సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 316వ భాగం


    ఖపర్డే డైరీ - రెండవ భాగం 

7-12-1910

ఉదయం నా ప్రార్థన అయాక, బాలాసాహెబ్ భాటే అనే రిటైర్డ్ మమల్తదారు వాడాకి వచ్చి మాతో మాట్లాడుతూ కూర్చున్నాడు. కొంతకాలం నుంచి ఇక్కడే ఉంటున్న ఇతని ముఖంలో ఒక విశేషమైన ప్రశాంతత ఉంది. సాయి మహారాజు బయటకు వెళుతున్నప్పుడు వారిని చూసి, మధ్యాహ్నం మసీదులో ఉన్న వారి వద్దకు వెళ్ళాం. నేను, బాబాసాహెబ్ సహస్రబుద్ధే, మా అబ్బాయి బాబు, బాపూసాహెబ్ జోగ్, పిల్లలు అందరం కలిసి వెళ్ళి అక్కడ కూర్చున్నాం. సాయి మహారాజు మంచి హాస్యధోరణిలో ఉన్నారు. ఆయన బాబాసాహెబు సహస్రబుద్ధేని "నీవు బొంబాయి నుండే వచ్చావా?" అని అడిగారు. 'అవున'న్నాడు సహస్రబుద్దే. "మళ్ళీ బొంబాయే వెళతావా?" అని అతన్నడిగారు బాబా. సహస్రబుద్దే అవునని చెప్పి, అయితే అక్కడ ఎన్ని రోజులుండేదీ అక్కడి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ విషయం ఖచ్చితంగా చెప్పలేనన్నాడు. సాయి, "అవును నిజమే - నీకు చాలా పనులున్నాయి - ఇంకా ఎన్నో చేపట్టాలి. నువ్విక్కడే ఇంకా నాలుగైదు రోజులుండాలి. నువ్విక్కడే ఉండి నిన్ను నువ్వే చూసుకోవాలి. గడచిన అనుభవాలన్నీ వాస్తవాలే. అవి కల్పనలు కావు. నేనిక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రిందట నుంచీ ఉన్నాను" అని, సాయి మహారాజు నావైపు తిరిగి కొత్త ధోరణిలో స్పష్టంగా ఇలా అన్నారు: "ఈ ప్రపంచం విచిత్రమైంది. అందరూ నా వారే. అందర్నీ నేను సమానంగానే చూస్తాను. అయితే అందులో కొందరు దొంగలవుతారు. వారికి నేనేం చేయగలను? మరణానికి దగ్గరపడుతున్నవారు కూడా ఇతరుల మరణానికి పన్నాగాలు పన్నుతారు. వారు నా మనస్సునెంతో బాధపెడుతున్నారు. వారు నన్నెంతగా బాధిస్తున్నా నేనేం మాట్లాడక, మెదలక ఊరుకుంటున్నాను. భగవంతుడు చాలా గొప్పవాడు. వారి ప్రతినిధులు సర్వత్రా ఉంటారు. వారు ఎంతో శక్తి సంపన్నులు. భగవంతుడిచ్చిన దానితో మనం తృప్తిపడాలి. నేను చాలా శక్తివంతుణ్ణి. నేనిక్కడ ఎనిమిది లేక పదివేల సంవత్సరాల క్రితం కూడా ఉన్నాను". 

తనకు ఇదివరకు చెప్పిన కథను చెప్పమని మా అబ్బాయి సాయినడిగాడు. 'అదేం కథ?' అని అడిగారు బాబా. 'ముగ్గురు సోదరులు మసీదుకు వెళ్ళే కథ' అని సమాధానం ఇచ్చాడు మా అబ్బాయి. అందులో ఒకడు బయటకు వెళ్లి భిక్ష చేయాలని అనుకుంటాడు. భిక్షతో సంపాదించిన ఆహారం పవిత్రమైనది కాదు కనుక, అది వారి చావడిని అపవిత్రం చేస్తుంది కనుక మిగతావారు అందుకు ఒప్పుకోరు. మూడవ సోదరుడు ఆ ఆహారం చావడిని పాడుచేస్తే తన కాళ్ళని ఖండించమని సమాధానమిస్తాడు. సాయి మహారాజు 'ఇది చాలా మంచి కథ' అని చెప్పారు. తనకు చెప్పాలనిపించినప్పుడు మరో కథ చెబుతానన్నారు సాయి. 'అలాంటి సందర్భం ఎప్పుడు వస్తుందో తనకు తెలీదనీ, ఒకవేళ ఆ సందర్భం తను వెళ్ళిపోయాక వస్తే దానివల్ల తనకి అంతగా ప్రయోజనం ఉండదనీ' అన్నాడు మా అబ్బాయి. అప్పుడు సాయిబాబా అతను వెళ్ళేలోపలే ఆ కథను చెప్తానని మాట ఇచ్చారు.

'అంతకుముందురోజు ఎందుకు కోపించార'ని బాబాను నేను అడిగాను. 'నూనె వ్యాపారస్తుడు తననేదో అన్నాడ'ని అన్నారు బాబా. 'కొట్టొద్దు, కొట్టొద్దు' అని ఈరోజు ప్రసాదం పంచే సమయంలో బాబా ఎందుకు అరిచారని నేను అడిగితే, 'పాటిల్ కుటుంబంవారు భాగాలు పంచుకునేందుకు తమలో తాము కొట్లాడుకుంటున్నారనీ, అందుకని అరిచాననీ' అన్నారు బాబా. 

సాయి సాహెబ్ ఎంత మాధుర్యంగా ఎంత అద్భుతంగా మాట్లాడారంటే - పదే పదే అలౌకిక కరుణాపూరిత స్నిగ్ధదరహాసం ఎంతగా ఒలికించారంటే - ఆ సంభాషణ నా జ్ఞాపకాల్లో శాశ్వతంగా ముద్రించుకుపోయింది. దురదృష్టవశాత్తూ ఇతరులెవరో రావటంవల్ల ఆ సంభాషణకు అంతరాయం కల్గింది. మేం చాలా బాధపడ్డాం కానీ, దానికెవరూ ఏమీ చేయలేరు. దీని గురించే మాట్లాడుకుంటూ తిరిగి వచ్చాం. తాత్యాసాహెబ్ నూల్కర్ మొదట్లో అక్కడ లేడు కానీ, సంభాషణ జరిగిన తరువాత వచ్చాడు. బాలాసాహెబ్ భాటే సాయంత్రానికి వచ్చాడు. మేం మళ్ళీ ఆ సంభాషణ గురించే మాట్లాడుకుంటూ కూచున్నాం.

8-12-1910

ఉదయం ప్రార్థన అయ్యాక, సాయి మహారాజుని యథాప్రకారం వారు బయటకువెళ్ళే సమయంలో దర్శించుకున్నాం. తరువాత మధ్యాహ్నం వారి దర్శనానికి వెళ్ళాం గానీ వారు కాళ్ళుకడుక్కుంటూండటం వల్ల మేం వెనక్కి మరలవలసి వచ్చింది. బాబాసాహెబ్ సహస్రబుద్ధే, నేను, మా అబ్బాయి, ఈరోజు ఉదయాన్నే వచ్చిన ఓ పెద్దమనిషి కలిసి వెళ్ళి తిరిగి రావలసి వచ్చింది. తాత్యాసాహెబ్ నూల్కర్ మాతో రాలేదు. తరువాత మేం మళ్ళీ వెళ్ళాం గానీ, సాయి సాహెబ్ మమ్మల్ని వెంటనే పంపేశారు. కనుక మేం తిరిగి వచ్చాం. వారు దేన్ని గురించో ఆలోచిస్తూ అందులో తీవ్రంగా నిమగ్నమైనట్లనిపించింది. రాత్రి సాయి సాహెబ్ చావడిలో నిద్రిస్తారు. ఆ చావడి ఉత్సవాన్ని చూసేందుకు వెళ్ళాం. అది చాలా బావుంది. 

పైన నేను పేర్కొన్న ఆ పెద్దమనిషి ఒక పోలీసు ఆఫీసరు, హెడ్ కానిస్టేబుల్ అనుకుంటాను. ఆయనపై డబ్బు సంగ్రహించాడన్న దోషారోపణ చేయబడటం వల్ల సెషన్స్ కోర్టు అతని కోసం గాలిస్తున్నది. తాను నిర్దోషిగా నిరూపించబడితే సాయి మహారాజుని దర్శించుకుంటానని అతను మొక్కుకున్నాడు. అతను నిర్దోషి అని నిరూపించబడింది కనుక తన మొక్కుని తీర్చుకునేందుకు వచ్చాడట. అతన్ని చూడగానే సాయి మహారాజు బాధపడినట్లు కనిపించి ఇలా చెప్పారు: "అక్కడ మరికొద్ది రోజులు ఎందుకుండలేదు? పాపం ఆ పిచ్చివాళ్ళు నిరుత్సాహపడి ఉంటారు". దీన్నే మళ్ళీ రెండుసార్లన్నారు. తరువాత మాకు తెలిసింది, ఆ పెద్దమనిషి స్నేహితులు అతన్ని ఉండమని ఎంతో బలవంతం చేసినా వారి అర్థింపును ఇతను పట్టించుకోలేదట. అతను సాయిబాబాను అంతకుముందు చూడలేదు. బాబా కూడా అతన్ని అంతకుముందు చూడలేదు. అయితే సాయి మహారాజుకి అతను ఎవరన్నదీ, ఏం చేశాడన్నదీ ఎలా తెలుసనేదే ఆశ్చర్యం.

తరువాయి భాగం రేపు ......

    source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo