1. సాయి మహత్యం
2. పూర్తిగా శాకాహారిగా మార్చిన బాబా
సాయి మహత్యం
నేను సాయిబాబా భక్తురాలిని. సమస్య చిన్నదైనా, పెద్దదైనా సాయికి చెప్పుకోవడం ఆయన తీరుస్తారని గుడ్డిగా నమ్మటం మా కుటుంబానికి అలవాటు. ఒకసారి ఇంట్లో ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు డ్రైనేజీ పూర్తిగా నిండిపోయి పెద్ద సమస్య అయింది. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియని నేను నాకు తోచిన విశ్వ ప్రయత్నాలు చేశాను. కానీ ఫలితం లేకపోయింది. ఇక నావల్ల కాదని పనివాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు విపరీతమైన వానల కారణంగా రాలేమని అన్నారు. ఇంట్లో చూస్తే, ఎక్కడ నీళ్లు అక్కడే నిలిచిపోయి ఉన్నాయి. నాకు ఏం చేయాలో తెలియక అలా చేయొచ్చో, లేదో తెలియదుగాని బాబా ఊదీ తీసుకెళ్లి ఎక్కడైతే నీళ్లు వెళ్లకుండా ఆగిపోయాయో అక్కడ వేసాను. అలా చేయడమైతే చేసానుగాని ఏదో పెద్ద అపరాధం చేశానని నా మనసుకనిపించి పవిత్రమైన ఊదీని డ్రైనేజీలో వేసానని నన్ను నేను నిందించుకోవడం మొదలుపెట్టాను. బాబా పాదాలు పట్టుకొని విపరీతంగా ఏడ్చాను. "నన్ను క్షమించు తండ్రీ" అని ప్రాధేయపడ్డాను. సరిగ్గా పది నిమిషాల తర్వాత వెళ్లి చూస్తే, కొద్దిసేపటివరకు నిలిచిపోయిన నీళ్లు ఒక్క చుక్క కూడా కనపడలేదు. డ్రైనేజ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇది సాయి మహత్యం కాకపోతే ఇంకేంటి? ఆ సమయంలో నాకు దిక్కుతోచలేదు. ఆయన ఒక్కడే దిక్కు అనుకున్నాను. ఆ సమయంలోనే కాదు, ఏ సమయంలోనైనా నాకు ఆయన ఒక్కడే దిక్కు. ఎందుకంటే, ఆయన నాకు నాన్న. నాకేం కావాలన్నా, నేనేం పొందాలన్నా ఆయన్ని మాత్రమే అడుగుతాను.
ఒకప్పుడు మా అమ్మ మొలల సమస్యతో తీవ్రంగా బాధపడుతుండేది. ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరిగి ఎన్నో మందులు వాడాం. కానీ నయం కాలేదు. దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అమ్మ ఆ సమస్యతో చాలా ఇబ్బందిపడింది. ఇలా ఉండగా ఒకరోజు బాబా మా అమ్మకి స్వప్న దర్శనమిచ్చి, "నీ సమస్య నేను తీరుస్తాను. నీకు మొలల ఆపరేషన్ నేను చేస్తాను" అని చెప్పి ఆ కలలోనే అమ్మకి చిన్న సర్జరీ చేశారు. అమ్మ మరుసటిరోజు పొద్దున్న లేస్తూనే, "నాకు సాయి కలలో కనిపించారు. నా సమస్య తీరుస్తానని చెప్పి సర్జరీలాగా ఏదో చేశారు" అని చెప్పింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ రోజు నుంచి మా అమ్మ మొలలు సమస్య తగ్గిపోయింది. ఇలా మా జీవితంలో ఎన్నో సమస్యల్ని అడిగిన వెంటనే పరిష్కరించారు బాబా. ఇలాంటి అనుభవాలు ఇంకా ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. సాయిభక్తులకు నేను చెప్పేది ఒక్కటే, బాబాను గుడ్డిగా నమ్మండి. 'ఇది కావాల'ని అడగాల్సిన అవసరం లేదు. మీకేం కావాలో ఆయనే చూసుకుంటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
పూర్తిగా శాకాహారిగా మార్చిన బాబా
నా పేరు వాసంతి. ముందుగా సాయి మహారాజ్ పాదపద్మములకు నా ప్రణామాలు. సాయిబంధువులకు నమస్కారాలు. నేను, మా బాబు సాయిని ప్రేమిస్తాము. ఆయనపై మాకు చాలా నమ్మకం. మాకు 15 సంవత్సరాలుగా సాయితండ్రితో అనుబంధం వృద్హి చెందుతూ వస్తుంది. సమస్య ఏదైనా సాయిబాబాను మనసులో ధ్యానించి సమస్య ఆయనకు తెలుపుకుంటే మా మనసుకు పరిష్కారం అవగతమవుతుంది. ఇంకా నా అనుభవం విషయానికి వస్తాను. మేము శాఖాహారులం. కానీ మా బాబు పీజీ అనగా ఎంబీఏ, ఎం.కం పూర్తిచేసి పూర్తిగా మాంసాహారిగా మారిపోయాడు. నేను ఎంతగా చెప్పినప్పటికీ తను మాంసాహారం తినడం మానలేదు. తన ఆలోచనలు, మాటలు కఠినంగా మారిపోయాయి. తనని మార్చడం నావల్ల కాలేదు. ఇలా ఉండగా నేను 2022, ఫిబ్రవరిలో శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాను. ఆ సమయంలో నేను ఆ స్వామికి నా సమస్యను తెలిపి, "మా బాబుని శాఖాహారిగా మార్చమ"ని వేడుకున్నాను. తదుపరి కొన్నినెలల తర్వాత మా బాబు తనంతటతానే మాంసం తిననని మాసం తినడం మానేశాడు. తర్వాత డాక్టర్ ప్రోటీన్ కొరకు గుడ్డు తినమని చెప్తే, గుడ్లు తెచ్చుకున్నాడు. కానీ తన మనసుకి అది చాలా తప్పుగా అనిపించి అవి కూడా తిననని పూర్తిగా శాకాహారిగా మారిపోయాడు. క్రమేపి తనలో ఉన్న కాటిన్యం కూడా తగ్గిపోయింది. ఇదంతా బాబాకు మా మీద ఉన్న ప్రేమ వల్ల సాధ్యమైంది. "ధన్యవాదాలు సాయినాథా. ఎల్లప్పుడూ మిమ్మల్ని ధ్యానించు భాగ్యం మాకు ప్రసాదించు సాయి. అలాగే మా అందరినీ సదా నడిపించు స్వామి".

