- మన సాయిబాబా - మన ప్రతి మాట వింటారు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు కుమారి. మా అన్నయ్యవాళ్ల 4 సంవత్సరాల పాపకి తిరుపతి మొక్కు ఉంది. అయితే వాళ్ల ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ఆ మొక్కు ఎలా తీర్చాలని వాళ్ళు బాధపడుతుండేవాళ్లు. ఆ విషయం గురించి నేను బాబాకి చెప్పుకొని, "బాబా! అన్నయ్యవాళ్లు ఎలాగైనా ఈ సంవత్సరం తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకోవాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని నేను బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. కొన్నిరోజుల తర్వాత అన్నయ్యవాళ్ళు, "తిరుపతి వెళ్తున్నాము. మీరూ వస్తారా?" అని మమ్మల్ని అడిగారు. మొదట మేము రామని చెప్పాము కానీ, మా అమ్మకి కూడా మొక్కు ఉన్నందున తర్వాత సరేనని చెప్పాము. ఇది 2023, మేలో జరిగింది. వెంటనే జూన్ 22కి ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అవి వెయిటింగ్ లిస్టులో ఉన్నప్పటికీ కంఫర్మ్ అయిపోతాయి అనుకున్నాం. ఇక దర్శనం టిక్కెట్లు, రూములకోసం ఆన్లైన్లో చూస్తే, ఫుల్ అయిపోయి వున్నాయి. దాంతో అక్కడికి వెళ్లి చూసుకుందామని అనుకున్నాము. నేను, "బాబా! దర్శనం, రూమ్స్ విషయంలో ఏటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకొని ఆయన మీద భారం వేశాను. సరిగా ఒక వారం ముందు రైల్వేస్టేషన్లో అడిగితే, "టిక్కెట్లు కంఫర్మ్ కాలేదు, ఇక కావు. క్యాన్సల్ చేసుకోండి" అని చెప్పారు. అప్పుడు మేము సరేలే తత్కాల్ టిక్కెట్లు ప్రయత్నిద్దాము అనుకున్నాము. నేను అయితే 'బాబా ఏదో ఒకటి చేస్తార'ని ఆయన మీద నమ్మకం ఉంచాను.
ఇంతలో హఠాత్తుగా మా అమ్మకి విపరీతంగా దగ్గు వచ్చి అస్సలు తగ్గలేదు. రెండు రోజులు నిరంతరాయంగా అమ్మ దగ్గుతూనే ఉంది. తనకి ఆస్త్మా ఉంది. హాస్పిటల్కి వెళితే, డాక్టర్ చెక్ చేసి టెస్టులు, ఎక్స్-రే వ్రాశారు. మేము "ఈ స్థితిలో తిరుపతి వెళితే పర్వాలేదా?" అని డాక్టరుని అడిగాం. అందుకు డాక్టరు, "మరుసటి వారం రిపోర్టులు వస్తేగానీ ఏం చెప్పలేను" అన్నారు. నేను, "బాబా! నువ్వే దిక్కు. రిపోర్టులు నార్మల్గా వచ్చి, తిరుపతి వెళ్ళమని డాక్టరు చెపితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. అమ్మకి రోజూ ఊదీ పెట్టి, ఊదీ కలిపిన నీళ్లు ఇస్తూ 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని నిత్యం పఠిస్తూ ఉండేదాన్ని. మరుసటి వారం రిపోర్టులు వచ్చాయి. బాబాని తలుచుకొని డాక్టర్ దగరకి వెళితే, డాక్టర్ రిపోర్టులు చూసి, "ఏం పర్లేదు. టాబ్లెట్లు వాడండి" అని అన్నారు. నేను వెంటనే నా మనసులో బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇంతలో డాక్టరు, "తిరుపతి వెళ్ళండి. రెండు వారాల తర్వాత మళ్ళీ రండి" అని అన్నారు. అంతా బాబా దయ.
అయితే తత్కాల్లో ట్రైన్ టిక్కెట్లు బుక్ అవ్వలేదు. అందరూ ఇక తిరుపతి ప్రయాణం క్యాన్సల్ అనుకున్నారు. కానీ నేను, "బాబా! మీరే ఏదో ఒకటి చేయండి" అని బాబాని అడిగాను. అకస్మాత్తుగా మా తమ్ముడువాళ్ల ఫ్రెండ్ ఫోన్ చేసి, "అక్కా! రేపటికి ఒక ట్రైన్కి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి" అని చెప్పాడు. అది విని నేను షాకయ్యాను. ఆనందంగా ఆ ట్రైన్కి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. తిరుపతి చేరుకున్నాక రైల్వేస్టేషన్ సమీపంలోనే మాకు దర్శనం టిక్కెట్లు కూడా దొరికాయి. కొండపైకి వెళ్ళాక మాకు రెండురోజులకి రూమ్స్ దొరకడంతో మేము అందరం షాకయ్యాము. కేవలం 5 గంటల సమయంలో మాకు వేంకటేశ్వరస్వామి దర్శనం చాలా బాగా జరిగింది. అంతా బాబా దయ. చివరిరోజున శ్రీకాళహస్తి వెళ్లి, దర్శనం చేసుకొని, అదేరోజు ట్రైన్ ఎక్కి తిరిగి ఇంటికి చేరుకున్నాము. అసలు వెళ్ళమనుకుంటే వెళ్ళేలా చేసి మా యాత్ర అంతా మాకు చాలా సహాయం చేశారు బాబా. 'బాబా' అని పిలిస్తే చాలు, పలుకుతారు.
ఇంటికి వచ్చిన 3 రోజుల తర్వాత మా అమ్మకి మళ్ళీ ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మని తీసుకొని మళ్లీ డాక్టర్ దగరకు వెళ్ళాము. డాక్టరు, "ఊరు వెళ్ళారు కదా! ఇన్ఫెక్షన్లా అయింది. టాబ్లెట్స్ ఇస్తాను, ఒక వారం వాడి రండి" అన్నారు. అయితే అమ్మకి దగ్గు అస్సలు తగ్గలేదు. మూడురోజులు నిరంతరాయంగా అమ్మ దగ్గుతూనే ఉంది. రాత్రి పడుకునేది కాదు, ఆహారం కూడా తినేది కాదు. అందువల్ల అమ్మ బరువు తగ్గిపోతుంటే నాకు చాలా భయమేసింది. రోజూ అమ్మకి ఊదీ పెట్టి, ఊదీ నీళ్లు ఇస్తూ, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని చెప్పుకున్నాను. అయినా అమ్మకి తగ్గలేదు. మా చిన్నప్పుడు ఒకసారి అమ్మకి టీబీ వచ్చిందంట. డాక్టర్ కూడా, "మీకు టీబీ వచ్చి ఎన్ని సంవత్సరాలైంది" అని అడిగారు. అందువల్ల 'అమ్మకి మళ్లీ టీబీ వచ్చిందేమో, దగ్గు తగ్గకపోతే టీబీ టెస్టు చేస్తారేమో' అని నాకు చాలా భయమేసింది. అందువల్ల డాక్టర్ ఒక వారం తర్వాత రమ్మని చెప్పినప్పటికీ అమ్మకి దగ్గు తగ్గని కారణంగా ముందుగానే శుక్రవారం హాస్పిటల్కి వెళదామని అనుకొని గురువారంనాడు నేను బాబా గుడికి వెళ్లి, "అమ్మ ఆరోగ్యం బాగుండాలి సాయి. అమ్మకి దగ్గు తగ్గి టెస్టులు ఏమీ లేకుండా టాబ్లెట్లు ఇస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. కానీ ఆరోజు అమ్మకి చాలా ఎక్కుగా దగ్గు వచ్చింది. నేను, "బాబా! నువ్వే దిక్కు" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఆరోజు రాత్రి నుండి దగ్గు కొంచం కొంచంగా తగ్గుతూ వచ్చింది. అందువల్ల మేము శుక్రవారం డాక్టర్ దగరకి వెళ్ళలేదు. కానీ సోమవారం వరకు అమ్మకు దగ్గు వస్తూనే ఉంది, కాకపోతే అంత ఎక్కువగా కాదు, చాలా స్వల్పంగా. హఠాత్తుగా అంతలా ఎలా తగ్గిందో! అది బాబా మిరాకిల్.
ఇక విషయానికి వస్తే, మా తమ్ముడు అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. నేను, "బాబా! డాక్టరు టాబ్లెట్లు మాత్రమే ఇవ్వాలి, టెస్టులు ఏమీ వ్రాయకూడదు" అని బాబాకి చెప్పుకున్నాను. అప్పటివరకు జరుగుతున్న ఈ అనుభవం అంతా ఒక పుస్తకంలో వ్రాస్తున్న నేను, 'చివరిలో ఏం వ్రాయాలి? డాక్టర్ ఏం చెప్తారు?' అని అనుకుంటున్నంతలోనే మా తమ్ముడు ఫోన్ చేసి, "డాక్టరు టాబ్లెట్లు ఇచ్చారు. ఒక నెల తర్వాత మళ్లీ రమ్మన్నారు" అని చెప్పాడు. నేను చాలా షాకయ్యను, అస్సలు మాటలు రాలేదు. కన్నీళ్ల పర్యంతమవుతూ బాబా దగరకి వెళ్లి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇంకేం చెప్పాలో నాకు తెలియడం లేదు. మన సాయిబాబా ఉన్నారు - పిలిస్తే పలుకుతారు. మన సాయిబాబా - మన ప్రతి మాట వింటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఏదైనా అనుభవం పంచుకోవడం మర్చిపోయినా, అలాగే తెలిసీతెలియక ఏదైనా తప్పు చేసినా క్షమించు సాయి. అమ్మ ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు, ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది. తను ఆరోగ్యంగా ఉండేలా చూసే భాధ్యత మీదే సాయి. మాకు మీరు తప్ప ఎవరూ లేరు సాయి. నా కష్టం నీకు తెలుసు, సహాయం చేయి సాయి. అందరికీ తోడుగా ఉండండి బాబా".

