సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1026వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి ఆదేశంతో కాశీలో వ్రతాలు - వారి అనుగ్రహం
2. కేవలం బాబా ఊదీతో కరోనా లక్షణాల నుండి ఉపశమనం

సాయి ఆదేశంతో కాశీలో వ్రతాలు - వారి అనుగ్రహం

 

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు సూర్యనారాయణమూర్తి. నా శ్రీమతిచే నిర్వహించవలసిన కొన్ని వ్రతాలను ఎలా చేయించాలి, ఎప్పుడు చేయించాలి, ఎక్కడ చేయించాలి అనే విషయాలపై నేను చాలాకాలం నుండి సద్గురు శ్రీసాయిబాబా ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాను. ఆ విషయంలో బాబా నాకు కొన్ని సూచనలు ఇచ్చినప్పటికీ ఆలస్యం జరుగుతూ వచ్చింది. అయితే, 2021, అక్టోబరు 15, విజయదశమినాడు మధ్యాహ్నం 1.30 గంటలకు బాబా నాకు చాలా చక్కటి సూచనలు చేశారు. అది - 'తాము కాశీలో దత్తుడిగా ఉన్నామ'నే విషయంగా “ప్రతిరోజూ ఆరతిలో 'కాశీ స్నాన జప ప్రతి దివసీ' అని పాడుతూ కూడా కాశీలో చేయడానికి అనుమతి ఇవ్వాలా?” అని బాబా ప్రశ్నించారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ వ్రతాలన్నీ కాశీలోనే జరపాలని బాబా నన్ను ఆదేశించారని. వెంటనే కాశీలో నాకు తెలిసిన ఒక మిత్రుడిని సంప్రదించాను. ఆయన కూడా దత్తభక్తుడే అనే విషయం కాశీ చేరుకునేవరకు నాకు తెలియదు. కాశీలో ఈ వ్రతాలకి కావలసిన అన్ని విషయాలు తాను చూసుకుంటాననీ, అన్నీ బాగా జరిగాక డబ్బు చెల్లించమనీ ఆయన నాతో చెప్పారు. నేను, నా శ్రీమతి నవంబరు 5వ తేదీ సాయంత్రం బయలుదేరి కాశీకి వెళ్ళాము. 9 రోజులు అక్కడ నిద్రచేసి, నా శ్రీమతి చేయవలసిన వ్రతాలను పూర్తిచేశాము. ఆ వ్రతాలను నేను నవంబరు 7, 8 తేదీలలో గణపతి హోమంతో ప్రారంభించాలనుకున్నాను. అనుకోకుండా మా కాలనీ మిత్రులొకరు కాశీలో నన్ను కలిసి, 8వ తారీఖున తాను కాశీలో చింతామణి గణపతి దేవాలయంలో గణపతి హోమం చేస్తున్నాననీ, మమ్మల్ని కూడా తమతో కలిసి ఆ హోమంలో పాల్గొనమని ఆహ్వానించారు. అది ఖచ్చితంగా మన సాయిగణపతి చేసిన ఉపకారమే. తరువాత కాశీలో 11, 12 తేదీలలో లక్షవత్తుల నోము, 13వ తేదీన అనంతపద్మనాభవ్రత ఉద్యాపన, మహామృత్యుంజయ హోమాలను మన విశ్వనాథుడైన సాయినాథుడు దగ్గరుండి జరిపించినట్లు ఎంతో చక్కగా జరిపించారు. ఈ యాత్రలో బాబా మా పట్ల చూపిన అనుగ్రహ విశేషాలను ఈ క్రింద పొందుపరుస్తున్నాను.


1) మేము కాశీలో విమానం దిగిన తరువాత కారు కోసం రోడ్డుపైకి రాగానే ‘శ్రీసాయి జ్యూస్ సెంటరు’ అనే బోర్డు, బాబా పెద్ద పటము మాకు దర్శనమిచ్చాయి.


2) కాశీలో మేము బసచేసిన ఆశ్రమం పేరు శ్రీకాశీగాయత్రి ఆశ్రమం. దాని నిర్వాహకులైన హరిహరశాస్త్రిగారు, వారి గురువులు కూడా దత్తభక్తులు. ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగానే పెద్ద దత్తుడు, చిన్న బాబాల దర్శనం అద్భుతం!


3) మా శ్రీమతి చేసిన అనంతపద్మనాభ వ్రత ఉద్యాపన పురోహితులందరూ కాశీకి చెందినవారే అయినప్పటికీ వారంతా సాయిభక్తులే.


4) లక్షవత్తుల వ్రతంనాడు రాత్రి జాగరణ సమయంలో సుమారు 8 గంటల పాటు రామనామం పలుకుతూ ఉంటే చాలా మంచిదని ఆ వ్రత పురోహితులు చెప్పారు. అద్భుతంగా, శ్రీసాయిసచ్చరిత్రలో హేమాడ్‌పంత్‌కి బాబా రామనామాన్ని గుర్తుచేసినట్లు వేరే ఆశ్రమం నుండి మైకులో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుఝామున 4 గంటల వరకు మాకు శ్రీరామనామ సంకీర్తన వినబడేలా బాబా అనుగ్రహించారు


5) అదేవిధంగా, కాశీలో సచ్చరిత్ర పారాయణ పూర్తికాగానే బాబా నాకు స్వప్నదర్శనమిచ్చి, మకు కాశీ అంటే ప్రాణమనీ, తామే విశ్వనాథ, దత్త, శక్తి రూపాలనీ నాకు తెలియపరచి, ఇంతకుముందు 1994లో నేను కాశీయాత్రలో చేసిన ‘జై విశ్వనాథ.. జై సాయినాథ’ నామం తమ చెవులలో ఇంకా మారుమ్రోగుతోందని చెప్పడం నా పూర్వజన్మ సుకృతం, శ్రీసాయికి నా పట్ల గల అపారమైన దయ.


6) ఆ 9 రోజులలో ఏ రోజూ కూడా ఎటువంటి ఆందోళనగానీ, విఘ్నాలుగానీ, ఆరోగ్యపరమైన ఇబ్బందులుగానీ లేకుండా బాబా మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుని, కాశీనుండి తిరిగి నవంబరు 14న క్షేమంగా హైదరాబాదు చేర్చారు. అట్టి సద్గురు సాయివిశ్వనాథునికి వేలకోట్ల నమస్కారములతో..


సూర్యనారాయణమూర్తి నిట్టల

విజయనగర్ కాలనీ, హైదరాబాదు.


కేవలం బాబా ఊదీతో కరోనా లక్షణాల నుండి ఉపశమనం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా సాయిబంధువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు లక్ష్మి. 2021, ఫిబ్రవరి 27, శనివారంనాడు నాకు ఈ బ్లాగు గురించి తెలిసేలా బాబా అనుగ్రహించారు. ఆపై 2021, మార్చి 6, శనివారంనాడు నేను ఈ బ్లాగుకి సంబంధించిన వాట్సప్ గ్రూపులో చేరాను. నేను 1995 నుండి సాయిబిడ్డను. కానీ ఆ సాయినాథుడు తమ అమృతహస్తాన్ని అందించి, 'నీకు నేనున్నాను' అని నాకు తెలిసేలా చేసింది మాత్రం 2020, డిసెంబర్ 17న. ఈ సంవత్సరకాలంగా బాబా నాపై చూపిన ప్రేమను, 'నేనున్నాన'ని ఆయన నాకు ప్రసాదించిన నిదర్శనాలను నేను నా జీవితంలో మరిచిపోలేను. సాయినాథుడు ప్రసాదించిన ఆ దివ్యానుభూతులను మన 'సాయి మహారాజ్ సన్నిధి' ద్వారా తోటి సాయిబంధువులతో మొదటిసారి పంచుకోదలచి ముందుగా ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.


2021, జూన్ 10న నాకు, మావారికి విపరీతమైన జ్వరం, కళ్ళుమంటలు, దగ్గు, జలులు, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, ఊపిరి అందని పరిస్థితి మొదలైన కరోనా లక్షణాలన్నీ చాలా స్పష్టంగా కనిపించాయి. కానీ ఆర్ధికంగా చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నందువల్ల హాస్పిటల్‍కు వెళ్ళలేని పరిస్థితి అయినందున మాకు ఏమి చేయడానికి తోచక, "బాబా! ఇదేమిటి తండ్రీ, ఉన్న సమస్యలు చాలవన్నట్లు ఇలా ప్రాణాల మీదికి తెచ్చావు. ఆర్థిక సమస్యల నుండి బయటపడేసి మమ్మల్ని కాపాడు తండ్రి. మా భారమంతా మీకే అప్పగిస్తున్నాను. ఏం చేస్తావో నీ ఇష్టం. నీ ఊదీ తప్ప నాకు వేరే మార్గం కనపడటం లేదు. మందులు, డాక్టర్లు, టెస్టులు, హాస్పిటల్ మొదలైనవన్నీ మీ ఊదీయే మాకు" అని పరిపరి విధాల బాబాను పదేపదే ప్రార్థిస్తూ, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రం పఠిస్తూ, ఊదీ నుదుటన ధరించి, అలాగే నీళ్ళ బిందెలోనూ, అన్నం, కూరలు, టిఫిన్లు వంటి తినే, త్రాగే పదార్థాలలో అన్నిటిలో చిటికెడు ఊదీ వేసి వాటినే తీసుకునేవాళ్ళం. అలాగే సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేసి, "బాబా! హాస్పిటల్‍కి వెళ్ళే పరిస్థితి మాకు రాకుండా ఇంట్లోనే, అది కూడా కేవలం మీ ఊదీతో మాకు నయమవ్వాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల పదిరోజుల్లో జ్వరం, దగ్గు, జలుబు తగ్గాయి. కానీ ముక్కు, కళ్ళ మంటలు, నోటి వాసన మాత్రం 3 నెలల వరకు ఉన్నాయి. 3 నెలల తరువాత అవి కూడా తగ్గాయి. బాబా దయ, కరుణల వల్లే మాకు ఇంట్లోనే బాబా ఊదీతో పూర్తిగా నయమైంది. నిజంగా ఇది బాబా మాకు ప్రసాదించిన పునర్జన్మ. "ధన్యవాదాలు బాబా. మా సమస్యలన్నీ తీర్చండి బాబా".


సర్వం శ్రీసాయిపాదారవిందార్పణమస్తు!!!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo