1. వారణాసి యాత్రలో బాబా చూపిన అనురాగం
2. బాబా దయతో స్వస్థత
వారణాసి యాత్రలో బాబా చూపిన అనురాగం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు సూర్యనారాయణమూర్తి. నేను ఇప్పుడు ఆత్మీయ సాయిబంధువులతో మా వారణాసి యాత్రలో బాబా మాపట్ల చూపిన అనురాగాన్ని పంచుకుంటున్నాను. ఈ అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైనందుకు బాబాని క్షమించమని కోరుకుంటున్నాను. 2023, మార్చి 4వ తేదీ ఉదయం 9 గంటలకు మేము హైదరాబాదు నుండి విమానంలో బయలుదేరి 11:05 నిమిషాలకు వారణాసి చేరుకున్నాం. వారణాసి విమానాశ్రయం నుండి మేము బస చేయాల్సిన చోటుకి టాక్సీలో బయలుదేరి వెళ్తుండగా హొలీ పండగ కారణంగా మణికర్ణిక ఘాటు వద్ద చాలా రద్దీగా ఉంది. ఆ రద్దీని దాటడానికి చాలా సమయం పడుతుంది. ఆ కారణంగా మేము మా బసకు చేరడం ఆలస్యమైతే అక్కడ భోజనాలుండవు. అందుకని నేను సాయిని, "దారి చూపమ"ని ప్రార్థించాను. ఆయన దయ చూపారు. ఒక పోలీస్ అధికారి వాహనంలో వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసి మమ్మలి వెళ్ళడానికి అనుమతించారు. దానితో మేము సుమారు 1:30 నిమిషాలకు మా బసకి చేరుకున్నాము. బాబా దయవలన మాకు భోజనాలు అందాయి. అలాగే 2023, మార్చి 8న గయ నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా హోలీ వల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మేము ఎప్పుడు మా బసకు చేరుకుంటామో అని కంగారుపడ్డాం. అప్పుడు కూడా బాబా దయతో పోలీసు ఉన్నతాధికారులు వచ్చి ట్రాఫిక్ నియంత్రణ చేశారు.
2023 మార్చి 7న మేము శ్రీవిశ్వనాథుని దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా రద్దీగా ఉంది, లైన్లు కూడా ఆపేసారు. నేను, "బాబా! ఈరోజు మాకు ఎలాగైనా దర్శనం అయ్యేలా దయచూపండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అలా బాబాను ప్రార్థించగానే లైన్లు వదిలారు. అంతేకాదు, విశ్వనాథుని లింగం వద్ద బాబా మాకు దర్శనమిచ్చారు. అది బాబా మాకు ప్రసాదించిన మహద్భాగ్యం.
2023, మార్చి 8న మేము ఉదయం నుండి సాయంత్రం వరకు సుమారు 90 కిలోమీటర్ల కాశీ పరిక్రమ యాత్ర ఆటోలో చేసాము. ఆ యాత్ర అంతటా బాబా మాతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు. యాత్ర చివరిలో గంగానదిలో బోటు ఆగిపోయి చాలా ఇబ్బందిపెట్టింది. మేమంతా చాలా భయపడి బాబా నామస్మరణ బిగ్గరగా చేసాము. ఇంతలో మరో బోటు అతను వచ్చి మమ్మల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఇవన్నీ బాబా అనుగ్రహ చమత్కారాలు. ఇలాగే సర్వోజనులను సకల వేళలందు చల్లగా చూడమని బాబాను ప్రార్థిస్తున్నాను.
బాబా దయతో స్వస్థత
సాయి బంధువులకు నమస్కారాలు. నాపేరు లక్ష్మి. మాది హైదరాబాద్. సద్గురు సాయి నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. 2020, జూన్లో ఒకరోజు నిద్రలేచేసరికి నా ఎడమచెవికి ఏదీ వినిపించలేదు. మావారు బ్లాక్ అయివుంటుందని ఇయర్ డ్రాప్స్ వేశారు. అలా రెండు, మూడు రోజులు ఇయర్ డ్రాప్స్ వేసి చూసినా గుణం కనపడలేదు. దగ్గరలో మా అమ్మాయి పెళ్లి కూడా ఉండడంతో నేను కొంచెం ఆందోళన చెందాను. కోవిడ్ సమయమైనందున బయటకి వెళ్లి ఏదైనా హాస్పిటల్కి వెళ్లాలంటే భయంతో నెట్లో సెర్చ్ చేస్తే ఒక ENT డాక్టరు అందుబాటులో కనిపించారు. ఆయన్ని సంప్రదిస్తే, "దాదాపు 80 నుండి 90 శాతం డామేజ్ అయింది. అయినా చెవికి ఇంజక్షన్ ఇచ్చి మన ప్రయత్నం మనం చేద్దాం" అన్నారు. నేను బాబాని, "ఏ సమస్య లేకుండా నాకు వినిపించేటట్లు చేయి నాయనా" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల అంత డామేజ్ అయినా కూడా మూడు ఇంజన్క్షన్లకే నా చెవి సమస్య నయమైంది. నిజంగా అది అద్భుతం. మా అమ్మాయి పెళ్లి చాలా సంతోషంగా జరిగింది. "కృతజ్ఞతలు బాబా".
ఇటీవల మేము శిరిడీకి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసాము. ముందురోజు మా మనవరాలికి విపరీతమైన జ్వరం వచ్చింది. జలుబు, దగ్గుతోపాటు రక్తవిరోచనలు కూడా అయి పాప చాలా నీరసించిపోయింది. డాక్టరు మందులిచ్చారు. మేము బాబాని, "సాయీ! మీ దర్శనానికి మమ్మల్ని అనుమతించు స్వామి. మనవరాలికి తగ్గితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాము. అంతే, మా మనవరాలికి తగ్గింది. మరుసటిరోజు చెక్ అప్ కోసం డాక్టరు దగ్గరకి వెళితే, "శిరిడీ వెళ్ళిరండి" అని చెప్పారు. మేము సంతోషంగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాము. అంతా ఆయన దయ. నేను సదా ఆయనకి కృతజ్ఞురాలిని.

