సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శాంతారాం బల్వంత్ నాచ్నే- ఐదవ భాగం


రవీంద్ర శాంతారాం నాచ్నేకు శ్రీసాయిబాబా ప్రసాదించిన అనుభవాలు:

ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి సమయానికి నాచ్నే కుటుంబసభ్యులంతా ఒకచోట చేరేవారు. 1988లో గణేశుని విగ్రహాన్ని తీసుకొచ్చారు. ప్రాణప్రతిష్ఠ చేయటానికి ఇంకా సమయం ఉంది. రవీంద్ర నాచ్నే భార్య, అతని వదిన పూరీలు వేయిస్తున్నారు. అతని పెద్ద కోడలు శ్రీమతి షమికా సందీప్ మిగతా వంటకాలు తయారుచేస్తోంది. రవీంద్ర నాచ్నే తమ్ముడు శ్రీకాంత్ నాచ్నే తొమ్మిది సంవత్సరాల కుమార్తెకి అభ్యాస వైకల్యం(లెర్నింగ్ డిజెబిలిటీ) ఉంది. తను అలమరాలో ఏదో తీయడానికి ప్రయత్నిస్తోంది. అకస్మాత్తుగా ఆ అలమారా షమిక భుజంపై వచ్చి పడింది. ఆశ్చర్యం ఏమిటంటే, అలమరా మొత్తం పడిపోయినప్పటికీ అందులో సామాన్లన్నీ అలానే ఉన్నాయి. కేవలం ఒక్క సీసా మాత్రమే కింద పడింది. ఆ బాటిల్ కూడా పొయ్యి పక్కనే పడి విరిగిపోయింది. ఒకవేళ ఆ సీసా వేడిగా కాగుతున్న నూనె బాణలిపై పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగివుండేది. అదృష్టవశాత్తూ, సాయిబాబా ఆ ప్రమాదం నుండి కుటుంబసభ్యులందరినీ రక్షించారు. ఎవరికీ గాయాలు కాలేదు. నిజంగా ఇది బాబా ఆశీర్వాద ప్రభావమే.

1991, మే 21న రవీంద్ర నాచ్నే కుమార్తె స్వాతి వివాహం బదలాపూరుకి చెందిన నితిన్ కార్నిక్‌తో జరిగింది. కుటుంబసభ్యులు శ్రీసాయిబాబాకు మొదటి ఆహ్వానపత్రిక ఇవ్వాలని నిర్ణయించుకుని శిరిడీ వెళ్లారు. రవీంద్ర నాచ్నే ద్వారకామాయిలో ఉన్న శ్రీసాయిబాబా ఫోటో తనకు కావాలని ఆశపడ్డాడు. తరువాత కుటుంబసభ్యులందరితో మందిరం నుండి బయటకు వస్తూనే అదే ఫోటో సంస్థాన్ నడుపుతున్న స్టాల్‌లో అమ్మకానికి ఉండటం చూసాడు. అతని కుమార్తె స్వాతి కూడా ఒక ఫోటో కావాలని ఆశపడింది. అందువలన రెండు ఫోటోలను తీసుకున్నారు. ఒక ఫోటోను ఇంట్లో ఉంచి, మరొకటి పెళ్లి మండపంలో ఉంచి నైవేద్యాలు సమర్పించారు. పెళ్లి అంతా సజావుగా సాగింది. తరువాత పెళ్లి ఊరేగింపు బదలాపూర్‌కు చేరుకుంది. మరుక్షణంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణవార్త వచ్చింది. పెళ్లికి ముందే ఆ వార్త వచ్చి ఉంటే పెళ్లికి పెద్ద ఆటంకమయ్యేది. బాబా స్వయంగా ఫోటో రూపంలో వివాహానికి హాజరైనందువల్ల వివాహ వేడుక ఎటువంటి సమస్యా లేకుండా పూర్తయింది.

రవీంద్ర నాచ్నే కుటుంబసభ్యులందరికీ ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు నుదుటిపై బాబా ఊదీ ధరించడం అలవాటు. ఒకరోజు అతని కొడుకు సందీప్ పనికి ఆలస్యం అవుతుందన్న కంగారులో ఊదీ పెట్టుకోవడం మర్చిపోయాడు. తరువాత పని మధ్యలో ఉండగా అతనికి ఊదీ పెట్టుకోకుండానే వచ్చానన్న సంగతి గుర్తొచ్చింది. వెంటనే అతను ఇంటికి వెళ్లి ఊదీ పెట్టుకుని, మళ్ళీ పనికి వెళ్ళాడు. ఆరోజు మధ్యాహ్నం అతను రోజూ వెళ్లే సమయానికన్నా రెండు నిమిషాలు ముందే భోజనానికి లేచాడు. అతను అలా వెళ్ళగానే రోజూ అతను కూర్చునే చోట పైకప్పు విరిగి పడింది. అందరూ అతనికి గాయాలై ఉంటాయని అనుకున్నారు. కానీ అతను చేతులు తుడుచుకుంటూ వంటగది నుండి బయటకు రావడం చూసి, అతనికేమీ కాలేదని స్నేహితులంతా సంతోషించారు. సాయిబాబా తృటిలో ప్రమాదాన్ని తప్పించి అతన్ని రక్షించారు.

శిరిడీ సంస్థాన్‌లో పూజారిగా పనిచేసిన ఉదయ్ వలుంజ్కర్ ఎప్పుడు ముంబాయి వెళ్లినా రవీంద్ర నాచ్నే ఇంటికి వెళ్తుండేవారు. అయితే ఒక నాలుగేళ్లపాటు నాచ్నే కుటుంబం అతనిని చూడలేదు. హఠాత్తుగా ఒకరోజు రవీంద్ర భార్యకు రెండవసారి గుండెపోటు వచ్చింది. ఆమెకు యాంజియోగ్రఫీ చేయాలని వైద్యులు కుటుంబసభ్యులతో చెప్పారు. వీలైతే గురువారంనాడు ఆ పరీక్ష చేయమని రవీంద్ర కుమారుడు సందీప్ వైద్యులను అభ్యర్థించాడు. వాళ్ళు అంగీకరించి ఉదయం 9 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యపోయేలా నాలుగేళ్ళ నుండి కనపడని ఉదయ్ వలుంజ్కర్ బుధవారంనాడు శిరిడీ నుండి వచ్చి ఊదీ, ప్రసాదాలిచ్చి ముంబాయి వెళ్లిపోయారు. గురువారం ఉదయం రవీంద్ర భార్య ఆ ఊదీ ధరించి యాంజియోగ్రఫీ చేయించుకోవడానికి వెళ్ళింది. ఆశ్చర్యం! యాంజియోగ్రఫీ రిపోర్టు నార్మల్ అని వచ్చింది. ఆమెకు బైపాస్ సర్జరీ అవసరం లేకుండా బాబా కాపాడారు.

1996వ సంవత్సరంలో ఒకసారి రవీంద్ర డోంబివలీలో ఉన్న తన సోదరుడిని చూడటానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు థానే స్టేషన్‌లో సాధారణంగా ట్రైన్ ఆగాల్సిన ప్లాట్‌ఫాం పైన ఆగకుండా అవతలివైపు ప్లాట్‌ఫాం పైన ఆగింది. చాలా రద్దీగా ఉండటం వలన రవీంద్ర ప్లాట్‌ఫాం పైకి దిగలేక మరోవైపు దిగాడు. అవతలి ప్లాట్‌ఫాం వైపు వెళ్తుండగా అనుకోకుండా అతని కాలు ఒక మురికిగుంటలో దిగబడిపోయింది. అందువలన అతను ప్లాట్‌ఫాం పైకి ఎక్కలేకపోయాడు. అంతలో మరో రైలు ఆ ప్లాట్‌ఫాం మీదకి వస్తూ ఉంది. రైలు వేగంగా అతనిని సమీపిస్తున్నందున అక్కడున్న ప్రజలు త్వరగా ప్లాట్‌ఫాం పైకి రమ్మని అరిచారు. ఏమి జరుగుతోందో ఊహకు అందని స్థితిలో రవీంద్ర చాలా భయపడ్డాడు. హఠాత్తుగా ఎవరో తనను ప్లాట్‌ఫాంపైకి నెడుతున్నట్లు అతనికి అనిపించింది. అతను ప్లాట్‌ఫాం మీదకి వచ్చిన మరుక్షణంలో రైలు క్రాస్ అయింది. తనను పైకి నెట్టి రక్షించినది ఖచ్చితంగా శ్రీసాయిబాబానే తప్ప మరెవరూ కాదని గ్రహించిన రవీంద్ర మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

రవీంద్ర నాచ్నే కుమార్తె స్వాతి వాళ్ళ మామగారికి బదలాపూరులో ఒక ఇల్లు ఉండేది. అయితే అది స్టేషనుకి దూరంగా ఉన్నందున స్టేషనుకి సమీపంలో మరొక ఇల్లు కొనాలని ప్రయత్నించారు. కానీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకరోజు ఆమె బావ/బావమరిది స్నేహితుడు వారి ఇంటికి వచ్చాడు. అతను ఎదుటి వ్యక్తిని చూసి భవిష్యత్తును చెప్పగలిగేవాడు. అతను స్వాతిని చూసి, "ఈమెకు శ్రీసాయిబాబా ఆశీస్సులున్నాయి, అందువలన కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది" అని చెప్పాడు. కొద్దిరోజుల్లో వాళ్ళు స్టేషన్ సమీపంలో ఒక ఇల్లు కొన్నారు. కొన్నిరోజులకి ఆ ఇంటి చుట్టూ భవన నిర్మాణాల సంఖ్య పెరిగింది. ఆ భవంతులు మరియు చెట్లు కారణంగా పగటిపూట కూడా ఇల్లు చీకటిగా ఉండేది. అందువలన ఆ ఇంటిని అమ్మేసి మరో పెద్ద ఇంటిని కొనాలని నిర్ణయించుకున్నారు. చాలామంది కొనుగోలుదారులు ఇల్లు చూడటానికి వచ్చారు కానీ ఎవరూ కొనడానికి సిద్ధపడలేదు. అప్పుడు స్వాతి "కొనుగోలుదారుని పంపించమ"ని  బాబాను ప్రార్థించి, 5 గురువారాలు ఉపవాసం చేస్తానని బాబాకు మ్రొక్కుకుంది. మొదటి గురువారం ఆమె ఆరతి మొదలుపెట్టబోతుండగా ఒక కొనుగోలుదారుడు వచ్చాడు. అతనికి ఇల్లు నచ్చింది. మరుసటి గురువారం అతను వచ్చి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. స్వాతికి కలలో బాబా కనిపించి "ఆందోళన చెందవద్ద"ని చెప్పారు. మూడవ గురువారంనాడు అతడు మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించాడు. నాలుగవ గురువారంనాటికి స్వాతి కొత్త ఇంట్లో ఉంది. ఈ సంఘటన నాచ్నే కుటుంబీకులు ఎక్కడున్నా వారిపై బాబా ఆశీస్సులు సదా ఉన్నాయని స్పష్టం చేస్తుంది.

రవీంద్ర కుమారుడు ముంబయిలోని రిలయన్స్ కాలనీలోని 'రసాయని' అనే ప్రదేశంలో నివసిస్తుండేవాడు. 2000వ సంవత్సరంలో ఒకసారి రవీంద్ర తన కుమారుడి ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీసాయిబాబా లీలామృతాన్ని చవిచూశాడు. రవీంద్ర కొడుకు తండ్రికి ఇష్టమని సార్డిన్స్ చేపలు కొని తీసుకొచ్చాడు. రవీంద్ర వాటిని శుభ్రపరచడంలో నిమగ్నమయ్యాడు. తరువాత అతను థానేకు తిరిగి వచ్చాక అర్థరాత్రి గాఢనిద్రలో ఉన్నప్పుడు సాయిబాబా దర్శనమిచ్చి, "ఆ సార్డిన్స్‌ చేపలను చంపే హక్కు నీకు ఎవరు ఇచ్చారు?" అని అడిగారు. అందుకతను క్షమాపణలు చెప్పి, "మళ్ళీ ఆ తప్పు చేయను" అని బాబాకు మాటిచ్చాడు. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. ఆ సంఘటన తరువాత రవీంద్ర పీతలు, సార్డిన్స్ వంటి జీవమున్న చేపలను తినడం మానేశాడు.

శాంతారాం బల్వంత్ నాచ్నే తానెప్పుడూ సాయిబాబాను కలిసానని ప్రచారం చేసుకునేవాడు కాదు. అతను 1930లో ప్రచురించబడిన శ్రీసాయి ఆత్మకథ(సచ్చరిత్ర) మొదటి ఎడిషన్‌ను కేవలం రెండున్నర రూపాయలకు కొన్నాడు. నాచ్నే కుటుంబీకులు ఆ మొదటి ప్రతిని తమ పూజగదిలో ఉంచి, పూజిస్తూ క్రమంతప్పకుండా చదువుతుండేవారు. 2006వ సంవత్సరంలో రవీంద్ర నాచ్నే ప్రతిరోజూ 2-3 అధ్యాయాలు చదువుతూ శ్రావణమాసం పూర్తయ్యే నాటికి గ్రంథాన్ని పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడు. శ్రావణ ఏకాదశినాడు పక్కింట్లో ఉంటున్న శ్రీఅరుణ్ విశ్వనాథ్ జోగ్లేకర్ "'శ్రీసాయి ఆత్మకథ' మొదటి ముద్రణ ఉందా?" అని రవీంద్రను అడిగారు. అందుకతను, "ఉంది, కానీ నేను పూజ చేసిన తర్వాత దాన్ని తాకను. శ్రావణమాసం పూర్తయిన తరువాత మాత్రమే నేను దాన్ని మీకు చూపించగలను" అని అన్నాడు. అలాగే శ్రావణమాసం ముగిసిన తరువాత అతను ఆ పుస్తకాన్ని చూపించాడు. జోగ్లేకర్ దానిని చూసిన తరువాత పూణేకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు 81 సంవత్సరాల వయస్సులో ఉన్న శ్రీమధుకరరావు జోషీకి ఆ సమాచారాన్ని అందించాడు. ఆ పెద్దాయన, 'ఆ మొదటి ముద్రణ కనీసం శిరిడీ సాయిబాబా సంస్థాన్‌కు కూడా లభించలేదా?' అని తెలుసుకోవడానికి రవీంద్రకు ఫోన్ చేసి, "గత 40 సంవత్సరాలుగా నేను సాయిబాబా యొక్క ఈ పవిత్ర గ్రంథాన్ని ఒక్కసారి తాకాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పటివరకూ దాని జాడ  కనుగొనలేకపోయాను" అని చెప్పి, "మీవద్ద ఉన్న మొదటి ముద్రణను జిరాక్స్ కాపీ తీసుకోవడానికి అనుమతిస్తారా?" అని అడిగాడు. అతని వయస్సు దృష్ట్యా రవీంద్ర అందుకు అంగీకరించాడు. దాంతో అతను జిరాక్స్ కాపీ తీయించమని భారత్ పెట్రోలియం మార్కెటింగ్ మేనేజర్ అయిన శ్రీవివేక్ గుప్తాను పంపారు. రవీంద్ర అతనితో 4 రోజుల్లో ఉన్న గణేశ పూజకు ముందే ఆ పుస్తకాన్ని తిరిగి తెచ్చి ఇవ్వమని చెప్పాడు. ఎందుకంటే గణేశ విగ్రహాన్ని తీసుకురావడానికి ముందు శ్రీసాయి ఆత్మకథకు పూజలు నిర్వహించడం ఆ కుటుంబ ఆచారం. వాళ్ళు అలాగే ఆ పుస్తకాన్ని సమయానికి తిరిగి ఇచ్చారు. ఒక అదనపు కాపీని రవీంద్రకు, మరొకటి శ్రీజోగ్లేకర్‌కు కూడా పంపించారు. వివేక్ గుప్తా తన గురువైన శ్రీచంద్రభాను సత్పతి గారికి ఒక కాపీ ఇచ్చాడు. సత్పతి గారి శిష్యుడు సాయి ఆనంద్ పత్రిక (కాకాసాహెబ్ దీక్షిత్ ట్రస్ట్ ప్రచురించింది) సంపాదకుడు, శ్రీమతి శుభాంగి జవాలె ఆ పవిత్ర గ్రంథ పూజకు వచ్చారు. శ్రీమధుకర్ జోషీ కూడా శ్రీఅనిల్ షాను పంపారు. శ్రీఅనిల్ షా పుణేలో ఉన్న సాయి ఆలయ వార్షికోత్సవానికి రమ్మని రవీంద్ర కుటుంబాన్ని ఆహ్వానించారు. జోగ్లేకర్‌తో కలిసి రవీంద్ర ఆ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ వారు శ్రీఅన్నా అడ్కర్, శ్రీమతి మాయి అడ్కర్, శ్రీరౌత్ వంటి మరికొందరు భక్తులను కలుసుకున్నారు. వారు పూణేలోని శివనేరి సాయిబాబా కార్యక్రమాలకు కూడా హాజరై ఇతర సాయిభక్తులను కూడా కలిశారు. శ్రీమతి జవాలే గారు శ్రీసమీర్ ఫనాసే గారికి రవీంద్రను పరిచయం చేశారు. అతను ఈ రోజుకి కూడా రవీంద్రను సందర్శిస్తున్నారు. రవీంద్ర, శ్రీసమీర్ ఫనాసే మరియు శ్రీసంజయ్ జాదవ్ లు 2007, జూన్ 12న శిరిడీ సందర్శించారు. అక్కడ వాళ్ళు ప్రముఖ రచయిత శ్రీమతి విన్నీ చిట్లూరిని కలిశారు. ఈ భక్తులందరినీ కలవడాన్ని వాళ్ళు నిజంగా ఆనందించారు. ఈ విధంగా శ్రీసాయిబాబా ఎక్కడెక్కడో ఉన్న తమ భక్తులందరినీ కలిపారు.

పిచ్చివాడి బారినుండి బల్వంత్ నాచ్నేను కాపాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ అణ్ణాచించణీకర్‌తో బాబా, "నేను కాస్త ఆలస్యం చేసినట్లయితే ఇతడు చనిపోయేవాడు. నా బిడ్డలను నేను రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారు?" అని చెప్పిన విషయం తెలిసిన రవీంద్ర నాచ్నే ఎప్పుడు శిరిడీ వెళ్లినా చావడిలో శ్రీ&శ్రీమతి అణ్ణాచించణీకర్‌ పేర్లున్న బోర్డువద్ద నిలబడి నమస్కరించడం మర్చిపోయేవాడు కాదు. ఒకసారి చించణీకర్ ఒక సాయిమందిరాన్ని నిర్మించదలచి బాబాను అనుమతి అడిగినప్పుడు బాబా, "చించణీలోనే మందిరం నిర్మించమ"ని చెప్పి, "నేను అక్కడ ఉంటాన"ని హామీ కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని ఏదో పుస్తకంలో చదివిన తరువాత రవీంద్ర ఆ మందిరాన్ని దర్శించాలని అనుకున్నాడు.

2007, జూన్ 6న ఉదయం 9 గంటలకు అకస్మాత్తుగా రవీంద్ర నాచ్నేకి చించణీలోని సాయిమందిరాన్ని దర్శించాలని తీవ్రంగా అనిపించింది. వెంటనే అతడు గం. 9:30 ని.లకి ఉన్న బస్సులో బైండర్ చేరుకున్నాడు. అక్కడ గం.11:18 ని.లకి విరార్ రైలు ఎక్కాడు. విరార్‌లో గం.11:55 ని.లకి దహను వెళ్లే షటిల్ రైలు వచ్చింది. అదెక్కి మధ్యాహ్నం గం.1:15 ని.లకి బోయిసర్ స్టేషన్లో దిగాడు. అక్కడినుండి మందిరానికి వెళ్లాలంటే తూర్పు దిశగా వెళ్లాలా లేక పడమర దిశగా వెళ్లాలా అన్న సందిగ్ధంలో పడ్డాడు రవీంద్ర. అంతలో అక్కడ కూర్చుని ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి, "సాయిమందిరానికి వెళ్లాలంటే ఎటువైపుగా వెళ్ళాలి?" అని అడిగాడు. అందుకా వ్యక్తి, "నేను సాయిబాబా భక్తుడిని. నువ్వు సరైన వ్యక్తినే అడుగుతున్నావు" అని "పడమర వైపుగా వెళ్ళమ"ని రవీంద్రతో చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు: "మందిరం మధ్యాహ్నం 12:30 గంటలకు మూసివేసి మళ్ళీ సాయంత్రం 5:30 గంటలకు తెరుస్తారు. ఒకవేళ నీకు సాయిబాబా పట్ల అంకితభావం ఉంటే, నువ్వు వెళ్లే సమయానికి మందిరం తెరచి ఉండవచ్చు" అని. ఆ తరువాత మందిరానికి ఎలా వెళ్ళాలో కూడా చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. రవీంద్ర బాబాకోసం థానే నుండి కొన్ని పేడాలు కొని తీసుకొచ్చాడు. కానీ, అగరుబత్తీలు, పూలదండలు తేలేదు. అవి తీసుకుందామంటే చుట్టుపక్కల ఎక్కడా దుకాణాలు లేవు. చేసేది లేక అతడు ముందుకు సాగుతూ బస్ డిపో వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఒక పాన్ షాప్ ఉంది. అందులో అతనికి అగరుబత్తీలు దొరికాయి. తరువాత ఒక సందులోకి తిరగగానే ఒక మహిళ పూలదండలు అమ్ముతుండటం చూశాడు. అక్కడికి వెళ్లి ఒక అందమైన మల్లెపూల మాలను తీసుకొన్నాడు. అక్కడ వాంగోన్ నాకా & బోయిసర్ సరిహద్దు వరకు వెళ్ళడానికి 10 మంది ప్రయాణీకులు ఎక్కే వాహనం లభిస్తుందని రవీంద్ర వేచి ఉండగా, సమీపంలో ఉన్న ఒక వ్యక్తి, "ఎక్కడికి వెళ్తున్నార"ని అడిగాడు. "చించణీలో ఉన్న సాయిమందిరానికి వెళుతున్నాన"ని అతను బదులిచ్చాడు. అందుకా వ్యక్తి "అణ్ణాచించణీకర్ అలియాస్ బాబరే నిర్మించిన మందిరమేనా?" అని అడిగాడు. రవీంద్ర "అవున"ని తల ఊపాడు. వెంటనే ఆ వ్యక్తి ఒక రిక్షా మాట్లాడి రవీంద్రను కూడా ఎక్కించుకుని దగ్గరుండి మందిరం ఎక్కడుందో చూపించాడు. ఆనందంతో రవీంద్ర మందిరం ముందున్న మెట్లెక్కుతూ మందిరం మూసి ఉండటం చూసి సాయంత్రం వరకు వేచి ఉందామని నిర్ణయించుకున్నాడు. అయితే మందిర ప్రధాన ద్వారం వద్ద పూజారి, మరికొంతమంది కూర్చుని ఉన్నారు. రవీంద్రను చూసి పూజారి ప్రధానద్వారం తెరిచాడు. రవీంద్ర కాళ్ళుచేతులు కడుక్కుని మందిరం లోపలి వెళ్ళాడు. గర్భగుడి తాళం వేసి ఉన్నందున తాను తీసుకెళ్లిన స్వీట్లు, పూలదండలు, అగరుబత్తీలను అక్కడ ఉంచిన పళ్లెంలో పెట్టాడు. అక్కడున్న ఆడవాళ్లు అది చూసి, "మీరు పూలమాల తెచ్చారా! అలా అయితే మీరు వాటిని సాయిబాబాకు అర్పించడం మంచిది" అన్నారు. అది విన్న పూజారి గర్భగుడి తలుపులు కూడా తెరిచాడు. ఇక రవీంద్ర ఆనందానికి అవధులు లేవు. తన స్వహస్తాలతో అగరుబత్తీలు వెలిగించి, పూలదండ బాబాకు వేసి, పేడాలు నివేదించి బాబాను ప్రార్థించాడు. కనులారా బాబాను దర్శించుకుని ఆనందపరవశుడై బయటకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు పూజారి రవీంద్రతో మాట్లాడుతూ, "సాధారణంగా గురువారం తప్ప ఇతర రోజుల్లో మూసిన తలుపులు మళ్ళీ తెరవము. కానీ వాటిని తెరవమని బాబా ఆదేశించినట్లు అనిపిస్తుంది. సాధారణంగా మేము 12:30 గంటలకు మందిరం పూర్తిగా మూసివేస్తాం. కానీ ఈ రోజు బయట కూర్చుని మాట్లాడుకుంటున్నాం. కొంత భాగం తెరిచి ఉంచడానికి కారణం అదే. ఇదంతా బాబా సంకల్పమే అయివుంటుంది" అని అన్నాడు. తరువాత రవీంద్ర తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ ప్రయాణం కూడా సురక్షితంగా, సంతోషంగా సాగి సాయంత్రం 5 గంటలకు అతను థానేలో తన ఇంటికి చేరుకున్నాడు. శ్రీసాయిబాబా తమ దర్శనం కోసం ఆరాటపడుతూ అంతదూరం ప్రయాణం చేసి వచ్చిన తన భక్తుడిని వేళకానివేళలో తమ దర్శనంతో సంతృప్తి పరిచి తిరిగి సురక్షితంగా తన ఇంటికి చేర్చారు.

source:  Personal Interview with Shri.Ravindra Shantaram Nachane Son of Late Shri.Shantaram Balavant Nachane, and Akhanda Shree Sai Krupa Marathi Book written and published by Shri.Ravindra Shantaram Nachane)
devotees experiences of saibaba by b.v. narasimha swamy.

 


ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి.




నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.

2 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri saijaya Jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo