1. సాయినాథుని కరుణాకటాక్ష వీక్షణాలు
2. ఆటంకాలు తొలగించి ప్రయాణం చేయించిన బాబా
సాయినాథుని కరుణాకటాక్ష వీక్షణాలు
నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా శ్రీసాయినాథుని దివ్య పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒకసారి మావారు జలుబు, దగ్గు, స్వల్ప జ్వరంతో ఇబ్బందిపడ్డారు. ఆరోజు మధ్యాహ్నం ఆయన కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ పక్కనున్న ఏదో అందుకోవడానికి అటుఇటు జరిగారు. ఆ క్రమంలో ఆయన కూర్చున్నది ప్లాస్టిక్ కుర్చీ అయినందున టైల్స్ మీద జారి కిందపడ్డారు. కుర్చీ విరిగిపోయింది. ఆయన కుడి పక్కటెముకల్లో నొప్పి వచ్చింది. తల దగ్గర, కుడి చెవి క్రింద కొంచెం వాపు వచ్చింది. ఒళ్ళునొప్పులు కూడా ఉన్నాయి. మరుసటిరోజు ఆఫీసులో ఆడిట్ ఉన్నందువల్ల ఆ స్థితిలో ఎలా పని చేయాలని మావారు టెన్షన్ పడ్డారు. నేను వెంటనే బాబాకు నమస్కరించుకొని, "మావారికి జ్వరం, అన్నీ నొప్పులు, వాపులు తగ్గాల"ని చెప్పుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. ప్రక్కరోజు మావారు ఆఫీసుకి వెళ్తే ఆడిట్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. ఇంకా జ్వరం, ఒళ్ళునొప్పులు, వాపు చాలావరకు తగ్గి రెండు రోజులకు పూర్తిగా నార్మల్ అయ్యారు. నా తండ్రి సాయినాథుడు ఏదో పెద్ద ప్రమాదం నుంచి నా భర్తను కాపాడారని అనుకుంటున్నాను. "చాలా థాంక్స్ బాబా. మీ చల్లని కరుణాకటాక్ష వీక్షణాలు నా కుటుంబం మీద, అందరి మీద ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను సాయినాథా".
20 సంవత్సరాల క్రితం నాకు పంటి చిగుళ్ళకు సంబంధించి ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి పంటి చిగుళ్ల నొప్పి అంటే నాకు చాలా భయం. నాలుగు సంవత్సరాల కిందట చెకప్ కోసం డెంటిస్ట్ వద్దకి వెళ్తే, "ఒక పంటికి రూట్ కెనాల్ చేస్తే మంచిది" అన్నారు. అప్పుడు నేను బాబా దగ్గర చీటీలు వేస్తే, 'రూట్ కెనాల్ వద్దు' అని వచ్చింది. ఇంకా నేను రూట్ కెనాల్ చేయించుకోలేదు. బాబా దయవల్ల తర్వాత నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇటీవల ఒకసారి పంటినొప్పి, చిగుళ్ల వాపు వచ్చాయి. అప్పుడు నేను భయపడి బాబాకి దణ్ణం పెట్టుకొని, "డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకుండానే ఊదితో, గృహ చికిత్సలతో నొప్పి తగ్గిపోవాల"ని మొక్కుకున్నాను. బాబా దయ చూపించారు. నాలుగు రోజులలో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. మీ చల్లని కరుణాకటాక్షాలు నామీద ఎల్లప్పుడూ ఉండాలి బాబా".
ఆటంకాలు తొలగించి ప్రయాణం చేయించిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
నేను ఒక సాయి భక్తుడిని. మా అక్క కూతురు పెళ్లి 2023, మే నెలలో నిశ్చయమైంది. మేము ఒక నెల ముందే ట్రైన్ టికెట్లు బుక్ చేసాము. కానీ సమయం దగ్గర పడుతున్నా టిక్కెట్లు RACలోనే ఉండటంతో నేను, "బాబా! టికెట్ కంఫర్మ్ అవ్వకుండా 8 నెలల బాబుతో 24 గంటలు ప్రయాణం చాలా కష్టం. మీ దయతో మా టికెట్లు కన్ఫర్మ్ అవ్వాలి" అని బాబాను వేడుకొని ఆయన మీద భారం వేసాను. ఆ తండ్రి దయవల్ల ప్రయాణానికి రెండు రోజుల ముందు టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఇకపోతే, నేను ప్రయాణమయ్యే రోజు కూడా సెలవు తీసుకుని అన్నీ సర్దుకుని రాత్రి ట్రైన్ ఎక్కుదామనుకున్నాను. కానీ ఆ ముందురోజు సాయంత్రం వచ్చిన ఆఫీస్ ఆర్డర్(తరువాత రోజు డ్యూటీ డిస్క్రిప్షన్ డీటెయిల్)లో మరుసటిరోజు నాకు డ్యూటీ వేసినట్లు ఉంది. నేను వెంటనే మా ఇంచార్జికి ఫోన్ చేసి అడిగితే, "వేరే ఇంజినీర్లు అందుబాటులో లేనందున సెలవు ఇవ్వడం కుదరదు" అని అన్నారు. నేను, "ఈరోజు రాత్రే నా ప్రయాణం" అని చెప్పినా అతను వినలేదు(కనీసం అలా చెప్తేనైనా వదులుతారని అలా చెప్పాను). నేను వెంటనే బాబాని తలుచుకొని, "బాబా! ఎలా అయినా సెలవు ఇచ్చేలా చూడు తండ్రీ" అని చెప్పుకున్నాను. 30 నిముషాల్లో ఆ ఇంచార్జ్ తనంతటతానే నాకు ఫోన్ చేసి, "నువ్వు సెలవు తీసుకోవచ్చు" అని అన్నారు. నాకు చాలా ఆనందంగా అనిపించి బాబాకి ధన్యవాదాలు చెప్పుకొని, "బాబా! నేను రేపు ట్రైన్ ఎక్కేవరకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎవరి కంటా పడకుండా చూడు తండ్రి" అని ప్రార్థించాను. ఆ కరుణామయుడిపై భారం వేసాక ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మా ప్రయాణం ఎటువంటి ఇబ్బందీ లేకుండా చక్కగా జరిగింది. పెళ్లి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగింది. మేము క్షేమంగా మా ఇంటికి తిరిగి వచ్చాము. అంతా ఆ బాబా దయ. "ధన్యవాదాలు బాబా. నా భార్యాబిడ్డలను సదా సంరక్షించు తండ్రీ. అలాగే మీ అనుగ్రహం మీ భక్తులందరిపై వర్షించు తండ్రీ".

