1. మనసులో నిలుపుకుంటే చాలు - మన కోరికలు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు సాయిబాబా
2. ఆరోగ్య ప్రదాత సాయి
3. మానసిక వ్యాధి నుండి బయటపడేస్తున్న బాబా
మనసులో నిలుపుకుంటే చాలు - మన కోరికలు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు సాయిబాబా
ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయిబిడ్డని. 2021లో బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను సాయిబాబాని మనస్ఫూర్తిగా నమ్మడం మొదలుపెట్టాక బాబా విగ్రహం ఒకటి కొనుక్కోవాలని నాకు అనిపించింది. ఆ విషయమై నేను విగ్రహం ఎక్కడ తీసుకోవాలని అందరినీ అడుగుతుండేదాన్ని. కానీ నాకు ఎక్కడా సరైన సమాధానం దొరికేది కాదు. ఎన్నో రోజులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ నాకు ఫలితం కనపడక నేను చాలా బాధపడ్డాను. కానీ సాయి తమ లీలను ఇంకో విధంగా చూపించారు. అనుకోకుండా మా శ్రీవారి స్నేహితులొకరు శిరిడీ వెళ్లారు. మాకు ఆ విషయం ముందు తెలీదు. అతను శిరిడీ నుండి తిరిగి వచ్చేముందు అతను శిరిడీలో ఉన్న విషయం మాకు తెలిసింది. విచిత్రమేమిటంటే, అదేరోజు నేను మావారితో సాయిబాబా విగ్రహం గురించి చెప్పాను. వెంటనే మావారు తన స్నేహితునికి ఫోన్ చేసి, "ఒక బాబా విగ్రహం తీసుకుని రమ్మ"ని చెప్పారు. దాంతో అతను మాకోసం ఒక చిన్న బాబా విగ్రహం తెచ్చి ఇచ్చారు. నేను ఆ రోజు చాలా చాలా సంతోషించాను. ఎందుకంటే, విగ్రహం కావాలన్న నా మదిలో కోరికను మన్నించి, తమ నివాస స్థానమైన శిరిడీ నుండి నాకోసం మా ఇంటికి వచ్చారు బాబా. ఇంతకంటే ఆనందం ఏముంటుంది?
తరువాత సాయి సచ్చరిత్ర కూడా నాచేత పారాయణ చేయించారు బాబా. అది ఎలాగంటే, బాబా మా ఇంటికి వచ్చిన తరువాత ఒకరోజు మా చిన్న అత్తగారు నాకు ఫోన్ చేసి, "సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తావా?" అని అడిగారు. అప్పటికి సాయి సచ్చరిత్ర పారాయణ అంటే ఏమిటో కూడా నాకు తెలియనందున, 'నేను రోజూ క్రమం తప్పకుండా పారాయణ చేయగలనా?' అని కొంచం సంకోచించాను. కానీ మా అత్తగారు నన్ను బాగా ప్రోత్సహించారు. దాంతో నాకు ఉత్సాహం కలిగి చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే సాయి సచ్చరిత్ర పారాయణ గ్రూపులో జాయిన్ అయ్యి పారాయణ చేయడం మొదలుపెట్టాను. సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తుంటే, ఎదో తెలియని మంచి అనుభూతి కలుగుతుంది. శిరిడీ నుండి సాయి మా ఇంటికి రావడం, అనుకోకుండా నేను సాయి సచ్చరిత్ర పారాయణలో భాగం కావడం చూస్తుంటే ఆ సాయినాథుడే నన్ను అయన వైపు తిప్పుకున్నారన్న భావన నాకు కలుగుతుంది. మనసులో నిలుపుకుంటే చాలు, మన కోరికలు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు సాయిబాబా.
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
ఆరోగ్య ప్రదాత సాయి
సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీకాంత్. మాది నాగర్ కర్నూల్ జిల్లా. 2021 చివరిలో నేను, నా భార్య అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడంతో మేము డాక్టరుని సంప్రదించాము. డాక్టరు పరీక్షించి వారం రోజులకు సరిపడా టాబ్లెట్లు ఇచ్చి, మళ్లీ రమ్మన్నారు. ఆ సమయంలో అదివరకు ఎప్పుడూ లేని విధంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, బీపీ హెచ్చుతగ్గులు అవుతుండటం వంటివి నన్ను ఆందోళనకు గురి చేసాయి. 2021, డిసెంబరు 1న నేను, "బాబా! డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు నా బిపి నార్మల్గా ఉండేటట్లు చూడండి. అలాగే నాకు, నా భార్యకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని డాక్టర్ నోటివెంట వచ్చేటట్లు చూడు తండ్రి" అని ఆ సాయినాథుని వేడుకుని నా భార్యతో కలిసి హాస్పిటల్కు వెళ్లాను. ఆ సాయినాథుని కృపాకటాక్షాల వలన నా బీపీ పరిశీలించిన డాక్టర్ గారు, "బీపీ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదు. అది కేవలం వ్యాయామం చేయడం వల్ల కంట్రోల్ అవుతుంది" అని చెప్పారు. తరువాత, 'నా భార్యకు ఎలాంటి అనారోగ్యకరమైన సమస్యలు లేవని, ఆమెకు ఎలాంటి మందులు అవసరం లేద'ని చెప్పేసరికి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ శిరిడీ సాయినాథునికి మనస్ఫూర్తిగా నా తరుపున, నా కుటుంబ సభ్యుల తరుపున సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ వారి ఆశీస్సుల వల్ల నాకు, నా కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేలా అనుగ్రహించమని కోరుకుంటున్నాను.
సద్గురు శిరిడీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
మానసిక వ్యాధి నుండి బయటపడేస్తున్న బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కానీ ఎలా వ్రాయాలో తెలియడం లేదు. బాబా ప్రతిదీ వింటారు. మావారి ఆరోగ్య విషయంలో ఆయన నాకు ఎంతో సహాయం చేశారు. మావారు మానసిక వ్యాధితో ఎంతగానో బాధపడుతుండేవారు. అది ధీర్ఘకాలిక వ్యాధి. దానికి మందు, చికిత్స లేవన్నారు. ఇలా ఉండగా ఒకరోజు నేను, "నీ భర్త ఆరోగ్యం బాగుపడుతుంది" అన్న బాబా సందేశం చూసాను. 'ఇది ఎలా జరుగుతుంది బాబా? మావారికి దీర్ఘకాలిక వ్యాధి కదా!' అని నాలో నేను నవ్వుకున్నాను. ఆ తరువాత కొన్నిరోజులకు బాబా దయవల్ల వేరే వైద్య విధానంలో మావారి సమస్యకు చికిత్స ఉందని తెలిసింది. దాంతో మందులు మార్చాం. ఆపై మావారి ప్రవృత్తిలో(ప్రతికూల భావాలు) మార్పు వచ్చింది. నేను అప్పుడు, "బాబా! మావారికి పూర్తిగా నయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. ఆ తరువాత వారంలో మావారు కొంచెం మాములుగా అయ్యారు. ఇదంతా బాబా దయవల్లే.
