సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాధువు మరియు కూలీ రూపాలలో సీతాకాంత్ గారిని రక్షించిన బాబా


రైలు ప్రమాదం నుండి తన భక్తుని రక్షించిన బాబా లీల.

'తన భక్తులను కాపాడటానికి బాబా అనేక రూపాలను ధరిస్తారు' అని శ్రీసాయిసచ్చరిత్రలో మనం చదువుకున్నాము. అటువంటి ఒక అనుభవాన్ని ఇప్పుడు మీరు చదవబోతున్నారు. ఈ లీలలో, రైలు ప్రమాదం నుండి తమ భక్తుడైన సీతాకాంత్ కామత్‌ని కాపాడటానికి బాబా ఒక సాధువు మరియు కూలీ రూపాలను ధరించారు.

సీతాకాంత్ కామత్ మిజోరంలో పనిచేస్తూ ఉండేవాడు. అక్కడ అతని పదవీకాలం పూర్తికావడంతో ఆగస్టు, 1971లో అతనికి మిజోరం నుంచి ముంబైకి బదిలీ అయ్యింది. మిజోరం నుంచి ముంబై వెళ్ళే ప్రయాణం సుదీర్ఘమైనదనీ, దుర్భరమైనదనీ మరియు ప్రమాదకరమైనదనీ అతని సహచరులు సూచించారు. అందుచేత కామత్ తన ప్రయాణం క్షేమంగా సాగాలని తమ కులదేవతను ప్రార్థించి, ముంబై బయలుదేరాడు. మొదటిదశ ప్రయాణం బస్సులో పర్వతప్రాంతాల గుండా జరిగింది. ఆ మార్గమంతా ఒకవైపు నిటారుగా ఉన్న పర్వతాలు, మరోవైపు అతి లోతైన లోయలతో నిండివుంది. పొరపాటున డ్రైవర్ నియంత్రణను కోల్పోయినట్లయితే, మరుక్షణం బస్సు లోతైన లోయలో పడిపోవటం ఖాయం. ఆ మార్గంలో ఎటువంటి ప్రమాద హెచ్చరికలూ లేవు. అంతటి ప్రమాదకరమైన మార్గంలో తన ప్రయాణం సాగింది. ఏదైతే ఏమి, చివరకు డ్రైవర్ సురక్షితంగా సిల్చార్ అనే ప్రాంతానికి చేర్చాడు.

ఇక, తన ప్రయాణంలో రెండవదశ ట్రైన్‌లో వెళ్లవలసివుంది. కామత్ సిల్చార్‌లో ముంబయికి ఒక టికెట్ తీసుకొని ఒక మిలిటరీ ఆఫీసర్ ద్వారా బెర్త్ కూడా సంపాదించాడు. రైలు భారీ సొరంగాల గుండా గౌహతికి వెళ్లనుంది. కామత్ తన బెర్త్‌పై సౌకర్యవంతంగా పడుకొని చిన్న గురక తీస్తూ ఉన్నాడు. అనుకోకుండా తన పక్కన ఎవరో నిల్చుని ఉన్నట్లు తోచి కామత్ కళ్ళు తెరిచి చూశాడు. ప్రక్కనే తెల్లని గడ్డం మరియు మీసంతో, పొడవైన కఫ్నీ ధరించి ఉన్న ఒక ఫకీరుని చూశాడు. ఆ ఫకీరుకి సుమారు 55 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు ఉంది. అతడు హిందీలో, "బాబూజీ, ఇక్కడ దిగి ఈ నగరాన్ని, కామాక్షి దేవాలయాన్ని సందర్శించండి" అని చెప్పి కనుమరుగైపోయాడు. ఇప్పుడు కామత్ ఒక పెద్ద గందరగోళంలో పడ్డాడు. "ఇప్పుడు ఇక్కడ దిగిపోతే, మొత్తం లగేజీ ఎక్కడ పెట్టాలి? మళ్ళీ మరో రైలులో ప్రయాణించాల్సి వస్తుంది. ఒకవేళ టికెట్ పొందలేకపోతే?" అని సందిగ్ధంలో పడిపోయాడు. ఇటువంటి స్థితిలో ఉన్న కామత్‌కి గౌహతి స్టేషన్‌లో రైలు నిలిచి ఉందని కూడా తెలియలేదు. ఇంతలో ఒక కూలీ వచ్చి అతని ముందు నిలబడ్డాడు. ఆ కూలీ అచ్చం అంతకుముందు కామత్ చూసిన ఫకీరులానే ఉన్నాడు, కాకపోతే, బ్యాడ్జి ఉండే రైల్వే కూలీలు ధరించే ఎర్రని యూనిఫామ్ ధరించి ఉన్నాడు. అతని బ్యాడ్జిపై '389' అనే నెంబర్ ఉంది. ఆ కూలీ వేగంగా కామత్ సామానులన్నీ తన చేతిలోకి తీసుకొని, 'పదండి' అని అన్నాడు. కామత్ ఏదో ఒక మైకంలో అతన్ని అనుసరించాడు. సామాన్లన్నీ క్లోక్‌రూమ్‌లో డిపాజిట్ చేసి కూలీవాడు అదృశ్యమైపోయాడు. తరువాత కామత్ స్నానం చేసి, టీ త్రాగుతూ ఉండగా, ఇంతలో అతను దిగిన రైలు కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిన తరువాత ఒక ఘోర ప్రమాదానికి గురైందని విని నిర్ఘాంతపోయాడు. దురదృష్టవశాత్తూ ఆ ప్రమాదంలో అనేకమంది ప్రయాణీకులు తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది తీవ్రమైన గాయలపాలయ్యారు. తనని రైలు నుండి దించి తన జీవితాన్ని కాపాడిన ఆ కూలీ గుర్తుకువచ్చి అతని కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ అతనెక్కడా కనిపించకపోవటంతో స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్లి బ్యాడ్జి నెంబర్ 389 గల కూలీ గురించి అడిగాడు. స్టేషన్ మాస్టర్ ద్వారా 'ఆ బ్యాడ్జ్ నెంబర్ గల కూలీ ఎవరూ లేరని, అసలు ఆ నెంబరుతో బ్యాడ్జే లేద'ని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.

మరుసటిరోజు అతను నాసిక్ చేరుకున్నాడు. వెంటనే అతనికి శిరిడీ సందర్శించాలని తీవ్రమైన ప్రేరణ కలిగి అక్కడి నుండి నేరుగా శిరిడీ చేరుకుని, సమాధిమందిరంలోకి వెళ్ళాడు. సమాధిమందిరంలోని బాబా విగ్రహాన్ని చూసి అతను ఎంతగానో ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే, ఆ మూర్తి తన జీవితాన్ని కాపాడిన ఫకీరు మరియు కూలీని పోలివుంది! ఆ రూపాలలో వచ్చి తనను కాపాడింది బాబానే అని అర్థమై కన్నీళ్ళతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

సోర్స్: శ్రీసాయిసాగర్ మ్యాగజైన్, జులై-ఆగస్ట్ 2006

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo