సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1575వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కరోనా నుండి కాపాడి పునర్జన్మనిచ్చిన సాయిబాబా
2. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా మీద భారమేస్తే ఆయన మనల్ని కాపాడుతారు

కరోనా నుండి కాపాడి పునర్జన్మనిచ్చిన సాయిబాబా


నా పేరు పిడెం నరసింహులు. మేము హైదరాాబాద్, నల్లకుంటలో ఉంటున్నాము. ముందుగా సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఇప్పుడు 2020, సెప్టెంబర్‌లో కరోనా రెండో విడతప్పుడు స్వయంగా నాకు జరిగిన అనుభవం పంచుకుంటున్నాను. హఠాత్తుగా నాకు జ్వరం వస్తూ పోతూ ఉండేది. దాంతో ఒకరోజు కరోనా టెస్టు చేయించుకుంటే 'పాజిటివ్' అని వచ్చింది. అప్పటికి వేరే లక్షణాలేవీ కనిపించకపోయినా ఆ రోజు సాయంత్రానికి మాత్రం నా పరిస్థితి కొద్దికొద్దిగా దిగజారడం ప్రారంభించింది. కనీసం అరటిపండు కూడా తినలేని స్థితికి వచ్చాను. అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. కష్టం మీద రెండు అడుగులు వేయగానే ఆయాసమోచ్చి కుప్పకూలిపోయేవాడిని. ఆ విధంగా ఒక రాత్రంతా గడిచింది. మరుసటిరోజు ఎలాగో కష్టపడి ఆటోలో చైతన్యపురిలోని నా మిత్రుని ఆస్పత్రికి వెళ్లాను. ఒక గంటసేపు ఆక్సిజన్ పెట్టి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అంబులెన్స్‌లో సిటి స్కానింగ్‌కు పంపారు. దారిలో దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా మందిరం ఆర్చి నా కంటపడింది. అంబులెన్స్‌లోని బెడ్ మీద నుండే రెండు చేతులెత్తి నమస్కరించాను. స్కానింగ్ అయిపోయన రెండు గంటల తరువాత రిపోర్టులు వచ్చాయి. అప్పటికే నన్ను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. నా భార్య, కుమారుడు ఆస్పత్రికి వచ్చారు. డాక్టర్లు వాళ్ళని పిలిచి, "ఆయన ఊపిరితిత్తులు 80 శాతం దెబ్బతిన్నాయి. ఇక బతకడం కష్టం. బంధువులు ఎవరన్నా ఉంటే తెలియపరచండి" అని అన్నారు. అదే విషయాన్ని నా భార్య వచ్చి నాతో చెప్పింది. "నాకు ఏమి కాదులే" అని నేను తనకి ధైర్యం చెప్పాను. కానీ నేను బతుకుతానన్న నమ్మకం ఎవరికీ లేదు. ఊరిలో ఉండే మా అమ్మ, తమ్ముడు, తన భార్య కారు మాట్లాడుకుని మరుసటిరోజు హైదరాబాద్ వచ్చారు. కరోనా కారణంగా వ్యాపారం నడవక మా వద్ద డబ్బు కూడా లేదు. అయినా నేను ధైర్యంగానే ఉండసాగాను. దాదాపు 14 రోజులపాటు ఐసియులో ఉన్నాను. అప్పటికీ వైద్యులకు నమ్మకం కుదరడం లేదు. నాకు మాత్రం లోపల వ్యాధి నయమవుతున్నట్లు తెలుస్తుండేది. ఆక్సిజన్ లెవెల్స్ క్రమంగా పెరిగాయి. ఆక్సీజన్ పైపు తీసి బాత్రూమ్‌కు వెళ్లగలుగుతుండేవాడిని. డాక్టర్లకి నమ్మకం లేకపోయినా నా మనోధైర్యాన్ని చూసి 15వ రోజు జనరల్ రూమ్‌కు మార్చారు. ఆ తరువాత మూడు రోజులకు డిశ్చార్జ్ కూడా చేశారు. 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నా నేను కోలుకోవడం డాక్టర్లకే ఆశ్చర్యం కలిగించింది. నేను, నా కుటుంబం డాక్టర్లకు నమస్కరించబోతే, "మేము చేసింది ఏమీ లేదు. ఇంతకంటే తక్కువ తీవ్రత ఉన్నవాళ్ళు చాలామంది చనిపోయారు(నా కళ్లముందే నా పక్క బెడ్డుపై ఉన్న పేషెంటు కూడా చనిపోయాడు). కాబట్టి మాదేమీ లేదు. దేవుడే మిమ్మల్ని కాపాడాడు" అని అన్నారు. ఆ దేవుడు ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే. నేను బతికానంటే అంతా ఆ సాయిదేవుని కృప మాత్రమే. ఈ వ్యాధి బారినపడతానని, నా ప్రాణానికి ముప్పు ఉందని ఆయనకు ముందే తెలుసేమో! అప్పటికీ రెండు నెలల ముందు నుండి నా చేత భరద్వాజ మాస్టారు రచించిన గురుచరిత్ర, సాయిచరిత్ర పారాయణ చేయించారు. నిజానికి నేను వాటిని ఎప్పుడో పాత పుస్తకాలు అమ్మేవాళ్ళు దగ్గర కొని ఒక మూలన పెట్టేసాను. సరిగా నాకు కరోనా సోకడానికి రెండు నెలలు ముందు వాటిని పారాయణ చేయాలన్న బుద్ధి పుట్టించారు బాబా. 2014లో శిరిడీ నుండి తెచ్చుకున్న ఒక చిన్న బాబా విగ్రహం మా ఇంటిలో ఉంటే, ఆ విగ్రహానికి అభిషేకం చేసి రోజూ పారాయణ చేస్తూ, సాయంత్రం పూట బాబా గుడిలో జరిగే ఆరతికి వెళ్తుండేవాడిని. ఆ విధంగా ఆయన నా చేత పూజలు చేయించుకొని, దానికి బదులుగా నా  ప్రాణాలు కాపాడారు. నన్ను నా కుటుంబాన్ని ఆదుకున్న సాయినాథునికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను? నా అనుభవాన్ని ఈ విధంగా అందరితో పంచుకునే భాగ్యం కల్పించిన సాయిబాబాకు నమస్సులతో..


ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా మీద భారమేస్తే ఆయన మనల్ని కాపాడుతారు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నాడు బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలు భక్తులు పొందారో నేడు కూడా భక్తులు ఎన్నో అనుభవాలను పొందుతున్నారు. ఏదైనా సమస్య వచ్చినా, రాబోతున్నా బాబా ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేయడం, హెచ్చరించడం జరుగుతున్నాయి. ప్రతిరోజు, ప్రతి నిమషం బాబాతో మనకి ఏదో ఒక అనుభవం ఉండనే ఉంటుంది. ఈ బ్లాగు ద్వారా అటువంటి అనుభవాలు చదువుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాదు ఈ బ్లాగు వల్ల ప్రతిరోజు బాబా దర్బారులో ఆయనతో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇక విషయానికి వస్తే, నా పేరు చైతన్య. 2023, ఏప్రిల్‌లో మా కుటుంబం, మా స్నేహితుల కుటుంబం కలిసి శిరిడీ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాము. అనంతరం హఠాత్తుగా మా మామయ్యగారు అనారోగ్యం పాలయ్యారు. దాంతో మేము శిరిడీ వెళ్లలేమేమోనని నేను చాలా బాధపడి, "బాబా! మా మామయ్యగారి ఆరోగ్యం బాగుండేలా చూడండి. మీ దయతో మా శిరిడీ ప్రయాణానికి ఆటంకాలు లేకుండా ఉంటే నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయతో మావయ్యగారి ఆరోగ్యం మెరుగుపరిచి మా శిరిడీ ప్రయాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసారు. మేము సంతోషంగా శిరిడీ వెళ్ళాం. మొదటిరోజు బాబా దర్శనం చేసుకొని రెండోరోజు నాసిక్, త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి వెహికల్ బుక్ చేసుకున్నాము. అయితే హఠాత్తుగా ఆ రాత్రి నాకు గ్యాస్ ప్రాబ్లెమ్ వచ్చి విరోచనాలు మొదలయ్యాయి. నాకు చాలా భయమేసింది. "బాబా! రేపు నాసిక్ వెళదామనుకుంటే ఇదేంటి ఇలా అయ్యింది. నా వల్ల మిగతవాళ్ళు కూడా ఇబ్బందిపడతారు. నాకు తగ్గిపోయేలా చూడండి బాబా" అని బాబాని వేడుకొని ఊదీ నీళ్లలో కలుపుకొని త్రాగి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకుంటూ నిద్రపోయాను. ఉదయం నిద్ర లేచేసరికి నాకు తగ్గిపోయింది. అంతా ఊదీ మహిమ. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా మీద భారమేస్తే ఆయన మనల్ని కాపాడుతారు. ఇకపోతే నేను, "బాబా! ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడండి" అని బాబాను వేడుకొని మా స్నేహితులతో కలిసి నాసిక్‌యాత్రకు బయలుదేరాను. బాబా దయవల్ల ఏ ఇబ్బంది లేకుండా నాసిక్, త్రయంబకేశ్వర్ వెళ్లి శివయ్య దర్శనం చేసుకొని తిరిగి క్షేమంగా శిరిడీ చేరుకున్నాము. తర్వాత రోజు మేము ఔరంగాబాద్‌కి సమీపంలో ఉన్న ఘృష్ణేశ్వర్ వెళ్లి అక్కడి శివయ్య దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. "చాలా ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం మాపై సదా ఉండాలని, మీ కృపాదృష్టి మమ్మల్ని కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. సదా మీ నామస్మరణలో ఉండేలా దీవించండి బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo