సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 9వ భాగం


సాయి అనుగ్రహం - తిరిగివచ్చిన ప్రాణం

సాయిబాబా భక్తులందరికీ అటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు వుంటాయని నాకు ఖచ్చితంగా తెలుసు. దాని ఫలితంగానే బాబా పేరుప్రతిష్ఠలు ఖండ ఖండాంతరాలకు వ్యాపించాయి. ఒకసారి నేను న్యూఢిల్లీకి దగ్గరలో వున్న ఛత్తర్పూర్ శ్రీసాయిమందిరానికి సంబంధించిన బాబా భక్తురాలు మిస్. భకునీని కలుసుకోవడం జరిగింది. ఆమె సాహిత్యంలో సాయిబాబాపై గొప్ప పరిశోధన(పి.హెచ్.డి.) పూర్తిచేసింది. వారు నడిపే ట్రస్ట్ ద్వారా హిందీలో ఒక త్రైమాసిక పత్రిక ప్రచురించేవారు. ఆ పత్రిక చాలా విజ్ఞానదాయకంగా ఉండేది.

సాయిబాబా సశరీరులుగా ఉన్న కాలంలో, ముఖ్యంగా దాసగణు మహరాజ్ వల్ల బాబా బోధనలు ముంబయి, మహారాష్ట్రలలో బాగా వ్యాప్తి చెందాయి. బాబా ఆయనను 'గణ్యా' అని పిలిచేవారు. దాసగణు తన కీర్తనల ద్వారా బాబా లీలలను భక్తుల హృదయాలపై ప్రభావం చూపేలా వివరించి, బాబా బోధనలను సామాన్య ప్రజానీకంలోకి వ్యాపింపచేశారు. 

దాసగణు శిరిడీ, దాని చుట్టుప్రక్కల గ్రామాలలో హరికథలు చెప్పటానికి బయలుదేరేముందు బాబా ఆశీస్సులు తీసుకొని బయలుదేరేవారు. ఒకసారి దాసగణు శిరిడీలో ఉన్నప్పుడు, శిరిడీకి దగ్గరలోవున్న గ్రామంలో హరికథ చెప్పమని ఆయనను ఆహ్వానించారు. దాసగణు ఆరోజు మధ్యాహ్నం సాయిబాబా వద్దకు వెళ్ళి, సాయంత్రం దగ్గరలోనున్న గ్రామంలో హరికథ చెప్పటానికి వెళుతున్నానని, బాబా ఆశీస్సులు కావాలని ప్రార్థించాడు. బాబా ఆయనతో నిరభ్యంతరంగా వెళ్ళవచ్చుననీ, కానీ తనతో పాటు భావూను (మా నాన్నగారిని) కూడా తీసుకువెళ్ళమని అన్నారు. భావూను తనతో తీసుకునివెళ్ళడానికి అభ్యంతరమేమీ లేదనీ, కానీ ప్రతిరోజు సాయంత్రం మసీదులో పెట్రోమాక్స్ లైట్లు వెలిగించే భావూ పనిని ఆటంకపరచడం తనకు ఇష్టం లేదని దాసగణు చెప్పారు. ఇది వినగానే బాబా దాసగణుతో, ఆ విషయం గురించి అతడు పట్టించుకోవలసిన అవసరం లేదని, ఆ పని ఇంకెవరైనా చేస్తారనీ, కానీ భావూను తప్పకుండా తనతో తీసుకువెళ్ళమని మరీ మరీ చెప్పారు. దాసగణు, అక్కడే ఉన్న మా నాన్నగారు అది బాబా ఆజ్ఞ అని అర్థం చేసుకున్నారు.

ఆ సాయంత్రం, వారు శిరిడీకి 7, 8 కిలోమీటర్ల దూరంలో వున్న గ్రామానికి బయలుదేరి వెళ్ళారు. ఇప్పటిలాగా ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు లేకపోవడం వల్ల వారు కాలినడకనే ఆ గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. వారు ఆ గ్రామంలోకి ప్రవేశించేసరికి, సూర్యాస్తమయం అయింది. మామూలుగా దాసగణు హరికథ ప్రారంభించేముందు, ఒక చిన్నబల్లమీద బాబా చిత్రపటం ఉంచి, దానికి పూలమాల వేసి కీర్తన మొదలుపెట్టేవారు. ఆరోజు కూడా వారు చాపలను నేలమీద పరచి, ఒక బల్లమీద బాబా చిత్రపటాన్ని ఉంచి పూలమాల వేశారు. పెట్రోమాక్స్ లైట్లు వెలిగించి నాలుగుమూలలా వ్రేలాడదీశారు. గ్రామస్థులందరూ సమావేశమయ్యాక దాసగణు హరికథ మొదలుపెట్టారు. 

ఒక గంటసేపటి తరువాత బాగా ప్రొద్దుపోయాక వారు ఒక సంకటస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. నల్లటి శరీరఛాయలో వున్న సుమారు 7, 8 మంది భిల్లజాతివారు అటువైపుగా వచ్చారు. వారు తమ భుజాలమీద ఒక శవాన్ని మోసుకొని, అంతిమసంస్కారాలు పూర్తిచేయడానికి స్మశానానికి వెళుతున్నారు. వారి నాయకుడు దాసగణు మహరాజ్ వద్దకు వచ్చి, ఆయనను బెదిరించి, “ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ ఫోటోలో ఉన్నది ఎవరు?” అని ప్రశ్నించాడు. అది శ్రీసాయిబాబా ఫోటో అని, వారు శిరిడీలో ఉంటారని, తను ఆయనను గురువుగా మరియు దైవంగా పూజిస్తానని దాసగణు చాలా వినయంగా సమాధానం చెప్పారు. సాయిబాబా పేదలకు మందులిచ్చి వారి బాధలను తొలగిస్తారని కూడా దాసగణు చెప్పారు. తను తన దైవమైన బాబా కీర్తన చేస్తున్నానని, దానివలన గ్రామస్థులకు సంతోషం కలుగుతుందని వివరించారు. అప్పుడు ఆ భిల్లనాయకుడు తన తోటివారితో శవాన్ని క్రిందకు దించమని చెప్పి, దాసగణుతో, “నీ దైవమైన బాబా నిజంగా అంత శక్తిమంతుడే అయితే ఆ శవానికి తిరిగి ప్రాణం పొయ్యగలరా?” అన్నాడు.

ఆ భిల్లనాయకుడు దాసగణుకు అలా సవాలు విసిరి, అలా చేయలేకపోతే దాసగణుని, ఆయన హరికథ వినడానికి వచ్చినవారిని కూడా చంపేస్తానని బెదిరించాడు. దాసగణు విపరీతంగా భయపడిపోయి మా నాన్నగారి దగ్గరకు వెళ్ళి, ఆయన సలహా అడిగారు. మా నాన్నగారు, బహుశా ఇదంతా బాబా లీల అయివుండవచ్చునని గ్రహించి, తమను రక్షించమని బాబానే వేడుకోవాలని అనుకున్నారు. ఆయన దాసగణుతో, ఆయన వ్రాసిన ప్రముఖ ఆరతులలో ఒకటయిన “సాయి రహమ్ నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా” పాడమని, మిగిలినది బాబాకే వదలివేయమని చెప్పారు. అప్పుడు దాసగణు ఆ బాబా ఆరతిని పాడటం ప్రారంభించారు. దానిలో ఆయన ఎంతగా తన్మయత్వం చెందారంటే, అందులో లీనమైపోయి నృత్యం చేస్తున్నారు. గ్రామస్థులు కూడా ఆయనతో జత కలిపారు. దాసగణుని అంతటి తన్మయ స్థితిలో మా నాన్నగారు ఇంతకుముందెన్నడూ చూడలేదు. మా నాన్నగారి దృష్టి మాత్రం శవం మీదనే వుంది. సుమారు ఒక గంటసేపు గడిచింది. సరిగా అప్పుడే అనుకోని అద్బుతం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తికి ప్రాణం తిరిగి వచ్చి, తన కట్లను తెంచుకుని, లేచి కూర్చుని, తన రెండు చేతులతో భజన చేస్తూ అందరితో కలసి బాబా కీర్తనలో పాలుపంచుకున్నాడు. అదిచూసి మా నాన్నగారు పరమానందభరితులయ్యారు. భిల్లులు లేచి నిలబడ్డారు. ఆ ప్రాణం తిరిగి వచ్చిన వ్యక్తి లేచి నిలబడటానికి వారు సహాయం చేసారు. ఆ తరువాత వారు అతడితో దాసగణుకు నమస్కారం చేయమని చెప్పారు. తరువాత సాయిబాబా గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని, తాము తప్పకుండా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటామని వాగ్దానం చేశారు.

మరునాడు దాసగణు, మా నాన్నగారు మసీదుకు వెళ్ళినప్పుడు బాబా, "గణ్యా! నిన్న భావూ(మా నాన్నగారు) నీతోపాటు ఉన్నాడు. లేకపోతే ఆ భిల్లుల ఆగ్రహావేశాలనుండి నిన్ను రక్షించేవారెవరు?” అన్నారు. ఇది వినగానే ఇద్దరూ బాబాతో, అదంతా ఆయన లీలావినోదమేనని, అటువంటి పరిస్థితుల్లో తాము పూర్తిగా వారి మీదే ఆధారపడ్డామని, ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహ వర్షం తమపై కురిపిస్తూ ఉండాలని వేడుకున్నారు.

ప్రియమైన పాఠకులారా! ఇక్కడ మీకు చాలా సందేహాలు కలగడం సహజం. మీరందరూ ఈ బాబాలీలను ఎటువంటి సందేహాలు లేకుండా నమ్మండి. అసలు విషయమేమిటంటే హరికథ చెప్పేటప్పుడు ఏమి జరుగబోయేది బాబాకు ముందే తెలుసుండొచ్చు లేదా దాసగణులో నమ్మకాన్ని పెంపొందించడానికి అదంతా బాబా సృష్టించిన లీల అయినా కావచ్చు. తన భక్తులను తన దగ్గరకు ఎలా లాక్కోవాలో బాబాకు బాగా తెలుసు. ఇది అలా నిరంతరం కొనసాగుతూనే వుంటుంది. మనం బాబాపై దృఢమైన నమ్మకాన్ని ఉంచుకోవాలి.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.


4 comments:

  1. ఓం శ్రీ సాయిరాం జీ 🙏

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo