1. శ్రీసాయి దయ
2. బ్రతకడన్న మనిషికి ఆయువునిచ్చిన బాబా
శ్రీసాయి దయ
అందరికీ నమస్కారం. నా పేరు కుమారి. ఒకసారి హఠాత్తుగా మా పిన్ని ఫోన్ నెంబరుకి కాల్స్ రావడం ఆగిపోయాయి. చూస్తే, ఆ సిమ్ పనిచేయడం మానేసింది. మేము సదరు టెలికాం ఆపరేటర్ కార్యాలయానికి వెళ్తే, వాళ్ళు చూసి, "సిమ్ పనిచేయడం లేదు. టెక్నికల్ ప్రాబ్లెమ్" అని చెప్పారు. సరేనని కొత్త సిమ్ కావాలని అడిగితే, "ఈ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో, వాళ్లొచ్చి ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలి. అప్పుడు అప్డేట్ చేసుకొని కొత్త సిమ్ ఇస్తాము" అని అన్నారు. అయితే ఆ సిమ్ మా పిన్ని పేరు మీద కాకుండా మా బంధువుల అబ్బాయి పేరు మీద ఉంది. కొన్ని కారణాలు వల్ల మేమూ, వాళ్ళు మాట్లాడుకోవడం లేదు. మా పిన్ని ఆఫీసు, బ్యాంక్ మొదలైన ప్రతిదీ ఆ నెంబరుతోనే లింక్ చేయబడి ఉన్నందున మాకు అదే నెంబరు కావాలి. కానీ వాళ్ళు అలా అంటుంటే మాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను, "బాబా! ఏలాంటి సమస్య లేకుండా ఆ నెంబర్ మునుపటిలా పనిచేసేలా చేయండి" అని బాబాకి చెప్పుకొని భారం ఆయన మీద వేశాను. తర్వాత మా తమ్ముడు తన స్నేహితునితో ఆ బంధువుల అబ్బాయికి కాల్ చేయిస్తే, ఆ అబ్బాయి లిఫ్ట్ చేసి "వస్తాన"ని చెప్పాడు కానీ, మరుసటిరోజు నుండి కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో మళ్ళీ టెలికాం ఆపరేటర్ కార్యాలయానికి వెళ్లి విషయం చెప్తే వాళ్ళు, "మేము హెడ్ ఆఫీసుకి మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పెడతాము" అన్నారు. బాబా దయవల్ల 10 రోజుల తరువాత హెడ్ ఆఫీసువాళ్ళు ఓకే చెప్పడంతో మా పిన్ని ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని ఆఫీసుకి రమ్మని పిలిచారు. మేము అలాగే వెళ్తే, మా పిన్ని పేరు మీదకి ఆ సిమ్ నెంబరు మార్చి సిమ్ ఇచ్చారు.
2023లో మా అమ్మమ్మ కాలు పాదాలు బాగా పొంగిపోయాయి. డాక్టర్ దగ్గరకి వెళ్తే, టెస్టులు చేయాలని టెస్టుల వ్రాశారు. నాకు భయమేసి, "బాబా! టెస్టు రిపోర్టులు నార్మల్ వచ్చేలా దయ చూపండి" అని బాబాకి చెప్పుకున్నాను. తరువాత టెస్టులు జరిగి రిపోర్టులు వచ్చాయి. డాక్టర్ ఆ రిపోర్టులు చూసి, "సమస్యేమీ లేదు. బ్లడ్ తక్కువగా ఉంది" అని టాబ్లెట్లు ఇచ్చి ఒక నెల తర్వాత మళ్ళీ రమ్మన్నారు. "ధన్యవాదాలు బాబా. నాకు మీరు తప్ప ఎవరూ లేరు. మీరే నాకు సహాయం చేయాలి. మీ సహాయం కోసం ఏదురుచూస్తునాను బాబా. అందరికీ ఎల్లవేళలా తోడుగా ఉండండి బాబా.
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
బ్రతకడన్న మనిషికి ఆయువునిచ్చిన బాబా
సాయినాథ్ మహారాజ్ కి జై!!! సాయిబందువులకు నమస్కారాలు. నా పేరు రేణుక. 2022, డిసెంబరులో మా నాన్న ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వస్తే, నేను, నా భర్త ఇద్దరమూ వెళ్ళాము. మేము వెళ్లేసరికి నాన్న పరిస్థితి ఏమీ బాగాలేదు. అస్సలు నడవలేని స్థితిలో ఉన్నారు. మేము వెంటనే నాన్నని హాస్పటల్కి తీసుకొని వెళ్తే, డాక్టరు టెస్టులు చేసి, చికిత్స చేసారు. తర్వాత మమ్మల్ని పిలిచి, "ఆయన శరీరంలో అవయవాలన్నీ చెడిపోయాయి. ఆయన బ్రతకడం కష్టం. నమ్మకంగా ఏమీ చెప్పలేము" అని అన్నారు. మాకు ఏం చేయాలో అర్దం కాలేదు. నేను చాలా ఏడ్చాను. తరువాత దైర్యం తెచ్చుకొని నాన్నని గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ డాక్టరు, "షుగర్ ఎక్కువైంది. కాలుకి రంధ్రం పడి కాలు మొత్తం తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన బ్రతికే స్టేజ్లో లేరు" అని చెప్పారు. అది విన్న మా బాధ అంతాఇంతా కాదు. ఏదేమైనా నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. డాక్టర్, "48 గంటలు దాటితేనే ఏదైనా చెప్తాము" అని అన్నారు. మేము దైర్యంగా చికిత్స చేయమని చెప్పాము. ఆ రోజు రాత్రి 11 గంటలకి డాక్టరు పిలిస్తే వెళ్ళాము. డాక్టరు, "ఇక లాభం లేదు. ఆయన బ్రతకడం కష్టం. మీ వాళ్లందరికీ తెలియపరచండి" అని అన్నారు. ఆ క్షణాన నేను నరకం అనుభవించాను. ఆ హాస్పిటల్కి ఎదురుగా ఒక బాబా ఫోటో వుంది. ఆ రాత్రంతా నేను బాబాని వేడుకుంటూ, "నాన్నకి నయమైతే ఆయన్ని శిరిడీకి తీసుకొస్తాన"ని మ్రొక్కుకున్నాను. అలా బాబాని వేడుకుంటూ 48 గంటలు గడిపాము. అప్పటివరకు స్పృహలో లేని నాన్న కళ్ళు తెరిచారు. బాబాకి శతకోటి నమస్కారాలు చెప్పుకున్నాను. నాన్నని నెలరోజులు హాస్పిటల్లో ఉంచాము. ఆయన కొంచెంకొంచెంగా కోలుకుంటున్నప్పటికీ కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఆయన నడవలేకపోయారు. నేను, "బాబా! నాన్న నడిస్తే శిరిడీకి తీసుకొస్తాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు పర్లేదు. నాన్న కొద్దికొద్దిగా నడుస్తూ తన పనులు తాను చేసుకుంటున్నారు. అంతా ఆ బాబా దయ. బాబా మనకి సహాయం ఏ రూపంలో అయినా చేస్తారని నేను నమ్మాను. అదే నిజమైంది. నా అనుభూతి మాటల్లో చెప్పలేనిది. బాబాకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాబాకి జై!!!

