సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1017వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శరణన్నవారికి తప్పక లభించును బాబా అనుగ్రహం

సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ ద్వారా సాయిభక్తులకు తమ తమ అనుభవాలను పంచుకునే అవకాశం కల్పిస్తూ, తద్వారా భక్తులకు బాబాపై మరింత దృఢమైన శ్రద్ధాభక్తులను పెంచుతున్న బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు ప్రశాంతి. నేను తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో నివాసముంటున్నాను. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. "బాబా! నా అనుభవాలను ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి తండ్రీ".

మొదటి అనుభవం: కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితులలో జ్వరం, జలుబు మొదలైన ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కరోనా ఏమోనన్న భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నది అక్షరసత్యం. ఆరునెలల క్రితం, అంటే సుమారు 2021, జూన్ ప్రాంతంలో నాకొక అనారోగ్య సమస్య వచ్చి నా కళ్ళు చాలా ఎర్రబడిపోయాయి. కరోనా లక్షణాలలో కళ్ళు ఎర్రబడడం కూడా ఒకటైనందువల్ల నాకు భయమేసి మెడికల్ షాపుకి వెళ్ళి నా సమస్య గురించి చెప్పాను. వాళ్ళు నాకు ఐ-డ్రాప్స్, అయింట్మెంట్ ఇచ్చి, "వీటిని మూడురోజులు వాడండి. తగ్గకపోతే డాక్టరుని సంప్రదించి కరోనా టెస్టు చేయించుకోండి" అన్నారు. ఆ మందులు మూడు రోజులు వాడినా నాకు తగ్గలేదు. దాంతో నేను, "సాయీ! నేను కంటి డాక్టరు దగ్గరకి వెళుతున్నాను. నన్ను పరీక్షించే డాక్టరు హృదయంలో ఉండే మీరు, ఆయన చేత 'సమస్యేమీ లేదు. అంతా బాగానే ఉంది. కరోనా టెస్టు అవసరం లేదు' అని చెప్పించు స్వామీ" అని మనసులోనే బాబాను ప్రార్థించాను. తర్వాత డాక్టరు నా కంటిని పరీక్షించి, "సమస్యేమీ లేదు. అంతా బాగానే ఉంది. కంటికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఐ-డ్రాప్స్, అయింట్మెంట్ వాడితే సరిపోతుంది. కరోనా టెస్టు అక్కరలేదు" అని చెప్పారు. ఈవిధంగా బాబా నేను కోరుకున్నట్లే డాక్టరు చేత చెప్పించి, కరోనా బారినపడకుండా నన్ను రక్షించారు.

రెండవ అనుభవం: 2021, అక్టోబర్ లేదా నవంబరులో నాకు తరచూ జ్వరం వచ్చి, తగ్గుతూ ఉండేది. అలా ఒకే వారంలో మూడుసార్లు జరిగింది. ఆ తర్వాత హఠాత్తుగా నా శరీరంలో ఏదో అయిపోతున్నట్లు అనిపించింది. కడుపులో నొప్పి, నీళ్ళ విరోచనాలతో మూడురోజులు బాగా ఇబ్బందిపడ్డాను. సైక్లోపామ్ వేసుకున్నా పూర్తిగా తగ్గక వారం రోజులు నేను చాలా ఇబ్బందిపడ్డాను. 'ఏం తేడా జరిగింది? ఎందుకిలా అవుతోంది?' అని పరిపరివిధాలుగా ఆలోచిస్తూ, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుందామనుకుని CBP టెస్టు(Complete Blood picture) చేయించుకున్నాను. CBP టెస్టులో భాగంగా CRP టెస్టు కూడా చేస్తారు. CRP అంటే, బ్లడ్‍లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే అందులో తెలుస్తుంది. నేను ఆ టెస్టును డాక్టరుని సంప్రదించకుండానే చేయించుకున్నాను. ఎందుకంటే, డాక్టరు దగ్గరకు వెళ్ళినా ఆ టెస్టు చేయించుకునే రమ్మంటారు. అప్పుడైనా వెళ్లాల్సిందే! అందుకే ముందుగా టెస్టు చేయించుకుని, ఆ రిపోర్టు డాక్టరుకి చూపిస్తే ఏం జరిగిందో చూసి, మందులిస్తారని తలచి టెస్టు చేయించుకున్నాను. నేను టెస్టు చేయించుకోవడానికి ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది. ఈమధ్య డెంగ్యూ జ్వరం రావడం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం జరుగుతున్నాయి. ఆ టెస్టు ద్వారా ప్లెట్లెట్ కౌంట్ కూడా తెలుస్తుందని అనుకున్నాను. కానీ మా ఇంట్లోవాళ్లు, "డాక్టరుని సంప్రదించకుండా, ఏ టెస్టులు వ్రాస్తారో తెలియకుండా నువ్వే సొంతంగా టెస్టులు చేయించుకున్నావు. ఆ రిపోర్టులు డాక్టరు చూడకపోతే పరిస్థితి ఏమిటి?" అని నన్ను మందలించారు. అప్పుడు నేను బాబా దగ్గర నేను చేసిన తప్పును ఒప్పుకుని, "నన్ను క్షమించమ"ని వేడుకుని, "స్వామీ! ఒక డాక్టరు రాసిన టెస్టు రిపోర్టులు వేరే డాక్టరు చూడరు. వాళ్ళు మళ్ళీ టెస్టులు వ్రాస్తారు. అలాంటిది నేను సొంతంగా టెస్టులు చేయించుకున్నాను. కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమై భయపడుతున్నాను. సరే బాబా, బ్లడ్ టెస్టు రిపోర్టులు పట్టుకుని వెళ్ళి డాక్టరుకి చూపిస్తాను. ఆయన 'చూడను, ట్రీట్మెంట్ చేయనం'టే నేను ద్రాక్షారామం వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ డాక్టరుకి చూపించి మందులు వాడతాను. ఒకవేళ డాక్టరు టెస్టు రిపోర్టులు చూసి, నన్ను కోప్పడి, మళ్ళీ టెస్టులు చేయించుకోమంటే చేయించుకుంటాను. అలా కూడా కాకుండా టెస్టు రిపోర్టులు చూసి 'ఏ సమస్యా లేదు. ఇంకే టెస్టు అవసరం లేదు. మందులు వాడితే సరిపోతుంద'ని చెబితే అంతకన్నా ఆనందం లేదు" అని బాబాతో చెప్పుకుని ఏదైతే అది అయిందని డాక్టరు దగ్గరకి వెళ్ళి చూపించుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే డాక్టరు దగ్గరకు వెళ్ళి నా సమస్య గురించి చెప్పి, "బ్లడ్ టెస్టు చేయించుకుని ఆ రిపోర్టు మీకు చూపిద్దామని తీసుకొచ్చాను" అని చెప్పాను. అది విన్న డాక్టరు, "మీరు ముందుగానే టెస్టులు చేయించుకుని వచ్చారు. మీకెవరు చేయించుకోమని చెప్పారు" అని అడిగారు. అందుకు నేను, "నాకు ఎవరూ చెప్పలేదు. నేనే చేయించుకుని వచ్చాను" అని చెప్పాను. 'సరేన'ని ఆయన రిపోర్టులు చూసి, "హీమోగ్లోబిన్ తక్కువగా ఉంది. తిన్న ఆహారం జీర్ణంకాని కారణంగా మీకు కడుపులో నొప్పి, విరోచనాలు" అని చెప్పి గ్యాస్ టాబ్లెట్లు, కడుపునొప్పి తగ్గడానికి మందులు ఇచ్చారు. ఇదంతా బాబా దయ. ఆయన డాక్టరు హృదయంలో ఉండి నన్ను తిట్టకుండా రక్షించి నాకు మందులిప్పించి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు.

మూడో అనుభవం: సాధారణంగా నెలసరి వచ్చి స్నానమైన తర్వాత డిశ్చార్జ్ అవడం ఆగిపోతుంది. కానీ 2021, నవంబరులో నాకు నెలసరి వచ్చాక డిశ్ఛార్జ్ చాలా తక్కువగా అయింది. స్నానం చేసిన తరువాత కూడా 16 రోజుల వరకు ప్రతిరోజూ కొంచెం కొంచెం డిశ్చార్జ్ కనపడుతుండేది. దానితోపాటు నెలసరి వచ్చినప్పుడు ఉండే నడుం నొప్పి, కడుపునొప్పి ఉంటుండేవి. అప్పుడు బాబా ఊదీయే మందు, అదే నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, నా ఇబ్బంది పోతుంది అని బాబాపై నమ్మకముంచి, ఊదీ నీళ్ళలో కలుపుకుని త్రాగాను. దాంతో నా శరీరంలో మార్పు రావడం నేను గమనించాను. నెమ్మదిగా డిశ్చార్జ్ అవడం తగ్గి, నడుమునొప్పి, కడుపునొప్పి కూడా తగ్గి నాకు ఆరోగ్యం చేకూరింది. "సాయీ! నీ దయ ఎంతని చెప్పగలను? ఎంత చెప్పినా తక్కువే".

నాల్గవ అనుభవం: ఒకసారి మా నాన్నగారి ప్లేట్లెట్స్ తగ్గడం, కరోనా పాజిటివ్ రావడం జరిగింది. ఆయనకి నయమైన రెండు నెలల తరువాత అమ్మానాన్నలిద్దరికీ డెంగ్యూ జ్వరం వచ్చింది. ఇద్దరికీ తగ్గాక వినాయకచవితి వెళ్ళిన తర్వాత అమ్మ ఋషి పంచమి నోము పట్టింది. ఆ నదీ స్నానాల వల్ల, నీటి మార్పువల్ల అమ్మకి మళ్ళీ జ్వరం, దానితోపాటు పొడిదగ్గు వచ్చాయి. జ్వరం తగ్గినా పొడి దగ్గు బాగా ఎక్కువైంది. దాంతో దగ్గర దగ్గర 20 రోజులపైన అమ్మ బాధపడింది. టానిక్ వాడుతున్నప్పటికీ దగ్గు తగ్గక అమ్మ రాత్రిపూట నిద్ర కూడా పోలేక చాలా ఇబ్బందిపడింది. అలా ఉండగా ఒకరోజు మళ్ళీ అమ్మకి జ్వరం వచ్చింది. ఆ రాత్రి దగ్గుతున్నప్పుడు తన గుండెలు లాగేస్తున్నాయని అమ్మ నాతో చెప్పింది. అది విని నేను చాలా బాధపడి, "బాబా! అసలే ఈమధ్య అనారోగ్య సమస్యలతో చాలా బాధపడిన అమ్మ 20 రోజుల నుంచి పొడి దగ్గుతో మరింత బాధపడుతుంది. దయచేసి అమ్మకి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. తట్టుకునే శక్తినివ్వండి. రేపు డాక్టరు దగ్గరకి వెళ్ళినపుడు మీరు ఆయన హృదయంలో ఉండి 'పొడి దగ్గుకు భయపడాల్సిన అవసరం లేదు. వాతావరణ మార్పువల్ల వచ్చిన దగ్గు' అని చెప్పి అమ్మకి మందు ఇప్పించండి స్వామీ" అని మనసులోనే ప్రార్థించి 'అమ్మ అనుభవాన్ని కూడా "సాయి మహారాజ్ సన్నిధి" బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. మరుసటిరోజు డాక్టరు అమ్మని చూసి, "ఈ పొడిదగ్గకు భయపడక్కరలేదు. వాతావరణం మారుతున్నందువల్ల మీకు ఈ సమస్య వచ్చిందంతే" అని మందులిచ్చి, జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ చేసారు. ఆ మందులు వాడటం మొదలుపెట్టక అమ్మకి పాడిదగ్గు, జ్వరం తగ్గిపోయాయి. అంతా ఆ సాయినాథుని మహిమ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

"సాయీ! మీరే మాకు దిక్కు. మీకు శరణాగతి వేడుతున్నాము. మీరు మాకు సహాయం చేయండి" అని బాధతో ఆర్తితో ఎప్పుడైతే ఆయనను ప్రార్ధిస్తామో, స్వామి తప్పకుండా మనకు సహాయం చేస్తారని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo