సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1324వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న బాబా

నేనొక సాయిభక్తుడిని. నిజంగా ఈ బ్లాగుని నిర్వహిస్తున్నది బాబానే. వారికి నా అనేక నమస్కారాలు. ఈ ఆధునిక సాయిసచ్చరిత్రలో నా అనుభవాలు ప్రచురింపబడటం బాబా నాకు ప్రసాదించిన వరంగా భావిస్తున్నాను. నేను ఇంతకుముందు నన్ను, నా కుటుంబసభ్యులను బాబా ఎలా కాపాడిందీ, ఒక వ్యక్తి బారినుండి నన్ను ఎలా రక్షించిందీ ఈ బ్లాగులో పంచుకున్నాను(అనుభవమాలిక 824, 891 భాగాలలో). ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను. నా చిన్నతనంనుంచి బాబా నాకు తెలుసు. ఆ వయసులో నేను, నా స్నేహితులు ప్రతి గురువారం బాబా గుడికి వెళ్లి సంధ్య ఆరతి పాడేవాళ్ళం. కానీ ఇంటర్మీడియట్‌కి వచ్చేటప్పటికి నేను గుడికి వెళ్ళటం మానేశాను. అలా ఒక పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పది సంవత్సరాలలో థైరాయిడ్ తదితర అనేక వ్యాధులతో, కష్టాలతో చేతిలో డబ్బులేక నరకం అనుభవించాను. నా సమస్యల పరిష్కారం కోసం యోగా చేయడం, ఆయుర్వేదం మరియు అల్లోపతి మందులు వాడటం చేశాను. కానీ నా పరిస్థితి బాగుపడలేదు. చివరికి ఆధ్యాత్మికత వల్ల ఏమన్నా ప్రయోజనం ఉండవచ్చేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాను. ప్రతి గ్రంథంలోనూ 'ఆధ్యాత్మిక మార్గంలో సద్గురువు ఉండటం తప్పనిసర'ని చదివి 'సద్గురువు ఎలా ఉంటారు? ఆయనను ఎలా కలవాలి?' అని ఒక టెలిగ్రామ్ గ్రూపులో అడిగాను. నా ప్రశ్నకి ఒకరు, 'శ్రీగురుచరిత్ర పారాయణ చేస్తే, సద్గురువు లభిస్తార'ని ఆన్సర్ చేశారు. దాంతో ఒకసారి శ్రీగురుచరిత్ర పారాయణ చేశాను. వెంటనే శ్రీదత్తాత్రేయస్వామి స్వప్నదర్శనం ఇచ్చారు. మరికొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు లభించిన అనంతరం ఒకరోజు కలలో బాబా కనబడి 'తాము పూర్ణ దత్తావతారమని, ఇకనుంచి నన్ను సేవించినట్లైతే నీకు రాబోయే కష్టాలను తొలగించి జీవితాంతం నీకు తోడు ఉంటాన'ని చెప్పారు. కానీ నా మనసులో 'బాబా ముస్లిం కదా!' అనే ఒక చిన్న శంక ఉండేది. ఒకసారి గురుచరిత్రలో తెలుపబడ్డ శ్రీపాద శ్రీవల్లభస్వామి గురించి ఇంటర్నెట్లో వెతికితే 'శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం' అనే గ్రంథం లభించింది. అందులో శ్రీదత్తాత్రేయుడు హిమాలయాలలో శ్రీఆంజనేయుని కలిసినట్లు, దత్తతత్త్వంలో సమర్థ సద్గురు శ్రీసాయినాథునిగా అవతరించి జనులని తరింపచేయమని శ్రీఆంజనేయుడిని ఆదేశించినట్టు చదివాను. అప్పటినుంచి నేను బాబా, దత్తాత్రేయుడు ఒకటే అని నమ్ముతున్నాను. ఆయన నా అనారోగ్యాన్ని తగ్గించేందుకు ఒక సాయిమందిరంలో నిర్వహించిన మెడికల్ క్యాంపుకి వెళ్లేలా చేసి, వాళ్ళు ఇచ్చిన మందులు వాడినంతనే దాదాపు 75% పైగా నా అనారోగ్యం నయమయ్యేలా అనుగ్రహించారు.


అంతేకాదు, ఎన్నోసార్లు ఎంతోమంది చేతుల్లో మోసపోకుండా బాబా నన్ను కాపాడారు. నేను కరోనా బారినపడ్డప్పుడు ఒక గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా నాకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. ఆరోజే అనుకోకుండా నా స్నేహితురాలు 'తనకి ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉందని, కాబట్టి మహాపారాయణలో భాగంగా తాను చదవవలసిన సాయిసచ్చరిత్రలోని రెండు అధ్యాయాలను నన్ను పారాయణ చెయ్యమ'ని మెసేజ్ చేసింది. నేను సరేనని చదివితే, రెండో అధ్యాయంలో "చావు చీటీ తీసివేసితిని" అని ఉంది. అది చదవగానే నాకు అప్పటివరకు ఉన్న కరోనా లక్షణాలు పోయి పూర్తిగా నయమైపోయింది.


బాబా ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లలో వచ్చే సందేశాల ద్వారా ప్రతి గురువారం మందిరంలో మధ్యాహ్న ఆరతికి హాజరుకమ్మని, అక్కడ జరిగే సేవాకార్యక్రమాలలో పాల్గొనమని, పేదలకు, అనాథలకు అన్నదానం చేయమని నాకు తెలియజేశారు. దాంతో నేను ప్రతి నెలా నాకు వచ్చే ఆదాయంలో 10% అన్నదానానికి ఇవ్వడం మొదలుపెట్టాను. నేను అన్నదానానికి ఇవ్వగానే, 'నువ్వు పేదలకు పెడుతున్న అన్నం నాకు చేరుతోంది' అన్న మెసేజ్ ఫేస్‌బుక్‌లో చూసి నాకు చాలా సంతోషమేసింది.


బాబా ఆరతులు మరాఠీ భాషలో ఉండటం వల్ల వాటి భావం మనకి అర్థం కాదు. నాకు వాటిని భావయుక్తంగా చదువుకోవాలని ఉండేది. కొద్దిరోజులకి నేను 'సర్వం శ్రీసాయి సేవ' ట్రస్ట్ ద్వారా వెలువడిన 'శ్రీసాయి సంపూర్ణ ఆరతులు' అనే పుస్తకం కొన్నాను. దానిలో శిరిడీ ఆరతులు, వాటి తెలుగు వివరణలు ఉన్నాయి. ఆ పుస్తకం నా వద్దకు రాగానే, "నేను పంపిన పుస్తకాలు జాగ్రత్తగా దాచుకో. అవి భవిష్యత్తులో నీకు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి" అనే బాబా వచనం ఫేస్‌బుక్‌లో వచ్చింది. అప్పుడు ఈ పుస్తకాలను కొనేలా బాబానే అనుగ్రహించారని నాకర్థమైంది. ఇంకోసారి నాకు బాబా 108 నామాలు చదవాలనిపించింది. అప్పుడు బాబా నాకు 'శ్రీసాయి దివ్యపూజ' అనే పుస్తకాన్ని ప్రసాదించారు. అందులో నాకు కావలసిన బాబా 108 దివ్యనామాలు ఉన్నాయి.


ఒకరోజు నా పర్సు కనిపించకుండా పోయింది. అప్పుడు నేను, "బాబా! నా పర్సు దొరికాల"ని బాబాను వేడుకున్నాను. 10 నిమిషాల్లో అమ్మ, "పర్సు దొరికింద"ని తెచ్చి ఇచ్చింది. ఇకపోతే, నేను వ్రాసిన డి.ఎస్.సి, పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలలో ఏదో ఒక ఉద్యోగాన్ని నాకు ప్రసాదించమని బాబాని వేడుకుంటే, ఈ బ్లాగ్ ద్వారా 'నీకు ఉద్యోగం వస్తుంద'ని తెలియజేశారు బాబా. ఆయన కృపకోసం నిరీక్షిస్తున్నాను.


నేను చేసుకున్న పాపాల ఫలితంగా నా ఛాతీలో, వీపు క్రిందిభాగంలో, తలలో విపరీతమైన నొప్పి వచ్చినప్పుడు ఫేస్‌బుక్‌లో "నన్ను నిందించవద్దు. నీ వ్యాధులు మరియు నొప్పుల భారం నేను స్వీకరిస్తున్నాను" అని మెసేజ్ రావటం, అంతేకాకుండా సరిగ్గా నాకు నొప్పి ఉన్న ప్రాంతాలలోనే, అంటే ఛాతీ, పిరుదుల భాగంలో నొప్పితో బాధపడుతున్నట్టు బాబా ఫోటో కూడా దర్శనమివ్వడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. 2, 3 రోజులలో ఏ మందులు వాడకుండా నా నొప్పులు తగ్గిపోయాయి. అంటే, నా దుష్కర్మల ఫలితాలైన ఆ నొప్పులను తాము స్వీకరించి నన్ను ఆ బాధనుంచి విముక్తుడిని చేశారు బాబా. ఆయన మనం భరించలేని కర్మని మనకి ఇవ్వరు, మనం మోయగలిగినంత మాత్రమే ఇస్తారు. మిగతాది స్వయంగా తామే అనుభవిస్తారు. ఈ విషయాలను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో వచ్చే సందేశాల ద్వారా బాబా నాకు తెలియజేసి నా భక్తివిశ్వాసాలను మరింతగా దృఢపరుస్తున్నారు. ఇప్పుడు బాబానే నా లోకంగా మారిపోయారు. నేను వారిని స్మరించని క్షణం లేదు. ఇలా బాబా తమ కృపను నా మీద ప్రసరించకపోయుంటే నేను అసలు జీవించి ఉండేవాడినే కాదు. ఆయన పూర్ణ దత్తావతారం. సాక్షాత్తూ దత్తాత్రేయుడే. బాబా ఒక్కసారి మనల్ని స్వీకరిస్తే, జన్మజన్మలు మనతోనే ఉంటారు. మధ్యలో మన చెయ్యి విడిచిపెట్టరు. కాబట్టే నేను ఆయన కృపకు అర్హుడిని కాకపోయినప్పటికీ దయతో నన్ను కాపాడుతున్నారు. నేను ఏడిస్తే ఒక తల్లిలా, స్నేహితుడిలా నన్ను ఊరడిస్తున్నారు. వారి మహాత్మ్యం వర్ణించడానికి మాటలు సరిపోవు. వారు చూపే ప్రేమ తల్లిదండ్రులు, స్నేహితులు చూపే ప్రేమకన్నా అధికం. ఇంత ప్రేమ చూపే బాబా మన నుంచి కోరేది స్వచ్ఛమైన ప్రేమ, శ్రద్ధ, సబూరీ, దైవంపట్ల కృతజ్ఞత, ఇతరుల హృదయాలను గాయపరచకుండా ఉండటం. బాబా చెయ్యలేని పని, తీర్చలేని కోరిక, మోయలేని బరువు, ఇవ్వలేని వరం ఈ సృష్టిలోనే లేవు. కానీ వాటిని పొందటానికి మనకు దృఢమైన భక్తి, విశ్వాసాలు, శ్రద్ధ, సబూరీ కావాలి. "ధన్యవాదాలు బాబా. దయచేసి నా చదువు, ఆరోగ్యం, పెళ్లి ఉద్యోగం బాధ్యతలు మీరే చూసుకోండి బాబా. ఈ భారం మోయలేకపోతున్నాను, మీరే ఆదుకోండి బాబా".



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo