1. బాబా మీద నాలో భక్తిప్రేమలు మొలకెత్తించిన తొలి అనుభవం
2. వచ్చి, అనుగ్రహించిన బాబా
3. సాయిబాబాకు కృతజ్ఞతతో మా అనుభవం
బాబా మీద నాలో భక్తిప్రేమలు మొలకెత్తించిన తొలి అనుభవం
నేను ఒక సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన తొలి అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ముందుగా సాయిభక్తులకు తమ అనుభవాలను తోటిభక్తులతో పంచుకునే అవకాశాన్నిచ్చిన ఈ బ్లాగ్ నిర్వాహకులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాకు మొదట బాబాతో పరిచయమంటూ ఏమీ లేదు. మావారు పనిచేసే స్కూల్లో రాధాకృష్ణగారు అనే హెడ్ మాస్టర్ ఉండేవారు. ఆయన బాబా భక్తుడు. ఒకసారి ఆయన మా ఇంట భోజనానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు నా చేతిలో బాబా పారాయణ పుస్తకం పెట్టి, "ఇది చదువమ్మా, చాలా బాగుంటుంది" అని చెప్పి వెళ్ళిపోయారు. నేను పెద్దగా పూజలు చేసేదాన్ని కూడా కానందున 'ఈ పుస్తకం ఏం చేయాలి?' అని దాన్ని బీరువాలో పెట్టాను. నాలుగురోజుల తరువాత ఆయన మళ్ళీ కలిసి "ఏమ్మా చదివావా?" అని అడిగారు. తెరవనైనా తెరవని పుస్తకాన్ని "కొద్దిగా ఉంది సార్, అయిపోతుంది" అని అబద్దం చెప్పాను. వారం రోజుల తరువాత ఆయన ఇచ్చిన పుస్తకాన్ని చదవకుండానే ఆయనకు తిరిగి ఇచ్చేసాను. ఇది జరిగిన 15 రోజుల తరువాత మావారు ఏదో పత్రికలో చూసి, "ఇది చూడు. భార్యాభర్తలుకాని, తల్లీబిడ్డలుకాని, అన్నదమ్ములుకాని ఎవరైనాసరే ఎవరు సంపాదించుకున్న పుణ్యం వారిది, ఎవరి పాపం వారిది. ఎవరిది వారే అనుభవించాలి. ఒకరి పుణ్యం ఒకరికి రాదు. ఒకరి పాపం ఒకరికి రాదు" అని నాకు చదివి వినిపించారు. అప్పుడు నేను, "మీరు అలాగే అంటారు. పిచ్చిపిచ్చి వ్రాతలు నమ్మాల్సిన అవసరం లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు. భర్త చేసిన దాంట్లో భార్యకు కూడా భాగముంటుంది అని కదా! మేము తల్లిదండ్రులను కూడా వదులుకుని మీ దగ్గరకి వచ్చేది ఎందుకు?" అని వాదించి పడుకున్నాను. ఆరోజు బుధవారం. రాత్రి నాకు ఒక కల వచ్చింది. మా ఇంటి దేవుడి రూంలో ఎర్రబట్టలతో ఉన్న బాబా ఫోటో ఉంది. అదే రూపంలో బాబా మా ఇంటి దేవుని గదిలో ఉన్న ఒక స్టూలు మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నాకు కలలో దర్శనమిచ్చారు. నేను బాబా పాదాల దగ్గర కూర్చున్నాను. ఒక గంట సేపు బాబాకు, నాకు మధ్య వాదన జరిగింది. చిన్నపిల్లకు చెప్పినట్టుగా బాబా నాకు ఏవో విషయాలు చెప్పారు. ఇది జరిగి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. నాకు చాలావరకు గుర్తులేవు. గుర్తున్నంతవరకు చెప్తున్నాను.
"తల్లీ! నీకు ఆకలి వేస్తే, నువ్వే భోజనం చేయాలి. నీ భర్త తింటే నీ ఆకలి తీరదుగా. అలాగే నీకు ఒంట్లో బాగోలేకపోతే మందులు నువ్వే తీసుకోవాలి, నీ భర్త కాదు" ఇలా ఎన్నో ఉపమానాలు బాబా నాతో చెప్పారు. కానీ నేను మూర్ఖురాలిని కాబట్టి బాబా చెప్పింది సరైనదని అంగీకరించలేదు.
ఒక అరగంట తరవాత బాబా, "అయితే నీ భర్త పుణ్యం కానీ, పాపం కానీ, నువ్వు స్వీకరిస్తావా?" అని అడిగారు.
అందుకు నేను మొండిగా "స్వీకరిస్తాను" అని అన్నాను.
అప్పుడు బాబా, "అయితే పాపఫలం చేదుగా ఉంటుంది, పుణ్యఫలం తీయగా ఉంటుంది. కాబట్టి పుణ్యఫలాన్ని స్వీకరించు" అని చెప్పి రెండు చిన్న వెండి పళ్ళాలలో పరమాన్నం లాంటిది ఇచ్చి, "ఒకటి నీది, ఒకటి నీ భర్తది" అని చెప్పారు.
నేను వెంటనే నా భర్త పుణ్యఫలం ఉన్న పళ్ళాన్ని స్వీకరించబోయాను. అందుకు బాబా "ముందుగా నీ పుణ్యఫలాన్ని స్వీకరించిన తరువాత నీ భర్తది తీసుకో" అని అన్నారు.
నేను సరేనని నా పళ్ళెంలోది అంతా తిన్న తరువాత నా భర్త ప్లేటు తీసుకోబోయాను.
అప్పుడు బాబా, "నీ పళ్ళెంలోది పూర్తయిన తరువాత నీ భర్త పళ్ళెం తీసుకో" అన్నారు.
అప్పుడు నేను నా పళ్ళెంలో గమనిస్తే ఒక మెతుకు మాత్రం ఉంది. ఆ మెతుకు తిన్న తరువాత ఇక అంతే! నాకు తినటానికి ఎంత మాత్రమూ చేత కావట్లేదు. ఎంత ప్రయత్నించినా తినలేకపోయాను.
అప్పుడు బాబా నాతో, "నువ్వు పుణ్యమే స్వీకరించలేకపోతున్నావు. పాపమేమి స్వీకరిస్తావు. కాబట్టి పాపపుణ్యాలు ఎవరివి వారివే. ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా?" అని నవ్వి వెళ్ళిపోయారు.
ఈ కల వచ్చిన తరువాత బాబా మీద చిన్నగా నాలో భక్తిప్రేమలు మొదలయ్యాయి.
వచ్చి, అనుగ్రహించిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. 2021, డిసెంబర్ 15న బాబా నాకు మరో అద్భుతం చూపించారు. నా భర్త PSB (పంజాబ్ సిండికేట్ బ్యాంకు)లో పని చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా నా భర్తకు పదోన్నతి రాలేదు. ఆ విషయమై మేము, "దయచేసి మాకు సహాయం చేయండి బాబా. మాపై అనుగ్రహం చూపండి" అని బాబాని అడుగుతుండేవాళ్ళము. కానీ ఎందుకో తెలియదుగాని బాబా మేము కోరుకున్నది ఇవ్వలేదు. 2021, డిసెంబర్ 15, బుధవారం నా భర్త పదోన్నతికి సంబంధించిన ఒక అంతర్గత పరీక్షకు హాజరవ్వడానికి వెళ్తూ, 'ఒకవేళ పరీక్షలో విఫలమైతే, ఆర్థికపరంగా కొన్ని ప్రయోజనాలను కోల్పోతాన'ని ఆందోళన చెందారు. అదే జరిగితే కుటుంబపరంగా ఆర్థికసమస్యలను ఎదుర్కోవడం మాకు చాలా కష్టమవుతుంది. కాబట్టి నేను, "నా భర్తకు సహాయం చేయమ"ని నిరంతరాయంగా బాబాను అర్థించసాగాను. మధ్యాహ్నం నేను శుభ్రం చేయడానికని మెయిన్ డోర్ తెరిచాను. మా ఇంటి ద్వారం ముందు నేలపై ఒక మ్యాగజైన్ పడి ఉంది. ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని, దాన్ని చూసిన నేను ఆనందం పట్టలేకపోయాను. ఆ పుస్తకం శిరిడీ సాయి సంస్థాన్ వారి సాయిలీలా మ్యాగజైన్(ఫోటో కింద జతపరుస్తున్నాను).
వాస్తవానికి మేము శిరిడీలో మ్యాగజైన్ కోసం ఏ చందా కట్టలేదు. ఆ మ్యాగజైన్ పై ఉన్న అడ్రస్ మాది కాదు, అది వేరే వాళ్ళది. కానీ బాబా నా భర్త పరీక్షకు హాజరైన సమయంలో మా ఇంటికి ఆ రూపంలో చేరుకున్నారు. నిజంగా చెప్పాలంటే నేను అంతకు కాసేపటి క్రితం బాబాను, "నా భర్త నాతో, 'నేను పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాన'ని చెప్పాల"ని అడిగాను. తరువాత సాయిలీల పత్రిక రూపంలో బాబా వచ్చారు. ఆ పత్రికలోని మొదటి కథనం సపత్నేకర్, శేవడే అన్న బాబా భక్తులకు సంబంధించినది. సపత్నేకర్ శేవడేను, "పరీక్షకు సిద్ధమయ్యారా?" అని అడిగితే, "నాకు శిరిడీ సాయి ఆశీస్సులున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను నా పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాను" అని శేవడే బలంగా బదులిస్తాడు. అది చదివిన నాకు నా భర్త పరీక్షలో ఉత్తీర్ణులవుతారన్న సమాధానం లభించింది. అదే నిజమైంది! ఒక గంట తర్వాత నా భర్త నాకు ఫోన్ చేసి, "నేను పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను" అని చెప్పారు. మేము చాలా చాలా సంతోషించి సాయంత్రం బాబా మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాము. "ప్రేమతో మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సాయిబాబాకు కృతజ్ఞతతో మా అనుభవం
ముందుగా అందరికీ బాబా అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు పద్మజ. మాకు బాబాతో చాలా అనుభవాలు ఉన్నాయి. నేను ఈరోజు ఒక అనుభవం మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య మా అమ్మగారి బాబా ఉంగరం కనిపించలేదు. వాళ్ళు అంతటా వెతికినా ఆ ఉంగరం దొరకలేదు. ఆ తరువాత ఆ విషయం నాతో చెప్పారు. అప్పుడు నేను, "సాయీ! ఉంగరం దొరికితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. తరువాత 2021, డిసెంబర్ 16, ఉదయం మా అమ్మమ్మ బాబాకి దణ్ణం పెట్టుకుని, సాష్టాంగ నమస్కారం చేసుకుంటుండగా దేవుడి మందిరం కిందుగా ఆ ఉంగరం కనిపించింది. వెంటనే నాకు ఆ విషయం చెప్పారు. "చాలా చాలా సంతోషంగా ఉంది సాయీ. నమ్ముకున్న వారిని మీరు ఎన్నడూ నిరాశ పరచరని మాకు తెలుసు సాయీ. కృతజ్ఞతతో వెంటనే నా అనుభవాన్నిలా పంచుకుంటున్నాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి సాయీ".
