1. పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కోరుకున్నట్లు అనుగ్రహించిన బాబా2. ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబాకి వాడిన తువ్వాలు
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కోరుకున్నట్లు అనుగ్రహించిన బాబా
సాయిబంధువులకు నమస్కారాలు. నా పేరు శ్రీరామ సాయి కార్తికేయ. నేను ఈ సంవత్సరం(2023) పదవ తరగతి పరీక్షలు వ్రాసి బాబాను, "సాయీ! నాకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో లెక్కలు మరియు ఇతర సబ్జెక్టుల్లో మంచి మార్కులు, ముఖ్యంగా లెక్కల్లో 96 కంటే ఎక్కువ మార్కులు వచ్చేలా అనుగ్రహించండి. నేను టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పాసైతే శిరిడీ వస్తాను" అని మొక్కుకున్నాను. ఎందుకంటే, లెక్కల పరీక్షలో ఒక 8 ఎనిమిది మార్కుల లెక్కను నేను ఒక పద్దతిలో చేసాను. కాని ప్రిన్సిపాల్స్ ఆఫ్ వాల్యుయేషన్(principles of valuations)లో ఆ లెక్క ఇంకో విధంగా చేసి ఉంది. అందువలన నేను చేసింది సరైనదే అయినప్పటికీ ఆ లెక్కకు మార్కులు వేస్తారో, లేదో అని భయపడ్డాను. అదికాక నేను ఇంకో తప్పు కూడా చేసాను. కాని బాబాను వేడుకోవడం వల్ల ఆయన దయతో 2023, మే 6న వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో నాకు లెక్కల్లో వందకి వంద వచ్చాయి. నేను మొత్తం 600 మార్కులకి 569 మార్కులతో ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. నేను ముందుగా మ్రొక్కుకున్నట్లు 2023, మే 20న నా కుటుంబంతో శిరిడీకి ప్రయాణమయ్యాను. మేము మే 21న ఉదయం 10 గంటలకి శిరిడీ చేరుకున్నాము. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఒకసారి, మరుసటిరోజు ఉదయం ఒకసారి అంటే మొత్తం రెండుసార్లు సాయిబాబా దర్శనం చేసుకున్నాము. చుట్టుపక్కల దర్శినీయ క్షేత్రాలను కూడా దర్శించుకున్నాము. అంతా బాబా దయతో సజావుగా సాగింది.
తర్వాత 2023, మే 27న మేము అన్నవరం వెళ్లి అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణస్వామి దర్శనం చేసుకున్నాము. ఆరోజు నాకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నా తలనొప్పి తగ్గేలా చేయండి" అని బాబాకి చెప్పుకొని పడుకున్నాను. ఆయన దయతో నిద్రలేచేసరికి తలనొప్పి తగ్గిపోయింది. "దయతో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నన్ను పాస్ చేసినందుకు ధన్యవాదాలు తండ్రి శ్రీసాయినాథా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబాకి వాడిన తువ్వాలు
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను 2022లో జనరల్ బాడీ చెకప్ చేయించుకుంటే రిపోర్టులో నాకు థైరాయిడ్, రక్తహీనత, ఐరన్ లోపం ఉన్నట్లు వచ్చింది. నేను చాలా బాధపడి డాక్టరు ఇచ్చిన మందులు వాడటం మొదలుపెట్టాను. ఒకప్పుడు బాబా దయతో శిరిడీలోని చావిడిలో బాబాకి ఉపయోగించిన తువ్వాలు నాకు లభించింది. ప్రతి శుక్రవారం నేను ఆ తువ్వాలు తాకి, "నా ఆరోగ్యం బాగు చేయమ"ని బాబాను వేడుకుంటుడేదాన్ని. ఆశ్చర్యంగా 8 నెలల తరువాత మళ్ళీ టెస్టులు చేయించుకుంటే అన్నీ నార్మల్ వచ్చాయి. థైరాయిడ్ అయితే లేదని వచ్చింది. అది చూసి డాక్టర్ రిపోర్టులు తప్పుగా వచ్చాయేమో అని అన్నారు. నాకు మాత్రం ఇది నా తండ్రి సాయి చేసిన లీల అనిపిస్తుంది.
ఒకసారి మా కొత్తింట్లో సింక్ వాటర్ బయటకి పోకుండా ఆగిపోయినప్పుడు ప్లంబర్ని పిలిపించాము. అతను రెండు రోజులు చెక్ చేసి, "గోడకి రంధ్రం పెట్టాలి" అన్నాడు. కొత్తింటి గోడలకు రంధ్రం పెట్టడానికి నాకు బాధేసి, "సమస్య మాములుగా తీరాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అప్పడు వేరే ప్లంబర్ వచ్చి మాములుగా రిపేర్ చేసి వెళ్లారు. ఇది నా బాబా దయకాక ఇంకేమిటి? "కోటి కోటి ధన్యవాదాలు బాబా".

