సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1608వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. బాబా సన్నిధి నుంచి రాగానే సమస్యకు పరిష్కారం
2. గురుపౌర్ణమినాడు రోజుంతా తమతోనే ఉంచుకున్న బాబా
3. కేవలం ఊదీతో కొన్ని నెలలుగా ఏ ఔషదాలు తగ్గిన నొప్పి మాయం

బాబా సన్నిధి నుంచి రాగానే సమస్యకు పరిష్కారం 


నా పేరు పద్మజ. ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని అనుభవాలు చదువుతున్న సాయి బిడ్డలకు నా నమస్కారం. దాదాపు 8 సంవత్సరాల క్రితం బాబా నా జీవితంలోకి వచ్చారు. అప్పట్లో సాయిబాబా అంటే ఒక దేవుడని మాత్రమే నాకు తెలుసు. మా ఇంటి పక్కనే బాబా గుడి ఉండేది కానీ, నేను అంతగా ఆయన్ని నమ్మేదాన్ని కాదు. నేను ఇంకో దైవాన్ని నమ్ముకొని ఆ దేవుని గుడి మా ఇంటినుండి కొంచం దూరంలో ఉన్నప్పటికీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడిచి వెళ్లి అక్కడ 108 ప్రదక్షిణాలు చేసి ఆపై నా డ్యూటీకి వెళ్లేదాన్ని. నేను ఒక సమస్యతో ఇంకా పోరాడలేక చాలా పెద్ద నిర్ణయం తీసుకుందామనుకున్న సమయంలో మన సాయితండ్రి నా జీవితంలోకి వచ్చారు. అదెలా అంటే, ఒకరోజు నేను చాలా బాధతో ఏడ్చాను. గుడికి వెళితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. కానీ అంత దూరం వెళ్లి 108 ప్రదక్షిణాలు చేయాలంటే నా కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి. అందువలన అంతదూరం వెళ్లలేకపోయాను. ఆ సమయంలో నాకు ఏ ప్రేరణ కలిగిందో తెలీదుగాని, ఇంటి పక్కనే ఉన్న బాబా గుడికి వెళ్లి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి, "సాయిబాబా అంటే మీరే కదా!" అని ఒక స్నేహితునితో మాట్లాడినట్టు బాబాతో మాట్లాడుతూ చాలాసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చుని నా మనసులో బాధంతా చెప్పుకున్నాను. 108 ప్రదక్షిణాలు చేయలేదు, ఉపవాసాలు ఉండలేదు, ఏ పూజ చేయలేదు, కేవలం నా బాధ చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చాను. అంతే! ఎన్నో సంవత్సరాల నుంచి ఎటూ తేల్చుకోలేని సమస్య, ఇక జరగదనుకున్నది బాబా సన్నిధి నుంచి రాగానే పరిష్కారం అవడం మొదలయ్యింది. నేను ఆశ్చర్యపోయాను. చివరికి నేను ఊహించని రీతిలో బాబా ఆ సమస్యను తీర్చేసారు. అది కూడా చాలా తేలికగా. నిజానికి ఆ సమస్య విషయంలో ఏమీ తేల్చుకోలేక నేను చావే గతి అనుకున్నాను. అలాంటి స్థితిలో బాబా నా జీవితాన్ని మార్చేశారు. నేను ఈరోజు చాలా ఆనందంగా జీవితం గడుపుతున్నానంటే అందుకు కారణం బాబానే. ఆరోజు ఏ నమ్మకమూ లేకుండా బాబా గుడికి వెళ్లిన నాకు ఈరోజు 'సాయీ' అంటే కంటనీరు(ఆనందబాష్పాలు) వచ్చేంత ఇష్టం. స్నేహితులు, బంధువులు వద్ద సహాయం అందుతుందో, లేదో తెలియదు కానీ సాయి వద్ద సహాయం ఖచ్చితంగా అందుతుంది. ఆయన పిలిస్తే పలుకుతారు. ఆయన చేసిన అద్భుతాలు ఒకటో, రెండో కాదు ఎన్నో. వాటి గురించి నేను ఏమని, ఎన్నని చెప్పాలి? ఇప్పుడు మాత్రం కొన్ని పంచుకుంటాను.


గురుపౌర్ణమినాడు రోజుంతా తమతోనే ఉంచుకున్న బాబా

సాయి నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాలలో ప్రతి గురుపౌర్ణమికి నేను ఒక అతిథిలా గుడికి వెళ్లి బాబాని దర్శించి, ప్రసాదం తీసుకొని వచ్చేస్తుండేదాన్ని. కానీ ఈ సంవత్సరం(2023) నాకెందుకో 'మా బాబాకి మనం దగ్గరుండి గురుపౌర్ణమి చేయాలి, నేను ఏదో రకంగా ఆయన సేవలో పాల్గొనాలి' అనిపించి బాబాని, "'ఇన్ని సంవత్సరాలుగా మీ సహాయం తీసుకుంటున్న నాకు గురుపౌర్ణమినాడు మీ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి బాబా" అని అడుగుతుండేదాన్ని. ఆయనని అడిగితే చేయకుండా ఉంటారా? గురుపౌర్ణమి ముందురోజు నేను, నా స్నేహితురాలు మా ఇంటి దగ్గర ఉన్న బాబా గుడికి వెళ్ళాం. అక్కడ చాలామంది పని చేస్తుంటారు. మా అవసరం ఏమీ ఉండదు. ఆ గుడి మేనేజర్ నా స్నేహితురాలితో బాగా మాట్లాడతారు. అతను ఆరోజు నా స్నేహితురాలిని పిలిచి, "రేపు మీరు కూడా బాబాకి సేవ చేసుకోవచ్చు కదా!" అని నా స్నేహితురాలితో అని, మరుసక్షణం నావైపు చూసి, "మీరు కూడా రండమ్మా. పొద్దున్నే భక్తులు చేతుల మీదగా బాబాకి పాలాభిషేకం ఏర్పాటు చేశాం. మీరు సేవలో పాల్గొనండి" అన్నారు. ఇంకా నా ఆనందానికి అవదులులేవు. నా స్నేహితురాలు తనకి సెలవు ఇవ్వరని చెప్పింది. నేను మాత్రం ఈ అవకాశం అసలు వదులుకోనని మరుసటిరోజు పొద్దున్నే బాబా గుడికి వెళ్లి మధ్యాహ్నం వరకు బాబాకు ఎదురుగా నిల్చొని, ఆయన దర్శనం చేసుకుంటూ గురుపౌర్ణమినాడు ఆయన సేవ సంతోషంగా చేసుకున్నాను. అప్పుడు మేనేజరుగారు, "సాయంత్రం కూడా కాస్త రామ్మ. భక్తులు ఎక్కువగా వస్తుంటారు కదా!" అని అన్నారు. బాబా సేవ చేసుకొనేందుకు మరో అవకాశం వస్తే ఎలా కాదంటాను? సంతోషంగా వెళ్ళాను. సాయంత్రం పల్లకి సేవ అయిపోయాక అందరం నిల్చోని ఉన్నాము. పల్లకి సేవ చేయించినవాళ్ళకి ఆ పల్లకిలో ఉన్న చిన్న బాబా విగ్రహం ఇచ్చారు. అది చూడగానే నేను బాబా వైపు చూస్తూ, "వాళ్ళు ఎంత అదృష్టవంతులో బాబా!  గురుపౌర్ణమినాడు పల్లకి సేవ చేయించుకొని మీ ప్రతిమను బహుమానంగా తీసుకున్నారు. నేను మిమ్మల్ని ఒక కోరిక కోరాను. అది నెరవేరితే నేను, నా భర్తతో కలిసొచ్చి పల్లకి సేవ చేయించుకుంటాను" అని బాబాతో చెప్పుకొని అప్పుడు నాకు కూడా విగ్రహం ఇస్తారనుకుంటున్నాను. అంతలో మేనేజరుగారు పూజారితో, "పల్లకిలో ఇంకా ఐదు బాబా విగ్రహాలున్నాయి కదా! ఒకటి ఈ అమ్మాయికి ఇవ్వండి" అని అన్నారు. అసలు ఎంత ఆనందమేసిందో మాటల్లో చెప్పలేను. 'గురుపౌర్ణమినాడు సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి' అని అడిగిన నన్ను గురుపౌర్ణమి రోజంతా తమతోనే ఉంచుకొని అంతలా అనుగ్రహించారు బాబా. ఇంకో విషయం, బాబా విగ్రహం నాకు ఇచ్చినప్పుడు నా స్నేహితురాలు నా పక్కనే ఉంది. తను కూడా మనసులో, "అబ్బా! నేను కూడా సేవ చేసుకొని ఉంటే, నాతో కూడా బాబా వచ్చేవాళ్ళు కదా" అనుకుంది. వెంటనే తనకి కూడా ఒక బాబా విగ్రహం ఇచ్చారు. తను కూడా చాలా సంతోషించింది.

కేవలం ఊదీతో కొన్ని నెలలుగా ఏ ఔషదాలు తగ్గిన నొప్పి మాయం

చాలా నెలల క్రిందట మా అమ్మ చేతి ణికట్టు దగ్గర కొంచెం నరం వాపు వచ్చి, బరువులు మోయలేక బాధతో కొంచెం ఇబ్బందిపడుతుండేది. నేను తగ్గిపోతుందిలే అని కొంచెం అశ్రద్ధ చేశాను. పోనుపోను నొప్పి ఎక్కువైపోయింది. ఇక అప్పుడు నేను అమ్మ బాధని చూడలేక, "హాస్పిటల్‌కి వెళ్దామ"ని అమ్మని అడిగాను. తను పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హోమియో మందులు వాడుకుంటాను అని చెప్పి, మా పిన్నివాళ్ళుకు తెలిసిన ఒక హోమియో డాక్టర్ దగ్గర రెండు నెలలు మందులు వాడింది. కానీ నొప్పి కొంచెం కూడా తగ్గలేదు. ఇక అప్పుడు తప్పనిసరై నేను, అమ్మ హాస్పిటల్‌కి వెళ్ళాము. డాక్టర్ ఎక్స్‌రే తీయించుకొని రండి అని అన్నారు. సరేనని, ఎక్స్‌రే తీయించాము. డాక్టర్ ఆ ఎక్స్‌రే చూసి, "కొంచెం నరం నలిగింది. పది రోజులు టాబ్లెట్లు వాడండి తగ్గిపోతుంది" అని టాబ్లెట్లు వ్రాసి ఇచ్చారు. కానీ పది రోజులైనా నొప్పి కొంచెం కూడా తగ్గలేదు. అందువల్ల మళ్లీ డాక్టర్ దగ్గరకి వెళ్ళాము. డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చి, మూడు రోజులకి మందులు వ్రాసి, "వీటితో తగ్గకపోతే చిన్న సర్జరీ చేయాలి" అని అన్నారు. అది విని నాకు, అమ్మకి చాలా భయమేసింది. ఆ భయంలో అమ్మ మందులు వాడటం పూర్తిగా ఆపేసింది. ఒకరోజు రాత్రి నిద్రలో అమ్మ చేయి మంచంకి తగిలేసరికి అమ్మ నొప్పి తట్టుకోలేక చాలా ఏడ్చింది. నాకు చాలా భయమేసి బాబాకి దణ్ణం పెట్టుకొని ఊదీ తెచ్చి అమ్మ చేతికి రాసి, బాబా పుస్తకం అమ్మ దిండు కింద పెట్టాను. అయిదు నిమిషాల్లో అమ్మ నిద్రపోయింది. పొద్దున్న లేచిన తరువాత అమ్మ, "బాబా పుస్తకం పట్టుకుని పడుకున్నాను, నిద్ర వచ్చేసింది. నొప్పి కూడా అనిపించలేదు" అని చెప్పింది. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే బాబాని బాగా నమ్ముతాను. అలాంటిది అమ్మ బాబా గురించి అలా సానుకూలంగా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. వెంటనే, "బాబా! అమ్మకి తగ్గిపోతే అమ్మతో కలిసి గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి, అమ్మచేత తొమ్మిది ప్రదక్షిణాలు చేయిస్తాను సాయి" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అసలు ఏ మందులు వాడకుండా ప్రతిరోజూ పొద్దున్న, రాత్రి స్నానం చేశాక అమ్మ చేతికి ఊదీ రాస్తుండేదాన్ని. దాదాపు 6 నెలల నుంచి ఎన్ని మందులు వాడుతున్నా తగ్గని నొప్పి, మందులన్నీ ఆపేసి ఊదీ రాయడం మొదలుపెట్టిన 10 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. అమ్మ చాలా ఆశ్చర్యపోయింది. బాబాకి ఇచ్చిన మాట ప్రకారం అమ్మతో మొక్కు చెల్లించుకున్నాను. ఇప్పుడు అమ్మ ఏ చిన్న కష్టమొచ్చినా బాబాకి చెప్పుకుంటుంది. "చాలాచాలా ధన్యవాదాలు బాబా".

మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో పంచుకుంటాను.                                                                


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo