సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1027వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చూపిన అనుగ్రహం
2. బాబా కృపతో ఆరోగ్యం
3. ఎప్పుడూ మనతోనే ఉంటూ బాధల నుండి గట్టెక్కిస్తారు బాబా

బాబా చూపిన అనుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిబంధువులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకి కృతజ్ఞతలు. నా పేరు హరిత. నాకు నా చిన్నవయసు నుండి బాబా తెలుసు. మా అమ్మకు సాయిబాబా అంటే నమ్మకం. ఆవిడ నా చిన్నవయసు నుండే నాచేత బాబాచరిత్ర పారాయణ చేయించేది. రెండు నెలల క్రితం నా మొబైల్‍లో ఏ లింక్ ద్వారా ఈ బ్లాగు ఓపెన్ అయ్యిందో నాకు గుర్తులేదుకానీ అప్పటినుండి ఈ బ్లాగు గురించి తెలుసు. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మొదటిసారి పంచుకుంటున్నాను.


నేను, నా భర్త ఉద్యోగస్థులము. చాలాకాలంగా నా భర్త సైనస్ సమస్యతో బాధపడుతున్న కారణంగా 2021, సెప్టెంబర్ 8న నేను, నా భర్త ముందునుండి మాకు పరిచయమున్న ENT డాక్టరుని కలిసాము. ఆవిడ నా భర్త ముక్కు స్కాన్ చేయించి, "అంతగా భయపడవలసిన అవసరం లేద"ని చెప్పారు. కానీ మరుసటిరోజు ఆవిడ రిపోర్ట్ చూసి, మాకు ఫోన్ చేసి "ఈరోజు మీరు హాస్పిటల్‍కి రండి, రిపోర్టులో మీ వారి తలలో ఎదో సమస్య ఉన్నట్టు ఉంది" అని చెప్పారు. అది వింటూనే నేను చాలా కంగారుపడి ఏడ్చేసాను. తరువాత మావారికి MRI స్కాన్ చేసారు. అందులో మావారికి బ్రెయిన్ ట్యూమర్ అని, తప్పకుండా ఆపరేషన్ చేయాలన్నారు. అలా అనుకోకుండా మావారి బ్రెయిన్‍కి రెండు ఆపరేషన్లు చెయ్యవలసి వచ్చింది. చిన్న వయసులోనే ఆయనకి ఇలా రావడం చాలా బాధాకరం. నాకు చాలా భయమేసింది. మా వారికి ఆపరేషన్ జరిగే సమయంలో మా మేనమామ మరియు అత్తయ్యవాళ్ళ సహాయంతో నేను మహాపారాయణ గ్రూప్ ద్వారా బాబా పారాయణ చేయించాను. డాక్టరు ట్యూమర్ తీసిన తరువాత, "బ్రెయిన్ స్టెమ్‍కి తగిలి ఉన్న కారణంగా ట్యూమర్ మొత్తం తీయలేకపోయాము. ఇంకా 20% మిగిలి ఉంది. దానికి రేడియోథెరపీ చేయించాలి" అని అన్నారు. తరువాత డిసెంబర్ 2వ తారీఖున రేడియోథెరపీ జరిగింది. ఈ మొత్తం ప్రక్రియకు చాలా డబ్బు ఖర్చవుతున్న తరుణంలో నేను బాబాను ప్రార్ధించి, "నేను ఎక్కువ డబ్బులు పెట్టుకోలేను బాబా. 20,000 రూపాయలకు మించి ఖర్చు చేసే సామర్ధ్యం మాకు లేదు. మాపై దయచూపండి బాబా" అని వేడుకుని, "నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా నా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. మొత్తం ట్రీట్మెంట్‍కి 10 లక్షలదాక ఖర్చు అయితే, కేవలం 10,000 రూపాయలు మేము కట్టేలా అనుగ్రహించారు బాబా. ఆయన దయవలన ఇన్స్యూరెన్స్ చాలావరకు కవర్ అయ్యింది. అయితే ఇన్స్యూరెన్స్ నుండి ఇంకా అప్రూవల్ రాలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మావారి ఆరోగ్యానికి సంబంధించి చాలా పెద్ద సమస్యతో పోరాడుతున్నామని మీకు తెలుసు. ఈ సమస్య నుండి త్వరగా మమ్మల్ని బయటపడేస్తే నేను నా అనుభవాన్ని ఈ బ్లాగులో మళ్లీ పంచుకుంటాను". చివరిగా సాయిబంధువులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మమ్మల్ని ఆ సమస్య నుండి బయటకి లాగమని బాబాని మా తరపున వేడుకోమని అర్థిస్తున్నాను. ఇలా అడగటం తప్పైతే నన్ను క్షమించండి.


2021, నవంబర్ 26వ తేదిన రెండు సంవత్సరాల మా పాపకి జ్వరం, గొంతునొప్పి వచ్చాయి. చాలా హుషారుగా ఉండే పాప మూడు రోజులపాటు జ్వరం, గొంతునొప్పితో బాధపడుతుంటే నేను చూడలేకపోయాను. కనీసం నీళ్ళు, పాలు తాగడానికి కూడా పాప చాలా ఏడ్చేది. అప్పుడు నేను బాబా ఊదీ పాపకిచ్చి, మరికొంత ఊదీ తన గొంతుకు, పొట్టకి రాసుకోమని పాపతో చెప్పాను. ఆపై బాబాని, "పాపని ఈ బాధ నుండి తప్పించండి బాబా. ఇప్పటికే నా భర్త అనారోగ్యం వలన అందరూ బాధపడుతున్నారు. నేను ఈ సమస్య నుండి బయటపడితే బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. అప్పటినుండి పాపకి జ్వరం తగ్గిపోయింది. ఆ రోజు సాయంత్రం ENT డాక్టరుని కలిస్తే, ఆవిడ ఒక టాబ్లెట్ ఇచ్చారు. ఆరోజు రాత్రి పాప ఆ టాబ్లెట్ వేసుకున్నాక మరుసటిరోజు ఉదయానికి పాప పూర్తిగా నార్మల్ అయ్యింది. మేము చాలా సంతోషపడ్డాము. "మీ అనుగ్రహం సదా మా మీద ఇలాగే ఉండాలి బాబా. నా అనుభవం పంచుకోవడంలో మూడురోజులు ఆలస్యం అయ్యినందుకు నన్ను క్షమించండి తండ్రి". 


శ్రీసాయినాథ్ మహారాజ్ కి జై!!!


బాబా కృపతో ఆరోగ్యం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథుని పాదపద్మాలకు ముందుగా నమస్కరిస్తున్నాను. సాయితండ్రిని చూస్తూ, ఆయన బాటలో నడుస్తూ, ఆయన లీలలకు పరవశించిన అప్పటి భక్తులకు వలే ఇప్పటి భక్తుల పిలుపుకు కూడా పిలిస్తే పలికే దైవంలా తమ లీలలను చూపిస్తున్నారు బాబా. వాటిని అందరితో పంచుకునే అవకాశం కల్పించిన సాయినాథునికి, ఈ బ్లాగ్ నిర్వాహకులకి ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును ఆధునిక సాయిచరిత్ర అనడంలో ఏ సందేహం లేదు. నాకు చిన్నప్పటినుండి బాబా అంటే చాలా ఇష్టం. బాబా నా జీవితానికి తోడుగా ఉండి ఎన్నో అమూల్యమైన వరాలనిచ్చారు. మా కుటుంబమంతా కోవిడ్ సెకండ్ వేవ్ బారినపడ్డ సమయంలో నా సాయితండ్రి నా కుటుంబానికి తోడుగా నిలిచారు. ఆ కష్టకాలంలో మాకు సహాయం చేసిన ప్రతీ ఒక్కరిని బాబానే మా వద్దకు పంపినట్టుగా నేను భావించి, 'వారికి ఏమీ కాకుండా ఆరోగ్యంగా ఉండాల'ని బాబాను కోరుకున్నాను. బాబా ఊదీ ధరిస్తూ, వారి చరిత్ర, హారతులు వింటూ ఇంటి వద్దే ట్రీట్మెంట్ తీసుకుంటూ మేము కోలుకున్నాం. 4 నెలల తర్వాత నాకు మళ్ళీ ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చాయి. జ్వరం తగ్గిపోయింది. కాని ఒళ్ళునొప్పులు, దగ్గు, జలుబు, నీరసం 15 రోజులు వరకు తగ్గలేదు. దాంతో నాకు చాలా భయమేసి టెస్టులకు వెళ్ళినపుడు, "రిపోర్టులో ఏ సమస్య లేకుండా చూడండి బాబా. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి నమస్కరించుకుని వెళ్ళాను. బాబా దయవల్ల డాక్టరు వైరల్ ఫీవర్ వలన నాకు ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. దాంతో ఆనందంగా బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇంతలో నాకు మరో ఆరోగ్య సమస్య ఎదురైంది. అప్పుడు కూడా "పెద్ద సమస్య కాకుండా కాపాడు తండ్రి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. తరువాత డాక్టరు రూపంలో బాబాయే నాకు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు భావించాను. డాక్టరు టెస్టులు చేశాక నాకు ఎలాంటి పెద్ద సమస్య లేదని చెప్పారు. బాబాయే డాక్టరు ద్వారా అలా చెప్పినట్లు నాకు అనిపించింది. సమస్యలు ఎదురైనపుడు బాబా నా పూర్వకర్మను ఆ రూపంలో తొలగిస్తున్నట్టుగా నేను భావిస్తాను. ఇటీవల కాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలు నాకు ఎదురవుతున్నాయి. వాటిని తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని బాబాను వేడుకుంటున్నాను. అలాగే సాయినాథుని పాదపద్మాలయందు నిరంతరం భక్తితో ఉంటూ ఆయన సేవలో తరించిపోవాలని కోరుకుంటున్నాను. "అనుభవాలను పంపించడం ఆలస్యమైనందుకు క్షమించండి బాబా".


ఎప్పుడూ మనతోనే ఉంటూ బాధల నుండి గట్టెక్కిస్తారు బాబా


నేను ఒక సాయిభక్తురాలిని. సాయిబాబా ఎప్పుడూ మనతోనే ఉంటూ బాధల నుండి మనలను గట్టెక్కిస్తారు అని చెప్పడానికి నా జీవితంలో జరిగిన మరొక విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. కరోనా వలన మొత్తం అంతా లాక్ డౌన్ అయ్యిందని అందరికీ తెలిసిన విషయమే. ఆ లాక్ డౌన్ కాలంలో స్కూళ్లు లేనందున నేను, నా భర్త పని లేకుండా ఉండవలసి వచ్చింది. దాంతో ఇంట్లో ఇబ్బందిగా ఉండి మా బంగారం బ్యాంకులో పెట్టి కొంత డబ్బు తెచ్చుకున్నాము. దానికి ఒక సంవత్సరం తరువాత వడ్డీ కట్టవలసి ఉండగా మేము ఆ వడ్డీ చెల్లించడానికి కావలసిన మొత్తాన్ని పోగు చేసాము. అయితే బ్యాంకువాళ్ళు, "వడ్డీ మాత్రమే కట్టడం కుదరదు. ఇంకో 50,000 రూపాయలు అదనంగా కడితే మీ బంగారం వేలానికి వెళ్లకుండా ఉంటుంద"ని చెప్పారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న మాకు ఏం చేయాలో తెలియక చాలా ఆందోళనపడ్డాము. అప్పుడు బాబాని, "మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించమ"ని వేడుకున్నాము. ఆశ్చర్యంగా బాబాని వేడుకున్న తరువాత బ్యాంకుకి వెళితే వాళ్ళు మొదట చెప్పిన వడ్డీ మొత్తానికే మా బంగారాన్ని రెన్యువల్ చేసారు. మాకు చాలా సంతోషం కలిగింది. బాబా దయవల్లనే ఇదంతా. థాంక్యూ బాబా.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo