- బాబా పట్ల పిల్లలకున్న స్వచ్చమైన ప్రేమ
- జరగబోయే ప్రమాదం నుండి దూరంగా ఉంచి కాపాడిన బాబా
బాబా పట్ల పిల్లలకున్న స్వచ్చమైన ప్రేమ
నేను సాయిభక్తురాలిని. మేము యు.ఏస్. ఏలో నివాసముంటున్నాము. బాబా ప్రసాదించిన మధురమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, ఫిబ్రవరి 22న నేను బాత్రూమ్లో ఉండగా మా పెద్దబాబుకి కడుపునొప్పి వచ్చింది. నేను బయటకు రాగానే నా భర్త, మా చిన్నబాబు నాతో ఆ విషయం చెప్పారు. వెంటనే పెద్దబాబుని దగ్గరకు తీసుకొని, "ఇప్పుడెలా ఉంది?" అని అడిగాను. తను, "ఇప్పుడు తగ్గిపోయింది" అని చెప్పాడు. అంతలో ఆరేళ్ళ మా చిన్నబాబు నా వద్దకు వచ్చి, "మమ్మీ, నేను అన్నయ్యకి బాబా ఊదీ కలిపిన నీళ్లు ఇచ్చాను" అని చెప్పాడు. అది విని నేను ఆశ్చర్యపోయాను. అదే సమయంలో 'పిల్లలు బాబాను ఎంతగా ప్రేమిస్తున్నారో' అని సంతోషించి, వాళ్ళు బాబాను ప్రేమించినంతగా నేను ప్రేమించట్లేదని సిగ్గుపడ్డాను. ఇంతలో పెద్దవాళ్ళం చేసినట్లే ఆ అనుభవాన్ని చిన్నబాబు ఫోన్లో వ్రాశాడు. అది చూసి తను వ్రాసిన విధానానికి ఆనందంతో మాటలు రాక మూగబోయాను. భక్తులు తమ అనుభవాలు వ్రాసుకుంటారన్న అవగాహన కూడా లేని తనకు ఆ ఆలోచన ఎలా వచ్చిందా అని నేను ఆశ్చర్యపోయాను. అంతా బాబా ఆశీర్వాదం. ఆయన అనుగ్రహం లేకుండా మనం ఆయనను తలవలేము. ప్రతిరోజూ మా చిన్నబాబు తప్పనిసరిగా బాబా ఊదీ అడిగి తీసుకుని తింటాడు. వాడు ఊదీని చాక్లెట్లా ఆస్వాదిస్తాడు. నాకు ఎప్పుడైనా నలతగా ఉంటే, నా దగ్గరకొచ్చి నా నుదుటిపై బాబా ఊదీ పెడతాడు. తనకు పీడకలలు వచ్చినప్పుడు నన్ను నిద్రలేపి, తనకు ఊదీ పెట్టమని అడుగుతాడు. బాబా సీరియల్ చూస్తున్నప్పుడు, అందులో ఎవరైనా బాబాను కష్టపెడితే తను చాలా కలవరపడతాడు. ఒకరోజు సీరియల్లో బాబా తమ చేతులను మంటపై పెట్టడం చూసి, "అమ్మా! బాబా చేతులు కాలిపోతాయి" అని కంగారుపడ్డాడు. అంతలా తను బాబాను ప్రేమిస్తాడు. నేను తన నుండి చాలా నేర్చుకోవాలి. ఇకపోతే మా బాబు వ్రాసిన అనుభవం:
"అందరికీ ఓం సాయిరామ్! ఈరోజు నా అన్నయ్య హృషికేష్ ఆన్లైన్ క్లాసు నుండి బయటకు వచ్చి, "నా కడుపులో ఏమీ బాగోలేదు" అని చెప్పాడు. దాంతో నేను బాబా ఊదీ కలిపిన నీళ్లు అన్నయ్యకి ఇస్తే, తను త్రాగాడు. అప్పుడు అమ్మ బాత్రూమ్ నుండి బయటకి వచ్చింది. నేను అమ్మతో, "అన్నయ్య కడుపునొప్పితో బయటకు వచ్చాడ"ని చెప్పాను. అమ్మ, "నువ్వేమి చేశావ"ని అడిగింది. నేను, "బాబా ఊదీ నీళ్ళు ఇచ్చాన"ని చెప్పాను. బాబా నా అన్నయ్యని కాపాడారు".
ఈ చిన్న అనుభవం ద్వారా బాబా ఎల్లప్పుడూ మాతో ఉంటూ మమ్మల్ని సంరక్షిస్తున్నారనీ, మా పిల్లలు ఆయన చల్లని నీడలో ఉన్నారని నేను తెలుసుకున్నాను. "థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా! మీ చల్లని అనుగ్రహం ఎల్లప్పుడూ మాపై ఇలాగే ఉండాలి".
జరగబోయే ప్రమాదం నుండి దూరంగా ఉంచి కాపాడిన బాబా
నా పేరు కృష్ణకుమార్. నేను హైదరాబాద్ నివాసిని. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన 2013లో జరిగింది. 2013లో ఒకరోజు సాయంత్రం నేను దిల్సుఖ్నగర్లోని సాయిబాబా మందిరానికి వెళదామని ఆఫీసు నుండి బయలుదేరాను. ఛాదర్ఘాట్ దాటుతుండగా నా స్నేహితుడు నాకు ఫోన్ చేసి, “బాబా మందిరానికి మరోరోజు వెళుదువుగాని, ఇప్పుడు నువ్వు లాలాపేటకు రా!” అని చెప్పాడు. నేను వెంటనే ఛాదర్ఘాట్ నుండి లాలాపేటకు వెళ్ళాను. అదేరోజు దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడికి దగ్గరలో బాంబు ప్రేలుడు సంభవించింది. ఆ విషయం నాకు అప్పుడు తెలియదు. ఆఫీసు నుండి బయలుదేరేముందు, ‘నేను దిల్సుఖ్నగర్లోని సాయిబాబా మందిరానికి వెళ్తున్నాన’ని ఇంట్లోవాళ్ళకి చెప్పడంతో బాంబు ప్రేలుడు వార్త వినగానే వాళ్ళు చాలా కంగారుపడ్డారు. పైగా, నేను ఎలా వున్నానో తెలుసుకుందామని వాళ్ళు నాకు ఫోన్ చేస్తే, బాంబు ప్రేలుడు విషయం తెలియని నేను కాస్త బిజీగా ఉండి ఫోను తీయకపోవడంతో వాళ్ళు ఇంకా భయపడ్డారు. ఆ తర్వాత కొంతసేపటికి నేను మిస్డ్ కాల్స్ చూసి తిరిగి వాళ్ళకు ఫోను చేయడంతో, అప్పుడు తెలిసింది దిల్సుఖ్నగర్లో బాంబు ప్రేలుడు సంగతి. ఆ వార్త వినగానే నిర్ఘాంతపోయాను. నిజానికి ముందుగా అనుకున్న ప్రకారం నేను సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో దిల్సుఖ్నగర్ సాయిబాబా మందిరంలో ఉండాల్సింది. కానీ జరగబోయే ప్రమాదం గురించి ముందే తెలిసిన బాబా ఆ సమయానికి నేను అక్కడ ఉండకుండా దూరంగా వేరే చోట ఉండేలా చేసి, ఆ ప్రమాదం బారినపడకుండా నన్ను కాపాడారు. నన్ను కంటికి రెప్పలా కాపాడి నాకు పునర్జన్మను ప్రసాదించిన నా దైవం శ్రీసాయిబాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
