1. బాబా తెలిపిన ఆమోదం
2. షష్టిపూర్తి వేడుకను జరిపించిన బాబా
3. బాబాపై నమ్మకముంచితే, ఆయన మన బాగోగులు చూసుకుంటారు
బాబా తెలిపిన ఆమోదం
నా పేరు సూర్యనారాయణమూర్తి. నేను హైదరాబాద్ నివాసిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను 2021లో కరోనా సెకండ్ వేవ్ భయం కారణంగా 3 నెలలు ఆఫీసుకి వెళ్ళలేదు. కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేసుకున్న 14 రోజుల తరువాత 2021, జులై 11న నేను, 'రేపటినుండి ఆఫీసుకి వెళదామ'ని నిర్ణయించుకున్నాను. కానీ మనసులో ఎన్నో సందేహాలు, భయాలు. ఆశ్చర్యకరంగా, మరుసటిరోజు ఉదయం నేను మంచం మీద నుండి లేచే సమయానికి బంగారు వర్ణంలో ఉన్న ఒక చేయి నన్ను ఆశీర్వదిస్తునట్లుగా నాకు అనిపించింది. నేను అది ఆఫీసుకి వెళ్లడానికి బాబా అనుమతిగా భావించి, 'ఈరోజు బ్లాగులో నేను కొంతకాలం క్రితం పంపిన ఎఱ్ఱగుడి బాబా మందిర విశేషాలు పబ్లిష్ అయినట్లయితే గనక బాబా నా నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆమోదించినట్లు' అని నా మనస్సులో అనుకున్నాను. తరువాత నేను వాట్సాప్ తెరచి ఆశ్చర్యపోయాను. అక్కడ, నేను పంపిన 'ఎఱ్ఱగుడి బాబా మందిర విశేషాలు' ఈరోజు పబ్లిష్ చేశామని తెలియజేస్తూ దానికి సంబంధించిన బ్లాగు లింక్ ఉంది. బాబా ప్రేమకు నేను కన్నీళ్ళపర్యంతమయ్యాను. అంతేకాదు, అదేరోజు సాయంత్రం 'సాయి మహరాజ్ సన్నిధి' వాట్సాప్ గ్రూపులో 'పనికే మొదటి ప్రాధాన్యత' అన్న క్రింద ఇవ్వబడిన శరశ్చంద్రికలకు సంబంధించిన మెసేజ్ ద్వారా బాబా మరోసారి తమ ఆమోదాన్ని నిర్ధారించారు.
'🔥 *పనిచెయ్యి, సద్గ్రంథాలు చదువు, దేవుని నామం ఉచ్ఛరించు* - శ్రీసాయిబాబా
🌼భక్తుడు: గురువుగారూ! బాబా చరిత్రలో బాబా ఎప్పుడైనా ఎవ్వరికైనా ధ్యానం చేసుకోమని సూచించారా?
🌹గురువుగారు: *“ధ్యానం చేయి, సద్గ్రంథాలు చదువు, పనిచెయ్యి"* అని మాత్రమే బాబా చెప్పారు. *పనిచెయ్యి, భగవంతుని స్మరించు, మంచి గ్రంథాలు చదువు* - ఇదీ బాబా చెప్పిన అసలు క్రమం. ఆయన ఈ మూడింటిని చెప్పారు.
🌼భక్తుడు: బాబా ఈ మూడింటినీ ఒక ఖచ్చితమైన క్రమంలో చెప్పారంటున్నారా, గురువుగారూ?
🌹గురువుగారు: అవును, పనిచెయ్యడం మొదటిది. అందుకనే నేను ఆ క్రమాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాను.
🌼భక్తుడు: బాబా పనిచెయ్యడాన్ని మొదటగా ఎందుకు చెప్పారు?
🌹గురువుగారు: ఎందుకంటే, నిరంతరం బాబాను స్మరించడం, ఆయనను ధ్యానించడం సామాన్య జనానికి సాధ్యంకాదు. ఆ మాటకొస్తే మంచి పుస్తకాలు చదవడం కూడా అంతే. ఎందుకనో చాలామంది పనిచెయ్యడాన్ని ఒక శాపంగా భావిస్తారు. దేవుడు (తాము సృష్టించిన తొలి మానవులైన) ఆడమ్ మరియు ఈవ్లకు పనిని ఒక దండనగా విధించినట్లు, అందువలన వాళ్ళు చెమటోడ్చి తమ ఆహారాన్ని సంపాదించుకోవలసి వచ్చిందని బైబిల్లో ఉంది. కానీ నేను మాత్రం పని ఒక వరంగా భావిస్తాను. మనం కష్టపడి సంపాదించుకున్నది అది ఎండిపోయిన రొట్టె అయినా సరే, దాని మాధుర్యం దానికుంటుంది, దానిని తినడంలో ఒక సంతృప్తి ఉంటుంది. అందుకనే పనిచెయ్యడానికి నేను తొలి ప్రాధాన్యతనిస్తాను. మనం పనిచేసి సంపాదించుకోవాలి. అలా కాకపోతే, మీరు భవిష్యత్తు కోసం అట్టిపెట్టుకున్న ధనమో లేక పెన్షనో ఉంటే మీరు దానితో జీవించవచ్చు. అలా అయితే సమస్య లేదు. నేను నా పెన్షనుతో, నా స్వంత సంపాదనతో జీవిస్తున్నాను. కానీ, మొదటగా పనిచెయ్యడానికే నేను ప్రాముఖ్యతనిస్తాను. *బద్ధకంగా ఉంటూ మీ కాలాన్ని వ్యర్థంగా గడిపేయవద్దు.*
- శ్రీబాబూజీ (శరశ్చంద్రికలు, పని - ప్రేమకు ఓ చక్కని వ్యక్తీకరణ)'.
ఈ అనుభవంతో నాపై, మన బ్లాగుపై బాబాకున్న ప్రేమను అనుభూతి చెంది ఎంతగానో ఆనందించాను. ఆ ఆనందాన్ని పంచుకోవాలని బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ఫోన్ చేశాను, కానీ ఫోన్ కలవలేదు. అయితే ఆ ఆనందాన్ని పంచుకోకుండా ఆగలేక వెంటనే నా ఆనందానికి అక్షర రూపమిచ్చి మీ అందరితో పంచుకోవాలని సాయికి పంపాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".
షష్టిపూర్తి వేడుకను జరిపించిన బాబా
ఓం శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
ముందుగా, మన సద్గురు సాయినాథునికి శతకోటి నమస్కారాలు. శ్రీసాయిబంధువులందరికీ నమస్కారాలు. నేను ప్రతిరోజూ ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలన్నీ చదువుతూ బాబా ప్రేమను ఆస్వాదిస్తున్నాను. నేనిప్పుడు మొదటిసారి బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. నా పేరు పద్మ. తమిళనాడులోని హోసూర్ నా నివాసం. నేను పదిహేనేళ్ళుగా బాబా భక్తురాలిని. బాబా కృపతో నేను ఐదుసార్లు శిరిడీ సందర్శించాను. నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం. ఆయనపట్ల నాకు అత్యంత విశ్వాసం. నేను గత పదేళ్లుగా నిత్యమూ ఇంట్లో బాబాను ఆరాధిస్తూ, ప్రతి గురువారం ఆయన మూర్తికి పాలాభిషేకం చేసి భక్తిశ్రద్ధలతో పూజించుకుంటున్నాను. బాబా నాకు ఎంతో మేలు చేశారు. మా నాన్నకి 92 ఏళ్ళు, అమ్మకి 82 ఏళ్ళు. వాళ్లకి మేము ఐదుగురం పిల్లలం. మా అమ్మానాన్నలకి షష్టిపూర్తి చేయాలని నాకు ఒక కోరిక ఉండేది. అయితే, మా అక్కచెల్లెళ్ళను, అన్నదమ్ములను పిలిచి, అందరినీ ఒకచోట చేర్చి షష్టిపూర్తి జరపడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో అమ్మానాన్నల షష్టిపూర్తి బాగా జరిగేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే 2021, జులై 9న అమ్మానాన్నల షష్టిపూర్తి వేడుక జరిపించేలా బాబా అనుగ్రహించారు. నేను ప్రతిక్షణం 'బాబా, బాబా' అని తలచుకుంటూ, "మీరు అండగా ఉండి వేడుక బాగా జరిపించాల"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా చాలా బాగా వేడుక జరిపించి మమ్మల్ని ఎంతగానో అనుగ్రహించారు. తరువాత ఈ అనుభవాన్ని ఎలా మీ అందరితో పంచుకోవాలో తెలియక మధనపడినప్పుడు కూడా ఒక వ్యక్తి ద్వారా బాబా నాకు సహాయం చేశారు. "కోటానుకోట్ల ధన్యవాదాలు బాబా".
బాబాపై నమ్మకముంచితే, ఆయన మన బాగోగులు చూసుకుంటారు
నా పేరు పద్మావతి. ఐ లవ్ సాయిబాబా. నేను చాలా సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. బాబాపై భక్తి కుదరడం నా అదృష్టం. బాబా ఆశీస్సులతో నేను ఐదుసార్లు శిరిడీ దర్శించాను. సాయిభక్తులకి ఈ బ్లాగ్ ఒక వరం. దీన్ని బాబా నాకు పరిచయం చేశారు. ఇకపోతే, బాబా నా కాలినొప్పిని తగ్గించి, తమ భక్తురాలిగా చేసుకున్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఒకప్పుడు నా ఎడమకాలికి గాయమై, కాలు బాగా వాచిపోయి, ఎర్రగా కమిలిపోయినట్లు అయిపోయింది. ఆ కారణంగా నేను నడవలేకపోయాను. ఒకవేళ నడవడానికి ప్రయత్నిస్తే చాలా నొప్పిగా ఉండేది. అందువలన నేను మంచం పట్టాను. మందులేవీ పనిచేయలేదు. అటువంటి స్థితిలో నేను చేతికర్ర సహాయంతో నొప్పిని భరిస్తూ బాబా దర్శనానికి శిరిడీ వెళ్లి బాబాను చూస్తూనే ఏడ్చేశాను. శిరిడీ నుండి నేను ఇంటికి తిరిగి వచ్చాక బాబా ఒక హోమియోపతి డాక్టరుని చూపించారు. ఆరేళ్లపాటు అతను నాకు మందులిచ్చారు. నేను బాబాపై విశ్వాసముంచి అతనిచ్చిన మందులు వాడాను. నేను ఆ మందులతో పాటు బాబా ఊదీ తీసుకుంటూ ఉండేదాన్ని. కొద్దిగా ఊదీని నుదుటన పెట్టుకుని, మరికొంత ఊదీని నా కాళ్ళకు రాసుకుంటూ ఉండేదాన్ని. బాబా క్రమంగా నా కాలినొప్పిని తగ్గించారు. ఎంతో బాధను అనుభవింపజేసిన ఆ కాలినొప్పి నా జీవితాన్ని మలుపు తిప్పింది. నన్ను బాబాకి భక్తురాలిని చేసింది. ఇప్పుడు నేను మహాపారాయణలో సభ్యురాలిని కూడా. మనం బాబాపై నమ్మకముంచితే, ఆయన మన బాగోగులు చూసుకుంటారు. "ధన్యవాదాలు సాయీ. దయచేసి నా కొడుకుని, కూతురుని, కుటుంబాన్ని ఆశీర్వదించండి. మంచం పట్టిన అమ్మను జాగ్రత్తగా చూసుకోండి".
