1. బాబా తోడుగా ఉన్నంతవరకు దేనికీ భయపడవలసిన పనిలేదు
2. సంవత్సరం తర్వాత వస్తువు దొరికేలా అనుగ్రహించిన బాబా
బాబా తోడుగా ఉన్నంతవరకు దేనికీ భయపడవలసిన పనిలేదు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నేను సాయిభక్తురాలిని. సాయే నా ప్రత్యక్ష దైవం. ఆయన పిలిచిన వెంటనే పలుకుతారు, మన బాధలను తీరుస్తారు. సాయిపట్ల నమ్మకం, విశ్వాసం ఉంటే ఆయనెప్పుడూ మన వెంటే ఉంటారు. ఆయన లీలలను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక నా అనుభవాల విషయానికి వస్తే... నాకు నాలుగు సంవత్సరాల నుంచి నెలసరి సమస్య ఉంది. దానికోసం స్కానింగులు, టెస్టులు చేయించుకుంటే సమస్య ఏమీ లేదని వచ్చేది, కానీ నా అనారోగ్య సమస్య తీరేది కాదు. ఇలా ఉండగా ఈమధ్య ఎమ్ఆర్ఐ టెస్ట్ చేయిస్తే, గర్భసంచిలో ఫైబ్రాయిడ్లు(గర్భాశయ పొరలు) ఉన్నాయని రిపోర్టులో వచ్చింది. డాక్టరు బయాప్సీ చేయించుకోమని చెప్పారు. బయాప్సీ టెస్ట్ అనేసరికి రిపోర్టు ఎలా వస్తుందో, ఏమో అని నాకు చాలా భయమేసి, "బాబా! ఎలాగైనా బయాప్సీ టెస్ట్ చేసే అవసరం రాకుండా చూడు" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నేను ఎప్పుడు 'సాయిబాబా ప్రశ్నలు-జవాబులు’ తెరిచినా 'ఆరోగ్యంగా ఉంటావ'ని సమాధానం వచ్చేది. అలా బాబా ప్రతిక్షణం నాకు అభయమిస్తూనే ఉండేవారు. కొన్ని నెలల తరువాత ఒక గైనకాలజిస్ట్ దగ్గరకు వెళితే, ఆమె స్కానింగ్ చేసి, "ఎటువంటి సమస్యలు లేవు. అంతా బాగుంది. బయాప్సీ అవసరం లేదు" అని చెప్పింది. బాబా దయవల్లే నాకు ఇంత మంచి జరిగింది. ఇంత మంచి బాబా మనకు తోడుగా ఉన్నంతవరకు మనం దేనికి భయపడవలసిన పనిలేదు.
నాకు ప్రమోషన్ వచ్చి ముందు ఉండే ఊరికంటే దగ్గర్లో ఉండే చోటికి ట్రాన్స్ఫర్ అవడంతో చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే 'తదుపరి బదిలీలలో మేము అక్కడినుండి వేరే చోటుకి వెళ్లిపోవాల'న్న వార్త తెలిసింది. మళ్ళీ బదిలీలు అయితే దూరప్రాంతానికి వెళ్లే ప్రమాదముందని నాకు చాలా భయమేసి, "బాబా! ఎలాగైనా బదిలీ లిస్టులో మేముండే చోటు చూపించకుండా చూడు తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మేము కోర్టులో కేసు గెలిచాము. ఆ కారణంగా మేము ఉన్నచోటులోనే కొనసాగుతున్నాము. "థాంక్యూ బాబా. మీ చల్లని చూపువలనే ఇదంతా జరిగింది. అడిగిన వెంటనే కోరికలు తీర్చే కల్పవృక్షం మీరు బాబా".
నేను శిరిడీ వెళ్లాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నప్పటికీ వెళ్లకపోయాను. చివరికి ఒకరోజు అనుకోకుండా శిరిడీ ప్రయాణాన్ని నిర్థారించుకున్నాము. నేను శిరిడీకి బయలుదేరేటప్పుడు ముడుపులన్నీ తీసుకొని, "బాబా! ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము శిరిడీ దర్శించి, తిరిగి క్షేమంగా ఇంటికి చేరేలా దయ చూపండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల వారిని చాలాసేపు దర్శించుకొనే భాగ్యం, సమాధి తాకి నమస్కరించుకొనే అదృష్టం మాకు దక్కాయి. మధ్యాహ్న హారతి వీక్షించే అవకాశం కూడా బాబా ప్రసాదించారు. మేము అక్కడినుండి పండరీపూర్ వెళ్లి పాండురంగని, ఆపై కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము.
ఒకసారి మా పనిమనిషి కిందపడి కాలు నొప్పి వల్ల పనికి రాలేకపోయింది. ఆమె బాగా పని చేస్తుంది. ఆ కారణంగా ఆమె వస్తే బాగుంటుందని, "బాబా! ఎలాగైనా ఆమెకు కాలనొప్పి తగ్గించి, తిరిగి పనికి వచ్చేలా చేయి తండ్రి" అని బాబాను ప్రార్థించాను. ఆయన దయవల్ల 2023, మార్చి 2న తను పనికి వస్తానని చెప్పింది. అంతా సాయి దయ.
ఈమధ్య మా అమ్మకు ఆయాసం ఎక్కువై ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చేరింది. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా అమ్మకు ఆరోగ్యాన్ని ప్రసాదించి హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి చేర్చు తండ్రి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగుంది. కాకపోతే కొంచెం నీరసంగా ఉంటుంది. బాబా సర్వాంతర్యామి. సదా మనల్ని రక్షిస్తూ ఉంటారు. "ధన్యవాదాలు బాబా. అమ్మ రామకోటి చేస్తుంది. ఇంకా ఐదు లక్షలు చేయాల్సి ఉంది. ఆ జపం పూర్తి చేసే శక్తిని అమ్మకు ప్రసాదించు తండ్రి".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సంవత్సరం తర్వాత వస్తువు దొరికేలా అనుగ్రహించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నేను సాయిభక్తురాలిని. ఈ కలియుగంలో పిలిస్తే పలికే దైవం సాయిబాబా. ఎంతో అపారమైన పుణ్యం చేసుకుంటే తప్ప ఈ జన్మలో సాయిభక్తులం కాలేము. సాయిని పొందడం ఒక భాగ్యం. ఆయన తమ భక్తులకు ఎన్నో అనుభవాలను ప్రసాదిస్తుంటారు. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. సంవత్సరం క్రితం నేను నా బంగారు ఆభరణం ఒకటి ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోయాను. మళ్ళీ సంవత్సరం తర్వాత నాకు ఆ ఆభరణం గుర్తుకు వచ్చింది. ఆరోజు గురువారం. నేను బాబా గుడికి వెళదామని తయారవుతూ ఇంట్లో ఆ నగ కోసం ఎంత వెతికినా కనిపించలేదు. నేను గుడికి వెళ్ళి, "నా వస్తువు నాకు దొరకాల"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల నా వస్తువు నాకు దొరికింది. ఇది నిజమా, కలా అని అందరం ఆశ్చర్యానికి లోనయ్యాము. "ధన్యవాదాలు బాబా".

