- కొన్ని వేలకోట్ల పరిహారాలతో 'సాయి దివ్యపూజ' సమానం
కొన్ని వేలకోట్ల పరిహారాలతో 'సాయి దివ్యపూజ' సమానం
నేను సాయిబాబా భక్తురాలిని. నేనే కాదు, మా కుటుంబమంతా కూడా సాయికి అనన్య భక్తులు. మాకు బాబానే సర్వం. మాకు ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకుంటాం. ఎందుకంటే, ఆయన మా ఇంటి పెద్ద, మా ఫ్యామిలీ డాక్టర్. ఆయన ఎన్నో కష్టాల నుంచి మమ్మల్ని కాపాడారు. ఒకసారి మా మేనత్తకి యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో బ్లడ్ దొరక్క చాలా కష్టపడ్డాం. చివరికి సాయి అనుగ్రహం వల్ల బ్లడ్ దొరికి ఆపరేషన్ సక్సెస్ అయింది. కేవలం 15 రోజుల్లో నా మేనత్త ఇంటికి వచ్చింది. అయితే ఆ యాక్సిడెంట్ వల్ల మాకు పూడ్చలేని తీవ్ర నష్టం జరిగింది. అందువల్ల నేను కోర్టులో కేసు వేసాను. 'ఆ కేసు ఎంత మాత్రమూ నిలబడదని, ఓడిపోతామని' లాయర్ చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఆశ వదిలేసుకున్నాను. గెలిస్తే గెలిచాం, లేకపోతే లేదు అని ఊరుకున్నాను. కానీ, 'మా కష్టాన్ని ఎవరూ తీర్చలేరు, ఒక్క బాబా తప్ప' అని అనుకునేవాళ్ళం. ఇలా ఉండగా ఒకసారి మా బాబాయి 'సాయి దివ్యపూజ' పుస్తకం తెచ్చారు. నేను ఆ పుస్తకాన్ని ఒకసారి చదివి ఆ పూజ చేద్దామనుకొని ఒక గురువారం ఆ పుస్తకంలో ఉన్న పూజావిధాన్నాన్ని అనుసరించి పూజ చేశాను. అనంతరం ఒక పక్కకి వెళ్లి పది నిమషాలు కూర్చున్నాను. ఇంతలో లాయరు వద్ద నుంచి నాకు ఫోన్ వచ్చింది. "మీరు ఒకసారి రండి. మీ కేసు లోక్ అదాలత్లో పెడుతున్నాము. మీరు వస్తే ఇంతటితో ఈ కేసు గెలుస్తామో, లేదో తేలిపోతుంది" అని లాయర్ చెప్పారు. నాకు నమ్మకం లేకపోయినా, 'సరే, పిలిచారు కదా వెళదామని' అని చెప్పి వెళ్ళాను. ఒక గంటన్నరపాటు వాదోపవాదాలు జరిగిన తర్వాత వచ్చేసాను. రెండు రోజులు తర్వాత మళ్లీ లాయర్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. "మీకు న్యాయం జరిగింది. మీరు ఊహించిన దానికంటే మీకు ఎక్కువ డబ్బు రాబోతోంది" అని ఆమె చెప్పింది. అది విని మేమంతా చాలా షాక్కి గురయ్యాం. ఎందుకంటే, మాకు ఆ కేసు విషయంలో ఎటువంటి ఆశలు లేవు. అలాంటిది 'సాయి దివ్యపూజ' ప్రారంభించిన ఒక్క వారంలోనే మాకు అనూహ్యమైన విజయం లభించింది. నా జీవితంలో ఎప్పటికీ, ఎన్నటికీ మర్చిపోలేని సంఘటన ఇది. బాబా చేసిన ఎన్నో గొప్ప మహిమల్లో ఇది కూడా ఒకటి. ఈ అనుభవంతో బాబా ఎప్పుడూ మాతోనే ఉంటారు, మమ్మల్ని రక్షిస్తూ ఉంటారని మరింత గుడ్డిగా నమ్మడం ప్రారంభించాను.
నేను ఒక జ్యోతిష్యురాలిని. మాములుగా నేను ఇంతని కన్సల్టింగ్ ఫీజు తీసుకుంటాను. అయితే ఒకరోజు ఒక పాత క్లయింట్ నా దగ్గరకు వచ్చి, "నా ఫ్రెండ్ పరిస్థితి ఏమంత బాగోలేదు. తిండి గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళ జాతకం చూసి ఏవైనా పరిహారాలు చెప్పండి. ఫీజు మాత్రం ఇచ్చుకోలేరు" అని నన్ను అర్థించారు. సరేనని నేను వాళ్లతో ఫోన్లో మాట్లాడి, వాళ్ళ జాతకం చూసి చాలా పెద్ద పెద్ద దోషాలు ఉండటం వల్ల కొన్ని పరిహారాలు చెప్పాను. "మేము ఆ పరిహారాలు చేసుకోలేము. మా దగ్గర అంత డబ్బు లేదు. మేము దరిద్రంలో ఉన్నాం. మా అబ్బాయి చదువు పూర్తిచేసి 5 సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఒక్క ఉద్యోగావకాశం కూడా రావట్లేదు. కొన్ని కొన్ని ఆఫర్ లెటర్ దాకా వచ్చి ఆగిపోతున్నాయి" అని వాళ్ళ తమ కష్టాన్ని చెప్పుకొని చాలా బాధపడ్డారు. నాకు ఏం చేయాలో తోచలేదు కానీ, ఒకేఒక్క ఆలోచన ఆ సమయంలో నాకు తట్టింది. తదునుగుణంగా నేను గుడ్డిగా నమ్మే సాయినాథుని "వాళ్లకి సహాయం చేయమ"ని అడిగి, ఏ కష్టమొచ్చినా నేను ఆచరించే 'సాయి దివ్యపూజ' చేసుకోమని వాళ్లతో చెప్పాను. 'సాయి దివ్యపూజ'కి పెద్దగా ఏమీ అక్కర్లేదు. పూలు, అరచేయంత రెండు రుమాలులు, కట్టె పొంగలి ఉంటే సరిపోతుంది. అందుకే 'సాయి దివ్యపూజ' గురించి చెప్పి, వాళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితం మారుతుందని నేను గుడ్డిగా నమ్మి వాళ్లకు ఆ సలహా ఇచ్చాను. వాళ్లు నేను చెప్పిన వెంటనే రెండు రుమాలులు కొనుక్కొని ఒక రుమాలుని ఆసనం మీద వేయడానికి పక్కనుంచి, ఇంకో రుమాలుని పసుపు నీళ్లతో తడిపి ఆరేసి, పూజకి అంతా సిద్ధం చేసుకున్నారు. ఇంకాసేపట్లో పూజ ప్రారంభించబోతారనగా వాళ్ళబ్బాయికి ఇంటర్వ్యూకి రమ్మని ఒక కాల్ వచ్చింది. విషయమేమిటంటే, ఎప్పుడో ఒక ఆరునెలల క్రితం ఆ అబ్బాయి ఆ ఉద్యోగానికి అప్లై చేసి, ఎంతకీ కాల్ రాకపోయేసరికి ఈ ఉద్యోగం కూడా రాదని వాళ్ళు ఆశ వదిలేసుకున్నారు. వెంటనే ఆ అబ్బాయి 'సాయి దివ్యపూజ' పూర్తిచేసి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఒక వారం లోపే ఆఫర్ లెటర్ వచ్చి ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ఒకప్పుడు తినడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళ జీవితాలలో ఇప్పుడు ఎంతో వెలుగు నిండి ఉంది. వాళ్ళు సాయి భక్తులై బాబాని పూజించుకుంటున్నారు.
ఒకసారి నన్ను ఒక ఆవిడ సంప్రదించారు. ఆవిడకి పెళ్ళై ఒక బాబు ఉండగా మళ్లీ కడుపుతో ఉంది. ఆవిడ సమస్య ఏమిటంటే, తనకి, తన భర్తకి మధ్య విపరీతమైన గొడవలు. వాటిని తట్టుకోలేక ఆవిడ అత్తవారింటిని వదిలి పుట్టింటికి వచ్చేసింది. విడాకులు తీసుకుందామని నిశ్చయించుకుంది కూడా. అయినా ఆవిడకి మనశ్శాంతి లేకపోవడం వల్ల నాకు ఫోన్ చేసింది. నేను ఆవిడ జాతకం చూసి జాతకరీత్యా ఆవిడకి చెప్పాల్సిన కొన్ని పరిహారాలు చెప్పాను. అయితే నేను ఎన్ని పరిహారాలు చెప్పినా ఆవిడ సంతృప్తి చెందక జాతకం చెప్పించుకుంటూనే విపరీతంగా ఫోన్లో ఏడ్చేశారు. నేను ఆవిడ బాధ చూసి తట్టుకోలేకపోయాను. అప్పుడు నా మనసుకి ఈ పరిహారాలు అన్నిటికంటే అసలైన పరిహారం 'సాయి దివ్యపూజే'ననిపించి ఆవిడతో " 'సాయి దివ్యపూజ' చేసుకోండి" అని చెప్పి 'సాయి దివ్యపూజ' పుస్తకం డౌన్లోడ్ చేసి వాట్సాప్లో ఆవిడకి పంపించాను. ఆ తర్వాత ఆవిడ బుక్ స్టాల్ నుంచి ఆ పుస్తకం తెచ్చుకొని 11 వారాలు పూజ చేస్తాననుకొని 'సాయి దివ్యపూజ' మొదలుపెట్టింది. ఆవిడలా పూజ ప్రారంభించిన మూడు వారాల తర్వాత ఆవిడ అత్తగారు వచ్చి, "మా అబ్బాయి విడాకులు కావాలని అడుగుతున్నాడు కానీ, నిన్ను వదులుకోవడం మాకు ఇష్టం లేదు. ఆ దేవుని దయవల్ల అన్ని గొడవలు సమసిపోతాయి. వచ్చే వారం మేము వచ్చి నీకు సీమంతం చేస్తాము" అని ఆవిడతో, ఆవిడ తల్లిదండ్రులతో మాట్లాడి వెళ్లారు. అన్నట్టుగానే మరుసటి వారం వచ్చి సీమంతం చేశారు. అప్పటినుంచి ఆవిడ భర్త అప్పుడప్పుడు ఆవిడతో ఫోన్లో మాట్లాడడం, మెసేజ్ చేయడం మొదలుపెట్టాడు. అది అలా కొనసాగి వాళ్ల మధ్య ఉన్న గొడవలు సమసిపోయాయి. సాయి వాటిని పూర్తిగా తీసేశారు. అంతేకాదు, ఆవిడ 'సాయి దివ్యపూజ' చేసేటప్పుడు 'నాకు ఆడపిల్ల కావాలి' అని ముడుపు కట్టింది. తను కోరుకున్నట్టుగానే ఆవిడకి ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు ఆవిడకి ఏ సమస్య వచ్చినా 'సాయి దివ్యపూజ' చేస్తున్నారు. మరే పరిహారాల జోలికి పోవడం లేదు. కొన్ని వేలకోట్ల పరిహారాలతో 'సాయి దివ్యపూజ' సమానం. మనకి ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా 'సాయి దివ్యపూజ' చేయడం, సాయినాథుని గుడికి వెళ్లి సచ్చరిత్ర పారాయణ చేయడం చేస్తే కష్టాలు, బాధలు తీరిపోతాయి. ఇంకా ఏమి అక్కర్లేదని నా అనుభవం ద్వారా, నా క్లయింట్ల అనుభవాల ద్వారా నేను తెలుసుకున్నాను.

