సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - అసలైన సాయిబాట! అందరకూ రాచబాట!



అసలైన సాయిబాట! అందరకూ రాచబాట!

మౌళికమైన ఆధ్యాత్మిక సూత్రాలు ఎన్నడూ మారవు! కానీ, శాశ్వతము సనాతనము అయిన ఆ ఆధ్యాత్మికసూత్రాల ఆచరణకు ‘సుళువులుగ’ ఆయా దేశకాలపరిస్థితులకు అనుగుణంగా మహాత్ములు యేర్పరచిన ఆచారవ్యవహారాలు మాత్రం కాలక్రమంలో మార్పుచెందక తప్పవు! మన దేహంలో సత్త్వం కోల్పోయిన నిర్జీవకణాలు ఎప్పటికప్పుడు విసర్జింపబడి, వాటి స్థానే క్రొత్త జీవకణాలు తయారవుతూ వున్నట్లు, సమాజమనే దేహంలో ఎప్పుడో యేర్పడిన బాహ్యాచారవ్యవహారాలు కాలగతిలో అర్థరహితము నిర్జీవము అయినప్పుడు, అవతారపురుషులయిన సద్గురుమూర్తులు ఉద్భవించి సమాజంలోని ఆ నిర్జీవ సంప్రదాయాలను తొలగించి, నూతన సాంప్రదాయాలను పాదుగొల్పి, ఆధ్యాత్మికతకు ప్రాణమైన సనాతన ధర్మసూత్రాన్ని కాపాడుతుంటారు. ఇది సృష్టిధర్మం; జీవధర్మం. “సంభవామి యుగే యుగే” అని శ్రీకృష్ణుడు చెప్పింది యీ సృష్టి‘ధర్మ’సూత్రం గూర్చే! కానీ ఆ సద్గురుమూర్తులు సమాజంలో ఆ ‘మార్పులను’ సాధించడానికి ఉద్యమించినప్పుడు, వారి ప్రయత్నాలు ఆయాకాలాలలో సాంప్రదాయవిరుద్ధమైన భ్రష్టాచారాలుగ పరిగణింపబడ్డాయి. అందుకే తాను బోధించేది ‘ఉపనిషత్తుల సారమైన సనాతన ధర్మాన్నే’నని గీతాచార్యుడు మళ్ళీ మళ్ళీ నొక్కివక్కాణించవలసివచ్చింది.

అలాగే, “నేను సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయడానికి కాదు వచ్చింది; దాన్ని పరిపూర్ణం చేయడానికే!” (“I come not to destroy the law, but to fulfil it”) అని ఏసుప్రభువు ప్రకటించి, ఆయన సంస్కరణలను ప్రతిఘటించిన ఆనాటి ఛాందసులను శాంతపరచే ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఆ యుగపురుషులు తమతమ ‘నూతన’ మార్గాలను ఆవిష్కరించినప్పుడు, అప్పటికి జవసత్త్వాలు కోల్పోయి, కేవలం యాంత్రికంగా మిగిలిన ‘ఆచారవ్యవహారాలు మతధర్మాలే’ సత్యమని మూర్ఖంగా నమ్మిన ఛాందసులనుండి ప్రతిఘటన తప్పలేదు. అప్పట్లో అలాంటి ఛాందసులే బుద్ధభగవానుని ప్రబోధాలను ‘నాస్తిక పాషాండమతం’గా దూషించి ప్రచారం చేసారు. ఆ వెర్రి ఎంతవరకు వెళ్ళిందంటే, బుద్ధుణ్ణి ఒక దొంగగా శ్రీరాముని చేత దూషింపచేసేంత వరకు వెళ్ళింది! వాల్మీకిరామాయణం (అయోధ్యకాండ 110-34)లో శ్రీరాముడు ఇలా అంటాడు: “యథా హి చోరస్య తథాహి బుద్ధః తథాగతం నాస్తిక మత్ర విద్ది!...” అని. అంటే, 'బుద్ధుడు ఒక చోరుడు; ఆ తథాగతుని మతం నాస్తికము, గర్హ్యము'౼ అని రాముడంటున్నాడు! కొంచెం ఆలోచిస్తే, ఎవడో బుద్ధిహీనుడయిన ఛాందస వైదికమతోన్మాది, శ్రీరాముడి తర్వాత ఎంతోకాలానికి బుద్ధుడు జన్మించాడనే విషయం కూడా యోచించక, బౌద్ధమతంపైని ద్వేషంతో యీ శ్లోకం కల్పించి, ‘వాల్మీకి రామాయణం’లో చొప్పించినాడని ఇట్టే స్పష్టమవుతుంది. కానీ, అది ప్రతిఘటనలో ఒక దశ మాత్రమే. బుద్ధుని ప్రబోధాల ప్రచండ ప్రభంజనాన్ని దూషణతో ఎదుర్కొనలేమని గుర్తించిన బుద్ధిమంతులు ఆ తరువాతి కాలంలో బుద్ధుణ్ణి విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారంగా అవతారాల జాబితాలో చేర్చి, ... సరి! అదొక పెద్ద కథ! ఇక ఆ విషయం వదలి బాబా విషయానికొద్దాం!

“ఆమ్ చా ఘరాణె నిరాళా ఆహేత్!” 'మా సాంప్రదాయమే వేరు!' అన్నారు శ్రీసాయిబాబా! వేరంటే, దేన్నుండి వేరు? ఈనాడు ఆధ్యాత్మికత పేరున, సనాతన సంప్రదాయం పేరున చలామణి అవుతున్న మూఢనమ్మకాలు, దురాచారాలు, వ్యర్ధఆచారకాండ మొదలైనవాటి నుండి వేరు! అలాంటి విశిష్ఠమైన ఒక నూతన సంప్రదాయాన్ని ఈ యుగధర్మంగా శ్రీసాయిబాబా ప్రబోధించారు. అందుకనే శ్రీసాయిబాబా భౌతికరూపంతో సంచరించిన కాలంలో ఆయనకు ఇటు హిందూ, అటు ముస్లిం మతాలకు చెందిన ఛాందసుల నుండి ప్రతిఘటన ప్రాతికూల్యం తప్పలేదు. ప్రచండమైన సాయి మహిమ యొక్క ప్రాబల్యాన్ని తట్టుకోలేక ఆ ప్రతిఘటన బాబా కూడా పరమ వైదిక సంప్రదాయ ప్రవర్తకుడనే ప్రచారంగా రూపుమార్చుకొన్నది. 

బాబా యేనాడూ మంత్రోపదేశాలు చేయలేదు. సరికదా, ఇతరుల వద్దకు మంత్రోపదేశాలకై పరుగులిడటాన్ని కూడా ఆయన అంగీకరించలేదు. అలాంటిది, ఈనాడు శ్రీసాయి పేరున ‘మంత్రోపదేశాలు’ చేస్తున్న గురుస్వాములు మన మధ్యనున్నారు. మడి మైల అంటరానితనం కులతత్వం ఉపవాసాలు మొదలైన ఆచారకాండను బాబా నిర్ద్వంద్వంగా నిరసిస్తే, ఆ దురాచారాలన్నీ యీనాడు సాయిసాంప్రదాయంలో సాయిమందిరాల్లో చొప్పించబడటం మనం చూస్తున్నాం. ‘నేనెప్పుడూ చమత్కారాలు చెయ్యను’ అన్న శ్రీసాయినే తమ ‘కులదైవం’గా చెప్పుకుంటూ, తమ వృత్తులను నిరాటంకంగా చేసుకుంటున్న జోస్యాలరాయుళ్ళు, ‘ప్రశ్నల’ పరమహంసలు చెట్టుకొకరు పుట్టకొకరుగా పుట్టుకొస్తూనే వున్నారు. ‘సద్గురువుకు అనన్యంగా శరణాగతి’ చెందమని బాబా చెప్పిన ఉపాసన, అందరి దేవతలు ఒకటేనన్న విశాలదృక్పథం ‘పేరున’, శివరామకృష్ణగణేశదత్తమారుత్యాది రూపాలతోపాటు బాబాను కూడా చేర్చి అందరినీ మూకుమ్మడిగా పూజించే పద్ధతికి మారింది. మనస్సు వివిధ రూపాలు ధరించటం మాని, ఒకే రూపం ధరించడం ద్వారా చైతన్యఘనత లేక బ్రహ్మతథాకారవృత్తి సిద్ధిస్తుందని బాబా చెప్పిన ఉపాసనారహస్యం మరవడం వల్ల ఎందరో సాయిభక్తుల పూజామందిరాలు వివిధ దేవతామూర్తుల చిత్రపటాల ప్రదర్శనశాలలుగా మారుతున్నాయి. సాయిభక్తులందరు వివేకంతో ఈ పరిణామాలను గమనించి ఆత్మవిమర్శన చేసుకుంటూ, నిజమైన సాయిసాంప్రదాయమేమిటో విచారించి తెలుసుకొని ముందుకు సాగాలి! అలా ముందుకు సాగనీయకుండా అడ్డుపడే బూజుపట్టిన ఆచారవ్యవహారాలపట్ల మనకుండే మూర్ఖమైన మూఢవిశ్వాసమే మనలోని మహిషతత్త్వం. ఆ మూఢాచారాలను సమాజంలో ప్రచారం చేసేవారే ఆ మహిషతత్త్వం మూర్తీభవించిన మహిషాసురులు. మన ఆధ్యాత్మిక పురోగమనానికి నిరోధమయిన ఈ మహిషతత్త్వాన్ని ఒకరూపంలో జయిస్తే అది మరోరూపంలో తలెత్తుతూనే ఉంటుంది – మహిషాసురుని ప్రతి రక్తం బొట్టులో నుండి మరో మహిషాసురుడు పుట్టి విజృంభించినట్లుగ! మనలోని త్రికరణాలను ఏకం చేసి, ఒక మహిషాసుర మర్దన శక్తిగా రూపొందింపజేసుకొని, సాయిభక్తి వివేకము నిష్ట-సబూరీలనే ఆయుధాలతో పోరినపుడే ఆ మహిషాసుర మర్దనం జరుగుతుంది. అది జరిగిననాడే మనకు నిజమయిన విజయదశమి!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

3 comments:

  1. om sai please give me good thougths.be with me.bless my daugther',son ,hubby with good health and long life.be with them and bless them to

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo