ్చింది. ఆమెను నేను దూరంనుంచే చూశాను. మాధవరావు దేశపాండే మర్నాడు తాను ఎక్కడికో వెళుతున్నానని, మూడోనాటికి తిరిగి వస్తానని చెప్పాడు. తాను వెళ్ళేందుకు సాయి మహారాజుని అనుమతి కోరి, పొందాడు.
తరువాయి భాగం రేపు ......
source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.